సాంస్కృతిక పునరుద్ధరణ దీప శిఖ రాణి.. అహిల్యాబాయి
---
( మే 31 – రాణి అహిల్యాబాయి జయంతి )
సాధారణంగా వీరనాని అనగానే మనందరికీ ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి గుర్తుకు వస్తారు. కానీ మన దేశ చరిత్రను చూసుకుంటే తమ రాజ్యాల కోసం వీరోచిత పోరాటాలు చేసిన రాణులు చాలామంది ఉన్నారు. అందులో ఒకరు మహారాణి అహిల్యా బాయి హోల్కర్. వీరోచిత పోరాటాలతో పాటు ఆదర్శ పరిపాలనను అందించిన స్త్రీ మూర్తి రాణి అహిల్యా బాయి. 18వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్త చరిత్రలో దాదాపు 30 సంవత్సరాలు అత్యంత ప్రశాంతంగా, అత్యంత సాధికారతతో, అత్యంత వైభవంగా రాజ్యపాలన చేసిన రాణి అహిల్యా బాయి 1725వ సంవత్సరం మే 31న మహారాష్ట్రలోని ప్రస్తుత అహ్మద్నగర్ జిల్లాలోని చోండి అనే గ్రామంలో జన్మించారు. తండ్రి పేరు మంకోజిరావు శిందే, తల్లి పేరు సుశీలాబాయి శిందే. అహిల్య 8వ ఏట జరిగిన ఒక నాటకీయ పరిణామం ఫలితంగా 1733లో ఖండేరావు హోల్కర్ను వివాహమాడి ప్రఖ్యాత మరాఠా సేనాని మల్హర్ రావు హోల్కర్ ఇంట కోడలిగా అహిల్య అడుగుపెట్టింది.
అహిల్యలోని ప్రతిభను మామగారైన మల్హర్ రావు గుర్తించడమే కాక ఆమెకు రాజ్యపాలనలో, యుద్ధ వ్యూహాలలో తర్ఫీదు ఇచ్చారు. అయితే ప్రశాంతంగా సాగుతున్న అహిల్యాబాయి జీవితంలో భర్త ఖండేరావు 1754లోను, తండ్రి వంటి మామ మల్హర్ రావు 1766లోను, కుమారుడు మలేరావు 1766లోను ఆ తరువాత కుమార్తె ముక్తాబాయి ఇలా ముఖ్యులందరూ అకాలంగా తనువు చాలించారు. ఇలా ఒకదాని వెంట మరొకటిగా కష్టాలు ఆమెను వెన్నాడినా ఈ బాధలను దిగమింగి తన కర్తవ్యాన్ని ధైర్యసాహసాలతో ఎంతో సమర్థవంతంగా నెరవేర్చింది. తన పాలనను కేవలం రాజ్య విస్తరణకు, శాంతిభద్రలతను కాపాడటానికే పరిమితం చేయలేదు. ప్రజలకు, సమాజానికి, ధర్మానికి ఎనలేని సేవలు అందించింది.
అహిల్యాదేవి శకం మహిళాసాధికారకతకు నిలువెత్తు దర్పణంగా నిలుస్తుంది. వరకట్నం, సతీసహగమనం వంటి దురాచారాలను నిషేధించింది. మహిళలకు విద్య, వితంతు మహిళలకు భర్త ఆస్తి పై హక్కు, పునర్వివాహం చేసుకునే అవకాశం, బాల్య వివాహాల పట్ల ఆంక్షలు, సంతానం లేని వితంతువుల ఆస్తుల జప్తు విధానం రద్దు, మహిళా సైనిక దళాల నిర్మాణం ఇలా సాహసోపేత నిర్ణయాలు ఎన్నో తీసుకుంది. అహిల్యాబాయి దేశవిశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే ఆలోచించేవారు. ఆంగ్లేయుల సామ్రాజ్యవిస్తరణ కాంక్షను ముందే పసిగట్టి వారి నక్కజిత్తులకు మోసపోవద్దని సమకాలీన పాలకులనందరినీ ఆమె హెచ్చరించారు. మొగలాయీలూ నేలమట్టం చేసిన అనేక పవిత్ర దేవాలయాలను తిరిగి నిర్మించారు. ఆ దేవాలయాలు ధార్మికపరంగానే కాదు విదేశీ ముస్లింల విధ్వంసానికి, ముస్లిం వలసపాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలకు ఈనాటికీ ప్రతీకలుగానే నిలుస్తున్నాయి. రామేశ్వరం నుంచి చార్ధామ్ వరకు, కాశీ నుంచి ద్వారక వరకు ఆమె ఎన్నో ఆలయాలను నిర్మించి ధార్మిక పునరుద్ధరణ నాయకురాలిగా రాణి అహిల్యాబాయి చరిత్రలో నిలిచిపోతారు.
అహిల్యాబాయి పరిపాలనా వ్యవస్థలో అవినీతికి తావు ఉండేది కాదు. న్యాయపాలనకు ప్రతీకగా అందరి పట్ల సమభావంతో రాణి అహిల్య వ్యవహరించేది. ప్రజలకు ఉపాధి కల్పించేందుకు వస్త్ర పరిశ్రమను నెలకొల్పింది. వ్యాపార అవకాశాలను పెంపొందించిది. బిల్లులు, గోండులను వ్యవసాయం వైపు మళ్లించింది. ఛత్రపతి శివాజీ మహారాజ్, శంకరాచార్యులలో ఉన్న విశాల దృష్టి, ఆర్యచాణక్యుని పాలనా, దౌత్యనీతులు, సమర్థ రామదాసు, సంత్ జ్ఞానేశ్వర్ దివ్యత్వాల మేలుకలయికే రాణి అహిల్యాబాయి. ప్రజా సమస్యల పట్ల సానుభూతి, అవగాహన ఉన్న ఒక కరుణాత్మకమైన నాయకత్వం ఎంత సాధించగలదో అనడానికి అహిల్య ఒక ఉదాహరణ కనుకనే ఆమెను లోకమాత, సాధ్వి, పుణ్యశ్లోక, మాతృశ్రీ వంటి బిరుదులతో ప్రజలు ఆప్యాయంగా, గౌరవంగా పిలిచారు. పాశ్చాత్య చరిత్రకారుల ప్రశంసలు అందుకున్న అహిల్యాబాయి 13 ఆగస్టు 1795న తన 70వ ఏట తనువు చాలించింది. ఆమెను భగవద్గీతలో చెప్పినట్లు కర్మయోగిగా పేర్కొనడం సముచితం. అహిల్య పాలన శాంతి సౌభాగ్యాలకు, సుస్థిరత్వానికి నిలయమై భారతదేశ చరిత్రకు వన్నెచిన్నెలు అద్ది, తరతరాలకు స్ఫూర్తిదాయకమై నిలుస్తుంది.
No comments:
Post a Comment