మహాభారతం శాంతి పర్వంలోని…
*సుశనుడు:*
(శుక్రాచార్యుని కధ)
*అనేక సందర్భాలలో దేవతల వలన కలిగిన ప్రమాదాలతో తల్లడిల్లిన రాక్షస జాతినే శుక్రాచార్యుడు కాపాడినట్లు అనేకానేక పురాణకథలలో కనిపిస్తుంటుంది.*
*రాక్షసులకు గురువైన ఈ శుక్రాచార్యుడి జన్మకు సంబంధించిన కథ విచిత్రంగా ఉంటుంది.*
*పూర్వం యక్షులకు రాజైన కుబేరుడు దేవరాజైన ఇంద్రుడి కోశాగారానికి అధిపతిగా ఉంటుండేవాడు. అయితే ఈ కుబేరుడి ఆధిపత్యాన్ని తగ్గించాలనే లక్ష్యంతో ‘సుశనుడు’ అనే ఒక ముని సమయం కోసం వేచి ఉండేవాడు.*
*ఆ మునికి తగిన సమయం ఆసన్నం కాగానే తన యోగశక్తి సహాయంతో కుబేరుడి ఆధీనంలో ఉన్న సంపద మొత్తాన్ని సంగ్రహించుకుని తీసుకువెళ్ళాడు.*
*ఆ విషయం తెలిసిన కుబేరుడు తను ‘సుశనుడి’ చేతిలో మోసపోయినందుకు ఎంతగానో బాధపడుతూ ఎవరికి చెప్పినా ఫలితం లేదని చివరకు పరమేశ్వరుడినే శరణువేడాడు.*
*శరణన్న వారిని ఆదుకునే శంకరుడు కుబేరుడికి అభయమిచ్చి సుశనుడిని సంహరించి ఆ ధనాన్ని మళ్ళీ కుబేరుడికి అప్పగించాలనుకున్నాడు.*
*అయితే ఈ విషయం తెలిసిన సుశనుడు మొండి ధైర్యంతో ఎలాగైనా పరమేశ్వరుడి నుంచి తప్పించుకోవాలని అనేక విధాలుగా తరుణోపాయం కోసం ఆలోచించసాగాడు. తాను ఎక్కడ దాక్కున్నా పరమేశ్వరుడు తనను పట్టి సంహరిస్తాడనే నిర్ణయానికి వచ్చి ఆ ముని తన యోగమాయతో పరమేశ్వరుడి చేతిలో ఉన్న శూలం మీదకు చేరి కూర్చున్నాడు.*
*శూలం మీద ఉన్న తనను శివుడు గమనించడులే అనుకున్న ఆ మునికి నిరాశే ఎదురయింది.*
*సకల చరాచర జగత్తును శాసించగల శివుడు మునిని కనుక్కోలేకపోవడం అనేది అసంభవం. తన శూలాగ్రం మీదనే తనకు కోపాన్ని తెప్పించిన ముని ఉన్నాడని గమనించిన శివుడు తన చేతిలోని శూలాన్ని మరొక చేతితో వంచాడు.*
*ఆనాటినుండి అలా వంగిన శూలం శివుడికి … ‘పినాకము’ అనే ఆయుధంగా మారిపోయింది.*
*అల్లరి చేష్టలు లాగా తనను చీకాకు పరుస్తున్న మునిని శివుడు ఒక చేత్తో పట్టుకుని తన నోట్లో వేసుకుని మింగివేశాడు.*
*అలా ‘సుశనుడు’ పరమేశ్వరుడి గర్భంలో తిరగడం ప్రారంభించాడు.*
*పరమేశ్వరుడి గర్భగోళంలో వుండలేక తనను రక్షించమని అనేక రకాలుగా ఆముని ఈశ్వరుడిని ప్రార్ధిస్తూ ఎలాగైనా బయటకు తీయమని వేడుకున్నాడు.*
*అయినా చాలాకాలం వరకు శివుడు అతడి మాటలను వినిపించుకోలేదు.*
*సుశనుడు మరీమరీ ఆర్థ్రత నిండిన భక్తి భావంతో శివుడిని ప్రార్ధిస్తూ ఎలాగైనా తనను వెలుపలికి రప్పించమని ఎన్నోమార్లు వేడుకున్న మీదుట శివుడు శాంతుడై తన సర్వ రంధ్రాలను మూసి ఒక్క రంధ్రాన్ని మాత్రం తెరిచి వుంచి ఆ రంధ్రం నుండి సుశనుడిని బయటకు రమ్మనమని చెప్పాడు.*
*చేసేది లేక ఈశ్వర శుక్లం వెలువడే ఆరంధ్రం నుండే సుశనుడు బయటకు వచ్చాడు. ఆనాటి నుండి సుశనుడు శుక్రుడు అయ్యాడు.*
*బయటకు వచ్చిన శుక్రుడు గొప్ప తేజస్సుతో వెలుగొందుతూ కనిపించాడు.*
*శివుడికి అప్పటికీ అతడిమీద కోపం చల్లారలేదు. అతడిని పట్టి సంహరించబోతుండగా ఈశ్వర గర్భం నుంచి వెలువడినవాడు తనకు పుత్రుడితో సమానమని పార్వతీదేవి శివుడికి నచ్చచెప్పి అతడిని రక్షించమని ప్రార్ధించింది.*
*పార్వతీదేవి ప్రార్ధన మేరకు పరమేశ్వరుడు శుక్రుడిని విడిచి పెట్టాడు.*
*శుక్రుడు కూడా తనమీద దయ చూపిన పార్వతీ పరమేశ్వరులకు మొక్కి వెళ్ళిపోయాడు.*
*అలా సుశనుడు అనే ముని అనంతర కాలంలో దానవులకు గురువైన శుక్రాచార్యుడిగా మారిన ఈ కథను భారతం శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు వివరించి చెప్పాడు.*
*ఈ శుక్రాచార్యుడు కథ కొద్దిపాటి తేడాతో శివపురాణంలో కూడా కనిపిస్తుంది.*✍️
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
No comments:
Post a Comment