"సర్వం పొందడమే - శరణాగతికి ఫలం"
మన పరిసరాలు, మన పరిస్థితులు...
మన కుటుంబం, మన ఉద్యోగం...
మన స్నేహితులు, బంధువులు...
మన ఆరోగ్యం...మన సంతానం....
అంతా అలాగే ఉండాలి...
దేవుణ్ణి పొందేయాలంటే కుదరదు...
"నాది" అనుకున్నది ధ్వంసం అయిపోతేగాని
"నేను" అనేది తేటతెల్లం కాదు.
అనగా నీవు ప్రపంచంలో దేనికైతే ప్రాధాన్యత ఇచ్చావో
అవన్నీ నశిస్తేగాని, స్వరూపమైన దైవానికి ప్రాధాన్యత ఇవ్వలేవు...
అంతేగాని ఓ అరగంటో, గంటో కళ్లు మూసుకొని కూర్చుంటే స్వరూపం తెలియబడదు.
ఏమీ వదలకుండా, అన్నీ పొందాలనే
చేసే యెత్తుగడలే ఈ కపట సాధనలు.
"నేను ముక్తి పొందడం ఎలా?" అడుగుతాడు శిష్యుడు.
"నేను" పోతే ముక్తి అంటాడు గురువు.
నీవు 'పోయాక' కోటిరూపాయిలు ఇస్తాం అన్న ఇన్సురెన్సు పాలసీలా అనిపిస్తుంది శిష్యునికి.
కానీ తప్పదు....
పొందాలంటే పోగొట్టుకోవాలి.
జీవించాలంటే మరణించాలి.
* * *
నిజానికి 'నేను'ను(అహాన్ని) పోగొట్టుకోవడానికి దిగులు చెందనవసరం లేదు.
నది సముద్రంలో కలిసి సముద్రంగా మారుకున్నట్టు
ఈ పరిమితమైన నేను అనంతమైన నేనుగా మారుకుంటుంది.
కాబట్టి శరణాగతి అనేది సర్వం దైవానికి సమర్పించి, సర్వం పొగొట్టున్నట్టు అనిపిస్తుంది.
కానీ 'సర్వం పొందడమే' శరణాగతికి ఫలం.
పావలా పోగొట్టుకుని 'రూపాయి'ని పొందినట్టుగా.
* * *
రూపాయి చిల్లరలో పావలా విడిగా కనబడుతుందే గాని
రూపాయి నాణెంలో పావలా ఉన్నా విడిగా కనబడదు.
అలాగే నిద్రలో, మరణంలో అహమిక ఉంటుంది.
ముక్తిలో అహమిక ఆత్మలో తల్లీనమైపోయి ఉంటుంది.
అందువలన నిద్ర, మరణం అనేవి - అజ్ఞానస్థితులు.
తురీయం, మోక్షం అనేవి - జ్ఞానస్థితులు.
* * *
మరణంలో అహమిక మరో శరీరాన్ని, మరో ప్రపంచాన్ని అది సృష్టించుకుంటుంది.
కాబట్టి జీవించి ఉండగానే తాను(అహమిక) చావాలి.
అదే జీవన్ముక్తి.
తాను మరో శరీరంగా మొలకెత్తకుండా
ఆత్మలో తల్లీనమై ఉండడమే పరమపదం.
* * *
ఒక్కసారి అంతర్ముఖం అయ్యి....
'నేను' మూలాన్ని అన్వేషిస్తే చాలు...
అక్కడ మరో 'నేను' సాక్షాత్కరించి
ఈ వ్యక్తిగతమైన 'నేను'ను కబళించేస్తుంది.
తరువాత కూడా తాను ప్రపంచానికి కనబడుతున్నట్టు ఉంటాడేగాని,
నేను-నేను అంటూ వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తాడేగాని
నిజానికి తనకు తానుండడు.
* * *
1. బుద్ధి చేత దైవాన్ని తెలుసుకోలేం
2. బుద్ధి చేతనే దైవాన్ని తెలుసుకోగలం.
సమన్వయం ఎలాగంటే,
1.బుద్ధి చేత (బాహ్యవస్తువును తెలుసుకున్నట్టు ఓ విషయంగా)దైవాన్ని తెలుసుకోలేం.
2.బుద్ధి చేతనే(అనగా బుద్ధిని లోనికి త్రిప్పడం వలన) దైవాన్ని తెలుసుకోగలం.
* * *
ఆత్మ యొక్క ప్రకాశవైభవమే బుద్ధి.
బుద్ధి ఆత్మకాదు, ఆత్మకు భిన్నమూ కాదు.
కిరణం సూర్యుడు కాదు, సూర్యునికి భిన్నమూ కాదు.
కెరటం సముద్రం కాదు, సముద్రానికి భిన్నమూ కాదు.
అది వెలిగా వచ్చి లోక విషయాలను వివేచించి తెలుసుకోగల సామర్థ్యమూ దానికి ఉంది.
అది లోపలికి వెళ్లి అహంమూలాన్ని శోధించి ఆత్మలో లీనమయ్యే సామర్థ్యమూ దానికి ఉంది.
* * *
విషయసంగ్రహణ చేస్తూ బుద్ధివైభవాన్ని
ప్రకటించేవాడు విజ్ఞాని అవుతాడు.
బుద్ధిని అంతర్ముఖం గావించి ఆత్మలో లీనం
చేసేవాడు జ్ఞాని అవుతాడు.
* * *
తెలుసుకోవడం - విజ్ఞానం.
తెలుసు అనడం - అజ్ఞానం.
తెలియదు అనడం - జ్ఞానం.
విజ్ఞానం మనల్ని అనేకం వైపుకు తీసుకెళుతుంది.
జ్ఞానం మనల్ని ఏకం వైపుకు తీసుకెళుతుంది.
విజ్ఞానం బాహ్యవిషయం.
జ్ఞానం ఆంతరవిషయం.
* * *
బుద్ధిని లోనకి త్రిప్పడం అంటే,
బాహ్య(ఐహిక)బంధాలను త్రెంపడమే.
బాహ్యబంధాలను త్రెంపడం అంటే,
"నేను-నాది అనేవి ఆత్మ(ప్రొజెక్టర్)నుండి వెలువడే కాంతి తెరపై(మనసుపై) పడడం వలన కదలాడే నీడలే"
అని వైరాగ్యం కలిగి ఉండడం.
"ఇతరములన్నియు నేమిటికి?
మతి చంచలమే మానుట పరము"
అంటాడు అన్నమయ్య.
* * *
పారమార్థిక పరిభాషలో చెప్పుకోవాలంటే-
బుద్ధి ఉన్నవాడు బుద్ధిమంతుడు.
బుద్ధి లేనివాడు జ్ఞానవంతుడు.
* * *
No comments:
Post a Comment