*సండే స్టోరీ*
*మెడికల్ రిపోర్ట్స్*
📝
రచన: నండూరి సుబ్బారావు
అదే అమ్మడూ. ఇక నీ మాంగల్యాన్ని ఎలా కాపాడుకుంటావో. పైన భగవంతుడున్నాడు. క్రింద నీవున్నావు. మధ్య బావున్నాడు" అని హైడ్రోజన్ బాంబు లాంటిది చెల్లెలు నళిని చెవిలో వేసి లేచి నిలబడ్డాడు వీర వెంకట వరప్రసాదు... వెళ్తూ వెళ్తూ ఒక క్వార్టరు బాటిల్ జేబులో పెట్టుకుని రెండు క్వార్టర్సు చేతి సంచిలో వేసుకుని తూలుతూ తూలుతూ తన ఊరు వెళ్ళిపోయాడు.
వార్త విన్న నళిని కరెంటు షాకు తిన్నట్టు నవనాడులూ బిగదీసుకుపోయి ఎలాగోలా లోపలికి పోయి గంగానమ్మకు చద్ది నైవేద్యం పెడతానని మొక్కుకుంది. నిగనిగలాడు తున్న తన కురులలో నుంచి రెండు వెంట్రుకలు కత్తిరించి తీసి వెంకటేశ్వరస్వామి కి ఎడ్వాన్సుగా యిచ్చి భర్త ఆరోగ్యం సరిగా ఉంటే మిగతా జుట్టు కొండకొచ్చి సమర్పించు కుంటానని ప్రామిస్ చేసింది.
ఈ రోజు తన భర్త సుబ్బారావు బర్త్ డే కూడాను. "హాపీ బర్త్ డే టు యూ" అని స్వాగతం చెపుతుందని పాపం కలలుగన్న సుబ్బారావుకు నిరాశే ఎదురయింది. 'ఏమోలే పిండివంటలు చేయటంలో మరచి పోయి ఉంటుం'దని సరిపుచ్చుకున్నాడు సుబ్బారావు. ఆఫీసు పని ఎక్కువయి మధ్యాహ్నం ఒంటిగంట దాటి నీరసంగా అడుగులో అడుగువేసుకుంటూ, చెమటలు కక్కుకుంటూ యింటికి వచ్చాడు. బర్త్ డే స్పెషల్సు - పిండి వంటలను తలచుకుంటూ లోలోపల గుటకలు మింగుతున్నాడు, నళిని వంట ఇంట్లోనే ఉంది.
“ఏమోయి ఇవాళ శాకపాకాలేమిటి?" అంటూ కూనిరాగంలా, ఉత్సాహంగా అడిగాడు, ఏమేం పిండివంటలు చేసిందో తెలుసుకునేందుకు. నళిని పమిట చెంగుతో ముక్కుతుడుచుకుని “గోధుమఅన్నం-కాకర కాయ కూర” అని చెబుతూ "ముందు ఇది తాగండి" అంటూ గిన్నెలో ఉన్నవి ముందుకు పెట్టింది.
“ఏమిటివి? కొబ్బరి నీళ్లా”?
"కాదు. మెంతుల కషాయం" అని చెప్తూనే ముఖం చాటు చేసుకుంది. సుబ్బారావు నవ్వుకుని “ఏమిటిది పుట్టినరోజు సరసమా?" అన్నాడు.
"ఇక నా బతుక్కి సరసాలే మిగిలాయి. భగవంతుడు దయ తలచి మీ ఆరోగ్యం కుదుటపడితే ముందు ముందు మీక్కావల సినవన్నీ చేసిపెడతా, అంతవరకూ మీకు గోధుమ అన్నం కాకరకాయ కూడా తప్పదు" అంది విచార వదనంతో.
"అదేమిటే ఇవాళ ఇలా తలపెట్టావూ? నాకు కాకరకాయ అసలు సహించదని నీకు తెలుసు. దానికి తోడు మెంతి కషాయం అనుపానమా? గోధుమ అన్నం ఏమిటి రోగిష్టి వాడికి పెట్టినట్లు? ఎంచక్కా బంగాళ దుంపల వేపుడు, గడ్డపెరుగు, ఆవకాయ, మామిడి పండు వేసి అన్నం పెడతావని నేనొస్తే" అన్నాడు అర్ధోక్తిగా.
"ఇక ఆ పప్పులేం ఉడకవు. నా మంగళ సూత్రం బాగుండాలంటే ఇక నుంచీ నేను పెట్టినట్లే తినాలి. మామిడి పళ్లూ, అరటి పళ్లూ, స్వీట్లూ అసలు ముట్టుకోకూడదు. గడ్డపెరుగులూ, మీగడలు కలలో కూడా తలపెట్టకూడదుట".
"ఎందుకని? ఎవరు చెప్పారు నీకు"? డీలా ముఖంతో అడిగాడు సుబ్బారావు.
“ఎవరు చెపితే ఏం? డాక్టరుగారే చెప్పారు. సరేనా. మధుమేహం - అంటే షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు ఇవేవీ దగ్గరకు రానీకూడదట. షుగర్ ఎక్కువయి గుండె ఆగిపోతుందిట. పక్షవాతం వస్తుందట. అవునూ, మీ ఆఫీసు లో ఎవరికో షుగర్ ఎక్కువై కాళ్లు మోకాళ్ల వరకూ కత్తిరించేశారట నిజమేనా?" భయం భయంగా అడిగింది.
సుబ్బారావు కుప్పకూలిపోయాడు. పెళ్లాం పనులు మొదట 'సరసం' అనుకున్నాడు కాని ఇప్పుడు ఇదంతా 'విరస' మే అని నిర్ధారణ చేసుకున్నాడు.
"ఎవడు చెప్పాడే ఈ సపోటా కబుర్లు, అంతా అబద్ధం, నాకేమిటి షుగర్ వ్యాధి ఏమిటి? పిడిరాయిలా నేనుంటే... చాలు చాలు గాని పుట్టిన రోజునాడు ఏడిపించక అన్నీ వడ్డించు" అని ఆజ్ఞలు జారీ చేశాడు.
నళినికి మళ్లీ అన్నగారి మాటలు జ్ఞాపకం వచ్చాయి.
"అతను ఎంత గింజుకుని పెట్టమన్నా పెట్టకు. మంగళ సూత్రం జాగ్రత్త" అన్న మాటలు.
ఒక్కసారి మంగళ సూత్రాలు కళ్ళకద్దుకుని "మీరు నన్ను చంపినా సరే నేను పెట్టను గాక పెట్టను. అంతేకాదు ఇకపై దుంపకూరలు, వంకాయకూర, బెండకాయ, చిక్కుడుకాయ, గుమ్మడికాయ, పనసకాయ లాంటివి కూడా ఏమీ ఇంటికి తీసుకురావద్దు” అని గట్టిగా చెప్పింది.
ఈ చెప్పిన వన్నీ సుబ్బారావుకు చాలా ఇష్టమయినవే. పులుసులో చిలగడదుంప ముక్కలంటే ప్రాణం లేచొస్తుంది. అన్నిటికీ బ్యాన్ పెడితే ఇక తను తిని చచ్చేదేముంది. సుబ్బారావు హతాశుడైపోయాడు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
"అవునూ. నెయ్యి, పెరుగు మీగడ నాకిష్టమని నీకు తెలుసు కదా” ఇంకా వాక్యం పూర్తి కాలేదు. నళిని అడ్డుపడి "అవన్నీ వద్దని చెప్పానా? అవి కొలస్ట్రాల్ పెంచుతాయట. ఆవకాయ, మాగాయ, ఉప్పుకారం బి.పి. పెంచుతాయట. ఇవేమీ వద్దుట. కావాలంటే తోటకూర ఉడకపెట్టి ఉప్పు వేయకుండా పెట్టమన్నారు. పెడతాను తినండి" అని చెప్పేసింది మంగళసూత్రాన్ని మనసులో పెట్టుకుని.
సుబ్బారావుకు ఒళ్లు మండిపోయింది. "అయితే - ఒక పని చెయ్యి. చిటికెడు విషం ఉంటే అందులో వెయ్యి. నా పీడా నీ పీడా వదిలిపోతుంది" అంటూ బొబ్బలుపెట్టాడు. ఏమయినా సరే నళిని మెట్టు కూడా దిగకుండా, ఇంకో మెట్టు కూడా పైకెక్కి ఆర్డర్లు జారీ చేసింది" ఇవేవీ ఇంకతను పెట్ట"నని.
📖
వారం రోజులు గడిచాయి. దబ్బపండులా ఉండే సుబ్బారావు పాపం నిమ్మపిందె లాగా అయిపోయాడు. ఎంత బతిమిలాడినా నళిని వినడం లేదు. రోజూ భోజనం దగ్గర రామరావణ యుద్ధమయిపోతోంది. “పోనీ ఆ చిక్కుడు కాయ గింజలు లేకుండా పై తొక్కలన్నా వెయ్యవే" అని బతిమిలాడుకున్నాడు.
"అమ్మో! వాతం చేస్తుంది. నా వల్ల కాదు. అయినా అన్నిటికీ అంత జిహ్వచాపల్యం ఏమిటి?.. లేకితనం చూస్తే నలుగురూ నవ్వుతారు. ఏదో తిన్నన్ని రోజులు తిన్నారు. ఇక ఈ జన్మలో వాటికి నీళ్లొదులుకోండి. ఏదోలా బ్రతకడం అలవాటు చేసుకోండి" అని వేదాంత ధోరణిలో మందలించింది.
సుబ్బారావుకి ఒకపక్క కోపం ఎక్కువయింది "బతికినన్నాళ్లు బ్రతికాగా ఇక ఇప్పుడు చంపెయ్యరాదూ ... ఈ దిక్కుమాలిన బ్రతుకు బతక్కపోతే ఎవడేడిచాడు. ఛస్తేనే మంచిది” అని విసుక్కున్నాడు నిరాశతో.
మరి నాలుగు రోజులు గడిచాయి. సుబ్బారావు కాకరకూరను కళ్లు మూసుకుని నోట్లో వేసుకుని చెంబెడు నీళ్లు గుటుక్కున తాగుతున్నాడు. నడిచే ఓపిక లేక కర్ర చేతికి వచ్చింది. ఏమయితేనేం తన మంగళ సూత్రం బాగుంటోందని నళిని సంతోషపడి పోతోంది. అనకూడదు గాని పిల్లికి చెలగాటం - ఎలక్కి ప్రాణసంకటంలా ఉంది పాపం సుబ్బారావు పరిస్థితి.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
మరో వారం గడిచింది. ఒక రోజున సుబ్బారావు పడక కుర్చీలో కళ్లుమూసుకుని పడుకుంటే మెట్ల దగ్గర ఏదో పెద్ద మూలుగు వినిపించింది. క్రమంగా మూలుగు తనకు దగ్గరవుతోంది. ఏ పందికొక్కో, లేచి కొడదామనుకుంటే అతనికి 'లేచే ఓపిక లేదు. ఆ మూలుగు క్రమంగా దగ్గిరయి దగ్గిరయి హాల్లోకి చేరుకుంది. తీరా చూస్తే తన మామగారు పరంధామయ్య గారు జంపకానా పరుపు చుట్ట భుజాన వేసుకుని, చంకలో సంచీతో (సిమెంటు సంచీలో బట్టలు కుక్కి) మరో చంకలో గొడుగుతో మూలుగుతూ ప్రత్యక్షమయ్యారు. సుబ్బారావు ఓపిక తెచ్చుకుని కుర్చీలోంచి లేచి మామగారి చేతిలో లగేజీ అందుకుని "ఏమేవ్ ఎవరొచ్చారో చూడు"అని దొడ్లో ఉన్న భార్య నుద్దేశించి నీరసంగా కేకేశాడు.
నళిని అతిధి మర్యాదలన్నీ చేసి " నీవంట్లో ఎలా ఉంది నాన్నా? అంతా బాగున్నారా" అని కుశల ప్రశ్నలు వేసింది.
పరంధామయ్య తాత్కాలికంగా మూలుగు ఆపి "ఏం కులాసా తల్లీ. నా ఆరోగ్యమే ఏమీ బాగుండటం లేదు. ఇక్కడ డాక్టరుకు చూపిద్దామని వచ్చా ... బలానికి డాక్టరు పళ్లూ పాలూ, తినమంటే రోజూ చక్రకేళీలూ, పంచదార బాగా వేసి బాగా పాలూ, ఆరగా ఆరగా తింటూనే ఉన్నా. ఏమీ తగ్గి చావటం లేదు. అది సరే గాని అమ్మా! నీ ఆరోగ్యం బాగుంటోందా. 'నీకున్న షుగర్ వ్యాధి కంట్రోల్లోకి వచ్చిందా?" అని అడిగాడు.
నళిని తెల్లబోయి "అదేమిటి నాన్నా? నాకు షుగర్ వ్యాదేమిటి? ఆ షుగర్ మీ అల్లుడు గారికి” అని చెప్పింది.
దాంతో పరంధామయ్య చివ్వున లేచి "నీ బొందా నా బొందాను. అల్లుడి గారికి కాదు, నీకే! డాక్టరు రిపోర్టు తారుమారు చేయకు" అన్నాడు బల్ల గుద్ది మరీ చెపుతూ.
కుర్చీలో కూర్చున సుబ్బారావుకు ఎక్కడ లేని ఓపికా వచ్చి చివాల్న లేచి “చూశారా చూశారా తనకి షుగర్ వ్యాధి పెట్టుకుని నా ప్రాణం తీసి, నన్ను నిలువునా కాల్చుకు తింటోంది" అని ఎగిరిపడ్డాడు.
“లేదు నాయనా. ఇన్నేళ్లొచ్చి నీతో ఇలా అబద్దమాడతానా. షుగర్ వ్యాధి దానికే ఉందనీ, గోధుమ అన్నం, కాకరకాయ కూరా బాగా తినమనీ దానికే, నీరసానికి పళ్లూ పాలూ బాగా వాడమనీ నాకు డాక్టర్ స్వయంగా చెప్తేనే' అని గట్టిగా అనేసరికి సుబ్బారావు సంతోషం పట్టలేక కెవ్వున అరిచాడు. నళిని అరిచింది కెవ్వున, కానీ సంతోషంతో కాదు భయంతో విచారంలో.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
ఆరోజు నుంచీ పరిస్థితులు మారిపోయాయి. గోధుమ అన్నం, కాకరకాయ కూర నళినికి ట్రాన్స్ ఫర్ అయ్యాయి. సుబ్బారావు మాత్రం అన్నీ తింటున్నాడు. ఆ తర్వాత వారం రోజులయ్యేసరికి సుబ్బారావు బాగా కోలుకున్నాడు గాని, నళిని మాత్రం మంచం దిగలేకపోతోంది. బాగా నీరసించిపోయింది. మామగారికి పూట వారీ పళ్లూ, పాలూ, జీడిపప్పు, కిస్మిస్, బలానికి మందులూ తేలేక సుబ్బారావు అవస్థపడిపోతున్నాడు.
📖
ఇలా కొద్ది రోజులు గడిచాయి. రాను రాను సుబ్బారావుకు ఈ ఇల్లు నరకప్రాయమైంది. ఇంట్లో హమేశా రెండు మంచాలు విడవ కుండా నట్టింట వున్నాయి. ఒక మంచం మీద కాళ్లూ, చేతులూ లేపే శక్తి లేక వెల్లికిలా, శవాకారంలా పడివున్న నళిని, రెండో మంచం మీద అంపశయ్య మీద పడుకున్న భీష్ముల వారిలా మామగారూ. వీళ్లకు వండి పెట్టలేక, మందులు తీసుకు రాలేక తన చావు దగ్గరకొస్తోంది. ఇంతకంటే గోధుమ అన్నం, కాకరకూరే నయమేమో అనుకున్నాడు సుబ్బారావు.
"ఏవండీ. ఒక్కసారి నన్ను బాత్రూమ్ కి
తీసుకెళ్తారూ?" అని నళిని.
"అల్లుడూ, నన్ను కొంచెం వత్తికించి పడుకోబెట్టు. పడుకొని పడుకుని పక్కలు పీక్కుపోతున్నాయి" అని మామగారు. ఇలా ఇద్దరూ వంతుల వారీగా పిలిచి ప్రాణాలు కొరుక్కుతింటున్నారు సుబ్బారావుని.
"ఈ ముసిలాడు ఇక్కడికెందుకొచ్చినట్టు నా ప్రాణం తీయడానికి కాకపోతే. డబ్బుకు డబ్బు బోలెడయిపోతోంది. నా ప్రాణానికి సుఖం లేకుండాపోతోంది. చాకిరీ చెయ్యలేక" అంటూ సుబ్బారావు గుడ్ల నీళ్లు గుడ్డను కుక్కుకుంటున్నాడు.
శనివారం. దుర్ముహూర్తం. నళిని, పరంధామయ్య ఇద్దరూ పంతం పట్టినట్లు ఒకళ్లు విడచి ఒకళ్లు ఆర్తనాదాలు మొదలు పెట్టారు.
నళిని మంచానికి అతుక్కుపోయింది. పరంధామయ్య గుడ్లు తేలవేస్తున్నాడు. సుబ్బారావుకి భయమేసింది. మాసిపోయిన పాంటు షర్టు అని ఆలోచించకుండా ఫామిలీ డాక్టర్ దగ్గరకి పరిగెట్టాడు. పాపం డాక్టరు గారు ఏకళనున్నాడో, జపం కూడా చేసుకో కుండా గజేంద్ర మోక్షంలో విష్ణుమూర్తిలా పరిగెత్తుకొచ్చాడు. తీరా వచ్చి చూస్తే ఏముంది?! ప్రాణాలు పోయినంత పనయి తండ్రీ కూతుళ్లు చెరో మంచం మీదా పడున్నారు.
డాక్టరుగారికి తను ఇచ్చిన మెడికల్ రిపోర్ట్స్ జ్ఞాపకం వచ్చినాయి. ఎందుకాయినా మంచిదని ఆ రిపోర్టులు మళ్ళీ ఒకసారి ఇవ్వమన్నారు. పరంధామయ్య తన సిమెంటు సంచీ లోంచి వాటిని బయటికి తీసి ఇచ్చాడు. వాటిని చూచి డాక్టర్ ఒక్కగావు కేక పెట్టి "ఆవిడకు షుగర్ వ్యాధనీ, మిమ్మల్ని పళ్లూ, పంచదారా తినమని ఎవరు చెప్పారు?" అని అరిచాడు.
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
"మా అబ్బాయి వీర వెంకట వరప్రసాదు" అని పరంధామయ్య చెప్పాడు.
"చంపారు పొండి. చక్కెర వ్యాధి ఆవిడకు కాదు మహానుభావా, ఈ పరంధామయ్య గారికి, అందుకని గోధుమ అన్నం, కాకర కాయ ఈయన తినాలి. మిస్టర్ సుబ్బారావ్! నళినికి ఇప్పుడు నాలుగో మాసం. మీరు తండ్రి కాబోతున్నారు. అందుకని పళ్లూ పాలూ వంటి బలకరమైన ఆహారం తినమని చెప్తే, ఈయన పళ్లూ పాలూ మెక్కి, ఆవిడకు గోధుమ అన్నం, కాకరకాయ కూర పెట్టి ఆవిడ ప్రాణం తీయబోయాడు. మెడికల్ రిపోర్ట్స్ తారుమారయ్యాయి. ఇలా ఇంకో రోజుంటే ఇద్దరి ప్రాణాలు దక్కేవి కావు. ఏమైతేనేం. అదృష్టవంతులు' అన్నాడు.
“మరి మావాడు అలా చెప్పి చచ్చాడే!" అన్నాడు పరంధామయ్య.
"తాగుబోతు వెధవ. వాడి మాటలకు విలువేమిటి? అది సరే ఇప్పుడేం చేద్దాం" అన్నాడు సుబ్బారావు.
“ఏముందీ? ముందావిడకి పళ్లూ పాలూ ఇవ్వండి. ఇంతవరకూ పళ్లూ, పాలూ ఆరగించిన మీ మామగారిని ఒక లాగుడు బండి మీద వేసి హాస్పిటల్ కి పంపండి. తిన్నవన్నీ ముందు కక్కించాలి" అన్నారు డాక్టర్ గారు.
సుబ్బారావుకు ఆలోచన వచ్చింది. 'పోనీ మావగారిని శీర్షాసనం వేయించి వీపు మీద బాదితే.. తిన్నవన్నీ బయటకి వస్తాయేమో కదా' అనుకున్నాడు వచ్చే కోపాన్ని బలవంతాన అణగదొక్కుతూ. కాని పాపం పైకి మాత్రం అనలేకపోయాడు.
🩺
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం*
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
*తెలుగు భాషా రక్షతి రక్షితః*
*1 YEAR SUBSCRIPTION 120/-
phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
No comments:
Post a Comment