*'మనో దౌర్బల్యమే మనిషి పతనానికి మూలం'*
*తాను సుఖపడడు. ఇతరులను సుఖపెట్టడు. పరులు సుఖపడుతుంటే ఓర్వలేడు. ఇది క్లీబుడి (నపుంసకుడి) లక్షణం. ఇలా నపుంసకులుగా బ్రతుకొద్దంటున్నాడు భగవంతుడు. రెంటికీ చెడ్డ రేవడిలాంటి బ్రతుకు తగదంటున్నాడు. ఇది వదలమంటున్నాడు.*
*ఆత్మన్యూనతా భావం వల్ల ఈ క్లీబత ఏర్పడుతుంది. కర్తవ్యాన్ని విస్మరించడం వల్ల మనో దౌర్బల్యం ఏర్పడుతుంది. ఆలోచనలు క్రమం తప్పితే కర్తవ్యం మరుపుకొస్తుంది. తగనివాటిమీద ప్రేమ ఆలోచనల్ని తప్పుదారి పట్టిస్తుంది. కృప మంచిదేకాని, అది తగని రీతిలో, తగని వాటిపై కలగడమే ప్రమాదకరం. ఎంతటి వాడినయినా పాడుచేస్తుంది. హనుమంతునంతటివానినీ హృదయదౌర్బల్యం ఆత్మహత్య చేసుకుందామా అనేంతవరకు తీసుకెళ్ళింది. ఇది తగదు. హనుమంతుడు సీతాదేవి కన్పించకముందు అన్వేషణ ఇంకాపూర్తి కాకుండానే సీత ఇక దొరకదు అనుకున్నాడు.*
*"వెనుతిరిగి వెళ్ళి సీత లభించలేదని చెబితే రాముడు ప్రాణం వదులుతాడు. అది చూసి లక్ష్మణుడు ఆపై సుగ్రీవుడు దానివల్ల వానరులు, అది తెలిసి అయోధ్యాపురజనులు, ఇందరూ ప్రాణం వదిలేస్తారు.*
*ఇందరి ప్రాణం తీసేది తానే. సమాచారం చెప్పకపోతే అందరూ. ఆశతో బ్రతికి ఉంటారు" ఇలా వారందరిమీద జాలికలిగినట్లుగా భావించి వెళ్ళొద్దని నిర్ణయించేసుకున్నాడు. వెళ్ళకుండా లంకలో తానుండలేడు. వెళితే వారుండరు. ఇలా జీవించడంకంటే ప్రాణం వదలడమే మేలు అని, ఆత్మహత్యకు సిద్ధపడ్డాడు. నిజానికి హనుమంతుడు వెతకకపోయినా, లంకకు వెళ్ళకపోయినా రాముడెవరో ఒకరిద్వారా సీతా సమాచారం తెలుసుకొని ఉండేవాడే. రావాణ వధకూడా చేసియుండేవాడే. హనుమంతుడికా అదృష్టాన్ని కలిగించాడు. నేనే చేసేస్తున్నాననుకున్నాడు హనుమంతుడు. ఆ గర్వం నిరాశ అయి, అది క్లీబతగా మారి ప్రాణానికే ముప్పు తెచ్చుకునేంతవరకు వెళ్ళింది. అయితే బుద్ధిమంతుడు కనుక మరొకడు చెప్పక్కర్లేకుండానే మనోదౌర్బల్యాన్ని వెంటనే దూరం చేసికొని కర్తవ్యాన్ని గుర్తించి పునరన్వేషణ ప్రారంభించాడు. సీత అక్కడే లభించింది. మనో దౌర్బల్యాన్ని ఎలా దూరం చేసుకున్నాడు? అనేది ప్రశ్న. తాను చేసేది సీతారాముల సేవ కనుక వారే తనకి శక్తినివ్వాలని వారికి శరణాగతి చేసాడు. వెంటనే ఫలించింది.*
*అర్జునుడికి తన కర్తవ్యమైన దుష్ట నిర్మూలన చేస్తే బంధువులు పోతారని, స్నేహితులు నశిస్తారని, నరకాలొస్తాయని అనవసరపు ఆలోచనలు మనోదౌర్బల్యాన్ని తెచ్చిపెట్టాయి. కర్తవ్యాన్ని మరిపించాయి. రోగం తొలగడానికి శస్త్ర చికిత్స చేయవలసిన వైద్యుడు ఆపరేషన్ రూములో జాలికలిగి, చికిత్సమాని, కత్తిని పారవేసినట్లు అర్జునుడు ధనుర్బాణాలు శ్రీకృష్ణునిముందరే పారేసి అంత యుద్ధరంగంలోను తన రథంలో చతికిలపడ్డాడు. సహజంగా పరంతపుడు. కాని అసహజమైన కృపవల్ల పనికిరాని క్లిబుడయ్యాడు. రెంటికి చెడ్డ రేవడిలా తయారయిన అర్జునుని శ్రీకృష్ణుడు మేల్కొల్పుతున్నాడు. అతనిని సాకుగ నిలిపి మన మనోదౌర్బల్యాన్ని పారద్రోలుతున్నాడు. ఉత్తిష్ఠ! అంటూ నిద్రాణమైన సమాజాన్ని మేల్కొల్పుతున్నాడు. కర్తవ్యనిష్టులను కమ్మంటున్నాడు.*
*ఒకడు దేముడు లేడని అనుకున్నాడు. ఉన్నాడని శాస్త్రం చెప్పింది. పెద్దలూ చెపుతున్నారు. ప్రమాణాల్లో నిరూపిస్తారు. ఐనా తన నిర్ణయానికి విరుద్ధం కనుక, అస్తిత్వాన్ని అంగీకరించలేడు. లేడని తాను నిరూపించలేడు. ఉన్నాడన్న వాదనని ఖడించలేడు. ఇదో రకమైన మనోదౌర్బల్యం. అర్జునుడి స్థితి అలాగే ఉంది. మనలో చాలమందిలో ఈ స్థితి ఉంది. పెద్దలంగీకరించనిది, శ్రేయస్సును నాశనం చేసేది, కీర్తిని పాడుచేసేది ఐన మనో దౌర్బల్యాన్ని మట్టుపెట్టి సమాజానికి హాని కల్గించే దుష్ట ప్రవృత్తులను దునిమాడి శ్రీకృష్ణుడు చెప్పే సత్యమార్గములో ముందుకు సాగండి! పరంతపులు కండి! బలహీనతలను అణచివేయండి.*
*┈┉┅━❀꧁మార్గదర్శి꧂❀━┅┉┈*
*ఆధ్యాత్మిక అన్వేషకులు*
🍁🦚🍁 🙏🕉️🙏 🍁🦚🍁
No comments:
Post a Comment