Tuesday, January 28, 2020

ఉన్నత పదవులలో ఎవరుండాలి?

ఉన్నత పదవులలో ఎవరుండాలి?


‘🤔ఉన్నత పదవులలో ఎలాంటివారిని నియమించాలి?’ అన్న అనుమానం వచ్చింది ధర్మరాజుకి. తన సందేహాన్ని నివృత్తి చేయమని ఆయన భీష్ముణ్ణి కోరాడు. అప్పుడు భీష్ముడు ఓ కథ ద్వారా ధర్మరాజు సందేహాన్ని నివృత్తి చేశాడు.

‘‘పూర్వం ఒక అడవిలో ఓ ముని తపస్సు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఓ కుక్క ఎప్పుడూ ఆ ముని వెంటే తిరుగుతూ ఉండేది. తనపట్ల విశ్వాసంగా ఉన్న ఆ కుక్కని చూసిన ముని, దానిని తన చెంత ఉండనిచ్చేవాడు. వీరి అనుబంధం ఇలా కొనసాగుతుండగా ఓరోజు ఆ కుక్క ఓ పులి కంటపడింది. అంతే! ఆ పులి తన పంజా విసురుతూ కుక్కని బలిగొనబోయింది.

వెంటనే ఆ కుక్క పరుగుపరుగున పోయి మునీశ్వరుని వెనుక నక్కింది. తనను నమ్ముకున్న కుక్క ఆ పులికంటే బలహీనంగా ఉండటంవల్లే కదా... దానికి ఆపద కలిగింది అనుకున్నాడు మునీశ్వరుడు. దాంతో ఆ కుక్కను పులిగా మార్చేశాడు. ఆ ఘటనను చూసిన పులి భయపడి గిర్రున వెనక్కి తిరిగి పారిపోయింది.

కానీ, పులిగా మారినంత మాత్రాన కుక్క జీవితం పూర్తిగా సురక్షితమనడానికి లేదు. ఎందుకంటే మరోసారి దానిమీదకి ఓ ఏనుగు దూసుకువచ్చింది. దాంతో పులి రూపంలో ఉన్న కుక్కను ఏనుగులా మార్చివేశాడు ఆ మునివర్యుడు.

ఇలా... ఏ జంతువు దాడిచేసినా తన దగ్గర ఉన్న కుక్కను అంతకంటే బలమైన జంతువుగా మార్చసాగాడు ముని. అలా మృగరాజులా మారిన కుక్క ఓరోజు బోర విరుచుకుని అడవిలో తిరగసాగింది.


ఇక తనమీద దాడి చేసేంతటి శక్తి మరో జంతువుకి లేదన్న నమ్మకంతో నిర్భయంగా సంచరించసాగింది. కానీ అలా తిరుగుతుండగా దాని మనసులో ఓ ఆలోచన మొదలైంది.

‘ముని నామీద జాలిచూపాడు కాబట్టి, నన్ను అన్నింటి కంటే శక్తిమంతమైన జంతువుగా మార్చాడు. అంతవరకు బాగానే ఉంది కానీ, రేపు మరో జంతువు ఏదన్నా మునీంద్రుని శరణువేడితే నా పరిస్థితి ఏంటి? అప్పుడు నాకంటే బలమైన జంతువు ముందు తల వంచాల్సిందే కదా’ అనుకుంది. ‘అసలు ఆ మునీశ్వరుణ్ణే చంపిపారేస్తే, అతను మరో జంతువు మీద జాలిచూపే అవకాశం ఉండదు’ అని పన్నాగం పన్నింది.

కుక్క తన మనసులో ఇలాంటి దుర్మార్గపు యోచనలు చేస్తూ ఏమీ ఎరగనట్లు ముని ముందరకి వచ్చి కూర్చుంది. కానీ కుక్కను మృగరాజుగా మార్చినవాడు... దాని మనసులో ఏముందో గ్రహించలేడా! మునీశ్వరుడు ఎప్పుడైతే కుక్క మనసులోని దురాలోచనను పసిగట్టాడో వెంటనే తిరిగి దానిని కుక్కగా మార్చేశాడు. అది పూర్వంలాగే కుక్క బతుకుని గడపసాగింది.


కాబట్టి ధర్మనందనా! దుర్మార్గులకు ఉన్నత పదవులని ఇస్తే, వారి బుద్ధి చివరికి ఇలాగే పరిణమిస్తుంది. అందుకే యోగ్యతని అనుసరించి పదవులను అందించాలి. అలాంటి యోగ్యులు తన అనుచరులుగా ఉన్న రాజు ఏ కార్యాన్నయినా సాధించగలడు’’ అంటూ వివరించాడు భీష్మ పితామహుడు.🤔

No comments:

Post a Comment