Wednesday, May 28, 2025

 హరి ఓం ..
🌷🌷🌷🌷
ఒకప్పుడు చైతన్యుడు అనే భక్తుడు ఉండేవాడు తను గురువు ద్వారా నారాయణ మంత్రాన్ని ఉపదేశం పొంది ఒక నారాయణుడి విగ్రహం ఇచ్చి దాని మీద దృష్టి సారించమని చెప్పాడు!

 చైతన్యుడు కూడా మంత్రాన్ని వల్లిస్తూ నిత్యం ఆ విగ్రహాన్ని పూజిస్తుండేవాడు , కానీ విగ్రహం లో చలనం లేదు దేవుడు కూడా తనని గుర్తించినట్టు కనపడలేదు !! 

చైతన్యుడు నిరాశతో తన గురువు దగ్గరకు చేరి  తనకు విష్ణుమూర్తి (విగ్రహం)  కరుణించటం లేదని తనకు మరొక  కొత్త ఉపదేశం చేయాల్సిందిగా గురువు ని కోరుకుంటాడు !

 చైతన్యుడి అజ్ఞానానికి నవ్వుకొని సరే అంటాడు !
ఈ మారు శిష్యుడికి శివ మంత్రాన్ని ఉపదేశించి  శివుడి మూర్తిని ఇచ్చి , భోలే నాథుడు త్వరగా కరుణిస్తాడు అని చెప్పి శిష్యుడిని పంపిస్తాడు ! 

చైతన్యుడు ఆరు నెలల పాటు నిర్విరామంగా మంత్ర జపము మరియు శివ మూర్తి ఆరాధనాలో నిమగ్నమయ్యాడు !!

మునపటి నారాయణుడి మూర్తిని పూజించకుండా దుమ్ము పట్టిన అటక ఎక్కించేశాడు ! 

చాలా రోజులు శివుడి మూర్తిని పూజించి మంత్రాన్ని జపించినా కూడా చైతన్యుడికి ఫలితం కనిపించక మరీ నిస్పృహ చెంది తిరిగి గురువు దగ్గర కి పయనమయ్యాడు!

గురువు ని చేరిన చైతన్యుడు నిర్వేదం తో శివుడి మూర్తి కూడా కరుణించలేదు కావున తనని అనుగ్రహించు దేవ మూర్తిని ప్రసాదించమని కోరుకున్నాడు ! 

గురువు జ్ఞానోదయానికి సమయం ఆసన్నమైంది అని తలచి శిష్యుడితో ఇలా అన్నాడు ! 

ఈ యుగానికి కాళీ మాత మూర్తి అన్నిటి కన్నా శ్రేష్టమైనది కావున కాళీ మాత మూర్తిని పూజించమని చెప్పి కాళీ మంత్రాన్ని కూడా ఉపదేశించాడు !

 చైతన్యుడు సంతోషం గృహోన్ముఖుడయ్యాడు!
శివ మూర్తిని కూడా మునుపటి విష్ణు మూర్తి పక్కన అటక ఎక్కించేశాడు ! కాళీ మాత మూర్తిని ఆరాధించటం మొదలెట్టాడు !

 కాళీ మాత మూర్తి ముందర ధూపాన్ని వెలిగించి పూజించడం మొదలు పెట్టాడు ! ఆ ధూపం గది మొత్తం నిండిపోతూ ఉంది !

 అటక మీద ఉన్న శివుడి మూర్తిని సమీపించగానే చైతన్యుడు కోపం తో వెళ్ళి నన్ను అనుగ్రహించని ఈ మూర్తి (విగ్రహం)  కాళీ మాత మూర్తికి అర్పించిన ధూపాన్ని పీల్చకూడదు అని ఆ మూర్తి యొక్క నాసిక రంధ్రాల్లో పత్తిని పెట్టబోయాడు !

అంతలో ఆ విగ్రహం మాయం అయ్యి కళ్ల ఎదుట పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు ! పరమేశ్వరుడు చిద్విలాసం చేస్తూ దయతో కోరిక కోరుకో అన్నాడు ! 

ఈ హటత్పరిమాణానికి సంభ్రమాశ్చర్యాల్లో మునిగి పోయిన చైతన్యుడు పరమేశ్వరుడిని ఇలా అడిగాడు ! 

స్వామి ఇన్ని రోజుల నా జప మరియు పూజలకి స్పందించని వాడి వి నీ మూర్తి (విగ్రహం) నన్ను అనుగ్రహించటం కోసం కాదు అని తలచి నిన్ను పక్కన కి పెట్టిన తర్వాత ఇప్పుడు నన్ను అనుగ్రహించటానికి కారణం ఏమి అని అడిగాడు ?

పరమేశ్వరుడు ఇలా సమాధానం ఇచ్చాడు!
కుమారా  చైతన్య నువ్వు ఇన్ని రోజులు పూజించిన ఆ మూర్తిలో నేను ప్రాణం తో ఉన్నాను అన్న భావం తో పూజించలేదు , 

ఇన్ని రోజులు కేవలం ఒక రాతి విగ్రహంగానే భావించావు , కానీ ఈ రోజు నా మూర్తికి  ప్రాణం ఉంది అన్న  భావనతో నేను ధూపాన్ని పీలుస్తాను అని నా మూర్తిలో ప్రాణం తో కూడిన నేను ఉన్నాను అని తలచావు కావున నీకు అనుగ్రహం లభించింది అని చెప్పాడు !

వేదం కూడా ఇదే చెప్తోంది కేవలం ప్రకృతిని , విగ్రహాలని పూజిస్తే లాభం లేదు అని ! దాని అర్థం తెలుసుకోలేని మూర్ఖులు వేదాలలో విగ్రహారాధన లేదు అని వితండవాదం చేస్తుంటారు ! 

మనం ఎప్పుడైతే విగ్రహం లో పరమాత్మ ని చూడగలుగుతామో అప్పుడే మనకి ఫలితం ఉంటుంది ! 

ఏదో విగ్రహానికి దండం పెట్టేశామా వెళ్లిపోయామా అన్న చందాన కాకుండా ఎప్పుడైతే ఆ విగ్రహం లో పరమాత్మ స్వరూపాన్ని స్మరిస్తామో అప్పుడే దానికి తగ్గ ఫలితం తప్పక లబిస్తుంది...స్వస్తి.

🙏🏻🌷🙏🏻🌷🙏🏻🌷🙏🏻

No comments:

Post a Comment