తెల్లవారని రాత్రి.
రచన: ద్విభాష్యం రాజేశ్వరరావు.
(ఈ కథకు వయస్సు 60 ఏళ్లు. 1965 ఆంధ్రప్రభ వార పత్రికలో ప్రచురింపబడింది)
రాత్రి అంతా దట్టంగా కురిసిన వాన వెలిసింది. పల్చగా నేలపై పరుచుకుంటున్న నీరెండలో కడిగి ఆరబెట్టిన ముత్యంలా ప్రకృతి మెరిసిపోతోంది! ప్రహారీ ఆవరణలో వార్ధక్యాన్ని సూచిస్తూ నింగిలోకి తొంగిచూస్తున్న పున్నాగ చెట్టు ఆకుల నుండి నీటి బొట్లు నేల మీద రాలి వింతగా శబ్దం చేస్తున్నాయి. రాత్రి వానలో తడిసిన గడ్డి పోచలు చలిగాలి తాకిడికి వణికిపోతున్నట్లు తల లూపుతున్నాయి!
వీధి వరండాలో వాలు కుర్చీలో మేను వాల్చిన పరంధామయ్య గారు ఒకసారి కళ్ళజోడు సవరించుకొని వీధి గేటు వంక దృష్టి సారించారు. ఎనిమిదేళ్ల పిల్ల ఒక చేతిలో పుస్తకాలు పుచ్చుకొని, మరో చేతితో పరికిణి కుచ్చిళ్ళు తడిసిపోకుండా పట్టుకుని; స్కూలుకు బయలుదేరింది కాబోలు, ఆయన వంక ముద్దు ముద్దుగా చూసి చిన్నగా నవ్వి, తన దారిన తాను వెళ్ళిపోయింది .
గేటు వంక రెండు నిమిషాల సేపు తదేక ధ్యానంతో చూశారు పరంధామయ్య గారు.
ఎక్కడా రంగమ్మ గారు వస్తున్న జాడలేదు!
నిరాశ ఆవరించిన మనసును పొదిలివి పట్టుకుని, చూపులను వీధి గేటు నుండి ఆకాశం వైపుకు మరల్చారు.
వాన వెలిసిన ఆకాశంలో చెదురు మదురుగా నల్లని మబ్బులు అలుముకుని ఉన్నాయి. గాలి తాకిడికి తట్టుకోలేక పింజల్లా విడిపోయి, నీలాకాశం పై పరుచుకుంటున్నాయి. ఊరికి కాపలాకాస్తున్నట్టున్న కొండలు, మబ్బులతో ఆడుకుంటున్నాయి! సుందరమైన ఆ ప్రకృతిని పరికిస్తూ, కొద్ది క్షణాలు తన్మయుత్వంలో మునిగిపోయారాయన!
గదిలోని గడియారం ఎనిమిది గంటలు కొట్టింది .
ప్రతి రోజూ పొద్దుట ఏడు గంటలకే వచ్చే రంగమ్మ గారు ఈ దినం ఎనిమిది గంటలైనా రాలేదు.
'పాపం! ఆవిడ కూతురు మూడు రోజుల నుండి జ్వరంతో బాధపడుతోందట.. నిన్న మరీ హెచ్చయిందట!... ఎలా ఉందో?! ఏదో పెద్ద అవాంతరం వస్తే కానీ సాధారణంగా ఆవిడ రావటం మానదు! మరి ఈ దినం వస్తుందో.. రాదో?!' అనుకుంటూ
నీరసంగా మరోసారి గేటు వంక చూశారు పరంధామయ్య గారు.
రంగమ్మ గారు వస్తున్న జాడలేదు!
ఆలోచనలను చేతి మీద భగవద్గీత మీదకు మళ్లించి దానిమీద మనసు నిలిపే ప్రయత్నం చేశారాయన .
"ఏవండీ! రంగమ్మ గారు వచ్చారా?" హీనస్వరంతో లోపల నుండి భార్య ప్రశ్నించింది .
"ఇంకా రాలేదు! వచ్చేవేళ అయింది!" భార్యను సముదాయించే ధోరణిలో అన్నారు.
లోపల నుండి దీర్ఘంగా నిట్టూర్పు వినబడింది!
అనాదిగా వస్తున్న హిందూ సంప్రదాయాలను తూ చా తప్పకుండా అనుసరించి, అరవై ఏళ్ల జీవితాన్ని మరో ధ్యాస లేకుండా భర్త సుఖం కోసమే త్యాగం చేసి, ఇక ఏమీ ఇవ్వలేని స్థితిలో జీవచ్ఛవంగా మిగిలిపోయి, అసహాయ స్థితిలో చిక్కుకున్న భార్య వదిలిన నిట్టూర్పు అది!!
చేతి కర్ర ఆసరా చేసుకుని కుర్చీలో నుంచి లేచి గదిలోకి వెళ్లారు. గదిలోని నిలువుటద్దంలో తన ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి దినం అలవాటైన దృశ్యమే అది!!
కాలచక్రం నలుపు చేసిన కనురెప్పలు, పండిపోయిన జీవితాన్ని పదేపదే గుర్తు చేస్తున్న తెల్ల వెంట్రుకలు, యవ్వనంలోని అనుభవాలను పదిల పరుస్తున్న నుదుటి మీది సన్నని మడతలు, మిగిలిపోయిన ప్రాభవానికిఅనుక్షణం కాపలాకాస్తున్న గాజు
కాయల్లాంటి కనుపాపలు... తనని మనిషిగా సూచిస్తున్నాయి!!
తన రూపాన్ని తదేకంగా చూసుకుంటూ ఉంటే, జీవం లేని పొడినవ్వు పెదవులపై క్షణం సేపు తిరుగాడి ,ఎక్కడికో ఎగిరిపోయింది !
టేబుల్ మీద ముక్కుపొడుం డబ్బి మూత తెరిచి, ఒక పట్టు తీసుకొని హాల్లోనికి వచ్చారు పరంధామయ్య గారు. రంగమ్మ గారి రాక కోసం కిటికీలోంచి గేటు వైపు పరికించి చూశారు.
ఆవిడ వస్తున్న జాడ కనిపించలేదు!
హాలుకు ఆనుకుని ఉన్న అవతలి వైపు గదిలో భార్య పడుకుని ఉంది. తలవైపున ఉన్న టేబుల్ మీద బత్తాయి తొనలు అందుకునే ప్రయత్నం చేస్తోంది. పక్కనే నీళ్లతో ఉన్న గ్లాసు ఆమె చేతికి తగిలి కిందకు దొర్లి ముక్కలు అయిపోయింది..
భార్య స్థితి చూస్తూ ఉంటే ఆయనకు దుఃఖం ముంచుకొచ్చింది.
" అయ్యో!... గ్లాస్ బద్దలైపోయినట్టుంది!" అంది భార్య.
"పరవాలేదు!... ఈ తొన తీసుకో! నేను గాజు ముక్కలు తీసి అవతల పారేస్తాను..." అంటూ గాజు ముక్కలన్నీ ఏరి కిటికీలో నుండి అవతలకు పారేశారు.
"మీకు సేవ చేయవలసిన వయసులో మీ చేత చేయించు కుంటున్నాను!" అంది ఆమె హీన స్వరంతో. మూసుకొని ఉన్న ఆమె కనురెప్పల చాటు నుండి కన్నీరు ఉబికి, తలగడా మీదకు జారిపోతోంది. భార్య ముఖం వంక చూడటానికి బాధ కలిగి, వరండాలోకి వచ్చేశారు.
వరండా గోడకు ఉన్న పాత క్యాలెండర్లు వాటి రంగులు మార్చుకొని వెలవెల బోతున్నాయి. సోఫాలు దుమ్ము పట్టి చూడటానికి అసహ్యంగా ఉన్నాయి. పైన వేలాడుతున్న పాత ఫ్యాన్ తన వంక దీనంగా చూస్తున్నట్లు అనిపించింది. తాను అభిమానించిన వ్యక్తులందరూ తనను వదిలి వెళ్ళిపోయినా ఈ వస్తువులు మాత్రం ఇంటిని, తనని అంటిపెట్టుకొని ఉన్నాయి. భారంగా అడుగులు వేస్తూ వాలు కుర్చీ వద్దకు చేరుకుని ఆశీనులయ్యారు పరంధామయ్య గారు.
ఆశగా మరోసారి గేటు వంక చూశారు. రంగమ్మ గారు రాలేదు.
ఇక ఈ పూటకి ఆవిడ వస్తుందనే ఆశ కూడా క్షణక్షణానికి దూరమవుతోంది.
రంగమ్మ గారు వంట మనిషి! ఎనిమిది సంవత్సరాలుగా ప్రతి పూట ఈ ఇంట్లో ఆవిడే వంట చేస్తున్నారు. అభిమానులు అందరూ దూరమైన పరిస్థితిలో తనకు, తన భార్యకు సహాయంగా నిలబడ్డారు. చాలా నిజాయితీ అయిన మనిషి ఆవిడ.
పరంధామయ్య గారికి ఎనిమిది సంవత్సరాల క్రితం జీవితంలో మళ్ళీ కోలుకోలేని పెద్ద దెబ్బ తగిలింది.. అదే ఆయన భార్యకు కళ్ళు రెండూ పోవడం! ఆపరేషన్ చేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు జరిగిన ఆ సంఘటన ఆమె జీవిత గతినే మార్చివేసింది!! అప్పటినుండి జీవచ్ఛవంలా మంచాన్ని అట్టిపెట్టుకొని బ్రతుకుతోంది ఆమె!
భార్యకు కళ్ళు పోయినప్పటి నుండి రంగమ్మ గారే వంట చేస్తున్నారు. ఆవిడ ఏ పూట రాకపోయినా పస్తు పడుకోవాల్సిందే! అందుకే తెల్లవారినప్పటి నుండి రాత్రి నిద్రకు ఉపక్రమించే వరకు ధ్యాస అంతా ఆవిడ రాకపోకలపైనే!
రంగమ్మ గారి ఇల్లు ఆ వీధి చివరనే ఉంది. ఆమెకు వయసులోనే భర్త గతించాడు అప్పటినుండి కూతురు వద్దే కాలం గడుపుతున్నారు. ఉదయాన్నే ఏడు గంటలకు వచ్చి , తమకు పాలు వెచ్చబెట్టి ఇచ్చి, తరువాత వంట ముగించి, తనకు భార్యకు వడ్డించి; భోజనాలు ముగిసిన తర్వాత గిన్నెలు కడిగి యధా స్థానంలో ఉంచి వెళ్ళిపోతారు. ప్రతి ఉదయం సాయంత్రం ఇదే ఆవిడ చర్య!
చిన్న తుంపర్లు చెదురు మాదురుగా మళ్లీ ప్రారంభం అయ్యాయి. పున్నాగ చెట్టు మీద పాలపిట్ట తడి రెక్కలు విదుల్చుకొని ఎక్కడకో ఎగిరిపోయింది. వీధిలో నుంచి ఎవరో నడిచి వస్తున్న శబ్దం అయితే ఆత్రంగా దృష్టి అటువైపు సారించారు పరంధామయ్య గారు. ఎవరో విద్యార్థులు నవ్వుకుంటూ స్కూల్ కి వెళ్ళిపోతున్నారు. రంగమ్మ గారు వస్తున్న జాడ మాత్రం లేదు !
నీరసంగా ఓ నిట్టూర్పు వదలి పుస్తకంలో తల దూర్చడానికి ప్రయత్నించి సఫలీకృతులు కాలేకపోయారు. వర్తమానాన్ని గతంతో పోల్చి చూస్తే ఆయనకుఎక్కడా సామ్యం కనిపించడం లేదు. గాలి వెలుతురు సోకని గదిలో బంధించినట్లు అనిపిస్తోంది.
పదేపదే గడిచిన పాత జీవితం గుర్తుకు వస్తోంది.
రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంలో తాను తహసీల్దారి పదవి నిర్వహించాడు. తన కార్యదీక్షకు తెలివితేటలకు పై అధికారులు మెచ్చుకోవడం, తనపై ప్రత్యేక అభిమానంతో సంచరించటం తలచుకుంటే తనువు పులకరిస్తుంది !అందుకే తన శక్తి సామర్థ్యాలతో రిటైర్ అయ్యేనాటికి డిప్యూటీ కలెక్టర్ కాగలిగాడు. ఆనాటి ప్రాభవం గుర్తుకు వస్తూ ఉంటే కనులు చమర్చాయి. జీవితంలో అన్ని సుఖాలు ఇచ్చిన భగవంతుడు ఈ ఆఖరి దినాలలో మాత్రం శాంతి లేకుండా చేశాడు. ఒక్కగానొక కొడుకు డిగ్రీ పొంది ఉద్యోగంలో చేరిన ఇరవై దినాలలోనే కారు ప్రమాదంలో మరణించాడు. అది తనకు, భార్యకు తీరని లోటుగా మిగిలిపోయింది. చేతికి అంది వచ్చాడనుకొన్న కొడుకు, కాలంలో కలిసిపోయాడు!
రిటైర్ అయ్యాక విశాఖపట్నం శివార్లలో ఇల్లు కొనుక్కొని ఈ కొత్తరకం జీవితానికి అలవాటు పడ్డాడు. భార్య వంట పని పూర్తి చేసుకుని తన వద్ద కూర్చుని భగవద్గీత చదువుతూ ఉంటే, తను కన్నులు మూసుకొని తన్మయత్వంతో వినేవాడు. గీత పఠిస్తూ ఉంటే ఆమె కన్నులు, ముఖం ఎంతో తేజస్సుతో వెలిగిపోయేవి! కానీ విధి వక్రించి, కన్నులు పోయిన నాటి నుండి ఆమె మంచం దిగకుండా చీకటి జీవితాన్నే గడుపుతోంది.
ఇక ఆమె జీవితానికి వెలుగు లేదు !
ఆపరేషన్ జరిగినాటి నుండి ఆ ఇంట్లో రంగమ్మ గారే దీపం వెలిగిస్తున్నారు. ఆవిడ ఎంతో వినయ విధేయతతో సంచరించి తన పనులు తాను నిర్వర్తించుకొని వెళ్ళిపోతారు. రంగమ్మ గారు రాకపోతే ఆ దినం నిద్ర పట్టదు పరంధామయ్య గారికి. ఆవిడ చేతి వంటి తినకపోతే మెదడు పని చెయ్యదు! అందుకే వృద్ధాప్యంలో తనకు తన భార్యకు రంగమ్మ గారే సర్వస్వం అయ్యారు !!
"ఇంకా రంగమ్మ గారు రాలేనట్టుంది!..." ఓపిక లేని స్వరంతో భార్య నీరసంగా అడుగుతోంది. పరంధామయ్య గారు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు.
గదిలోని గడియారం తొమ్మిది గంటలు కొట్టింది.
రంగమ్మ గారు వచ్చే సమయం మించిపోయింది!
'బహుశా.. రారేమో! పాపం ఆవిడ కూతురికి ఎలా ఉందో?!'
క్షణాలు గడుస్తున్న కొద్ది పరంధామయ్య గారి పేగులో ఎక్కడో ఆకలి అనే కదలిక ఆరంభమైంది !శరీరం అంతా నీరసం ఆవరించింది .
చేతి కర్ర సాయంతో మెల్లగా లేచి తూలిపోతున్న శరీరాన్ని స్వాధీనంలోకి తెచ్చుకుంటూ, అలమార లోని డబ్బా తీసి గుప్పెడు అటుకులు పాల గిన్నెలో నానవేసి, వచ్చి మళ్లీ కుర్చీలో కూర్చున్నారు.
చినుకులు పూర్తిగా తగ్గిపోయాయి. లేత ఎండ మబ్బులను చీల్చుకొని బయటికి రావడానికి ప్రయత్నాలు చేస్తోంది. గాలి తాకిడికి పున్నాగ పువ్వులు నేల మీద రాలిపోతున్నాయి. వాటి
సువాసనలతో గాలి వింత పరిమళం పులుముకుంటోంది. పరంధామయ్య గారు నీరసంగా కళ్ళు మూసుకున్నారు. మనసులో ఏవో అర్థం కాని అస్పష్టమైన దృశ్యాలు కదిలి మాయమైపోతున్నాయి. ఎందుకో మనసు చెప్పలేని ఆందోళనకు లోనైంది. మెల్లగా కళ్ళు విప్పి చూసారు.
రోడ్డు మీద ఏదో కలకలం!
జన సమూహంలో ఏదో కదలిక! ప్రశాంత వాతావరణంలో ఏదో సంచలనం!! ఎవరో సన్నగా విలపిస్తున్న భావన!
కుర్చీలో నుండి లేచి వరండా చివరకు వెళ్లి రోడ్డు మీదకు దృష్టి సారించారు .
రోడ్డుమీద ఏదో శవాన్ని తీసుకెళ్తున్నారు. శవం కాళ్ల నుండి మెడ వరకు తెల్లని గుడ్డ కప్పబడి ఉంది. తలవైపు ఉంచిన అగరవత్తుల ధూమం వర్తులంగా లేచి గాలిలో కలిసిపోతోంది. వాహనం ముందు రంగమ్మ గారి కొడుకు కుండతో నిప్పు తీసుకుని నడుస్తున్నాడు. శవం వెనక కొందరు పెద్ద మనుషులు అనుసరిస్తున్నారు
రక రకాలుగా మాట్లాడుకుంటూ!
"పాపం రాయి లాంటి మనిషి! నిన్న రాత్రి కలెక్టర్ గారి ఇంట్లో వంట కూడా వండిందట!! అర్ధరాత్రి గుండెలో నొప్పి వచ్చిందట!! అంతే! తెల్లవారేసరికి అంతా అయిపోయింది! ఎంతసేపు కావాలి ప్రాణం పోవడానికి ?!"
అంతే! తర్వాత వారి సంభాషణ వినపడలేదు పరంధామయ్య గారికి!!
చేతి కర్ర పట్టు తప్పి నేల మీద పడిపోయింది .
గాజు కాయ లాంటి కనుపాపల వెనుక నుండి ఊబికి వస్తున్న రెండు కన్నీటి చుక్కలు రెప్పల వెనుకనే ఆగిపోయాయి!!
No comments:
Post a Comment