*అక్బర్ - బీర్బల్ కధలు - 13*
🎭
రచన : యర్నాగుల సుధాకరరావు
ఒక సైనికుడు ఉదయాన్నే ఒక తాటాకు పత్రం తీసుకువచ్చాడు. అప్పటికే హేమరాజ్ లేచి జరగబోయే యుద్ధం కోసం ఆలోచించసాగాడు. వేకువజామున కొందరు యుద్ధనిపుణులు వచ్చి రకరకాలు గా యుద్ధ తంత్రాలు చెప్పి వెళ్లారు.
"ప్రభూ నేను సైన్యంలోంచి తప్పిపోయిన వాడిని. ఉదయాన్నే అడవిలో నుంచి వస్తుండగా పెద్ద ఏనుగుపై ఒక వ్యక్తి కనిపించి నాకు ఈ పత్రం తమకు ఇమ్మని చెప్పాడు. ఇదేదో పాటలా ఉంది" అని అందించాడు.
హేమరాజ్ తాటాకు పత్రం వైపు అదోలా చూసి..
“పాట రాసే కవి ఎవడూ అడవిలో తిరగడు. కనుక ఎవరు పంపారా అని ఆలోచించడం శుద్ధ దండుగ. రాసేది పంపేది గుండె ధైర్యం ఉన్న ఒక్క బీర్బల్ కే సాధ్యం అతడే ఇచ్చి ఉంటాడు. ఏదో రాసుంటాడు? నేను ఒక్కడినే చదువుకుని నవ్వుకునే దానికంటే ఇక్కడ మనతో వచ్చిన కవిచే చదివిస్తాను. అంతా వినండి. ఇప్పటికి యుద్ధరచనతో మన తలలు వేడెక్కాయి. కాసేపు బీర్బల్ రాసింది ఏమయినా మనల్ని నవ్విస్తుందని నేను నమ్ముతాను.” అని పకపకమని నవ్వి అక్కడ ఒక కవికి ఇచ్చి చదవమన్నాడు.
ఆ కవి పత్రం అందుకుని సన్నగా నవ్వి అందరిని చూసి పెద్దగా రాగాలాపనతో చదివాడు.
“బతికేందుకు దారిలేక చావబోతే, సైతాన్ తోటలో మామిడి పండ్లు దొరికే, వాటితో ప్రాణాలు నిలిచే”
ఢాం! ఢాం!!
“మామిడిలు తినీ తిని రోతపుట్టే, చావే మంచిదనిపించే.. ఖాను వచ్చే ఆశలు పెట్టే, బతకాలి అని పెద్ద కొలువు ఇచ్చే..”
ఢాం! ఢాం!!
“ఒంటినిండా నగా నట్రాలే, ఖరీదైన జీవితం దొరికే, ఆ నగానట్రలకు అక్బర్ కుంటి కోతికి ధర పలికే”
ఢాం! ఢాం!!
“అక్బర్ ధరను కోతి ఇచ్చినవాడికే, ముఖాన కొట్టే కోతి కథ నడిపినందుకే, మెచ్చి పెద్దకొలువు నిచ్చే”
ఢాం! ఢాం!!
“అక్బర్ ఇచ్చిన కొలువూ వదిలే, పెద్దలతో పరుగులు తీసే, పదవులే లేని పెద్దలు కొట్టుకునే, తల్పం వదులుకునే”
ఢాం! ఢాం!!
“చావు తప్పి కన్నులొట్టబోయే, పెద్దల్ని పట్టి ఇచ్చే, కాలం చెడిన గుర్రంతో కారడవుల పాలయ్యే..”
ఢాం! ఢాం!!
“అక్బర్ ఇచ్చిన నగలతో కర్ణకఠోర డప్పు వచ్చే, ముసలి గుర్రం విక్రమాదిత్యకు స్వారీ అయ్యే..
ఢాం! ఢాం!!
“బక్క గుర్రం, దరువులు డప్పు పోయే, జాతి ఏనుగు వచ్చే ఊరేగుతూ ఊరుపోయే..”
ఢాం! ఢాం!!
ఆ కవిత విని అంతా ముసిముసిగా నవ్వారు. హేమరాజ్ పడిపడి నవ్వాడు. "భలేగా రాసాడయ్యా! మనం జాతి ఏనుగునిచ్చి రేపోమాపో చావనున్న గుర్రాన్ని కొనుగోలు చేసాం. రాత్రి ఆ ముసలి గుర్రాన్ని అడవిలో వదిలేయమ న్నాను. అలా దాన్ని వదలకండి. మనతో తీసుకుపోదాం. ఢిల్లీ వెళ్లాక దానికి ప్రత్యేక శ్రద్ధతో సాకాలి. ఇదో గొప్ప గుర్రం. దానిలో మనం బీర్బల్ను చూసుకోవచ్చు.” అని అక్కడ మంత్రి సామంత దండనాయకుల కు ఛలోక్తిగా చెప్పా డు.
📖
పానిపట్టు వద్ద ఇరువర్గాల పోరు ఉధృతంగా సాగింది. ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో తెలియని విధంగా పోరు భయంకరంగా సాగింది. అతి చిన్న వయస్సులో ఉన్న అక్బర్ ఏమాత్రం బెదరక కదనరంగాన కత్తులు ఝళిపించ సాగాడు. అతని చుట్టూ రక్షణ రేఖల్ని ఛేదించ వీలుకాని విధంగా ఏర్పాటు చేసాడు పాదుషా సంరక్షకుడు భైరంఖాన్. పోరు ఎంత భయంకరంగా సాగినా హేమరాజ్ లెఖకు మించిన సైన్యాన్ని అక్కడ మోహరించడం వలన చాలా ప్రమాదంలో పడింది. ఒక్కసారి కాల్బలం, గజబలం, ఒకే చోట చేరిపోవడంతో వారిలో కుమ్ములాట అయ్యింది. కట్టు తెగిన వరదలా ఒక అగాధంలోకి గజబలం దూసుకుపోయింది. ఒకటే హహాకారాలు. హేమరాజ్ సైన్యం ఎటుపోతున్నామో తెలి యని పరిస్థితిలో చిక్కుకుపోయింది. ఇదే అదను అనుకుని మొగలాయిలు వీరులు విజృంభన సాగించారు. దొరికినవాడిని దొరికినట్టే తెగనరికారు. అక్కడ శవాలు గుట్టలయ్యాయి. ఎట్టి పరిస్థితిల్లో హేమ రాజ్ ఓడాల్సింది లేదు. మొగలాయిలను తరిమి తరిమి కొట్టాల్సిందిపోయి అతడు ఊహించని విధంగా అతడి సైన్యం ఓటమి బాటలో పడింది. సాయంత్రానికి తీవ్రంగా శరాఘాతాలతో గాయపడిన హేమరాజ్ బందీ అయ్యాడు.
(రెండవ పానిపట్టు యుద్ధం గురించి ఇక్కడ ప్రస్తావన వచ్చినది కనుక అవసరం ఏ మేరకు ఉందో అంతవరకు మాత్రమే ఇచ్చాం. పూర్తి నిడివి ఇవ్వలేదు. కనుక గమనించగలరు) అతడిని సైన్యం మధ్య నుంచి తీసుకుపోవాలని పలువురి
ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి అక్బర్ ముందు పడేసారు. అప్పటికి హేమరాజ్ చేష్టలుడిగి ఉన్నాడు. అతన్ని వధించవల సిందిగా సేనానులు వివిధ దళపతులు పట్టుబట్టారు. వారిచే అలా అన్పించింది
భైరంఖానే.
పట్టుమని పదహారునిండని అక్బర్ హేమరాజ్ ను చంపేయాలన్నంత కసిలో లేడు. కారాగారంలో వేయమన్నాడు. అతడిలో ఏ మూలనో జాలి కన్పించింది. "పాదుషావారు ఉపేక్షించకుండా దొరికిన శత్రువుని మీరే స్వయంగా చంపేయండి.” భైరంఖాన్ అక్బర్ చేతికి కత్తిని ఇచ్చి చెప్పాడు. అక్కడ ఉన్న వారంతా వాళ్ళని అయోమయంగా ఉత్కంఠగా చూసారు. అప్పుడే కన్నులు తెరిచాడు హేమరాజ్.
"శత్రువు హేమరాజ్ యుద్ధంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఏ క్షణమైనా చావచ్చు. అలా అతను చావకూడదు. కనుక పాదుషావారూ! వెంటనే ఈ విక్రమాదిత్య బిరుదాంకితుడైన హేమరాజ్ ను మీ చేతుల మీదుగా చంపేయండి" మరోసారి చెప్పాడు భైరంఖాన్.
అక్బరు ముఖంలో రంగులు మారాయి. కత్తి ఎత్తి పట్టుకున్నాడు.
"మాకు ఆదేశించండి మేమే ఈ హేమరాజ్ తలను బంతి ఆట ఆడగలం మీకెందుకు వృథా శ్రమ” అని కత్తులతో ముందుకు దూసుకువచ్చారు వివిధ దళాధిపతులు. వారి వైపు గుర్రుగా చూసాడు భైరంఖాన్.
"పాదుషావారే తన కత్తికి ఈ యుద్ధ పిపాసిని ఎర వేయాలి. ఆ రక్తంతో ఈ పానిపట్టు నేలను తర్పణం చేయాలి. మీరెవరూ వద్దు వెనక్కుపొండి.”
'భైరంఖాన్ సింహగర్జన చేసాడు.
దాంతో అక్బర్ కత్తి ఎత్తాడు. అతడిలో నరాలు పొంగాయి. ఎత్తిన కత్తి బలంగా సర్రున దించబోయాడు. అక్కడ అందరిలో నరాలు తెగిన ఉత్కంఠ.
📖
"ఆగు చిరంజీవి, అక్బర్ ! గెలుపు గుర్రం ఎక్కినందున నా రక్తంతో నీ ఖడ్గం తడవాలి. కానీ, నేను, నీవు ఈ క్షణం పోరాడుతూ లేము. అలా పోరుతుంటే నీ ఖడ్గానికి బలి కావడం వేరు. అది నీకు కీర్తినిస్తుంది. కానీ, ఇప్పుడు నేను నీ బందీని. నన్ను చంపాల్సింది నీవు కావు. నీ ఎంగిలి మెతుకులు తినేవారు. ఇక్కడ ఉన్నవారు ఎవరికైనా ఆదేశించి నన్ను చంపించు. బందీని, నిరాయుధుడను, శక్తి లేనివాడ్ని నన్ను చంపిన హీనత్వం నీకు వద్దు. నీవు చక్రవర్తివి. ధర్మా ధర్మములు గురించి నీవు ఇలాంటి సమయంలో ఆలోచించాలి. అప్రతిష్టకు పోకు. బ్రాహ్మణ హత్యాపాతకానికి భయపడి నీసంరక్షకుడు తాను చేయకుండా నీచే ఆ పాపం చేయిస్తున్నాడు. చచ్చే ముందు నిజాలే కదా ఎవరైనా చెప్పేది.” అని తీవ్ర గాయాల పాలయిన హేమరాజ్ గొంతు ఖంగుమంది. అక్కడ అంతా భైరంఖాన్ వైపు తీక్షణంగా చూసారు.
ఎవరికివారే లోలోపల అనుకున్నారు. 'నిజమే వీడు బ్రాహ్మణుడు. వీడిని చంపితే అదేదో పాపం ఏడు జన్మల వరకు నీడలా వెంటాడుతుందని వారి మతం చాటి చెప్తోంది. మనకెందుకు ఇలాంటి సాహసం అని మెల్లగా కరవాలాలు ఒరల్లోకి నెట్టేసారు.
"రేయ్, నీవా బ్రాహ్మణుడవు. కసాయివి నీవు కదనంలోకి ఉరికినా, ఊళ్ల మీద పడినా పాపం అని చూడకుండా ముసలి పిల్లా పిచుక అనకుండా నరుక్కుంటూ పోతావు. నీ ముందు ఆ చాణక్యుడు
కూడా సాటిరాడు. నీవు రాజకీయ కుతంత్రపు హైందవుడవు. ప్రభూ! ఎత్తిన కత్తిదించవద్దు. తెగ నరకండి." భైరంఖాన్ అక్బర్ ను ఉసిగొలిపాడు.
“పాదుషా భవిషత్ ఉన్నవాడివి. నీవు చంపకు. ఈ ఖాన్ చే నన్ను చంపించు. నీవు ఆదేశించినా ఈ భైరంఖాన్ చంపడు. పాతక భయం!" మృత్యు ఒడిలోకి ఒరిగి పోతూనే హేమరాజ్ చెప్పాడు.
"నీకెలా తెలుసు? మా సంరక్షకులు ఖాన్ బబా ఆంతర్యం తెలుసుకున్నట్టు చెప్తున్నావు.” అక్బర్ అనుమానంగా అడిగాడు.
"బీర్బల్ ఈతనిచే నన్ను చంపవద్దని చెప్పి ప్రమాణం చేయించుకున్నట్టు నాకు తెలుసు" చెప్పి ఒంటి నిండా గుచ్చుకున్న బాణాలు పెట్టే శరీరపు రంపపు కోతను తట్టుకోలేక విలవిలలాడిపోయి లుంగలు చుట్టుకుపోయాడు. అతడికి చనిపోవాలని ఆశగా ఉంది.
అక్బర్ తల తిప్పి ఖాన్ బాబా వైపు చూసాడు.
భైరంఖాన్ ఎలా బదులు ఇవ్వాలో తెలియని పరిస్థితిలో తలదించుకున్నాడు. అక్బర్ తన చుట్టూ ఉన్నవారి వైపు ఓరగా చూసాడు. అప్పటికే అంతా కత్తులు ఒరలో పెట్టుకున్నారు.
అక్బర్ హేమరాజ్ ను చూసి అదోలా నవ్వి
“నాకు ఎలాంటి పాపభయం లేదు. ఇక బందీని చంపడంలో నేను చిన్నబోయినది లేదు.” అని చెప్పి ముందుకు అడుగులు వేసాడు. సర్రున కత్తి దూసి హేమరాజ్ తలను నరికేసాడు.
(అక్బర్ గురించి ఎక్కువమంది చరిత్రకారులు సర్వమతాభిమాని అని, హిందువులపట్ల సహనం, గౌరవం కనబరిచాడు అని రాసారు. కొంతమేరకు హిందూ ద్వేషం అత్యంత క్రూరంగా కనబరిచే సన్నివేశాలు అక్బర్ జీవితంలో కూడా కోకొల్లలు జరిగాయి.)
ఆ తరువాత అక్బర్ సేనావాహిని ఢిల్లీ వైపు సాగిపోయేందుకు సిద్ధం అయ్యింది.
🎭
No comments:
Post a Comment