Tuesday, April 29, 2025



*_వినమరుగైన కావ్యం..._* 
*_"పానశాల"....._*
*[రచన: కవికోకిల దువ్వూరి రామిరెడ్డి]*
*------🌹💐🌹------*

_ఉత్పలమాల_
*_అంతములేని ఈ భువనమంత పురాతన పాంధశాల, వి_*
*_శ్రాంతి గృహంబు, నందు నిరుసంజలు రంగుల వాకిళుల్, ధరా_*
*_క్రాంతులు పాదుషాలు, బహరామ్ జమిషీడులు వేనవేలుగా_*
*_కొంత సుఖించి పోయిరెటకో పెరవారికి చోటొసంగుచున్_*
*-------🙏🌷💐🌹🙏------*

*తెలుగు సాహిత్యంతో పరిచయమున్న ప్రతి ఒక్కరికీ ఈ పద్యం తెలిసే వుంటుంది.  కవిత ఏదైనా సరే అందులో గొప్పతనం ఉంటే, ఆ కవిత ప్రజల నాల్కలపై సదా నిలిచి ఉంటుంది. అలాగే ఇప్పుడు చెప్పిన ఈ పద్యం పండిత పామరులకందరికీ సుపరిచితమైన పద్యం. హృద్యమైన ఈ పద్యంలో అస్థిరమైన మానవ జీవితం గురించి విశదీకరించడం జరిగింది. ఇందులోని ఉపమానం అనుపమానం. నడక మనోహరం. సారాంశం వేదాంతం.*
*భావం:- ఈ ప్రపంచం ఆది, అంతమూ తెలియని ఒక పురాతన పాంథశాల, అంటే.... సత్రం. పూర్వ సంధ్య, అపరసంధ్య అనేవి రెండు వాకిళ్లు. వేలకొలది రాజులూ, చక్రవర్తులూ ఈ సత్రంలో కొంతకాలం సుఖాలను పొంది, ఆపై ఇతరులకు ఆ అవకాశం ఇస్తూ తాము ఎక్కడికో వెళ్లిపోయారు.... అని ఇందులో భావం. ఈ భూమిమీద శాశ్వతంగా ఉండేవాళ్లు ఎవరూ లేరు. అందువలన వున్న కొద్దికాలం వివాదాలు లేకుండా స్నేహంగా జీవించాలి అన్నది... ఈ పద్యం మనకిచ్చే గొప్ప హితోపదేశం.*

*
*జీవిత సత్యాన్ని ఇంత చక్కగా తెలియజేసే ఈ పద్యాన్ని రచించిన కవిని గురించి, ఈ పద్యం ఉండే కావ్యాన్ని గురించి తప్పక తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది.*

*
*ఈ పద్యాన్ని రచించినది "కవికోకిల దువ్వూరి రామిరెడ్డిగారు." ఈ పద్యం ఉన్న కావ్యం పేరు "పానశాల."*

*
*మనం 21వ శతాబ్దంలోకి ప్రవేశించి... అప్పుడే రెండు దశాబ్దాలు గడిచి పోయాయి. 20వ శతాబ్దంలోని మహాకవులను గురించి, వారి కావ్యాలను గురించి ఒక్కమారు సింహావలోకనం చేసుకొనవలసిన అవసరం ఎంతైనా ఉంది.*
*ఎందరో మహాకవులు... అందరికీ వందనాలు. " పురుషులందు పుణ్యపురుషులు వేరయా".... అని మహాకవి వేమన అన్నట్లుగా.... ---"కవులలో కూడా మహాకవులు వేరయా"---   అని చెప్పుకోవలసిన అవసరం ఉంది.*

*
*అటువంటి మహాకవుల కోవకు చెందినవారే 'కవికోకిల- దువ్వూరి రామిరెడ్డిగారు.*

*
*'నెల్లూరు జిల్లా గూడూరులో.. 09-11-1895 న జన్మించిన వీరిని పండితులంతా "సింహపురి సిరి"గా కొనియాడుతారు.*

*
*హేతువాద భావాలుగల వీరు మానవ ప్రయత్నంతో దేన్నైనా సాధించవచ్చనే గట్టి నమ్మకం ఉన్నవారు. ఆ నమ్మకంతోనే కృషీవలుడుగా ఉండిన దువ్వూరి రామిరెడ్డిగారు సాహితీ కృషీవలుడుగా కూడా మారారు. 23సం.ల వయసు వచ్చేసరికి రసికజనానందము, స్వప్నాశ్లేషము, అహల్యానురాగాలు, కృష్ణ రాయబారము అనే ప్రబంధాలు, నలజారమ్మ అనే కావ్యము, కర్షక విలాసం అనే నాటకం, మాతృశతకం అనే పుస్తకం వ్రాయగలిగారు.*

*
*స్వయంకృషితోనే అనేక భాషలలో పాండిత్యం సంపాదించారు. వీరి కవిత్వం పాత క్రొత్తలకు మేలుకలయికగా అందాలు అలవరచుకుంది.*

*
*శ్రమజీవియైన కర్షకుని జీవితం కూడా కవితా వస్తువేనని వీరు "కృషీవలుడు" అనే పద్యకావ్యము 1924లో రచించి  నిరూపించారు.*

*
*సి.ఆర్.రెడ్డిగారి అధ్యక్షతన జరిగిన ఒక సభలో 1917లో, అనగా వీరి 22వ ఏట, వీరికి స్వర్ణపతకం బహూకరించబడింది.*

*
*1918లో వీరు వ్రాసిన 'వనకుమారి' కావ్యం విజయనగర మహారాజు ఆస్థానంలో కావ్యస్పర్థలో... అంటే కావ్యాల పోటీలలో ప్రథమస్థానాన్ని పొందింది.*

*
*వీరు ఇంకా..... జలదాంగన, యువకస్వప్నము, కడపటి వీడికోలు, సీతావనవాసం, కుంభరాణా, మాధవ విజయం.... అనే నాటకాలు కూడా రచించారు.*

*
*రామిరెడ్డిగారు 1926లో 'పానశాల' అనే అనువాద గ్రంథాన్ని ప్రారంభించారు. ఈ పానశాల కావ్యం 1928లో సాహిత్య మాసపత్రిక "భారతి"లో ప్రచురింపబడింది.*

*
*1929లో విజయవాడలోని ఆంధ్రమహాసభ వారు వీరికి "కవికోకిల" బిరుదును ప్రదానం చేశారు.*

*
*ఉమర్‌ఖయ్యాం అనే మహాకవి పారశీక భాషలో రచించిన "ఉమర్ ఖయ్యామ్ రుబాయతులే"   ఈ 'పానశాల' కావ్యానికి మూలం.*

*
*గడచిపోయిన కాలం తిరిగిరాదు. రాబోయే కాలం అనేది అసలు ఉందో లేదో సందేహం.* *ఇప్పుడుండే ఈ వర్తమాన కాలంలోనే సుఖాలను అనుభవించాలి అని చెప్పే ఆ మతంలో విషాదానికి తావులేదు.* *********************     
*వీరు 11-09-1947న పరమపదించారు.*
*
*ఈ "పానశాల" గ్రంథాన్ని నేను ముప్పైయ్యేళ్ళ క్రితం కొని చదివాను.  చదవాలి అనిపించినప్పుడల్లా మరలామరలా... అనేక పర్యాయాలు చదివాను. కొంతకాలం విరామం తరువాత మరలా ఇప్పుడు చదువుతూంటే.... ఈ పద్యం దగ్గరకొచ్చేటప్పటికి....(దీనిగురించి మీకందరికీ ముందే తెలుసో లేదో తెలియదు. అయినా సరే  గానీ...)   మీతో కొన్ని విషయాలు చెప్పాలనిపించింది. అందుకే ఓపిక తెచ్చుకుని నా భావాలను ఇలా (టైపింగ్ చేస్తూ) వ్యక్తపరచాను.  ఇంకో విషయం ఏమిటంటే... దీనిని "అమర్ ఖయ్యామ్" అనే పేరుతో డాక్టర్ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు పద్య కావ్యంగా చాలా అద్భుతంగా రాశారు. దానిని గ్రంథాలయంలో చూశాను. కొనాలంటే నెల్లూరులో దొరకలేదు. అందుకని లైబ్రరీలో కూర్చొని నాలుగు రోజులపాటు నోట్బుక్ లో ఎత్తి రాసుకున్నాను. దానిని అనేకసార్లు చదివాను. టీచరుగా పనిచేస్తున్నప్పుడు పాఠ్యాంశాల బోధనలో సందర్భోచితంగా మధ్యమధ్యలో విద్యార్థులకు ఈ రెండు కావ్యాలలోని సంఘటనలను పద్యాలో సహా ఉదాహరించి, భావాన్ని విడమరచి చెప్పేవాడిని. ఇంకా బయట నేను ఇచ్చే అనేక ప్రసంగాలలో నూ వీటిని ఉదాహరిస్తూంటాను. మీరు ఇంత ఓపికగా, ఆసక్తిగా చివరిదాకా చదివారంటే.... ఇది మీకెంతగానో నచ్చిందనుకుంటాను. చాలా చాలా సంతోషం. వీలైతే..... కాదుకాదు... వీలుచేసుకొని మరీ ఈ కావ్యాలను కొంటారో, సేకరిస్తారో మీ ఇష్టం. కానీ, తప్పకుండా చదవమని నా అభ్యర్థన. ధన్యవాదాలతో !*
🙏 🙏 🙏 🙏 🙏
*_( నా అనుభూతిని మీతో పంచుకోవడం నాకు దక్కిన మహద్భాగ్యంగా భావిస్తూ🙏: -వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘికశాస్త్ర ఉపాధ్యాయులు, ఆత్మకూరు పట్టణం, నెల్లూరు జిల్లా.)_*

No comments:

Post a Comment