Friday, January 31, 2020

గర్భ సంస్కారం - భారతీయ విధానం

గర్భ సంస్కారం - భారతీయ విధానం

ఇటీవల ఆరోగ్యభారతి పశ్చిమ బెంగాల్‌లో మంచి సంతానాన్ని పొందడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు, హిందూ శాస్త్రాల్లో దీనిగురించి చెప్పిన విషయాలను తెలియజేస్తూ గర్భ సంస్కారం అనే ఒక చిన్న పుస్తకాన్ని ప్రచురించి, పంపిణీ చేసింది. హిందూత్వానికి సంబంధించిన ఏ విషయాన్ని అంగీకరించని కొందరు మేధావులు ఇది 'హిందుత్వవాదులను' తయారుచేసేందుకు జరుగుతున్న ప్రయత్నమంటూ గొడవ చేశారు. పాఠశాల స్థాయి నుంచే సెక్స్‌ ఎడ్యుకేషన్‌ ప్రారంభించాలని వాదించే వీరు భారతీయ విజ్ఞానాన్ని మాత్రం అంగీకరించలేక పోతున్నారు. గర్భస్థ శిశువుకు సంస్కారాలు అందించడం గురించి మన శాస్త్రాలు ఏమి చెపుతున్నాయో చూద్దాం -
పిల్లలకు మంచి సంస్కారం నేర్పించాలని, వారిని గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకు తగినట్లే చిన్నప్పటినుంచి వారిని ఏవిధంగా పెంచాలి అన్న విషయంపై తెగ ఆలోచిస్తుంటారు కూడా. సంస్కారానికి, విద్యకు ప్రాధాన్యమిచ్చిన సంస్కతి మనది. పిల్లలు ఏ వయసు నుంచి నేర్చుకో గలుగుతారు, ఏ వయసులో వారికి ఏం నేర్పించగలం అని తల్లిదండ్రులమదిలో నిరంతరం మెదిలే ప్రశ్న. ఈ విషయంపై మన పూర్వీకులు పరిశీలించిన విధానాన్ని మహాభారత కాలం నుంచి చూడగలం. పుట్టిన తర్వాతమాత్రమే కాదు పుట్టబోయేముందు అంటే గర్భస్థంగా ఉన్నప్పుడే పిల్లలు సంస్కారాన్ని ఎలా గ్రహిస్తారో మన పురాణాలలో అనేక ఉదాహరణలు చెప్పబడ్డాయి.

అభిమన్యుడి గురించి మనందరికీ తెలిసిందే. అతడు గర్భంలో ఉండగానే ఒకానొక సమయంలో తల్లిదండ్రుల సంభాషణను విన్నాడట. అర్జునుడు.. సుభద్రతో యుద్ధంలోని వ్యూహాల్ని గురించి ముచ్చటిస్తూ సైన్యాన్ని పద్మవ్యూహంలో ఎలా నిలపాలి అనే విషయంపై చర్చించాడట. మాట్లాడుతూ ఆ మాటల్ని మధ్యలో ఎందువల్లనో ఆపినట్లు.. అందువల్ల అభిమన్యుడికి పద్మవ్యూహంలో ప్రవేశించడం మాత్రమే తెలిసినట్లు భారతంలో గమనిస్తాం. అలాగే భారతంలోని వనపర్వంలో అష్టావక్రుడు అనే మహర్షిని గూర్చి ఉంది (అధ్యా: 132-34). అష్టావక్రుడు రాసిన అష్టావక్రసంహిత (అష్టావక్ర గీత) అనే వేదాంత గ్రంథం ప్రసిద్ధమైంది. ఇతని తండ్రి కహూలుడు. అష్టావక్రుడు తల్లి గర్భంలో ఉండగానే తన తండ్రి, తాతలు వేదాన్ని వల్లెవేయడం జాగ్రత్తగా విన్నాడట. ఒకానొక సందర్భంలో అతని తండ్రి ఒక స్వరాన్ని తప్పుగా పలికినపుడు గర్భంలో ఉన్న అష్టావక్రుడు ఆ తప్పును సూచించాడట. ఆ సమయంలో మిగతా శిష్యులు కూడా ఉండటంతో తండ్రి దాన్ని అవమానంగా భావించి గర్భస్త శిశువుకి శాపం పెట్టాడు. దానివల్ల ఆ శిశువు ఎనిమిది వంకరలతో పుట్టాడని, అందువల్ల అతడికి అష్టావక్రుడు అనే పేరు వచ్చిందని చదువుకున్నాం. కాలక్రమేణ అష్టావక్రుడు గొప్ప పండితుడయ్యాడనీ, తండ్రి అనుగ్రహంతో మళ్లీ సాధారణ రూపాన్ని పొందాడు.

మనకు పరిచయం ఉన్న మరొక పురాణగాథ ప్రహ్లాదుడిది. ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడు తీవ్రమైన తపస్సు చేస్తున్న సమయంలో అదను చూసి ఇంద్రుడు రాక్షసులపై దాడికి వెళ్లాడట. రాక్షసుల్ని తరిమిన తర్వాత హిరణ్యకశిపుడి భార్య గర్భవతి అని తెలిసిందట. ఆమెకు పుట్టబోయే బిడ్డను కూడా రాక్షసుడే కాబట్టి అతడ్ని సంహరించాలని ఆమెను కూడా బందీగా తీసుకున్నాడట. ఆ సమయంలో నారదుడు ఇంద్రుడ్ని అడ్డుకుని ఆమెకు కలగబోయే సంతానం గొప్ప విష్ణుభక్తుడు అవుతాడనీ, హిరణ్యకశిపుడిని అణచడానికి కూడా కారణమవుతాడని చెప్పడంతో ఇంద్రుడు ఆమెను వదిలాడట. నారదుడు ఆమెను తన ఆశ్రమంలో ఉంచి విష్ణుభక్తి బోధించాడట. నారదుడి విష్ణుభక్తి గానాన్ని గర్భంలో ఉన్న ప్రహ్లాదుడు కూడా విని గొప్ప విష్ణు భక్తుడయ్యాడని భాగవతంలో వివరించి ఉంది.

పిల్లలు ఏ విధంగా తయారు కావాలని తల్లిదండ్రులు తీవ్రమైన విశ్వాసంతో కోరుకుంటే వారు అలాగే అవుతారని చెప్పడానికి మరొక ఉదంతం ఉంది. ఇది మార్కండేయ పురాణం (అధ్యా: 21-22) లోనిది. రుతధ్వజుడు గొప్ప ధార్మికుడైన రాజు. గంధర్వ రాజకుమారి అయిన మదాలస అతని భార్య. రాజుకు వీరుడైన కుమారుడు కలగాలన్న కోరిక ఉండేది. కానీ మదాలస మాత్రం వేదాంతాన్ని పిల్లలకు చెప్పింది. పిల్లల్ని ఆడించే సమయంలో జోలపాటలు పాడుతూ వేదాంతాన్ని చెప్పింది. అలా పుట్టిన ముగ్గురు పిల్లలందరూ జ్ఞానులై రాజ్యాన్ని వదిలి వెళ్లారు. రాజుకేమో పరాక్రమవంతుడైన పిల్లలు కలగాన్న కోరికతో ఆక్రమంలో చివరగా పుట్టిన నాలుగ కుమారున్ని భార్య పరాక్రమవంతుడిగా నిలవాలని లాలించేలా కోరాడు. అలా లాలించిన ఆ బాలుడు పెద్దయ్యాక వీరుడైనాడు. స్వామీవివేకానంద, శివాజీమహరాజ్‌ వంటి వారిలో కూడా ఇలానే జరిగింది. పిల్లలు అతి చిన్న వయసు నుంచే అంటే గర్భస్థంగా ఉన్నప్పుడే అనేక విషయాల్ని గ్రహించగలరనే తెలుస్తోంది.

ఈ విషయంపై శాస్త్రీయ చర్చ చాలాచోట్ల ఉంది. భాగవతంలోనే కపిలుడు తన తల్లికి వేదాంత బోధ చేసిన సందర్భంలో (స్కంధం: 3, అధ్యా: 31) జీవుడు గర్భంలో పడిన సమయం నుంచి క్రమక్రమంగా ఎలా పెరుగుతుంది అన్న విషయాన్ని వర్ణించాడు. ఇదే విషయాన్ని గర్భోపనిషత్తు అనే ఉపనిషత్తు చెబుతుంది. గర్భం ఏర్పడినపుడు తొమ్మిది నెలల వరకు గర్భం ఎలా వద్ధి చెందుతుంది, ఏయే దశలో ఏయే అవయవాలు ఏర్పడతాయి.. మొదలైన విషయాల్ని గూర్చి ఇది చెబుతుంది. ఆయుర్వేద గ్రంథాల్లోని గర్భసంస్కారం, గర్భిణీ వ్యాకరణం మొదలైన అధ్యాయాల్లో గర్భధారణ సమయంలో తల్లి ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఎలా మానసికంగా ఉల్లాసంగా ఉండాలి, మంచి పుస్తకాల్ని చదవాలి లేదా లలితమైన సంగీతాన్ని వినాలి మొదలైన వాటిని వివరంగా విశ్లేషించారు. లలితా సహస్రనామాల్లో కూడా ఈవిషయంపై వివరణ ఉంది.

No comments:

Post a Comment