Monday, May 26, 2025

 *కర్మవ్యాధి - గాయత్రి శక్తి..!*
                 

```
సుమారు ఐదారువందల సంవత్సరాల క్రితం తిరువనంతపురం పరిపాలిస్తున్న కేరళరాజుకు నివారణకాని రోగం యేర్పడింది. ఎన్ని వైద్యాలు చేసినప్పటికీ వ్యాధి నివారణకాలేదు. 'రాజ వైద్యం' అని అంటూవుంటాం గదా, ఆ విధంగా యెంతగానో చికిత్స చేసినప్పటికీ నయంకాక యెంతో బాధపడ్డాడు.

ఒకరోజు రాత్రి భగవానుడినే ప్రార్థించుకొంటూ అలాగే కొంతసేపు రెప్పవాల్చాడు. అప్పుడు ఒక స్వరూపం వచ్చింది. కలలో ఆకాశంనుండి భూమివరకు ఒక పెద్ద రూపం కనిపించి ఆయనతో, “రాజా! నీకు కలిగినది ‘కర్మవ్యాధి.’  అంటే జన్మాంతరంలో నీవు చేసిన పాపంలో తీరిపోక మిగిలివున్న శేషమే రోగంగా మారింది. దానిని నీవు అనుభవించి మాత్రమే తీర్చుకోవాలి తప్ప ఔషధాలచే నయంచేయ సాధ్యంకాదు. 

కావాలంటే ఒక పని చేయవచ్చు. నీ ఆకృతితో నువ్వులతో ఒక ప్రతిమను చేసి దానిలోపల పూర్తిగా బంగారం నింపి, అందులో నీ కర్మను, పాపాన్ని, రోగాన్ని ఆవాహన చేసి శక్తివంతుడైన ఒక బ్రాహ్మణుడికి దానం యివ్వాలి.

అప్పుడు కర్మ నిన్ను విడిచి వాడికంటుకొంటుంది. అతడు మంచి శక్తి కలిగినవాడైతే రోగాన్ని సంభాళించుకొనగలడు. అది యెలాగైనా అతడికి ఈ విధంగా రోగాన్ని కలిగిస్తుందన్నందుకు ప్రతిహారంగానే యింతటి స్వర్ణాన్నివ్వాలనడం” అని చెప్పింది.

లేవగానే రాజు ఆ విధంగానే నువ్వులతో బింబాన్ని చేసి, దానిలో కందిపప్పు వంటివైన స్వర్ణపూసలను పోసి నింపించాడు. దాన విషయాన్ని బ్రాహ్మణ మహాజనులకు దాచిపెట్టకుండా తెలియపరిచాడు.

దానం తీసుకోవడానికి యెవరూ ముందుకు రాలేదు. 'రాజు తన కర్మ అనుభవించుకొనవలసినదే. బంగారుకు ఆశపడి మన మంత్రశక్తిని పణంగా పెట్టడమా? మంత్రశక్తి చాలకుంటే మన ప్రాణాన్నే పణంగా పెడుతున్నట్టవుతుంది గదా?' అని అందరూ తప్పుకొన్నారు.

రాజు రోగబాధ తట్టుకోలేక పోతున్నాడు. బయట ఊళ్ళు, బయట రాజ్యాల నుండైనా యెవరైనా రాకపోతారా అని నాలుగు దిక్కులా దండోరా వేయడానికి మనుష్యులను పంపాడు.

ఇందుచేత కేరళరాజు సంగతి కర్ణాటక రాజ్యానికి కూడా తెలిసింది. మంచి మంత్రశక్తి, ధైర్యం కలిగిన ఒక కన్నడ బ్రహ్మచారి దానం తీసుకోవడానికి తిరువనంతపురానికి వచ్చాడు.

రాజుకు పట్టరాని సంతోషం. విధింపబడినట్టు అచ్చుపోసిన నువ్వులబొమ్మను బ్రహ్మచారికి దానం చేశాడు.

అప్పుడు ఒక ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. బ్రహ్మచారి ప్రతిమను పరిశీలించి చూడగా, అది తన కుడిచేతిని పైకిలేపి బొటనవ్రేలిని, చిటికెన వ్రేలిని మడచుకొని మిగిలిన మూడువ్రేళ్ళను పైకి చాపి చూపింది.

రాజుయొక్క పూర్వకాల కర్మశేషం కాలపురుషుడనే మూర్తిగా ప్రతిమలో ప్రాణ ప్రతిష్ట చేయబడివుండింది. ఆ కారణంగా అచేతనమైన బింబం నిజంగానే ప్రాణం కలిగిన సచేతన జీవుడిగా మారింది.

అది ఈ విధంగా మూడు వ్రేళ్ళను పైకి చాపి చూపగానే బ్రహ్మచారి తల ఆడిస్తూ “అవన్నీ వీలుపడవు” అని అన్నాడు.

వెంటనే బింబం ఉంగరపు వ్రేలును మడచుకొని మిగిలిన రెండువ్రేళ్ళను మాత్రమే చాపినట్టు పెట్టుకొన్నది.

“అవి కూడా వీలుపడవు” అని కన్నడ బ్రహ్మచారి తల వూపాడు.

బింబం మధ్య వ్రేలును కూడా మడచుకొని, చూపుడు వ్రేలునొక్కదానిని మాత్రమే చూపింది.

“పోతేపోనీ. నీ యిష్టప్రకారమే కానీ” అని అన్నాడు బ్రహ్మచారి. 
ఆ విధంగా అతడు నోరు మూసేలోపే బింబం పరమ సంతోషంతో అతడి కాళ్ళపై పడి సాష్టాంగ నమస్కారం చేసి నిలబడింది.

తరువాత బింబం వట్టి బింబంగా మాత్రమే నిలబడింది. కాలపురుషుడు దానిని విడచిపెట్టి వెళ్ళిపోయాడు.

ఇదేమిటన్నది అర్థంకాక, నివ్వెర పోతున్న రాజును, యితర పరివారాన్ని చూసి బ్రహ్మచారి ఇలా వివరించాడు... 

బ్రహ్మచారి పరిశీలించి చూసినప్పుడు, “నీకు నా మంత్రజపంలో యెంతటి ఫలాన్నిస్తే నీవు నన్ను బాధించక వెళ్ళిపోతావు?” అంటూ మానసికంగా అడిగాడట.

అతడు రోజుకు మూడు వేళలా చేసే త్రికాల సంధ్యావందనాల ఫలాన్నిస్తే వెళ్ళిపోయేటట్టు, బింబం మూడు వ్రేళ్ళను చూపిందట. అంతటి పెద్ద ఫలితాన్ని యివ్వడం వీలుపడదని అతడు చెప్పినమీదట, అలాగయితే మూడు వేళల్లోని రెండిటి ఫలాన్నైనా యివ్వవలసినదని యాచిస్తూనే బింబం రెండు వ్రేళ్ళను చూపిందట. 

అది కూడా యెక్కువేనని అతడు బేరమాడాడు. అందుకే బింబం ఒకే ఒక వేళ సంధ్యావందన ఫలాన్ని అడిగిందట. దానినే పోతేపోనిమ్మని యితడు దత్తం చేయగా, భయంకరమైన కర్మశేషం, 'సమూలంగా పోతాను' అని యితడికి దండం పెట్టి పరుగెట్టి వెళ్ళిపోయింది.
                          పద్ధతిగా గాయత్రిని చేస్తే దానికి యెంతటి శక్తి వుంటుందని దీనినుండి తెలుసుకొన్న ప్రజలు ఆ శుద్ధమైన బ్రహ్మచారిని యెంతో ప్రస్తుతించారు. రాజుకు, పూర్వం బలి చక్రవర్తినుండి దానం తీసుకోవడానికి వచ్చిన వామన బ్రహ్మచారే నేడు ఈ విధంగా వచ్చి తన వ్యాధిని నివారణ చేసినవాడా అని అనిపించింది.

వాస్తవంగానే, బ్రహ్మచారి ప్రతిమను దానం తీసుకోగానే రాజుకు వ్యాధి నయమయింది.✍️```
…శ్రీపరమాచార్యులవారి 
                          అనుగ్రహభాషణం.
          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

No comments:

Post a Comment