Wednesday, May 28, 2025

 *విశిష్ట చారిత్రక తెలుగు మహిళలు - 68-2*

*క్రీడారంగం*

*ఒలింపిక్ పతకం సాధించిన తొలి భారత మహిళ*
*కరణం మల్లీశ్వరి.*

నీలంశెట్టి అప్పన్న, ఈ రంగంలో సాహసోపేతంగా శిక్షణ ఇచ్చారాయన. 1994 జాతీయ మహిళా ఛాంపియన్ షిప్లకు వెళ్లే మహిళా బృందాలకు కోచ్గా వారితో ఉండేవారు. 

ఆముదాలవలసలోని ఊసవానిపేటలో అప్పన్న నిర్వహణలోని 'వీర హనుమాన్ వ్యాయామ కేంద్రం' లో మల్లీశ్వరి చేరింది. ఈమెకు అక్క నరసమ్మ ప్రేరణ. తరువాత కొంత కాలం ఆమె కె. అమ్మి నాయుడు నిర్వహిస్తున్న 'మారుతి యువజన వ్యాయామ మండలి' లో చేరి శ్రమించింది. 

బెంగుళూరులో రష్యన్ కోచ్ రియోబోకాన్, మల్లీశ్వరి పట్టుదల, ప్రతిభ గుర్తించి ఆమెను ప్రత్యేకంగా శిక్షణ జట్టులో చేర్చుకున్నారు. తర్వాత ఆమె కలకత్తాలోను, పాటియాలలోను శిక్షణ పొందింది.

1990లో మల్లీశ్వరి మొదటి చెప్పుకోదగ్గ విజయం రాజస్థాన్లోని ఉదయపూర్లో *'జాతీయ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్లో* లభించింది. ఇక్కడ ఆమె ప్రథమ స్థానం సాధించింది. 1994లో హిరోషిమాలో జరిగిన ఆసియా క్రీడల్లో *రజత పతకం* సాధించింది. అంతర్జాతీయ కీర్తికి మార్గం ఏర్పరచింది. 1995లో *ఇస్తాంబుల్లో ప్రపంచ ఛాంపియన్షిప్లో44 కిలోల కేటగిరిలో ఒక రజతం, ఒక కాంస్య పతకం* గెల్చుకుంది. ఇస్తాంబుల్ క్రీడల్లో పాల్గొన్నప్పుడు క్రీడాకారులు స్వంత ఖర్చులకు 25 వేలు తెచ్చుకోవాల్సి ఉంది. ఆర్థిక పరిస్థితి ఏమాత్రం అనుకూలించని మల్లీశ్వరి కొన్ని గంటల్లో విమానం బయలుదేరుతుందనగా ధైర్యంగా నాటి క్రీడామంత్రి మమతా బెనర్జీ వద్దకు వెళ్లి 'నేను దేశానికి పతకం తెస్తాను. నాకు 25 వేలు ఇవ్వండి' అని కోరగా ఆమె మంజూరు చేసారు. 1995లో హాంకాంగ్లో ప్రపంచ ఛాంపియన్ షిప్ సాధించి ఆమె అంతర్జాతీయ స్థాయికి
చేరుకున్నారు. 54 కిలోల స్థాయిలో బంగారు పతకం సాధించింది. 113.0 కిలోల బరువెత్తి చైనా క్రీడాకారిణి లాంగ్ యు వింగ్ సాధించిన 112.5 కిలోల రికార్డును అధిగమించింది. 1997లో మల్లీశ్వరి సీనియర్ జాతీయ వెయిట్ లిఫ్టింగ్లో తన రికార్డును తానే బద్దలు కొట్టింది.

ఒలింపిక్స్లో స్త్రీలకు వెయిట్ లిఫ్టింగ్ను మొట్ట మొదటిగా సిడ్నీలోనే ప్రవేశపెట్టారు. సిడ్నీ ఒలింపిక్స్కు మరో ప్రాధాన్యముంది. స్త్రీలు పాల్గొన్న నూరవ ఒలింపిక్ అది. 

సిడ్నీ ఒలింపిక్స్కు భారతదేశం పక్షాన పంపవలసిన మహిళా వెయిట్ లిఫ్టర్ల విషయంలో కొంత గందరగోళం జరిగింది. వెయిట్ లిఫ్టర్ కుంజు రాణి చేదు అనుభవాలతో ఇక్కడే ఉండిపోయింది. మల్లీశ్వరితో పాటు సనమాబీబాను సిడ్నీ వెళ్లింది. 

2000 సెప్టెంబర్ మంగళవారం సాయంత్రం భారత క్రీడారంగానికి మల్లీశ్వరి అపూర్వమైన విజయాన్ని సాధించిపెట్టింది. ఆమె 240 కిలోలను ఎత్త కలిగి కాంస్య పతకం సాధించింది. 

ఒకప్పటి ఛాంపియన్, బెలారస్ నుంచి వచ్చి ఆమెకు శిక్షణ ఇచ్చిన కోచ్ లియోనిడ్ తారానెన్ ఒలింపిక్స్ ప్రారంభానికి ఒక వారం ముందే మల్లీశ్వరి 240 కిలోలు ఎత్త గలదని విజయం సాధిస్తుందని ఊహించారు.

ఆమెకు 1994లో అర్జున అవార్డు, 1995లో రాజీవ్ ఖేల్ రత్న అవార్డు లభించాయి. 1999లో భారత ప్రభుత్వం ఈమెకు *'పద్మశ్రీ'* బిరుదు ప్రదానం చేసింది.

ఈమె శిక్షణ తీసుకుంటున్న కాలంలో 'హిందూజా ఫౌండేషన్' నెలకు రూ. 1000 ఉపకార వేతనం ఇచ్చేవారు. తర్వాత 5000 లకు పెంచారు. తర్వాత ఆమెకు భారత ఆహార సంస్థవారు తమ సంస్థలో ఉద్యోగం ఇచ్చి గౌరవించారు. మల్లీశ్వరి భర్త వెయిట్ లిఫ్టర్ రాజేశ్ త్యాగి హర్యానాకు చెందిన వారు. 

వీరిద్దరూ ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో శిక్షణ పొందుతున్నప్పుడు మొదటిసారిగా కలుసుకున్నారు. ఇరు కుటుంబాల నుండి వ్యతిరేకత ఉండడంతో వారు 1997లో రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఒక సంవత్సరం వరకు మల్లీశ్వరి తన తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పనే లేదట. 

'మల్లీశ్వరి శిక్షణ శిబిరాలు, పోటీలతో వివాహమైన మూడేళ్లలో మేం 3, 4 నెలలు మాత్రమే కలిసి ఉండగలిగామని ఆమె శ్రమ ఫలించిందని అత్తమామల అభిమానాన్ని కూడా పొందగలిగిందని రాజేష్ త్యాగి ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కరణం మల్లీశ్వరి ఎన్నో ఒత్తిళ్లను, పత్రికల్లో వచ్చే వ్యతిరేక వార్తలను, ఇతర వెయిట్ లిఫ్టర్ల ఎత్తి పొడుపులను తట్టుకుంటూ సాంఘిక జీవితమే లేకుండా జీవితమంతా జిమ్లు చుట్టునే పరిభ్రమించగా నిద్ర పట్టనివ్వని ఎముకల నొప్పితో బాధలు భరిస్తూనే ఏకాగ్రతతో, కఠోర పరిశ్రమతో విజయం సాధించి భారతావనికి తొలి ఒలింపిక్ పతకం సాధించిన మహిళగా చరిత్రకెక్కింది.

*ఓం నమో శ్రీవేంకటేశాయ!!*
(సమాప్తం)

No comments:

Post a Comment