Monday, April 28, 2025

 చలాచల బోధ పార్ట్ 2.
మనము ఇంతవరకు మాయ యొక్క హద్దులో జరిగేవి,వాటి మూలాలను,అచటి నుండి అవరోహణా క్రమమును తెలుసుకున్నాము.వాటిలో భాగంగా చిత్ కు మూలం చిన్మాత్ర,జడములకు మూలం మూలప్రకృతి,చిజ్జడ గ్రంధిలో తోచిన "నేను"కు మూలం అవ్యక్త వ్యక్తిత్వముగా నున్న నిర్గుణ బ్రహ్మ అని మూడు మూలాలను గుర్తించాము.
ఈ మూడు మూలాలు మాయావరణలోనే ఉన్నాయి.కావున ఈ మూడింటిలో ఏ ఒక్కటి లేకపోయినా మనము మాయ యొక్క హద్దును దాటి పోగలము.
చిన్మాత్ర లేదనుకుందాము.ఇక జీవేశ్వర జగత్తులు తోచేదే ఉండదు.
చిన్మాత్ర స్వరూపమై యున్న నిర్గుణ బ్రహ్మ సంకల్ప బ్రహ్మ కాకుండా నిర్వికల్పంగా ఉండిపోతే జడ సృష్టి తోచదు.అనగా మూలప్రకృతి ఉండదు.ఈ జడ సృష్టి తోచుటకు మూలము బ్రహ్మ మాయాశబలితమగుటయే కారణము.
అసలు జడ సృష్టి లేకపోతే జీవులకు ఉపాధులు ఉండవు,వాసనలు ఉండవు,కారణ శరీరాలు ఉండవు,జన్మలే ఉండవు.
అలాగే జగత్తే లేకపోతే ఈశ్వరునికి కర్తృత్వము ఉండదు.అపుడు త్రిమూర్తులే ఉండరు.
అయినా ముక్తి ఎవరికి?కేవల జడము, లేక అనాత్మకు ఏ బాధలు అనుభవంలోకి రావు.అందువలన అనాత్మకు బంధము తెలియదు, ముక్తీ తెలియదు.
ఇక కేవలం ఆత్మ చిన్మాత్రగా ఉండిపోతే అది నిత్య ముక్త స్థితి.అందువలన ఇక ముక్తిని కోరేదేముంది?
సమస్య అంతా చిజ్జడ గ్రంధిలో తోచిన "నేను"కే కదా!ఈ నేను అనాత్మతో తాదాత్ణ్యత చెంది ఉండటము వలన బంధము, దుఃఖము కలిగాయి.అందువలన ఈ నేను కు బంధము నుండి విముక్తి మరియు దుఃఖ నివృత్తి వలన ఆనంద ప్రాప్తి కావలసి వచ్చెను.
ఇపుడు తేలింది ఏమిటంటే బంధ మోక్షాలు "నేను"కే!
అయితే ఈ "నేను"పోయేదెలాగు?
      సశేషం!

No comments:

Post a Comment