Monday, April 28, 2025

 చలాచల బోధ పార్ట్ 2.
"నేను"పోవాలంటే ముందుగా "నేను"కు మనసుతో ఉన్న తాదాత్మ్యత నుండి విడుదల కావాలి.స్థూల శరీరం "నేను"కాదు అని సాంఖ్య పద్ధతిలో విచారణ చేసి ఇంద్రియ భోగాలు పట్ల ఆసక్తిని విడచి పెట్టాలి.మనసును స్వాధీనం చేసుకుని జితేంద్రియుడు కావాలి.తరువాత సాక్షిగా ఉంటూ, భోక్తృత్వమును విడచి పెట్టాలి, అనగా ఆస్వాదించకూడదు.ఆ తరువాత కర్తృత్వమును కూడా విడచి పెట్టాలి.విషయాలను గ్రహించేటప్పుడు ద్వంద్వాలుగా చూచే దృష్టి ఉండకూడదు.అపుడు మనస్కరించకుండా పనులు జరుగుతూ ఉంటాయి.ఇదే అమనస్క స్థితి.
అమనస్కము అంటే మనసు పనిచేయని స్థితి.అవతార్ మెహెర్ బాబా వారు "మైండ్ నాట్ వర్కింగ్"స్థితి అని అంటారు.
మనసు పోయినా ఇంకా "నేను"ఉంటుంది.అంతఃకరణ శుద్ధి వలన ఈ "నేను"అధిష్ఠాన బ్రహ్మ (బింబ) ప్రకాశము యొక్క ప్రతిఫలించిన ప్రకాశముగా అహం స్ఫురణగా ఉంటుంది మరియు బింబ ప్రతి బింబ ప్రకాశములకు భేదము ఉండదు.ఇదే అహం బ్రహ్మ అనే జ్ఞానము.
కావున ఇక్కడి నుండి ముఖ్యంగా నాలుగు మహా వాక్యాలు బోధింప బడాలి.అవేమనగా .....
1. ప్రజ్ఞానం బ్రహ్మ.
2. అహం బ్రహ్మాస్మి.
3. తత్త్వమసి.
4. అయమాత్మా బ్రహ్మ.
      ఈ మహా వాక్యాలను తరువాత వివరంగా చెప్పుకుందాము.
ఏకమే వా 2ద్వితీయ బ్రహ్మ అనే మహావాక్యమును అనుసరించి బ్రహ్మము రెండవది లేని ఒక్కటై యున్నదని వేద ప్రమాణము.
కావున బ్రహ్మము ఉండాలి, రెండవది అయియున్న "అహం"పోవాలి.దీనికి తత్త్వమసి అనే మహావాక్యమును గురూపదేశముగా గ్రహించాలి.
అపుడు గుర్వనుగ్రహము వలన అహం పోతుంది మరియు అద్వైతము సిద్ధిస్తుంది.ఇచటితో మాయ హద్దుకి లోబడి చేసే ఉపాసనలు గాని,అనుష్ఠానములు గాని సంపూర్ణ మవుతాయి.సాధకునికి బ్రహ్మ అపరోక్షానుభూతిగా ప్రాప్తిస్తుంది.ఇటువంటి సమాప్తమును అయమాత్మా బ్రహ్మ అని అంటారు.కావున ఈ మహా వాక్యమును సమాప్త వాక్యము అని అంటారు.
అయితే ఈ సాయుజ్యముక్తి వలన జన్మ రాహిత్యము కాదు.పరమపదమే జన్మ రాహిత్యము.దీనికొరకు అచల బోధ తప్పని సరి.అపుడు అహం కు మూలమైన అవ్యక్త వ్యక్తిత్వ నిర్గుణ బ్రహ్మ ఏమీ లేదు.ఎందుకనగా ఇది మాయ యొక్క హద్దులోనే ఉన్నది.కావున ఈ మూలమును విచారించి అది లేకపోతే ఇంకేమి ఉంది? అని చూస్తే అంతా ఉళక్కి అని తేలుతుంది.ఈ ఉళక్కికి ఉత్త బట్ట బయలు అని పేరు.కాని బట్టబయలు ఉన్నదా? అంటే అది కూడా ఏమీ లేదు.అది శూన్యము కూడా కాదు.దీనిని అచల బోధలో వివరంగా చెప్పుకుందాము.
   ఈ "నేను"సమూలముగా పోయి,రహితము కావాలంటే అహం బ్రహ్మ జ్ఞానమును నిరసించ వలసి యున్నది.ఇది రెండు విధాలు.ఒకటి అహమును సమూలంగా రహిత పరచుకోవడము.రెండవది బ్రహ్మను, మాయను ఒక్కటిగా చేసి,మాయ లేనిది గనుక బ్రహ్మ కూడా లేనిదే అని నిరూపణ చేయాలి.ఇది అచల బోధలో వివరింప బడుతుంది.
      సశేషం!

No comments:

Post a Comment