Wednesday, October 16, 2024

****🌹కుండలిని సిద్ధ మహా యోగము🌹

 🌹కుండలిని సిద్ధ మహా యోగము🌹:
ఒకప్పుడు రాఘవేంద్రస్వామి అలాగే త్యాగయ్య కూడా అలాగే ఈ స్థితికి చేరుకున్నారని వారి ఇష్ట దైవ పూజలు ఆపలేదని మంచినీళ్ళే వారికి తీర్థప్రసాదములు ఇచ్చేవారని వారి సినిమాలు చూసిన తర్వాత నాకు అర్థమైంది.
అప్పటికి మూడు నెలలుగా EMI బాకీలు ఉన్నాయి. ఏమి చేయాలో అర్థం కాలేదు. విసుగు చికాకులు వెంటాడుతున్నాయి. ఇంత స్థితిలో ఉన్నా కూడా ఇష్ట దైవ పూజలు అలాగే చక్ర ధ్యానం ఆపలేదు. కొనసాగిస్తూనే ఉన్నాము.కాకపోతే ఎవరికీ ఏమీ అప్పులు లేవు. ఒక బ్యాంకు కి తప్ప. ఇది ఇలా ఉండగా ఒకరోజు రాత్రి నన్ను బస్టాండ్ లో బస్సు ఎక్కించడానికి మా స్నేహితుని తమ్ముడు వచ్చినాడు. గురూజీ, గురూజీ ...అంటుంటాడు. వాడు మాటలలో “తను ఉన్న చేస్తున్న వృత్తిలో అనుకోని సమస్యలు వస్తున్నాయి వాటికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి స్వామి” అన్నాడు. నేను వెంటనే యధాలాపముగా అయితే పది రూపాయిలు ఇవ్వు ప్రశ్న వేసి చెబుతాను అని అడిగి ఆ డబ్బులు తీసుకున్నాను. ఎందుకంటే, బస్సు ఎక్కటానికి కూడా డబ్బులు లేవు. అలాగని ఎవరి దగ్గర చెయ్యి చాచి అడగలేని స్థితి. ఆత్మాభిమానం కదా. వాడి దగ్గర డబ్బులు తీసుకుని వాడు అడిగిన ప్రశ్నకి తగిన పరిష్కార మార్గం చూపించి బస్సు ఎక్కి వెళ్ళాను.కానీ ఈ బస్సు ప్రయాణంలో నాకు ఒక స్ఫురణ కలిగినది. అది ఏమిటంటే ఇలాంటి వారు ఎంతో మంది ఎన్నో సమస్యలతో సతమతమవుతూ ఉంటారు గదా.వారికి పరిష్కార మార్గాలు చూపించే విధానం అనగా జ్యోతిష్యవేత్తగా అవతారం ఎత్తితే మంచిదే గదా అనుకొని ఆ పది రూపాయలు పెట్టుబడి తో అంతవరకూ ఎంతో మందికి ఉచితంగా జాతకాలు చెప్పే వాడిని కాస్త నా కుటుంబ పోషణార్ధం డబ్బులు తీసుకోవడం ప్రారంభించాను.ఆనాటి నుండి నేను డబ్బుల కోసం ఇక వెనుతిరిగి చూసే అవకాశమే రాలేదు. ఏ బ్యాంకు వద్ద నేను అప్పు తీసుకున్నానో ఆ బ్యాంకుకే అప్పు ఇచ్చే స్థాయికి వెళ్ళాను.అనగా F.D చేశాను. డబ్బులే డబ్బులు. ఎవరిని ముట్టుకున్న వద్దన్నా డబ్బులే డబ్బులు. పదులతో పోయి లక్షల దాకా వెళ్ళిపోయినది. ఎంత అడిగితే అంత వాళ్ళు మనస్ఫూర్తిగా ఇచ్చే వాళ్ళు. పూజలు చేయించుకునేవారు. వీళ్లు అనుకున్నట్టుగా ఫలితాలు పొందేవారు. మేము అంటే నేను అలాగే మా భౌతిక గురువైన విచిత్ర వేదాంతి సహాయసహకారముతో కలిసి వారి కోసం హోమాలు చేస్తే వారి ఇష్టదైవాలను ఆ హోమ దేవతలుగా కనపడి అనుగ్రహించే వారు. వారి కోరికలు తీరేసరికి నాకు మించిన డబ్బులు చేరేసరికి నాలో ధన అహంకారం మొదలైంది. "ధనం మూలం ఇదం జగత్" అన్నట్లుగా డబ్బులే నా జీవిత పరమావధి అనే స్థితికి వెళ్ళిపోయాను. నా చక్ర సాధన ఏదో మ్రొక్కుబడిగా జరిగితే పూజలు మాత్రం చాలా ఆర్భాటంగా జరిగేవి.దీనికి ఫలితము  కొల్హాపూర్ నుండి మహాలక్ష్మి దేవి విగ్రహం వచ్చినది.

స్వాధిష్టాన చక్రం శుద్ధి:

ఇది ఇలా ఉండగా ఒకరోజు నేను దత్త జయంతి రోజున దత్త దర్శనం సినిమా టీవీలో వస్తుంటే చూస్తున్నాను. ఇంద్రుని కోరిక మేరకు ఆయన ఒక రాక్షసుడిని చంపటానికి అనఘాదేవి శక్తిని ఉపయోగించడం ఆమె రాక్షసుడి నెత్తి ఎక్కేదాకా చాటుగా నిలబడమని ఇంద్రునికి చెప్పడము,కొద్దిసేపటి తర్వాత నెత్తికెక్కిన అనఘాదేవిని చూసి దత్తుడు ఈల వేయడం ఇంద్రుడు వచ్చి ఈ రాక్షసుణ్ణి సంహారము చేయటం జరిగినది. ఎందుకో ఈ దృశ్యం నన్ను బాగా ఆకర్షించింది.
ఆ తర్వాత ఆయన మహాలక్ష్మి ఎక్కడ ఏ ఏ స్థానాల్లో ఉంటే ఏ ఫలితాలు కలుగుతాయో దత్తుడు స్వయంగా బోధ చేసిన దృశ్యం చూస్తుంటే స్వయంగా నాకే చేస్తున్నారేమోనని అనిపించసాగింది. మనసు వికలమైంది. దాంతో రెండు లీటర్ల కూల్ డ్రింక్ బాటిల్ తెచ్చుకొని ఏకధాటిగా త్రాగటం మొదలు పెట్టినాను. మందు తాగటం అలవాటు లేదు. కానీ మందుకు బదులుగా కూల్ డ్రింక్ నా దృష్టిలో అన్ని రకాల మందులతో సమానమే. బాగా తిక్క పెరిగినప్పుడు అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నప్పుడు, విపరీతంగా తట్టుకోలేని ఆనందము వేసినప్పుడు ఈ కూల్ డ్రింక్ తాగటం నాకు అలవాటు.అప్పుడు గాని నా తిక్క తగ్గదు. ఈ విషయము మా శ్రీమతికి తెలుసు. మందు తాగే వారిని చూసాను. కూల్ డ్రింక్ మందుగా అనుకునేవారిని మిమ్మల్నే చూస్తున్నాను అని సన్నాయి నొక్కులు నొక్కటం నాకు అలవాటు అయిపోయింది. పాపము. మా తల్లి! నేను నిజముగా మందు త్రాగినా అది ఏమి అనుకోదు. నాతో కలిసి త్రాగుతుందేమోనని నా భయము. ఎందుకంటే ఎవరికి తెలుసు.ఏ చక్రము ఏ మాయ లో ఉందో! కలసి మాయలో పడదాము అన్నది అంటే స్వామిరంగా! అసలు తాగుబోతు లేని కొంప లో ఇద్దరం త్రాగుబోతులు తయారు అవుతారు. అంత అవసరమా. యద్భావం తద్భవతి అనేది ఉండనే ఉన్నది కదా. మనము ఏది త్రాగిన అది మందు అనుకుంటే సరిపోతుంది కదా అనుకునేవాడిని. ఎందుకంటే ఈ స్వాధిష్ఠాన చక్రం బలహీన పడితే ధన మాయలో లేదా మందు మాయ(త్రాగుబోతు)గామారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఇదివరకే యోగ శాస్త్రాలు ద్వారా తెలుసు.

కానీ నాకున్న ధన అహంకార మాయ వలన నాకు ఈ విషయము గుర్తు లేదు. ఎప్పుడైతే దత్త దర్శనం సినిమా చూసానో అప్పుడు గుర్తుకు వచ్చాయి. అంటే మొదటిలో నేను ధనానికి విపరీతంగా ఇబ్బంది పడినానని తెలుసు గదా! అపుడే స్వాధిష్టాన చక్రం జాగృతి అయినది. ఎప్పుడైతే నాకు కావలసిన ధనప్రాప్తి కలిగినదో అప్పుడే ఈ చక్ర శుద్ధి మాయ ఆరంభమైనది. దానితో నా అవసరానికి మించి ధనము నా దగ్గర చేరుతుందని తెలుసుకొని నా జ్యోతిష్య అవతారం పరిసమాప్తి చేయాలని అనుకుంటుండగా నాకు ధ్యానములో స్వాధిష్ఠాన చక్రం బీజాక్షరమైన 'వం' అనే ఆరు దళాల పద్మము అగుపించినది.ఆ తర్వాత నా ప్రమేయం లేకుండానే నా నాలుక ఖేచరి ముద్ర వేయడం జరుగుతుంది. తద్వారా పదార్ధ రుచులు గుర్తుకు రావడం ప్రారంభమైంది. తిరుపతి లడ్డు దగ్గరనుండి మోతీ చూర్ లడ్డు దాక పదార్థ రుచులు గుర్తుకు రావటం మొదలైంది. ఎందుకంటే ఈ చక్ర గుణము రుచి చూడటము అన్నమాట. అందుకని పదార్థ రుచులు ఎప్పుడో తిన్నది గుర్తుకు వస్తున్నాయి.ఎందుకంటే ఈ పదార్ధాల రుచి మాయలో సాధకునిని పడవేయాలని ప్రయత్నాలు అన్నమాట. అంటే ధన మాయ, పదార్ధ రుచి మాయ,మందు అలవాటు మాయ ఈ చక్ర మాయలుగా నాకు అర్థం అయ్యాయి.దానితో నేను ధ్యానములో నాలికతో ఖేచరి ముద్ర అలాగే కావాలని వివిధ రకాల పదార్థాలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉండగా ఒకరోజు నాకు తెలిసిన మిత్రుడు ఒకడు హిమాలయాల నుండి దొరికే సుదర్శన చక్ర విష్ణు సాలగ్రామమును ఆ నదిలో దొరికితే తీసుకొని వచ్చాడు .దానిని ఇంట్లో పెట్టుకుని పూజ చేద్దామని అనుకుంటే దానిని భరించడం తనవల్ల కాదని దీనిని ప్రతిరోజు నిత్య నైవేద్య మహాపూజలు జరపాలని చాలా నియమ నిష్ఠ గా ఉండాలని చెప్పారు. కాబట్టి మీ మిత్రుడు చాలా పూజలు చేస్తూ నిష్ఠ గానే ఉంటాడు కాబట్టి ఆయనకు ఇవ్వమని మా ఇంటికి పంపించినారట. అది నాకు ఇవ్వటం ఇష్టం లేకపోయినా వారి ఇంట్లో ఉంటే ఏమీ అనర్ధాలు జరుగుతాయో అని భయంతో వాడు నా దగ్గరికి తీసుకొని వచ్చినాడని నాకు అర్థం అయింది. ఎప్పుడైతే నేను ఈ చక్ర మాయ గురించి తెలుసుకున్నానో దాని విజయ సంకేతంగా విష్ణు సాలగ్రామం వచ్చిందని తెలిసి దానిని పూజలో పెట్టినాను.నాకు పెద్దగా తేడా ఏమీ అనిపించలేదు. కనిపించలేదు. భయం కలగలేదు.

స్వాధిష్ఠాన చక్రం ఆధీనము:

ఇది ఇలా ఉండగా నేను పూజలు జాతకాలు చెప్పటం నెమ్మది నెమ్మదిగా తగ్గిస్తూ ఉండేసరికి ధన మాయ తన మాయా ప్రభావం చూపడము  ప్రారంభమైనది. అప్పటిదాకా పూజ కి కావలసిన డబ్బులు నేను అడుగుతూ ఉండే వాడిని కదా! ఎప్పుడైతే నా స్వాధిష్ఠాన చక్రము జాగృతి,శుద్ధి పూర్తి అయ్యి ఆధీనము అయ్యే సమయానికి మహాలక్ష్మి యోగమాయ చూపడం ప్రారంభమైనది. అంటే నాకు రావలసిన 8  కోట్లు వచ్చేటట్లుగా చేస్తే10 లక్షలు దాకా డబ్బులు ఇస్తామని ఒకరు, మా ఇల్లు 5 కోట్లకు అమ్మి పెడితే 15 లక్షల దాకా ఇస్తామని మరొకరు,కబ్జా అయిన మా భూమి తిరిగి వస్తే దాని మార్కెట్ విలువలో 10% ఇస్తామని ఒకరు,I.Tలో ఇరుక్కోకుండా చేస్తే దాని పరిహారముగా డబ్బులు ఇస్తామని ఇంకొకరు ఇలా పలు రకాలుగా ఆఫర్ల మీద ఆఫర్లు తో సిద్ధముగా ఉన్నాయి. వాటిని చూసి లెక్కగడితే ఒక సంవత్సరంలో నా సంపాదన 5 కోట్ల దాకా చేరుతుందని అర్థమయ్యేసరికి “వామ్మో! ఇంత డబ్బులు మనకి అవసరమా? ఎక్కువ తిన్నా కూడా అరగదు. ఇన్నాళ్ళు గల్లా పెట్టె మనల్ని కాపు కాసింది. ఎప్పుడైతే మన అవసరానికి మించి డబ్బులు చేరతాయో ఏమో భవిష్యత్తులో ఏమి అవసరమో ఏమి వస్తుందో సంపాదించే వయసులో సంపాదించుకుంటే మంచిది అని మనల్ని ముంచే డబ్బును దాచిపెడితే గల్లా పెట్టెకి మనము కుక్కలాగా కాపలా కాయాలని నాకు అర్థమైనది.ఈ ఆఫర్ల మాయలో పడితే వారి నుండి వారి కర్మ నుండి వేయి జన్మల దాక కోలుకునే పరిస్థితి నాకు రాదు” అని అర్థమై ఒకరోజు ఎవరికీ చెప్పకుండా జాతకాలు చెప్పే జ్యోతిష అవతారమును సంతోషంగా మనఃస్ఫూర్తిగా పరిసమాప్తి చేశాను.మనకు కావలసిన డబ్బులు ఎలాగో F.D ద్వారా బ్యాంకుల ద్వారా వస్తూనే ఉన్నాయి. దాంతో నా జీవితం చక్కగా గడిచిపోతుందని ఎన్నో వ్యాపార ఆఫర్లు వచ్చినా కూడా తోసిబుచ్చి నాకు కావలసిన డబ్బులతో సుఖముగా జీవిస్తూ ఎలాంటి వ్యాపార ఉద్యోగ ప్రయత్నాలు చేయకుండా మా ఆవిడ చేయకుండా సాధనలతో కాలము వెళ్ళ బుచ్చాలని నిర్ణయించుకునేసరికి మహాలక్ష్మి ధన మాయను నా మీద నుండి సడలించే సరికి మూడు సంవత్సరములు పైగా పట్టింది.దీనికి గుర్తుగా కాశీ క్షేత్రంలో దీపావళి నాడు అన్నపూర్ణాదేవిని మహాలక్ష్మిగా బంగారు కాసులతో కొలిచి ఆ రోజు అందరికీ పంచుతారని అవి ఇంట్లో ఉంటే ఎలాంటి  మాయలు కలగవని ఆ రోజు మేము కాశీ క్షేత్రములో దీపావళి రోజున అన్నపూర్ణాదేవి సన్నిధిలో బంగారు కాసులు అందుకున్న సమయంలో తెలిసినది. దాంతో నాకు ఆనందం వేసింది.ఎందుకంటే ఈ కాసు వచ్చిన లేదా లక్ష్మీ గవ్వలు వచ్చిన లేదా లక్ష్మీ శంఖం వచ్చిన ఈ చక్ర మాయ దాటి ఆధీనం అయ్యినట్లే అని స్ఫురణకు వచ్చినది. ఇలా కొన్ని రోజుల తర్వాత నా దగ్గరకు కాశీ నుండి లక్ష్మీ గవ్వలు, రామేశ్వరం నుండి లక్ష్మీ శంఖం వచ్చి చేరినాయి.        

No comments:

Post a Comment