Monday, April 28, 2025

 *విశిష్ట చారిత్రక తెలుగు మహిళలు - 51 -1*

*పులకించని మది పులకించు మెలోడీ మహరాణి జిక్కి*

"సినిమా గాయనీ గాయకుల్లో తొలి జంట జిక్కి, ఎ.ఎమ్. రాజా. జిక్కి అసలు పేరు పి.జి కృష్ణవేణి. తండ్రి పిళ్లా గజపతినాయుడు కాబట్టి ఈమె పేరు ముందు పి. జి వచ్చింది. తండ్రి 'జిక్కమ్మా' అని ముద్దుగా పిలవడంతో 'జిక్కిగా' పేరు స్థిరపడింది. జిక్కి తల్లి రాజ కాంతమ్మ. వీరి కుటుంబం మద్రాసులో ఉండేది. జిక్కికి పెద్దగా చదువులేదు. మద్రాసులో పుట్టి పెరగడంతో అరవమేగాని తెలుగు చదవడం రాదు. చిన్నప్పట్నుంచీ పాడటం ఇష్టం. సంగీతం నేర్చుకోక పోయినా హిందీ, తెలుగు పాటలు రేడియోలోవి అలాగే పాడేసేది. జిక్కి సమీప బంధువులు కొందరు కళా కారులు. పెద్దమ్మ హార్మోనిస్టు పెదనాన్న రంగస్థల నాటకాలకు సంగీత దర్శకత్వం చేసేవాడు. మేనమామ జెమిని స్టూడియోలో అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేసేవాడు.

జిక్కి *'పంతులమ్మ'* చిత్రంతో సినీగాయనిగా ప్రవేశం చేసింది. అప్పుడామెకు ఏడేళ్ళు. 

గూడవల్లి రామ బ్రహ్మం గారి 'పంతులమ్మ' చిత్రంలో చిన్న వేషం ఇచ్చారు. ఆ రోజుల్లో ఎవరి పాత్రకు వారే పాడుకోవాలి. గాలి పెంచలయ్యగారు స్వరపరిచిన *'ఈ తీరున నిన్నెరిగి పలుకగా, నాతరమా జగదేక కారణ'* అనే పాట పాడారు. *వాల్మీకి, మంగళ సూత్రం, ఇది మాకథ, నాగయ్య గారి త్యాగయ్య, గొల్లభామ* చిత్రాల్లో నటించారు. ఈ చిత్రాల్లో తన పాత్రల పాటలు తానే పాడుకున్నారు.

పదేళ్లు వచ్చాక తండ్రి వేషాలు మాన్పించారు. సంగీతం మీద దృష్టి పెరిగింది.

జిక్కి సినిమాల్లో పాడిన మొదటి నేపధ్యగీతం 1949లో వచ్చిన *'మనదేశం'* చిత్రంలోని *నిన్ను నేను మరువలేనురా ఓ పోలీసు వెంకటస్వామి.'* ఈ చిత్రానికి ఘంటసాలగారు సంగీత దర్శకులు. ఎన్.టి. రావుగారి మొదటి చిత్రం కూడా ఇదే. ఆ తర్వాత *లైలా మజ్నూ, షావుకారు* మొదలయిన చిత్రాల్లో పాడారు.

తొలిదశ లోనే జిక్కికి తమిళంలోనూ మంచి అవకాశాలు వచ్చాయి. రామనాథయ్యర్ దర్శకత్వంలో మోడరన్ ధియేటర్స్ *'మంత్రి కుమారి'* చిత్రంలో నాటి కథానాయిక మాధురీదేవికి నాలుగు పాటలు పాడారు. ఆ తర్వాత తెలుగులో *పాతాళ భైరవి, దేవదాసు, దొంగ రాముడు* మొదలైన చిత్రాలలో పాడారు.

పెళ్లయ్యాక సంసార బాధ్యతల వల్ల జిక్కి గాయనిగా వెనకబడ్డారు. ప్రేక్షకుల మనసు దోచిన జిక్కి పాటలెన్నో పాత చిత్రాల్లో వినిపిస్తాయి. *దొంగ రాముడు*' చిత్రంలోని *రారోయి మా ఇంటికి*', అనార్కలి చిత్రంలో  *'రాజశేఖరా నీపై మోజు తీరలేదురా'* *జీవితమే సఫలము*, సువర్ణ సుందరి చిత్రంలో ఐదు రాగాల్లో స్వర పరచిన *'హాయి హాయిగా ఆమని పాడె'* చాలా గొప్ప పాటలు. ఎ.ఎమ్. రాజా దర్శకత్వంలో పెళ్లి కానుక చిత్రంలో  *'పులకించని మది పులకించు*...' అనే పాట నేటికీ జిక్కి పేరు గుర్తు తెచ్చే పాట. శ్రోతల్ని పులకింప జేసే పాట. 'ప్రేమ లేఖలు' చిత్రంలోని '
*పందిల్లో పెళ్లవుతున్నది*' పాట కూడా ఆ రోజుల్లో జనంలో బాగా ప్రచారంలోకి వచ్చిన పాట.


*ఓం నమో శ్రీవేంకటేశాయ!!*
(సశేషం)

No comments:

Post a Comment