Monday, April 28, 2025

 *ఏం కావాలి?*

శుక్రాచార్యులవారు బలిచక్రవర్తితో విశ్వజిత్‌ యాగాన్ని చేయిస్తున్నారు. యాగం పూర్తికావచ్చింది. దాని ఫలితమేంటో విష్ణువుకు తెలుసు. బలి అంతరంగం తెలుసు. శుక్రుని ఆంతర్యం ఎరిగిన లక్ష్మీపతి బాలకుడి వేషంలో యాగస్థలికి వచ్చాడు. తనను చూసి బలి ‘నీకేం కావాలో కోరుకో’ అన్నాడు. అందుకు మహాదేవుడు ‘ఇది నాకు నెలవని ఏ రీతి బలుకుదు?’ అని కొన్ని మంచి మాటలు చెప్పాడు. అందుకు మరింత ఆనంద పడిపోయి, పొంగిపోయి ‘పిల్లవాడా... నిన్ను చూస్తే చాలా ఆనందంగా ఉంది. నేను చక్రవర్తిని ఏదో ఒక కానుక ఇవ్వాలి. కాబట్టి ఏమి కావాలో కోరుకో’ అన్నాడు ధీమాగా, గర్వంగా. ఆయన అడిగాడు. బలి ఇచ్చాడు. చివరికి ‘బలైపోయాడు’.

వర్తమానంలో ఎంతోమంది ఆనందంతో, ఎదుటి వారి పైన అనురక్తితో ముందు వెనుకలు ఆలోచించకుండా ‘నీకేం కావాలి’ అని అడిగేస్తుంటారు. తీరా అవసరమైన వారు అడిగితే తడబడతారు. తమ తాహతేంటో, అవతలి వారి అవసరమేంటో గ్రహింపు లేకుండా ‘అడుగు, ఇస్తాను’ అనడం అనర్థాలకు హేతువు కావచ్చు. విశ్వామిత్రుడు రాగానే మర్యాదలు చేసిన దశరథుడు ఏం కావాలో చెప్పమనగానే ముని రామ లక్ష్మణులను తనతో పంపమన్నాడు. దశరథుడు ఆలోచనలో పడి, ఆవేదన చెందాడు.
రామాయణ, భాగవత, మహాభారత కథలు, పంచతంత్రం కథలు... అన్నీ కూడా ఆలోచించి మాట ఇవ్వాలంటాయి. మొహమాటానికి పోతే ఇబ్బందులు తప్పవని చెబుతాయి. బలి మాట విన్న వామనుడు ‘ఎంతమాట అన్నావయ్యా బలి చక్రవర్తీ! నాకు ఏది కావాలంటే అది ఇస్తావా! చక్రవర్తీ! దొరికిన దాంతో తృప్తి పడినవాడు పొందే ఆనందం దొరకని దానికోసం పరిగెత్తే వాడికి, అత్యాశతో పరుగెత్తే వాడికి దొరకదు’ అని చురక వేస్తాడు. భాగవతం రాసిన పోతన ఇటువంటి సన్నివేశాలను ఆద్యంతం అత్యంత రమ్యమైన పద గుంఫనాలతో రచించాడు.
ఎదుటివారు ఎంత కావాల్సిన వారైనా, వారెంత తమకిష్టులైనా మొహమాటాలకు, మెహర్బానీలకు పోయి ప్రాణం మీదకు తెచ్చుకోవటం వివేకమనిపించుకోదు. అసహాయులకు, అన్నార్తులకు సహాయం చేయాల్సిందే. కానీ ‘ఏం కావాలి’ అని అతిశయంతో, మితిమీరిన ఆత్మవిశ్వాసంతో అనడం మాత్రం నిశ్చయంగా ఇబ్బందని అంగీకరించక తప్పదు. ప్రస్తుత పరిస్థితులను బట్టి, వ్యక్తుల మనఃస్థితి గమనించి, స్థాయిని గుర్తించి, వారి ఆర్థిక, కుటుంబ అవసరాలను తెలుసుకుని ‘నేనేమైనా నా పరిధిలో మీకు ఉడతసాయం చేయగలనా’ అని నమ్రతతో అడిగితే ఎదుటివారికి మన స్థాయిని పరోక్షంగా తెలియజేసినట్లవుతుంది. సహాయమర్థించే వారికి అర్థమవుతుంది. భాగవతంలో వామనుడు చెప్పినట్లుగా ‘ఏ ఆశ్రమంలో ఉన్నవారు ఆ ఆశ్రమ ధర్మాన్ని అనుసరించి అర్థించాలి’. దాత కూడా అడిగిన వారి తాహతును తెలుసుకుని ఇవ్వాలి. అంతేకాని ‘ఏం కావాలి’ అనే అతిశయం పనికిరాదు.
~భమిడిపాటి గౌరీశంకర్‌

No comments:

Post a Comment