చలాచల బోధ పార్ట్ 2:--
ఇంతవరకు మనము సృష్టికి మూలం మూలప్రకృతి అని, త్రిగుణాలకు మూలం మూలావిద్య అని,చిత్ కు మూలం నిర్గుణ బ్రహ్మ అని,జడానికి మూలం కూడా మూలప్రకృతి అని, అహం కు మూలం నిర్గుణ బ్రహ్మ యందు గల అవ్యక్త వ్యక్తిత్వము అని చెప్పుకున్నాము.
నాదము అంటే ప్రణవ నాదం అని, బిందువు అంటే ఓంకారమని,కళ అంటే అకార ఉకార మకార మాతృకలుగా వమర్శింప బడటమని చెప్పుకున్నాము.
ఇవన్నీ మాయావరణలోనివే!
అలాగే మాయావరణలోనే బ్రహ్మణో అవ్యక్తః అవ్యక్తో మహత్త్ మహతో మహదహంకారః అహంకారో పంచ తన్మాత్రాణి తన్మాత్రో పంచ భూతాణి,పంచ భూతో అఖిలం జగత్.ఇది మూలం నుండి అవరోహణ.
మూలప్రకృతి అవరోహణలో నామ రూప ప్రపంచము అయింది.త్రిగుణాలు బీజ స్థితిగా ఉన్నప్పుడు మూలావిద్య నుండి అవరోహణ క్రమంలో మాయగా, శుద్ధ సత్వ మాయగా,మలిన సత్వ మాయగా, లేక అవిద్యగా అయింది.
బ్రహ్మ మూలంలో నిర్గుణ బ్రహ్మగా ఉంటూ అవరోహణ క్రమంలో జీవులు అయ్యింది.
మూలంలో నిర్గుణ బ్రహ్మ యందు అవ్యక్త వ్యక్తిత్వముగా ఉంటూ అవరోహణలో అంతఃకరణ చతుష్టయములోని అహంకారము అయ్యింది.
అలాగే మూలంలో నిర్గుణ బ్రహ్మ యందు చిన్మాత్ర ఉంటూ మాయావరణము నందు చైతన్యముగా వ్యాపించి మాయతో మిధునత్వము చెంది జడములో జడ శక్తిగా,అనాత్మలో ఆత్మ శక్తి, లేక చిచ్ఛక్తిగా జీవునిలో ప్రత్యగాత్మగా, ఈశ్వరునిలో పరమాత్మగా అవరోహణా క్రమంలో ప్రతీయ మానమైంది.
మూలావిద్య, నిర్గుణ బ్రహ్మ, మూలప్రకృతి ఒక వర్గముగా చూస్తే,మాయ(మహత్తు), సగుణ బ్రహ్మ, ప్రకృతి లను రెండవ వర్గముగా చూడవచ్చును.
శుద్ధ సత్వ మాయ, ఈశ్వరుడు,పర ప్రకృతి లను మూడవ వర్గముగా చూడవచ్చును.
మలిన సత్వ మాయ,లేక అవిద్య, జీవుడు,అపర ప్రకృతి లను నాల్గవ వర్గముగా చూడవచ్చును.
ఈ విధంగా అవరోహణా క్రమమును అవగాహన చేసుకోవాలి.
మూలము నుండి అవరోహణ అయిన విధానము చల బోధగా చెప్పుకుంటున్నాము.
ఇదంతా మాయ హద్దు నుండి మాయావరణము నందు జరిగేది.మాయ హద్దుకు ఆవల త్రిగుణములు లేవు, మూలప్రకృతి లేదు,మూలావిద్య లేదు, సగుణ నిర్గుణ బ్రహ్మలు లేరు,చిన్మాత్ర లేదు, కావున అరోహణ అవరోహణలు లేవు.వ్యక్తావ్యక్తములు లేవు.కదలికలు లేవు.కదిలించే ప్రేరణ శక్తులు లేవు.అదే శుద్ధ నిర్గుణ తత్త్వము.అదే అచలము.అదే పర తత్త్వము, లేక పరాత్పరము.దానినే అచల పరిపూర్ణము అని అంటారు.ఈ లక్ష్యమును వివరిస్తూ, బోధించేదే అచల బోధ!
ఇటువంటి లక్ష్య సిద్ధియే పరమపదము అనబడును.
సశేషం!
No comments:
Post a Comment