Friday, May 30, 2025

 


🙏🏻ఓం నమో భగవతే శ్రీ రమణాయ🙏🏻

భక్తురాలు :
భగవాన్! శరణాగతి చాలా కష్టంగా ఉన్నది కదా!

మహర్షి :
నిజమే. ఆరంభంలో పూర్ణ శరణాగతి కష్టమే. కొంతలో కొంత అందరికీ సాధ్యమే. కాలక్రమేణ అదే పూర్ణశరణాగతికి దారితీస్తుంది.

  🪷🪷🪷🪷🪷

భక్తుడు :
భగవాన్! ఆత్మవిచారం చేసేటప్పుడు బాహ్య సహాయం కోరడం, ఆధ్యాత్మికంగా న్యాయమా!

మహర్షి :
ఆత్మను దేహమని అనుకోవటంలో ఉన్నది పొరపాటు అంతా. మహర్షి దేహమే అయితే మీరు ఆ దేహాన్ని అడగవచ్చు. మీరు ఎవర్ని మహర్షి అని అంటున్నారో, అతన్ని అర్థం చేసుకోండి. అతడు దేహం కాదు, ఆత్మ.  సర్వమూ దైవమే, వ్యక్తికి చెందేది ఒక్కటీ లేదు. సర్వమూ అంటే వ్యక్తీ దైవమూ, అంతా ఆత్మయే.

   🪷🪷🪷🪷🪷

భగవద్గీత 7 వ అధ్యాయం గురించి మహర్షి ఇలా సెలవిచ్చారు ....

కర్మను నిరాకరించిన శ్రుతులే, నిష్కామ (ఫలితాన్ని ఆశించని) కర్మను అంగీకరించాయి. శ్రుతులు అంగీకరింపని కర్మలు కర్తృత్వ (నేను కర్తను) భావనతో చేసినట్టివి. కర్మలను పరిహరింపకు. అది అసాధ్యం. కర్తను నేను అనే భావనను త్యజించు. కర్మ తనకు తానై ప్రవర్తిస్తుంది. అంతేకాక కర్మ దానంతట అదే నిన్ను వీడిపోతుంది.

  🪷🪷🪷🪷🪷

భక్తుడు :
భగవాన్! కర్మ మనదో కాదో నిర్ణయించే విధానం ఏమి ?

మహర్షి :
కర్మఫలం అనుభవంలేని వ్యక్తి కర్మముక్తుడే.

   🪷🪷🪷🪷🪷

భక్తుడు :
భగవాన్! ఏది తెలిస్తే సకల సందేహాలు తీరిపోతాయో, అది యేది ?

మహర్షి :
ఈ సందేహించేవారిని పట్టుకో; సందేహాలు అసలు రావు. సందేహములను తీసుకురాకుంటే, సందేహాలే రావు. అవి ఎక్కడి నుంచి వస్తాయి? అందరూ జ్ఞానులే, జీవన్ముక్తులే. అది వారికి తెలియదు, అంతే. సందేహాలను సమూలం పెళ్ళగించవలె. అంటే సందేహించేవారు(మనసు) నాశనం కావలె..!!

No comments:

Post a Comment