Monday, January 26, 2026

 1️⃣2️⃣0️⃣

*🛕🔔భగవద్గీత🔔🛕*
  _(సరళమైన తెలుగులో)_

     *4. జ్ఞాన యోగము.*
   (నాలుగవ అధ్యాయము)

*35. యజ్ఞాత్వా న పునర్మోహమేవం యాస్యసి పాణ్డవl*
 *యేన భూతాన్యశేషేణ ద్రక్ష్యస్యాత్మన్యథో మయిll*

అర్జునుడు ఒక విధమైన మోహంలో భ్రమలో ఉన్నాడు. వీళ్లంతా నా వాళ్లు వీళ్లందరినీ నేను ఎలా చంపాలి అనే మోహంలో ఉన్నాడు. కాబట్టి అర్జునుడు తెలుసుకోదగిన జ్ఞానం గురించి చెబుతున్నాడు పరమాత్మ. ఏది నీవు తెలుసుకుంటే, మరలా ఇటువంటి మోహంలో పడవో, ఏది తెలుసుకుంటే అన్ని ప్రాణులలో ఉన్న ఆత్మను నీలో నాలో చూడగలవో, అట్టి జ్ఞానమును మంచి గురువుకు శిశ్రూష చేసి తెలుసుకో అని ఉచిత సలహా ఇస్తున్నాడు.

పరమాత్మ ఇక్కడ జ్ఞానము వలన కలిగే లాభాలను వివరిస్తున్నాడు. మొదటిది జ్ఞానం కలిగి నందు వలన అప్పటి వరకు ఉన్న మోహం పోతుంది. సమస్త ప్రాణి కోటిని తనలో చూడగలడు. అంటే సమత్వభావన కలుగుతుంది. భేదభావన ఉండదు. నువ్వు నేను అనే భావన అంతరిస్తుంది. మనకు చూడటానికి కళ్లు ఉన్నాయి. ఎందుకు? చూచి నడవడానికి, గోతిలో పడకుండా ఉండటానికి. అలాగే జ్ఞానం ఉన్న దానికి లక్షణం మోహంలో పడకుండా ఉండటానికి. ఈ ప్రాపంచిక విషయములు, విషయ వాంఛలు అన్నీ అసత్యములు ఒక్క ఆత్మయే సత్యము. ఇదే ప్రాధమిక జ్ఞానము. ఇటువంటి జ్ఞానము కలవాడు ప్రాపంచిక వస్తువులను చూచి వాటి మోహంలో పడి ఇవన్నీ నావి, ఇవి లేకపోతే నేను బతకలేను, వీటిని నేను ఎలాగైనా పొందాలి, అని అనుకోవడం మోహం. మామిడి కాయ మొదట వగరుగా ఉంటుంది. తరువాత పులుపుగా ఉంటుంది. బాగాపండిన తరువాత తియ్యగా ఉంటుంది. మామిడి పండు పూర్తిగా పండిన తరువాత, పూర్వపు వగరు పులుపు మాయం అవుతాయి. అలాగే జ్ఞానం కలిగిన వానికి అజ్ఞానం, అవివేకం పోవాలి. ఈ ప్రపంచం అంతా మాయ అని తెలుసుకోవాలి. ప్రాపంచిక విషయములను వదిలిపెట్టి చిత్తమును పరమాత్మ వైపు మళ్లించాలి. ఇప్పటి వరకు అర్జునుడు వీరంతా నా వాళ్లు, వీరిని ఎలా చంపడం అని అనుకుంటూ తన కర్తవ్యమును మరిచిపోయాడు. వీరు వేరు, వీరి ఆత్మలు వేరు, వీరి శరీరాలు మాత్రమే చంపబడుతున్నాయి కాని వీరి ఆత్మలు కాదు అనే జ్ఞానాన్ని పొందమంటున్నాడు కృష్ణుడు.

ఈ కాలంలో కూడా చాలా మంది మేము జ్ఞానులము మీకంతా జ్ఞాన బోధ చేస్తాము అని అంటుంటారు. అటువంటి వారు కూడా ప్రాపంచిక విషయములలో మునిగి తేలుతుంటారు. అటువంటి వారి జ్ఞానము ఒకరికి చెప్పడానికే కానీ వారు ఆచరించడానికి కాదు. దానినే దాంబిక జ్ఞానము, మిడి మిడి జ్ఞానము అంటారు. వారు జ్ఞానులు కారు అజ్ఞానులు అని భగవంతుడు చెబుతున్నాడు. శుష్క వేదాంతములు వల్లించేవారు జ్ఞానులు ఎన్నటికీ కాలేరు. వారి వేదాంతము ఉపన్యాసములకే పరిమితము. కాబట్టి జ్ఞానులు అని పిలిపించుకొనే వాళ్లు ముందు తాము చెప్పే వేదాంతాన్ని అర్థం చేసుకొని, ఆచరించి తరువాత ఇతరులకు బోధించాలి. భగవద్గీత ఎక్కువగా ఆచరణకు ప్రాధాన్యం ఇచ్చింది. కేవలం శాస్త్రజ్ఞానమునకు కాదు. కాబట్టి జ్ఞానము కొరకు సాధన చేసి జ్ఞాని అయిన వాడు ముందు కామమును, క్రోధమును, లోభమును జయించాలి. ఆత్మ గురించిన జ్ఞానమును పొందాలి. ఒకరికి చెప్పేముందు తనకు తాను ఆత్మశోధన చేసుకోవాలి. తనలో ఇంకా ఏమైనా లోపాలు ఉంటే వాటిని వెంటనే నిర్మూలించాలి. అప్పుడే అతడు జ్ఞాని అవుతాడు.

జ్ఞాని అయ్యాడు అన్నదానికి లక్షణము ఏమిటంటే తనలో ఉన్న ఆత్మ ఇతరులలో ఉన్న ఆత్మ ఒకటే అని తెలుసుకోవడం, అందరూ సమానమే అని తెలుసుకోవడం సమత్వభావన కలిగి ఉండటం. నేను వేరు నీవు వేరు నాకంతా తెలుసు నీకేమి తెలియదు అని అనుకున్నంత వరకు ఎవరూ జ్ఞాని కాలేరు. అంతే కాకుండా ఈ సమస్త జగత్తును జ్ఞాని తనలో చూడగలడు. మనస్సును ఆత్మ యందు లీనం చేయగలడు. ఆత్మానందాన్ని పొందగలడు. అతడే జ్ఞాని. జ్ఞాని యొక్క తరువాతి లక్షణము భగవంతుని తనలో ఆపాదించుకోవడం తనలో దైవత్వమును ఆపాదించుకోగలగడం. నేనే భగవంతుడు భగవంతుడే నేను అనే తాదాత్మ్య స్థితికి రావడం. అంటే "నేను భగవంతుడిని అందరూ నన్నే పూజించండి" అని అహంకరించడం కాదు. తనలో ఆత్మ ఉంది. ఆత్మ వేరు శరీరం వేరు. నాలో ఉన్న అత్మ ఆ పరమాత్మ అంశయే అనే జ్ఞానము కలగాలి కానీ, అహంకారము కాదు. అంటే ద్వైత భావన వదిలిపెట్టి అద్వైత భావన పెంపొందించుకోవాలి. ఆ భావన గలిగిన వాడే గురువు.

ఈ శ్లోకంలో మోహము అనే పదం వాడారు. మోహము అంటే రెండు విషయముల గురించి సందిగ్ధత, ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో తెలియని తనము. 'అదీ కుదరదు, అమ్మో! ఇది కూడా కుదరదు మరి ఎలాగ?" అనే వ్యాకులత, దీనినే మోహము అంటారు. ఇది ప్రతి మానవుని జీవితంలో అనునిత్యము కలుగుతూ ఉంటుంది. ఆ కారణంగా మనం మన నిర్ణయాలను తొందరగా తీసుకోలేము. దాటవేస్తుంటాము. నాన బెడతాము, దానితో సమస్య జటిలం అవుతుంది. ఎందుకంటే కాలం మనకోసం ఆగదు కాబట్టి. కాబట్టి తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకోవడం మానవ కర్తవ్యం. చాలా మంది తప్పు నిర్ణయాలు తీసుకొని జీవితాలను కష్టాలపాలు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే సరైన నిర్ణయం తీసుకోడానికి అవసరమైన వివేకము, జ్ఞానము, అవగాహన లేకపోవడం వలన.

కాబట్టి ప్రతి మానవుడు ముందు వివేకము, జ్ఞానము, బుద్ధి, విచక్షణా శక్తిని పెంపొందించుకోవాలి. కొంత మందికి ఇవన్నీ ఉన్నా పొరపాట్లు చేస్తుంటారు. అదే అర్జునుడు చేస్తున్నాడు. మనం ఉన్నదాన్ని ఉన్నట్టు దాని స్వస్వరూపంతో చూడగలగాలి కానీ మోహంతో కాదు. అప్పుడు ఎటువంటి పొరపాటు నిర్ణయాలకు అవకాశం లేదు. శరీరం వేరు, ఆత్మ వేరు అని కాకుండా ఈ శరీరమే నేను అనే మోహంలో పడటం వలన అర్జునుడు నేను యుద్ధం చేయను, సన్యాసం తీసుకుంటాను అని పొరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఈ శ్లోకంలో మరొక విషయం కూడా చెప్పారు. నీలో, నాలో, అందరిలో ఉన్న ఆత్మ ఒకటే వేరు వేరు కాదు అని తెలుసుకుంటావు అని అన్నాడు. అంటే నీవే పరమాత్మ ఆ పరమాత్మే నీవు అనే విషయాన్ని బోధిస్తున్నాడు. దీనినే జీవేశ్వర ఐక్యము అని కూడా అంటారు.
(సశేషం)

*🌹యోగక్షేమం వాహామ్యహం 🌹*

(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
                           P278

No comments:

Post a Comment