Saturday, October 29, 2022

ఫలితాలను ఏమీ ఆశించక నీ పని నీవు చేయి. నీవు చేయవలసింది అంతే.

 🌺ఓం నమో భగవతే శ్రీ రమణాయ🌻

      ఒక యువకుడు ఏదో కాగితాన్ని మహర్షికి అందించాడు. దానిలో ఏవో ప్రశ్నలున్నవి. సమాధానం కోసం వేచియున్నాడు. ఇతర మహాత్ములు ఎందెందు గలరో తెలిపితే, తాను వారిని దర్శించి వారి వలన మార్గం తెలుసుకొనవలెనని కోరిక అంట.

   ఇంట్లో ఎవరికీ తెలియజేయకుండా, మహాత్ముల ఉపదేశాలవల్ల దైవాన్ని అన్వేషణ చేయ వచ్చినాడు. తనకు దైవం ఏమో, అందుకై అన్వేషణ ఏమో, ఏమీ తెలియదు, నిజం. అందుకే తాను మహాత్ములను దర్శించడం.

   మహర్షి ఆ కాగితాన్ని కుర్రవానికి తిరిగి ఇచ్చి వేస్తూ ఇలా సెలవిచ్చారు ...
 
   “ *నేను ప్రతి ప్రశ్నకూ, అది ఏదైనా సరే, సమాధానం ఇవ్వవలెనన్నమాట; ఇవ్వకపోతే నేను గొప్పవాణ్ణి కాదు.* ”

    ఆ కుర్రవాడు కాగితాన్ని చింపివేసి, మరొకటి వ్రాసి మహర్షికి చూపినాడు :  *"తాము ఉడుతలను, కుందేళ్ళను దయగా చూస్తారు. పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు వానిని లాలిస్తారు. కాని మనుష్యులంటే తమకి ఉదాసీనం ఏమి ? నేను ఇళ్లు విడిచి పదిహేను రోజులుగా ఇక్కడ కాచుకుని పడియున్నాను; కొన్ని రోజులు తిండికూడా లేక పస్తుండినాను. ఎంతో కష్టపడుతున్నాను. అయినా తాము నన్ను కరుణించుట లేదు.* ”

            మహర్షి ఇలా సెలవిచ్చెను ...
  
  ఇటు చూడు. నాలో ఎటువంటి టెలివిజన్ లేదు. దైవం నాకు అటువంటి శక్తిని ప్రసాదించ లేదు. అందుకు నేను ఏమి చేయను? నీ ప్రశ్నలన్నింటికీ జవాబులు ఏమని చెప్పను ? 
  
    జనులు నన్ను మహర్షి అని అంటారు, మహర్షి వలెనే చూస్తారు. కాని నన్ను నేను మహర్షిని అని అనుకోవడంలేదు. అంతేకాదు. నాకు అందరూ మహర్షులే. 
    
     నీవు ఇంత చిన్న వయస్సులో దైవాన్ని అన్వేషిస్తున్నావు. చాల మంచి పని. దైవంపైనే మనసును ఏకాగ్రంగా నిలుపు, ఫలితాలను ఏమీ ఆశించక నీ పని నీవు చేయి. నీవు చేయవలసింది అంతే.

                   🌻ఓం తత్సత్🌺

No comments:

Post a Comment