Tuesday, April 27, 2021

అనంత పద్మనాభస్వామి దేవాలయ చరిత్ర..

అనంత పద్మనాభస్వామి దేవాలయ చరిత్ర.. భారతదేశం ఎన్నో సంస్కృతి సంప్రదాయాలకు నిలయం. ఇక్కడ శిల్పకళలకు కొదవలేదు. అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి. నభూతో న భవిష్యత్ అనే విధంగా దేవాలయాలను నిర్మించారు. కొన్ని వేల సంవత్సరాలు చెక్కుచెదరకుండా దృఢంగా ఉన్నాయి. అంతేకాకుండా దేవాలయాలకు ఎంతో విశిష్టత కూడా ఉంది. కేవలం కట్టడాలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచంలో పేరొందిన శాస్త్ర వేత్తలకు సైతం అంతు చిక్కని రహస్యాలతో అద్భుతమైన టెక్నాలజీని ఉపయోగించి దేవాలయాలను నిర్మించారు మన పూర్వికులు.

దేవాలయాలు నిర్మాణానికి మాత్రమే పరిమితం కాకుండా వాటిలో అనంతమైన సంపదను కూడా కట్టుదిట్టమైన భద్రతతో అందులో పొందుపరిచారు. ఇప్పుడు మనం దానికి సంబంధించిన పూర్తి విషయాలు తెలుసుకుందాం. అందులో భాగంగానే ప్రపంచ ప్రఖ్యాతి పొందిన అనంత పద్మనాభ స్వామి దేవాలయ రహస్యం గురించి తెలుసుకుందాం.

మొన్నటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయంగా పేరుంది. అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఉన్న గదులను తెరిచిన తర్వాత అందులో బయటపడిన అనంత సంపదతో ఒక్కసారిగా అనంత పద్మనాభ స్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయంగా రికార్డులకెక్కింది. అంతేకాకుండా కేవలం సంపద విషయం లోనే కాకుండా గుడికి సంబంధించిన రహస్యాల విషయంలోనూ ప్రసిద్ధి కెక్కింది. దేవస్థానానికి సంబంధించిన చరిత్ర, దేవాలయం వెనుక ఉన్న రహస్యాలు తెలుసుకుందాం.

హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీమహావిష్ణువు అవతరించిన 108 పవిత్ర క్షేత్రాల్లో ఒకటైన అనంత పద్మనాభ స్వామి దేవాలయం. ఈ దేవాలయానికి సుమారు 5 వేల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. అత్యంత పురాతనమైన ఈ దేవాలయం విట్టల్ పిల్ల మార్ అనే ఎనిమిది కుటుంబాల హయాంలో నడుస్తూ వస్తోంది. ఆ తర్వాతి కాలంలో ట్రావెన్కోర్ సంస్థాన భక్తుడైన రాజు మార్తాండవర్మ ఆలయాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకొని 1729 సంవత్సరంలో పునరుద్ధరించారు.

ఆలయ నిర్మాణం:
శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని నిర్మించడానికి దాదాపు 7000 మంది తాపీ పనివారు, 5000 మంది శిల్పకళ నిపుణులు, 800 ఏనుగు లను ఉపయోగించి ఈ ఆలయాన్ని నిర్మించారని అప్పటి శాసనంలో పొందుపరిచారు. స్వామివారి ఆలయ విస్తీర్ణం సుమారు ఏడు ఎకరాల వరకు ఉంటుంది. అంతేకాకుండా ప్రత్యేకమైన టేకుతో బంగారు కవచంతో తయారు చేయబడిన దేవాలయ ధ్వజస్తంభం ఎత్తు సుమారు వంద అడుగుల వరకు ఉంటుంది. ప్రస్తుతం ఉన్న గోపురాన్ని మాత్రం 1566 సంవత్సరంలో నిర్మించారు.

అంతేకాకుండా ఈ ఆలయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. అనంత పద్మనాభ స్వామి ఆలయం ముందున్న ద్వారం నుండి చూస్తే సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో ద్వారంలో ఉన్న రంధ్రాల నుండి సూర్యుడు స్పష్టంగా కనిపిస్తాడు. అంతేకాకుండా సూర్యుడు అస్తమిస్తుండడం దేవాలయం ద్వారం నుండి చూడటం మధురమైన అనుభూతిని కలిగిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే మాటల్లో వర్ణించలేని విధంగా ఆ దృశ్యం మన కళ్ళకు కనిపిస్తుంది.

అనంత పద్మనాభ స్వామి ఆలయంలో స్వామివారిని చూడాలంటే మూడు ద్వారాల నుండి చూడాలి. స్వామివారి మూలవిరాట్ విగ్రహాన్ని 1208 సాలగ్రామలతో తయారు చేశారు. మూలవిరాట్ ని చూడడానికి ఆదిశేషునిపై పవళించి ఉన్న స్వామి వారిని మొదటి ద్వారం నుండి చూస్తే తల భాగం కనిపిస్తుంది. మధ్య భాగం నుండి చూస్తే బొడ్డు అందులో పుట్టిన తామర పువ్వు కనిపిస్తుంది. మూడో ద్వారం నుండి చూస్తే పాద భాగం కనిపిస్తాయి. ఎంతో తేజోవంతమైన ఈ విగ్రహాన్ని దర్శించుకోవడం కొత్త అనుభూతిని కూడా కలిగిస్తుంది.

ఇవే కాకుండా స్వామివారి విగ్రహాన్ని ఎంతో ప్రత్యేకంగా తయారు చేశారని చెప్పుకోవచ్చు. అనంత పద్మనాభ స్వామి ఆలయం నుండి విగ్రహాన్ని రూపొందించడానికి వాడిన సాలగ్రామాలను నేపాల్ నుండి ప్రత్యేకంగా ఉరేగిస్తూ తీసుకొచ్చారు. అంతేకాకుండా ప్రతి సాలగ్రామాన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద మిశ్రమంతో తయారు చేసిన పదార్థాలను ఉపయోగించారు. ఆ తయారు చేసిన ఆయుర్వేద మిశ్రమాన్ని అతకడానికి వాడారు.

అంతేకాకుండా క్రిమికీటకాల నుండి విగ్రహాన్ని కాపాడడానికి ఆయుర్వేద మిశ్రమాన్ని వాడినట్టు ఇక్కడివారు చెబుతుంటారు. అంతేకాకుండా పద్మనాభస్వామి విగ్రహం, ముఖం, చాతి మినహా మిగతా భాగాలు మొత్తం పూర్తిగా బంగారంతో చేయబడినవి. స్వామివారి విగ్రహాన్ని తయారు చేయడానికి వాడిన ఆయుర్వేద మిశ్రమం వెనక ఒక బలమైన కారణం ఉంది.

ముస్లిం రాజుల దండయాత్రలతో విగ్రహాం ధ్వంసం కాకుండా కాపాడుకోవడం కోసం, విగ్రహానికి ఎటువంటి హాని కలగకుండా ఆయుర్వేద మిశ్రమాలు వాడినట్లు ఇక్కడివారు చెబుతుంటారు. అంతేకాకుండా స్వామి కిరీటం, చెవులకున్న కుండలాలు, చాతిని అలంకరించిన భారీ సాలగ్రామాల మాల, శివుడి విగ్రహనికి ఉన్న కంకణం, కమలం పట్టుకున్న ఎడమ చేయి, నాభి నుండి బ్రహ్మదేవుడు ఉన్న కమలం తీగ వరకు, స్వామి పాదాలు కూడా అంతా బంగారంతో చేయబడినవి.

స్థల పురాణం:
అనంత పద్మనాభ స్వామి స్థల పురాణం గురించి ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతూ ఉంటారు. అందులో ఒక స్థల పురాణం గురించి మనం తెలుసుకుందాం. పద్మనాభ స్వామి దేవాలయం ఎంతో విశిష్టత కలిగినది. దివాకర అనే ముని శ్రీ కృష్ణ భగవానుడి దర్శనం కోసం తపస్సు చేస్తుండగా మునిని కనుకరించడానికి శ్రీకృష్ణ భగవానుడు మారురూపంలో ఒక పిల్లవాడిగా ముని వద్దకు వచ్చాడు. ముని పూజలో ఉండగా ఆ బాలుడు ఒక సాలగ్రామాన్ని తీసుకొని మింగడంతో ముని పిల్లవాడిని వెళ్ళిపోమని ఆగ్రహిస్తాడు.

అప్పుడు పిల్లవాడు సమీపంలో ఉన్న ఒక చెట్టు వెనుక వెళ్లి దాక్కొని ఉంటాడు. ఆ సమయంలో ఆ చెట్టు విరిగి కింద పడి శ్రీమహావిష్ణువు విగ్రహంగా మారిపోతుంది. అంతేకాకుండా స్వామి వారు శయన భంగిమలో అనంతశయనం యోగనిద్ర మూర్తి తరహాలో కనిపిస్తాడు. స్వామివారి భారీ ఆకారాన్ని చూసి పూర్తిగా తనివితీరా దర్శించుకొలేక పోతున్నానని దివాకర ముని చింతిస్తాడు. దాంతో స్వామి వారిని దివాకర ముని వేడుకుంటాడు..

స్వామి మీ భారీ ఆకారన్ని నేను తనివితీరా చూడలేకపోతున్నాను.. దయచేసి మీ ఆకారంలో మూడో వంతుకు తగ్గండి అని ప్రాధేయపడతాడు. ముని విన్నపాన్ని ఆలకించిన శ్రీమహావిష్ణువు తన భారీ ఆకారాన్ని మూడోవంతుకు తగ్గిస్తాడు. అయితే నన్ను దర్శించుకోవడానికి వచ్చే భక్తులు నన్ను మూడు ద్వారాల గుండా దర్శించుకోవాలని మునితో అంటాడు. ఇప్పుడున్న ఆ మూడు ద్వారాలు రావడానికి అదే కారణమని ఇక్కడ స్థలపురాణం చెబుతుంది. అంతేకాకుండా స్కంద, పద్మ పురాణాలలో ఈ దేవాలయానికి సంబంధించిన పూర్తి విశేషాలు ఉన్నాయి.

అనంత పద్మనాభస్వామి అనంత సంపంద:
పద్మనాభ స్వామి లక్ష కోట్లు ఎవరికి ...

పురాతన ఆలయాలన్నింటికీ అపారమైన సంపదలున్నాయి. ఆస్తులకు కొదవ లేదు. వేలాది ఎకరాల భూములు, నగదు ఉండటం మామూలే. అయితే అనంత పద్మనాభుడి ఆస్తులు ఇతర దేవాలయాలతో పోల్చదగినవి కాదు. తిరుమలేశుని సంపద కంటే ఎక్కువే. ఇటీవల దేవాలయంలోని నేలమాళిగలో బయట పడిన నిధులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అనంత పద్మనాభుడి ఆలయంలో ధన కనక రాశులను భద్రపరిచే రహస్య భూ గృహాలు ఆరున్నాయి. వీటిలో దేవుడి సంపద కొంత దాగుందని ఒకప్పుడు కొందరికి, ఇప్పుడు అందరికీ తెలిసిన రహస్యం. ఈ సంపదను ఎప్పుడూ ఎవరూ లెక్కించిన ఆనవాళ్లు లేనట్లే. రాళ్లతో మూసివుండే ఈ గదుల్లో కొన్నింటిని తెరిచి దాదాపు 150 ఏళ్లు దాటిపోయింది.1860 లో కొన్ని గృహాలను ఏదో కారణం వల్ల మూసి వేశారు.

ఆలయ సంపద నిర్వహణలో అక్రమాలు నెలకొన్నాయని, వీటిని గాడిలో పెట్టాలని సుందర రాజన్ అనే న్యాయవాది 2011 లో, సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దేవాలయాన్ని నిర్వహించే ట్రస్టుకు, ఆస్తులు సంరక్షించే శక్తి సామర్థ్యాలు లేవని సుందర రాజన్ తన పిటీషన్లో ఆరోపించారు. అగ్నిమాపక దళం శాఖకు చెందిన ప్రభుత్వాధికారులను, పురావస్తు శాఖకు చెందిన అధికారులను, గర్భ గుడిలోని రహస్య గృహాలను తెరిచి తనిఖీ చేసి చూడాల్సిందిగా, వారికి కనిపించిన వస్తువులేంటి అని తేల్చాల్సిందిగా న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.

అంతకు ముందే, కేరళ హై కోర్టు, దేవాలయ నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వమే స్వయంగా చేపట్టాలని ఇచ్చిన ఉత్తర్వును సుప్రీం కోర్టు కూడా సమర్థించింది. కోర్టు ఏడుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని నియమించి సంపదను లెక్కించాల్సిందిగా ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆలయ సంపద లెక్కింపు మొదలవడం, రోజు రోజుకూ అపార ధన, కనక రాశులు కోకొల్లలుగా బయటపడడం బయట పడ్డ విలువ తెలుసుకున్న కమిటీ సభ్యులు వారి ద్వారా యావత్ ప్రపంచం ఆశ్చర్య పోవడం విశేషం.

ఆ విధంగా ఆ నేల మాళిగలలోని అనంత సంపద వెలుగు చూసింది. ఇప్పటివరకు ఐదు నేలమాళిగలలోని సంపదను మాత్రమే లెక్కించారు. అందులోనె అనంతమై సంపద బయట పడింది. ఇంకా ఆరో గది తెరవ వలసి ఉంది. దాని నిర్మాణ రీత్యా అది చాల పెద్దది, అందులోనే ఇంకా ఎక్కువ సంపద దాచి ఉంచబడి ఉన్నదని తెలుస్తుంది. ఇప్పటికే బయట పడిన సంపదతో ప్రపంచంలో అత్యంత సంపన్న క్షేత్రంగా ఈ ఆలయం రికార్డులకెక్కింది. ఇప్పటి వరకు బయటపడిన సంపదలో బంగారం, వజ్రాబరణాలు, బంగారు దేవతా ప్రతిమలు, కిరీటాలు, పచ్చ రాళ్లు పొదిగిన నగలు. బస్తాలకొద్ది బంగారు వెండి నాణేలు, దాదాపు రెండు వేల రకాల కంఠాభరణాలు గొలుసులు బయల్పడ్డాయి.

అనంత పద్మనాభస్వామి దేవాలయ చరిత్ర

పదహారవ శతాబ్దం నాటి శ్రీ కృష్ణ దేవరాయల కాలంనాటి నాణేలు, ఈస్టిండియా కాలం నాటి నాణెలు, నెపోలియన్ బోనపార్టే కాలం నాటివి బస్తాల్లో లబ్య మయాయి. అంతే గాక చిత్ర విచిత్రమైన వస్తువులెన్నొ ఉన్నాయి. ఇంకా బంగారు కొబ్బరికాయలు, బంగారు శంఖాలు ఇలా ఎన్నో వింత వింత వస్తువులు వెలుగు చూసాయి. ఆలయంలో లభ్యమైన సంపద ఇన్ని లక్షల కోట్ల రూపాయలని, విదేశీ కరెన్సీలో ఇన్ని బిలియన్ల డాలర్లేనని చెప్పడం అవివేకం తప్ప మరేమీ కాదు. ఆ సంపదకున్న పురావస్తు ప్రాధాన్యతా దృష్టితో మాత్రమే దాన్ని చూస్తే, ఆ విలువ మరిన్ని రెట్లనడమే కాకుండా, బహుశా విలువ కట్టలేనిదని కూడా అనాల్సి వస్తుందేమో! విలువ కట్టడానికి, ఆ సంపదేమన్నా బహిరంగ మార్కెట్లో అమ్మే అంగడి సరుకు కాదు కదా! అందుకే కేరళ రాష్ట్ర ముఖ్య మంత్రి అంతులేని ఆ వింత సంపదంతా పద్మనాభుడిదేనని తేల్చి చెప్పారు.

అనంత పద్మనాభస్వామి అనంత సంపందపై సుప్రీం కోర్టు కమీటి :

దేవాలయ నేలమాళిగలకు సంబంధించి మొత్తం ఆరు ఖజానా గదులున్నాయి. గర్భ గుడి కింద వున్న ఆ గదులను తెరిచేందుకు న్యాయస్థానం, “ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్” గదులుగా వాటికి పేరు పెట్టారు. వీటిలో “ఎ, బి” గదులు గత 130 సంవత్సరాలలో ఎన్నడూ తెరవలేదు. “సి, డి, ఇ, ఎఫ్” లేబులున్న గదులు మాత్రం అప్పుడప్పుడూ తెరుస్తూనే వున్నారు. ఆ నాలుగు గదుల “సంరక్షకులు” గా వున్న ఇద్దరు దేవాలయ పూజారులు “పెరియ నంబి”, “తెక్కెడం నంబి” పర్యవేక్షణలో మాత్రమే అవి అప్పుడప్పుడూ తెరవడం జరుగుతోంది.

నిత్యం దేవాలయంలో జరిగే పూజా కార్యక్రమాలకు భంగం వాటిల్లని రీతిలో మాత్రమే, “సి, డి, ఇ, ఎఫ్” లేబులున్న గదులు తెరవాల్సి వుంటుందని, అవి తెరవడానికుద్దేశించిన పని పూర్తైన తర్వాత తిరిగి యథావిధిగా మూసేసి వుంచాలని ఇటీవలి సుప్రీం కోర్టు ఉత్తర్వుల సారాంశం. ఇక “ఎ, బి” గదుల విషయానికొస్తే, వాటిల్లో నిక్షిప్తమై వున్న, నిధుల లెక్కింపు చేసి, రికార్డులలో నమోదు కార్యక్రమం పూర్తైన వెంటనే, వాటినీ మూసేసి వుంచాలని కూడా కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం, “ఎ” అని మార్కు చేసి వున్న గదిని తెరవడం, అందులోని నిక్షిప్తమై వున్న అపార సంపదను గుర్తించడం పూర్తైంది.

అంతుచిక్కని అనంత పద్మనాభస్వామి అరవ గది రహస్యం:
అరవ ఆలయ గదిలో ...

“బి” అని లేబుల్ వున్న అరవ గదికి నాగ బంధం వుందని, ఇనుప గోడలతో పటిష్టంగా గదిని నిర్మించారని, ఆ గదిని తెరిస్తే తీవ్ర అరిష్టం వాటిల్లే ప్రమాదముందని, గది లోపల నుంచి సముద్రం మధ్యలోకి మార్గముందని, తెరిచిన మరుక్షణంలోనే సముద్రంలోని నీరు కేరళ రాష్ట్రాన్ని ముంచేస్తుందని, రకరకాల అనుమానాలు అపోహలు వాస్తవానికి చేరువగా వుండే కొన్ని చారిత్రక సాక్ష్యాలు ప్రచారంలోకి వచ్చాయి. “ఎ” గదిని తెరవడానికి నియమించిన కమిటీ సభ్యుల్లో కొందరి అనారోగ్యం కలిగిందన్న వార్తలు కూడా వెలుగులోకి వచ్చాయి. దీంతో సుప్రీం కోర్టు నియమించిన సభ్యులను ఆ గదులను తెరువకూడాదని అదేశించింది.

సాధువుల వాదన:
సదువులు

ఆరో గది తెరిస్తే దేశానికి రాష్ట్రానికి చాలా అర్థాలు వస్తాయని, అంతేకాకుండా కేరళ రాష్ట్రం మొత్తం సముద్రంలో మునిగి పోతుందని వారు వాదిస్తున్నారు. అంతే కాకుండా ఆరవ గదిని ఎంతో ప్రసిద్ధి చెందిన తంత్రికులతో నాగబంధనం వేయించారని వారు చెబుతున్నారు. నాగబంధాన్ని చేధించడం అంత సులభం కాదని. ఆ గదిని తెరవడం కూడా అంత సాధ్యం కాదని సాధువుల అంటున్నారు. కేవలము నాగ శాస్త్రం, నాగబంధనం తెలిసిన వారు మాత్రమే శాస్త్ర ప్రకారంగా ఆ గదిని తెరువగలరని సాధువులు అంటుంన్నారు. వారు తప్ప మిగతా వారెవ్వరూ ఆ గదిని తెరువలేరని సాధువులు వెల్లడిస్తున్నారు. అలా కాదని ఆ గదిని ధరిస్తే వినాశనం తప్పదని కూడా హెచ్చరిస్తున్నారు. నాగసాధువుల మాటల్లో ఎంత వరకు నిజం ఉందో! అబద్ధమో ఉందో ! కాలమే సమాధానం చెప్పాలి.

దేవాలయ చరిత్ర

ఇక ఈ దేవాలయమే కాకుండా మన భారతదేశంలో ఇలాంటివి కొన్ని వేల ఆలయాలు ఉన్నాయి. వాటిల్లో అంతుచిక్కని రహస్యాలు, అంతులేని సంపదలు దాగి ఉండవచ్చని పురావస్తుశాఖ వారు అభిప్రాయపడుతున్నారు. కేవలం సంపద విషయం మాత్రమే కాకుండా.. ఆలయ నిర్మాణాలు వాటిపై ప్రత్యేకతలు, విశిష్టతలు రహస్యాలు ఇప్పటి శాస్త్రజ్ఞులకు అంతుచిక్కని విధంగా నిర్మింపజేశారు అని కూడా మనం చెప్పుకోవచ్చు.

అంతటి మేధో సంపత్తితో మన భారత శిల్పులు దేవాలయాలను నిర్మింపజేశారు. ప్రపంచనికి జ్ఞానం పరిచయం చేసింది మన భారతదేశం అని ఇప్పుడు వెలుగు చూస్తున్న సంఘటనలే నిదర్శనం. ఎటువంటి పరిజ్ఞానం లేకుండానే మన భారతీయులు మన శాస్త్రజ్ఞులు పూర్వ కాలంలోనే ఎన్నో విషయాలను కనిపెట్టారు. అంతటి గొప్ప దేశం మన భారత దేశం.
🙏🙏🙏
🌻🌻🌹🌹🌻🌻

Source - Whatsapp Message

No comments:

Post a Comment