వర్తమానంలో ఎంతోమంది ఆనందంతో, ఎదుటి వారి పైన అనురక్తితో ముందు వెనుకలు ఆలోచించకుండా 'నీకేం కావాలి' అని అడిగేస్తుంటారు. తీరా అవసరమైన వారు అడిగితే తడబడతారు. తమ తాహతేంటో, అవతలి వారి అవసరమేంటో గ్రహింపు లేకుండా 'అడుగు, ఇస్తాను' అనడం అనర్థాలకు హేతువు కావచ్చు.
రామాయణ, భాగవత, మహాభారత కథలు, పంచతంత్రం కథలు... అన్నీ కూడా ఆలోచించి మాట ఇవ్వాలంటాయి. మొహమాటానికి పోతే ఇబ్బందులు తప్పవని చెబుతాయి.
ఎదుటివారు ఎంత కావాల్సిన వారైనా, వారెంత తమకిష్టులైనా మొహమాటాలకు, మెహర్బానీలకు పోయి ప్రాణం మీదకు తెచ్చుకోవటం వివేకమనిపించుకోదు. అసహాయులకు, అన్నార్తులకు సహాయం చేయాల్సిందే. కానీ 'ఏం కావాలి' అని అతిశయంతో, మితిమీరిన ఆత్మవిశ్వాసంతో అనడం మాత్రం నిశ్చయంగా ఇబ్బందని అంగీకరించక తప్పదు. ప్రస్తుత పరిస్థితులను బట్టి, వ్యక్తుల మనఃస్థితి గమనించి, స్థాయిని గుర్తించి, వారి ఆర్థిక, కుటుంబ అవసరాలను తెలుసుకుని 'నేనేమైనా నా పరిధిలో మీకు ఉడతసాయం చేయగలనా' అని నమ్రతతో అడిగితే ఎదుటివారికి మన స్థాయిని పరోక్షంగా తెలియజేసినట్లవుతుంది. సహాయమర్ధించే వారికి అర్థమవుతుంది. భాగవతంలో వామనుడు చెప్పినట్లుగా ‘ఏ ఆశ్రమంలో ఉన్నవారు ఆ ఆశ్రమ ధర్మాన్ని అనుసరించి అర్థించాలి'. దాత కూడా అడిగిన వారి తాహతును తెలుసుకుని ఇవ్వాలి. అంతేకాని 'ఏం కావాలి' అనే అతిశయం పనికిరాదు.🙏🙏
No comments:
Post a Comment