ఈ కథ నేను 2017 లో రాసిన మొట్టమొదటి మనసుకథ 💕 నా ప్రధమ పుత్రిక ఈ నా కథ
🌿💜 మనసు కథలు 💜🌿
🌺 🌿 శ్రావణి 🌿🌺
కష్టపడి పని చేసుకోవటం,
ఆకలి వేళకి ఇంత తిండి తినటం,
పొద్దు పోనప్పుడు పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకోవటం, సుక్కేసుకోవటం..
ఇలానే ఇరవై యేళ్ళు గడిచాయి, సుబ్బడికి.
పెళ్ళి వయసొచ్చిందని , రుక్మిణికిచ్చి
పెళ్ళి చేసింది తల్లి.
దినచర్యలో పెద్ద మార్పులేమీ లేవు,
కాకపోతే కొత్తగా పెళ్ళాం అనే ఒక బంధం వచ్చి చేరిందంతే.
సంవత్సరం తిరిగేటప్పటికి
చిట్టి మూతి, పెద్ద కళ్ళు,
నవ్వితే వెన్నెల జల్లు కురిపించే పాప పుట్టింది.
చిత్ర అని పేరు పెట్టుకున్నారు.
చిత్రకు ఆరేళ్ళు ఉన్నప్పుడు
రుక్మిణి అనుకోకుండా కన్నుమూసింది.
ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా
చుక్కమ్మను , మళ్ళీ పెళ్ళి చేసేసుకున్నాడు
సుబ్బడు, తల్లి చెప్పిందని.
చిత్రకు చిత్రవిచిత్రాల నరకం చూపించింది చుక్కమ్మ.
అమ్మా, గట్టిగా ఆర్తనాదం విని
ఉలిక్కిపడి లేచింది శ్రావణి ఒక మద్యాహ్నం, ఆలోచనలతో అనుకోకుండా పట్టిన కునుకు నుండి. కొత్తగా ఆ ఇల్లు కొనుక్కున్నారు శ్రావణి, సమీర్.
ఆ రోజు పొద్దున్నే వచ్చారు ఈ ఇంట్లోకి.
ఎక్కడనుంచి వినపడింది అని బాల్కనీ వైపు వచ్చింది శ్రావణి.
పక్కనే పూరిగుడిసెలో చిత్ర వెక్కిళ్ళు పెడుతోంది, అంత పెద్ద కళ్ళూ, భయంతో ఇంకా పెద్దవయ్యాయి చిత్రకి, వద్దమ్మా అంటూ చేతులు తిప్పుతోంది. చుక్కమ్మ పొయ్యిలోంచి మండుతున్న కట్టె తెచ్చి చూపిస్తూ చిత్రను భయపెడుతోంది. ఏం చేస్తున్నావు నువ్వు, ఆగు అంటు శ్రావణి గద్దించింది చుక్కమ్మని.
చుక్కమ్మ, చిత్ర ఒకేసారి పైకి చూసారు. చుక్కమ్మ ఏదీ జరగనట్లు కట్టెను పక్కన పడేసి తన పని తాను చూసుకోవటానికి లోపలికి వెళ్ళింది.
చిత్ర తనను కాపాడేందుకు దేవత ప్రత్యక్షమయ్యిందా అన్నట్టు శ్రావణినే చూస్తోంది. అమాయకమైన మొహం, కళ్ళ నీళ్ళు జారుతున్నా తుడుచుకోవటం మరిచి పైకే చూస్తున్న చిత్రకి, ఏమీ పర్లేదు, భయపడకు, అన్నట్టు చెయ్యి ఊపి లోపలికి వెళ్ళింది శ్రావణి.
శ్రావణి గతంలోకి ప్రయాణించింది...
శ్రావణి ఆ రోజు, తాను పెళ్ళి చేసుకుని ఇంటికి వచ్చీ రాగానే అమ్మా అంటూ చుట్టుకున్న వేదవతిని ఏయ్ ఏంటి నువ్వు ఇలా మీద పడతావు అని విదిలించుకుంది. సమీర్ మృదువుగా వేదవతిని దగ్గరకు తీసుకుని తన మెడ చుట్టూ చేతులు వేసి నిశ్శబ్దంగా ఏడుస్తున్న పాపను వీపు నిమురుతూ ఓదారుస్తున్నాడు. అమ్మ వస్తుందన్నావుగా మరి ఈవిడ ఎవరు అని అడిగింది పాప. ఊ ఊ అమ్మ వస్తుంది ఊరుకో, ఆమ్ తిన్నావా, బజ్జుంటావా, అడిగాడు పాపని. నాకు అమ్మ కావాలి, మొండి చేస్తున్నట్టు అడిగింది వేదవతి , మనసుకి ఓదార్పుకై ఎదురుచూస్తున్న చిట్టితల్లికి ఆశాభంగమయ్యింది మరి.
అలాగేనమ్మా, అమ్మ వస్తుందిరా, ఇలా ఏడవకూడదు, ఇన్ని రోజులూ ఓపిక పట్టావు, ఇంకొంచెం ఓపిక పట్టు, ప్లీజ్ అని పాపను సముదాయించి నిద్రపుచ్చాడు.
తన రూంలోకి వెళ్ళాడు.
శ్రావణి, అయ్యిందా మీ పాప సేవ అని
ఎగతాళిగా అడిగింది.
సమీర్ శ్రావణిని చూసి ఊ అని తల ఊపాడు.
పాపకి చెప్పండి నా వల్ల కాదు ఇష్టం వచ్చినట్టు చేస్తే భరించటానికి అని, శ్రావణి స్పష్టం చేసింది.
సరే అన్నాడు శాంతంగా సమీర్.
పెళ్ళికొడుకు చివరినిముషంలో తాను ఇష్టపడ్డ అమ్మాయితో పారిపోవటం, ఉన్నవన్నీ అమ్మి పెళ్ళిపనులకి, పెళ్ళికీ అన్నీ సిద్ధం చేసిన తండ్రి ఏమీ తోచక దిగులుపడటం, అది చూసి తల్లి బాధపడటం, తాను ఎలా తీసుకోవాలో తెలీక అయోమయానికి గురవ్వటం, సమయానికి సరస్వతమ్మగారు తన కొడుకు సమీర్ ని పెళ్ళికి సిద్ధం చేయటం అన్నీ అరగంట తేడాలో చకచకా జరిగిపోవటం శ్రావణికి ఏదో తెలీని చిరాకుని తెప్పిస్తున్నాయి. మెడలో దండ తీసి ఒక్కో పువ్వుని పీకి పారేస్తూ ఎవరి మీదో తెలీని కోపాన్ని దండ మీద చూపిస్తోంది.
శ్రావణీ లేచి తయారు అవ్వు... అన్నం తిని విశ్రాంతి తీసుకో, అని సమీర్ చెప్పాడు అచ్చు పాపను సముదాయించినట్లే.
ఏ నీ పాపకి ఆయా ఉద్యోగం చెయ్యాలా నేను,
ఇంకా తిక్కగా అడిగింది శ్రావణి.
ఊహు, పాపని నేను చూసుకుంటాను, నాకు అలవాటేగా. నువ్వు ముందు అలసట తీర్చుకోమని నా ఉద్దేశ్యం, చెప్పాడు సమీర్.
చిన్నతనం అనాలో, మధ్యతరగతి జీవితం ఆటుపోట్లకు విసుగెత్తింది అనాలో, స్వతహాగా కఠినమనస్కురాలో శ్రావణి తన భర్త మొదటిభార్య కూతురిని ఏ నాడూ దగ్గరకు తియ్యలేదు. కొట్టలేదు కానీ నోరు ఎక్కువగానే వాడేది శ్రావణి, సమీర్ మీద, వేదవతి మీద, సరస్వతమ్మ మీద.
అపురూపంగా వేదవతిని చూసుకుని పెళ్ళి చేసి పంపించాడు సమీర్. అల్లుడికి ధనదాహం ఎక్కువే. ఏదో ఒక కారణంతో వేదవతిని కొడుతూ ఉండేవాడు. అనుకోకుండా వేదవతిని కోపంతో తోసాడు అల్లుడు, మెట్ల మీద నుంచి పడి వెన్నుకి, తలకి బాగా గాయాలు అయ్యాయి వేదవతికి. అమ్మా అమ్మా అని నొప్పితో విలవిల్లాడే కూతుర్ని చూసి శ్రావణికి తన మనసులో ఏదో నల్లమబ్బు కరిగిపోయిన భావన. మాతృత్వభావన శ్రావణిని కదిలించింది, వేదవతిని కంటికి రెప్పలా చూసుకుంది, అన్ని సేవలూ చేసింది. అమ్మా అని కలవరిస్తూనే శ్రావణి చెయ్యిని వదలకుండానే కన్ను మూసింది వేదవతి,
అంత ప్రేమగా అన్నేళ్ళూ పెంచిన సమీర్ కంటే కూడా శ్రావణి తల్లిప్రేమే, కావాలని తపన పడింది వేదవతి.
కన్నూమిన్నూ ఏకమయ్యేలా ఏడ్చింది శ్రావణి, వేదవతిని తలుచుకుని. సమయం మించిపొయ్యాక ఎంత ప్రేమ ఇవ్వాలని తనకున్నా,
వేదవతి ఇంక తిరిగి రాలేదిప్పుడు.
అనుకోకుండా ఇప్పుడు ఈ ఇల్లు
కొనుక్కుని రావాల్సి వచ్చింది శ్రావణి, సమీర్ లకి.
ఇక్కడికొచ్చాక చిత్ర గురించి తెలిసి.. వేదవతికి పంచి ఇవ్వాలనుకుని పంచలేని ప్రేమ ఇన్నాళ్ళూ మనసులో వరదలై పారుతుంటే, ఆ ప్రేమ పంచడానికే ఇక్కడకి రాబడ్డానేమో అనే బలమైన భావన మనసుకి రాగానే,శ్రావణి.. సవతితల్లి చెర నుంచి చిత్రను తప్పించి, ఒకనాటి సవతితల్లిగా తాను వేదవతికి పంచివ్వలేని ప్రేమని ఈ నాడు తనకు నలభై యేళ్ళు వచ్చినా, ఆలస్యంగా కన్న తొలిచూలు బిడ్డలా చిత్రను అక్కున చేర్చుకున్నారు, శ్రావణీసమీర్ లు. ఏ ప్రేమ ఎవరికి రాసి పెట్టుందో,
ఏ బంధం ఎవరితో ఎందుకు ముడి పడుతుందో..
తులసీభాను.
No comments:
Post a Comment