శ్రీ రమణ కథామృతం-1
. తపస్సంటే...!
శ్రీరమణులు విరూపాక్షగుహ వద్ద కలుసుకున్న గణపతిశాస్త్రి బొబ్బిలికి సమీపంలోని కలువరాయి అగ్రహారానికి చెందిన వారు. భగవత్సాక్షాత్కారానికై ఎన్నో చోట్ల తీవ్రమైన తపస్సు చేశారు. కాని సంతృప్తి చెందలేదు. చివరకు అరుణగిరిపై బ్రాహ్మణస్వామిగా ప్రసిద్ధులైన రమణుల వద్దకు వచ్చి వారి పాదాలను పట్టుకుని వలవలా ఏడ్చి ‘‘చదువవలసినదంతా చదివాను.
వేదాంతశాస్త్రాన్ని కూడా పూర్తిగా అర్థం చేసుకున్నాను. మనసారా జపం చేశాను. అయినా ఇప్పటి వరకు తపస్సంటే ఏమిటో తెలియలేదు. అందువల్ల మీ పాదాలను శరణుజొచ్చాను. తపస్సు స్వరూపాన్ని తెలియజేయండి’’ అని అర్థించారు. మౌనంగా ఆయన వైపు చూస్తూ స్వామి ఇట్లా సమాధానమిచ్చారు. ‘‘ ‘నేను’ అనే భావమెక్కడి నుంచి ఉదయిస్తోందని చింతన చేస్తే మనస్సు అందులో విలీనమైపోతుంది అదే తపస్సంటే. ఒక మంత్రాన్ని జపిస్తున్నప్పుడు ఆ
మంత్రోత్పత్తి స్థానంపై మనస్సుని కేంద్రీకరిస్తే మనస్సు అందులో లీనమైపోతుంది. అదే తపస్సంటే.’’ ఈ ఉపదేశానికి గణపతి మనస్సు ఉప్పొంగిపోయింది. వేదకాలం తరువాత ఇటువంటి ఉపదేశం ఎవ్వరూ ఇవ్వలేదని అనిపించిందాయనకి. వెంటనే ఆశువుగా అయిదు శ్లోకాలు చెప్పారు. స్వామి పరిచారకుని వద్ద నుంచి ఆయన పేరు వెంకటరామన్ అని తెలుసుకుని ‘భగవాన్ శ్రీ రమణమహర్షి’ అని నామకరణం చేశారు. మోక్షానికి మార్గం చూపే వారు మహర్షులు - ఈ నామకరణానికి అదే కారణం. గణపతిశాస్త్రి బ్రాహ్మణస్వాముల కన్నా ఒక ఏడాది పెద్ద వారైనా రమణులని తన గురువుగా స్వీకరించారు. తన శిష్యులందరికీ రమణుల ఔన్నత్యం గురించి చెప్పారు. మరి కొంత కాలానికి రమణులను స్తుతిస్తూ కొన్ని శ్లోకాలనూ, వారి బోధలకు సంబంధించిన గ్రంథాలనూ రాశారు. గణపతిశాస్త్రిని శ్రీరమణులు ‘నాయన’ అనేవారు.
భగవాన్ విరూపాక్ష గుహలలో ఉండే రోజులలో జరిగిన ఇంకో సంఘటన వారి గొప్పతనాన్ని సూచిస్తుంది. అది ఇది. వేసవి కాలంలో అక్కడ నీటి కొరత బాగా ఉండేది. దీని గురించి చెబుతూ మహర్షి ఇలా అన్నారు. ‘‘నీటి కొరతను తప్పించుకోవడానికి చూత గుహకి మారే వాళ్లం. మిట్ట మధ్యాహ్నం వేళ కడజాతి స్త్రీలు నెత్తిమీద గడ్డి మోపులను పెట్టుకుని అలసిపోయి ఆ గుహ వద్దకు వచ్చే వాళ్లు. గుహ దగ్గరకు రాగానే ఆ గడ్డి మోపులను కిందపడేసి, వంగి ‘‘స్వామీ, ఒక కడివెడు చల్లని నీళ్లని మా వీపుల మీద పోయరా!’’ అని అడిగేవారు.
………………………..
మనో దర్శనం
బ్రాహ్మణస్వామిగా విరూపాక్ష గుహలలో రమణులు ఉన్న రోజులలో శివప్రకాశం పిళ్ళై వారిని కలుసుకున్నారు. ఆయన చదువుకునే రోజుల్లోనే ఎవరైనా గొప్ప జ్ఞాని దర్శనం లభిస్తే బాగుండుననుకునే వారు. బ్రాహ్మణస్వామిని 1902లో కలుసుకున్నారు. స్వామి వయస్సు అప్పుడు కేవలం 22 ఏళ్లే. మౌనంగా కొండ గుహ బయట కూర్చునేవారు. పిళ్ళై అయన్ని దర్శించుకుని ఎన్నో ప్రశ్నలు వేశారు. ‘‘నేనెవరిని?’’ అన్న ప్రశ్న ఆయన్ని ఎంతోకాలంగా వేధిస్తోంది. అప్పటికే బ్రాహ్మణస్వామిని ఇదే ప్రశ్న అడిగారు. స్వామి ఇసుకమీద సమాధానం రాశారు.
అట్లాగే ఇంకొన్ని ప్రశ్నలు వేశారు. వీటన్నిటినీ మనసులో భద్రపరచుకుని ఒక చిన్న పుస్తకరూపంలో ‘నార్యాద్’(నేనెవరిని) అని ఇరవయ్యేళ్ల తరువాత తయారుచేశారు. ఇందులో రమణులు క్లుప్తంగా ఇచ్చిన సమాధానాలను తన అవగాహన ప్రకారం విస్తరించి రాశారు పిళ్ళై. ప్రచురించే ముందు రమణులకు చూపారు. దానికి కొన్ని దిద్దుబాట్లు చేసి స్వయంగా ఆ విషయమంతా ఒక వ్యాసరూపంలో రాశారు రమణులు. పిళ్ళైకి లభించిన సమాధానాలే రమణుల తత్త్వబోధ అంతాను. స్థూలంగా చెప్పాలంటే నేను ఇదీ, నేను అదీ అనేవన్నీ మనస్సుతో కల్పితమైనవే. పిళ్ళైకి బ్రాహ్మణస్వామి సన్నిధిలో కూర్చుండగా కొన్ని దివ్యదర్శనాలు కలిగాయి. వాటిని ఆయన ఈ విధంగా స్వామికే చెప్పుకున్నారు. ‘‘మీ సమక్షాన కూర్చున్నప్పుడు (1913 మే 5న) నాకొక మనో దర్శనమైంది. మిమ్మల్ని అనేక పున్నమి చంద్రుల చంద్రికలు పరివేష్ఠించాయి.
బంగారపు వన్నెను మించిపోయిన మెరుపుతో, సూర్యతేజంతో వెలిగిపోయింది మీ దేహం. మీ నేత్రద్వయం దివ్యమైన అనుగ్రహాన్ని విరజిమ్మింది. దానితో బాటు వితరణ శక్తి కూడా కనబడింది. మరి కొంత సేపటికి మీ దేహమంతా ధవళ కాంతులీనే విభూతిపూసి ఉంది. ఇవన్నీ నాకు కనబడ్డాయి గాని నా పక్కన ఉన్న వారెవ్వరూ చూడలేదు. మీరే నా నాథులని నేను గ్రహించిన నాటి నుంచి సూర్యోదయంతో మాయమయ్యే పొగమంచు వలె నా కష్టాలూ మాయమైపోయాయి.’’ శివప్రకాశం పిళ్ళైకి ఈ అనుభవమయ్యే నాటికి స్వామి పేరు భగవాన్ శ్రీరమణ మహర్షిగా స్థిరపడిపోయింది. అందరికీ పిళ్ళై వంటి అనుభవాలు కాకపోయినా భగవాన్ని దర్శించుకున్న వారందరికీ శోకనాశనమయ్యేది. అందువల్లే కావ్యకంఠ గణపతి ముని భగవాన్ని ‘శోకస్యహంత్రే నమః’ అని స్తుతించారు. (సశేషం)
-పింగళి సూర్య సుందరం
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment