*ఒకనాడు భోజుడి ఆస్థానానికి కవిశేఖరుడు అనే కవి వచ్చాడు.రాజు కవిజన పక్షపాతి అయినా, ద్వారపాలకులు కూడా అలా కావాలని లేదు గదా! రాజ దర్శనం చెయ్యటానికి వీల్లేదు పొమ్మని గెంటి వేశారు.*
*కొంతసేపు ఘర్షణ జరిగిన తర్వాత, రాజసభలోకి వెళుతున్న మరో పండితుడి సహాయంతో రాజాస్థానం లోకి చేరుకోగలిగాడు. అందుకే వస్తూనే నవ్వుతూ యిలా అన్నాడు.*
*_రాజన్! దౌవారికా దేవ ప్రాప్తవానస్మి వారణం_*
*_మదవారణం మిచ్చామి త్వత్తోహం జగతీ పతే_*
*దౌవారికాత్ ఏవ = రాజా! నీ ద్వారపాలకుడి చేత, ప్రాప్తవానస్మి వారణం = గెంటివేయబడి వున్నాను. వారణం(వారింప బడటం) అంటే గెంటివేత, ఏనుగు అనే రెండు అర్థాలున్నాయి. త్వత్తః అహం = నీవల్ల నేను మదవారణం =మదించిన ఏనుగు ను బహుమతిగా కోరుతున్నాను. జగత్పతీ! రెండర్థాలు వచ్చేలా చెప్పాడు.*
*ఈ చక్కని శ్లోకం విని రాజు అతనికి తన రాజ్యం లో తూర్పుభాగం యివ్వటానికి నిశ్చయించాడు. అది సూచించడానికి, సింహాసనం మీదే తూర్పుముఖంగా కూర్చున్నవాడు కాస్తా దక్షిణం వైపుకు తిరిగి కూర్చున్నాడు. కవి శేఖరుడికి రాజుగారి భావం అర్థం కాలేదు.*
*రాజును పొగుడుతూ యింకో చక్కని శ్లేషతో శ్లోకం చెప్పాడు.*
*_అపూర్వేయం ధనుర్విద్యా శిక్షితా కథమ్?_*
*_మార్గణౌఘః సమాయాతి గుణో యాతి దిగంతరం_*
*ఈ అపూర్వమైన ధనుర్విద్య నీ చేత ఎలా నేర్చుకో బడింది? అందరి విలుకాళ్ళకూ బాణం వేసేటప్పుడు అల్లెత్రాడు వాళ్ళ వైపు వస్తుంది, బాణాలు దూరంగా ఎక్కడో పడతాయి. నీకయితే మార్గణ-ఓఘం= (బాణాల సమూహం అని ఒక అర్థం), సంచార యాచకుల సమూహం అని యింకో అర్థం నీ దగ్గరకు వస్తున్నది. గుణం =(అల్లెత్రాడు అని ఒక అర్థం), నీ సుగుణాల గురించిన సమాచారం అని మరో అర్థం. దేశ దేశాంతరాలకు పాకుతున్నది.*
*ఈ అద్భుత శ్లేషను మెచ్చి రాజు తాన దక్షిణభాగం కూడా ఆయనకు యివ్వాలని నిర్ణయించుకున్నాడు. పడమరదిక్కుకు తిరిగి కూర్చున్నాడు. శ్లోకాలు విని రాజు దిక్కులు మార్చి ఎందుకు కూర్చుంటున్నాడో ఎవరికీ అర్థ కాలేదు. ఆయనకు తన కవిత్వం నచ్చలేదేమోనని కవి శేఖరుడు మరో మంచి శ్లోకం చెప్పాడు.*
.
*_సర్వజ్ఞః - ఇతి లోకోయం భవంతం భాషతే మృషా_*
*_పదమేకం న జానీషే, వక్తుం నాస్తీతి యాచకే!!_*
*రాజా! ఈ లోకం తమరిని సర్వజ్ఞుడు అని అసత్యం చెప్తున్నది.మీకు తెలియని మాట ఒకటున్నది 'లేదు' అని యాచకుడికి చెప్పటం. మరి మీరు సర్వజ్ఞు లెలా అవుతారు?*
*కవి చమత్కారానికి మెచ్చుకొని రాజు ఆయనకు తనరాజ్య పడమర భాగాన్ని కూడా యిచ్చేయాలని అని యాచకుడికి చెప్పటం. మరి మీరు సర్వజ్ఞు లెలా అవుతారు?*
*కవి శేఖరుడు యింకో శ్లోకం చెప్పాడు.*
*_సర్వదా సర్వ దోసీతి మిథ్యా త్వం కథ్యసే బుధై:_*
*_నారయో లేఖిరే పృష్టం న వక్షః పర యోషితః_*
*సర్వదా, సర్వమూ దానం చేస్తావని పండితుల చేత నీవు అసత్యంగా వర్ణించబడుతుంటావు. నీ శత్రువులకు నీ వీపు లభించదు, (యుద్ధం లో వెన్ను తిప్పవు కాబట్టి) నీ వక్షస్థలం, పర స్త్రీలకూ లభించదు. (వాళ్ళని నీవు దగ్గరకు చేర్చుకోవు కాబట్టి)*
*ఇది విన్న తర్వాత రాజు తన రాజ్యం అంతా కవికి ధారబోసినట్లు భావించి సింహాసనం వదిలి లేచాడు. కవికి రాజు భావం అర్థం కాలేదు. ఆయన్ని మెప్పించేందుకు మరొక ప్రయత్నంగా యింకో శ్లోకం చెప్పాడు.*
*_రాజన్ ! కనక దారాభి: త్వయి సర్వత్ర వర్షతి!_*
*_అభాగ్య ఛత్ర సంఛన్నే మయి నాయాంతి బిందవః!_*
*రాజా! నువ్వు సర్వత్రా కనకధారలతో వర్షిస్తుండగా, అభాగ్యమనే గొడుగు కప్పుకున్న నా మీద కొన్నిచుక్కలు కూడా పడడం లేదు..*
*రాజు సభ వదిలి అంతః పురానికి వెళ్లి, భార్య లీలావతితో చెప్పాడు. రాజ్యం అంతా దానం చేసేశాను. పద మనం అడవులకు పోదాం అన్నాడు.*
*అదే సమయంలో ప్రధానమంత్రి బుద్ధిసాగరుడు రాజసభ నుంచి వెళ్ళిపోతున్న కవి శేఖరుడిని ఆపి రాజుగారు నీకేమి దానం చేశాడు?అని అడిగాడు. బుద్ధిగల, రాజు గారి మనసు తెలిసిన మంత్రి కనుక ఆయనకు రాజు గారి భావం అర్థమైంది.*
*ఏమీ యివ్వలేదు అన్నాడు కవి నిరుత్సాహంగా. అయితే ఒక పని చెయ్యి నీకు కోటి బంగారు నాణాలు యిస్తాను రాజు ఏమిచ్చినా నువ్వు ఈ కోటి నాణాలకు అమ్మేయ్యాలి. అని అతనికి ఒక కోటి బంగారు నాణాలు యిచ్చి పంపేసి రాజు దగ్గరికి వెళ్ళాడు మంత్రి.*
*అప్పుడు రాజు మృతితో.. "బుద్ధి సాగరా!నేను రాజ్యమంతా కవి శేఖరుడికి ఇచ్చేశాను. సకుటుంబంగా అడవులకు పోతున్నాను. రాదలుచుకుంటే నువ్వూ వచ్చేయవచ్చు అన్నాడు రాజు.*
*అప్పుడు మంత్రి.. "రాజా! అక్కర్లేదు. మీరు కవి శేఖరుడికి యిచ్చిన రాజ్యం అంతా తిరిగి అతని దగ్గరనుంచి నీ ధనంతోనే కొనేశాను. ఈ రాజ్యం యింక నీదే హాయిగా పాలించుకో" అన్నాడు. రాజు మళ్ళీ గద్దె నెక్కాడు.. అలా కోటి బంగారు నాణాలు కవి శేఖరుడికి దక్కాయి. రాజ్యం భోజరాజుకే దక్కింది.* *బుద్ధిమంతుడు, తెలివైన మంత్రి ఉంటే రాజుకేమి తక్కువ? అతనిపేరే బుద్ధిసాగరుడు. పేరుకు తగిన మంత్రి.*
_--Suguna Rupanagudi_
-----------------------
*_{సేకరణ: --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయుడు🙏}_*
No comments:
Post a Comment