జమ్మూకశ్మీర్లో పహల్గాం దాడి తర్వాత భారత్ పాక్కు ఊహించని దెబ్బకొట్టింది. న్యూదిల్లీ మిలిటరీ చర్యలు తీసుకొంటుందని ఊహించిన పాక్ సైనికాధికారులు సరిహద్దుల్లో తమ వనరులు మోహరించుకొని కూర్చొన్నారు.కానీ, వారి ఊహకు అందని దెబ్బకొట్టింది భారత్. అదే సింధూ జలాల ఒప్పందాన్ని (Indus Waters Treaty) సస్పెండ్ చేయడం. వాస్తవానికి గతంలో పాక్తో యుద్ధాలు, సైనిక ఘర్షణలు జరిగినప్పుడు కూడా దయతో భారత్ ఈ ఒప్పందాన్ని రద్దు చేయకుండా కట్టుబడింది. ఎందుకంటే ఆ నదుల జలాలు పొరుగుదేశానికి జీవనాడులు. కానీ, ఈసారి సహనం నశించిపోవడంతో ఈ నిర్ణయం తీసుకొంది.
ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన నీటి పంపిణీల్లో సింధూ జలాల ఒప్పందం ఒకటి. 1960లో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత్-పాక్ దీనిని కుదుర్చుకొన్నాయి. ఆరు నదుల నీటిని ఇరుదేశాలు పంచుకొన్నాయి. దీని కింద సింధూ, జీలమ్, చీనాబ్ నదుల నీరు పాకిస్థాన్కు దక్కింది. ఇవి కాకుండా బియాస్, సట్లెజ్ జలాలు కూడా వెళుతుంటాయి. ఇక భారత్ ఈ నదుల్లో ప్రవహించే నీటిని పాక్కు చేరేలా వాడుకోవాలి. అంటే జలవిద్యుత్ ఉత్పత్తి వంటి వాటికి మాత్రమే వినియోగించాలి. కానీ, పాక్ ఈ నీటి పైనే ఆధారపడింది. దీనిని దృష్టిలో ఉంచుకొనే ఎన్ని సంఘర్షణలు జరిగినా భారత్ దయతో ఈ ఒప్పందం కొనసాగించింది.
నిలిపివేతతో తీవ్ర పరిణామాలే..
ఈ ఒప్పందం నిలిపివేత పాకిస్థాన్ను ఎండబెడుతుంది. ఆ దేశంలో నీటి సరఫరా అత్యధికంగా ఈ నదుల పైనే ఆధారపడింది. ఆ దేశంలో 23.7 కోట్ల మంది ప్రజల తాగునీటి అవసరాలకు ఈ జలాలను వాడతారు. కరాచీ, లాహోర్, ముల్తాన్ నగరాలు నేరుగా ఈ నదుల నీటినే ప్రజలకు అందిస్తున్నాయి.
పాక్ వ్యవసాయానికి వాడే నీటిలో 80శాతం ఈ ఒప్పందం కింద లభించేదే. 16 లక్షల హెక్టార్లు సాగవుతుంటాయి. ముఖ్యంగా పాక్ రాజకీయాలు, సైన్యాన్ని శాసించే పంజాబ్ ప్రావిన్స్కు ఇది జీవనాడి. ఆ దేశ జీడీపీలో 23 శాతం వ్యవసాయం నుంచే లభిస్తుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో 68 శాతం ప్రజలు దీనిపైనే ఆధారపడ్డారు.
సింధూ బేసిన్ నుంచి పాక్కు 154.3 మిలియన్ ఎకరాల అడుగుల (ఎమ్ఏఎఫ్) నీటిని ఏటా సరఫరా చేస్తోంది. ఆ దేశ ఆహారభద్రతకు ఇది చాలా కీలకం.
పాకిస్థాన్ ఇప్పటికే తీవ్రమైన నీటి కరవులో ఉంది. ఆ దేశ ఇరిగేషన్ మేనేజ్మెంట్ అధ్వానస్థితికి చేరింది. భూగర్భజలాలు పడిపోతున్నాయి.
పాకిస్థాన్ విద్యుత్తుకు కీలకమైన మంగల డ్యామ్ను జీలమ్ నదిపై నిర్మించారు. ఇది ఏటా ఆ దేశ విద్యుత్తు ఉత్పత్తిలో 8 శాతం ఇక్కడి నుంచే జరుగుతుంది. ఇక సింధూ నదిపై నిర్మించిన తర్బెల డ్యామ్ పాక్ వినియోగంలో 16 శాతానికి సమానమైన విద్యుత్తును తయారుచేస్తుంది. తాజాగా సింధూ జలాల ఒప్పందంతో పాక్లో 24శాతం జల విద్యుత్తుపై ప్రతికూల ప్రభావం పడనుంది.
మరోవైపు, తనకు ఇప్పటికే వస్తున్న నీటిని నిల్వ చేసుకొనే సామర్థ్యం పాక్కు లేదు. అక్కడ మంగలా, తర్బెల డ్యామ్లు కేవలం 14.4 ఎమ్ఏఫ్ నీటిని మాత్రమే నిల్వ చేయగలవు. పాక్ వాటాగా ఏటా లభించే నీటిలో ఇది 10 శాతానికి సమానం.
పాకిస్థాన్ జీడీపీలో 25శాతం ఈ నదుల నుంచే లభిస్తోందంటే.. భారత నిర్ణయం ఆ దేశాన్ని భవిష్యత్తులో ఎలా ప్రభావితం చేయనుందో అర్థం చేసుకోవచ్చు.
నిపుణులు ఏమంటున్నారు..?
గతంలో సింధూజలాల కమిషనర్గా పనిచేసిన ప్రదీప్కుమార్ సక్సెనా దీనిపై స్పందిస్తూ.. ''నదికి ఎగువ భాగాన ఉన్న దేశంగా భారత్కు అధిక ఆప్షన్లు ఉంటాయి. ఈ ఒప్పందం రద్దుకు తొలి అడుగుగా.. ఈ సస్పెన్షన్ను చూడొచ్చు. ఇక ఒప్పందం రద్దుకు సరైన ప్రొవిజన్లు ఏమీ లేవు. కానీ, వియన్నా కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ట్రీటీస్లోని ఆర్టికల్ 62 ప్రకారం పరిస్థితులు ఉంటే రద్దు చేసుకోవచ్చు.
సింధూ జలాల ఒప్పందం కింద కిషన్ గంగా ఇతర రిజర్వాయర్లలో పేరుకున్న బురదను తొలగించేందుకు నీటి విడుదలను ఈ ఒప్పదం ఆపుతుంది. ఎందుకంటే.. ఇప్పుడు నీరు దిగువకు విడుదల చేస్తే.. మళ్లీ నీరు నింపేందుకు ఆగస్టు వరకు ఎదురుచూడాల్సిందే. తాజాగా ఒప్పందం సస్పెన్షన్తో ఎప్పుడంటే అప్పుడు దిగువకు విడుదల చేసి.. తాజా నీటిని నింపుకొనే అవకాశం లభిస్తుంది. నిజంగా భారత్ ఇలా చేస్తే.. పాక్లోని పంజాబ్ ప్రావిన్స్లో పంటలు తీవ్రంగా దెబ్బతింటాయి'' అని పేర్కొన్నారు. కానీ, ఇక పాక్ గొంతు ఎండినట్లే. మహా అయితే పాక్ ప్రపంచ బ్యాంక్ లేదా ఐరాసకు వెళ్లి గోడు వెళ్లబోసుకుంటుంది.
తక్షణం లేకపోయినా.. మెల్లగా నొప్పి తెలుస్తుంది
భారత నిర్ణయం ప్రభావం తక్షణమే పాక్పై కనిపించకపోవచ్చు. నీటి ప్రవాహాన్ని వెంటనే ఆపడం సాధ్యం కాదు. సింధూ జలాలను నిల్వ చేయడానికి, మళ్లించడానికి తగిన వసతులు లేవు. ఇప్పటివరకు ఉన్న ఒప్పందం కారణంగా సింధూ, జీలం, చీనాబ్ నదుల ప్రవాహానికి ఆటంకం కలిగించే నిర్మాణాలు చేపట్టకూడదు. కాకపోతే తక్షణమే 5-10శాతం ప్రవాహాన్ని మాత్రం తగ్గించగలదు. ఒప్పందం నిలిపివేతతో భారత్ స్వేచ్ఛగా నిర్మాణాలు చేపట్టవచ్చు. ఇక్కడ భారీ డ్యామ్లకు ఏళ్ల సమయం పట్టొచ్చు.
No comments:
Post a Comment