*మార్గదర్శి.....*
*`శ్రీమద్భగవద్గీత` గ్రూప్ వీక్షకులకు ప్రత్యేకంగా...*
*📿🪔📿 సమర్థుడి సహాయం-సదా సుఖకరం 📿🪔📿*
*జీవితంలో ఎదురయ్యే కష్టాలకు, నష్టాలకు లెక్కలేదు. అవి చాల బాధను కలిగిస్తాయి. కష్టాలకు కారకులైన వారిని 'కనిపిస్తే కాల్చేద్దామన్నంత ఉద్రేకం కలుగుతూ ఉంటుంది. ఇది సహజం. కష్టాలు, నష్టాలు కనిపిస్తాయే తప్ప కారణాలు కన్పించవు. ఒక వేళ కారణాలుగ ఏ వ్యక్తులో కొందరు కనపడినా, మనకంటే వారు బలవంతులైతే, ఏమీ చేయలేక, లోలోపలే మండిపడుతాం. చేతకానితనానికి మరింత ఏడుస్తాం. నిజానికి కష్టనష్టాలకు కారణం బయటి పరిస్థితులా? ఆలోచించండి... కానేకాదు. బయట జరగవలసినవేవో, వాటిమానాన అవి సాగుతూంటాయి. వాటిని అర్థం చేసుకోలేని మనస్సు, దానిని బలవంతంగ చెడుమార్గాలవైపు లాక్కుపోయే ఇంద్రియాలే, మన కష్టనష్టాలకు మూలకారణాలు, వాటిని అదుపు చేయగలవారికి జీవితంలో ఏమీ కష్టమనిపించదు.*
*అది చేతకాని వారికి అన్నీ సమస్యలే. అయితే, ఈ ఇంద్రియాలు మన మాట వింటాయా? మనకులొంగుతాయా? మనస్సు మన అదుపాజ్ఞలలో ఇముడుతుందా? ఊహు! అవి మనతో ఉన్న, మనవస్తువులు కావు. కర్మానుభవానికి భగవంతుడు మనకు ఇచ్చాడు. శరీరంలో ఉన్నంతవరకూ వాటిని వాడుకోవచ్చు. అంతే! అవి మాటవిననపుడు, వానినిచ్చిన భగవంతునికి వాటినప్పగించాలి తప్ప, మనము రిపేరు చేసే ప్రయత్నం చేస్తే అవి మరింత దిగజారతాయి, అవి చాలా మొండివి. ఎవ్వరి మాటావినవు. వింటున్నట్టుగ ఉంటాయి. పూర్తిగ మునిగిపోయాక తప్ప, అవి ముంచాయనేది తెలియనివ్వవు.*
*మేనక వశుడైన విశ్వామిత్రుడు, పుత్రుని ఆయువును గూడ అడిగి తీసుకొని సుఖాలు అనుభవించిన యయాతి చక్రవర్తి దీనికి చక్కటి ఉదాహరణలు.*
*ప్రతిప్రాణికీ 10 ఇంద్రియాలుంటాయి. 5 కర్మేంద్రియాలు. 5 జ్ఞానేంద్రియాలు. పనిచేసి శక్తిని బయటకు వదిలేవి కర్మేంద్రియాలు, చేతులు, కాళ్ళు, వాక్కు, మలద్వారము, మూత్రద్వారము అనే ఐదూ కర్మేంద్రియాలు. చూపుతెలిపే కన్ను, వాసన తెలిపే ముక్కు, స్పర్శతెలిపే చర్మము, రుచితెలిపే నాలుక, శబ్దము తెలిపే చెవి, అనే ఐదింటినీ జ్ఞానేంద్రియాలంటారు. ఇవి బయటి వస్తువులకుండే స్వభావాలను గుర్తించి, తెచ్చి మనస్సుద్వారా జీవుని కందిస్తాయి. వస్తువులకుండే రంగు, రుచి, స్పర్శ, వాసన, ధ్వని వంటి స్వభావాలనే విషయాలంటారు. ఇంద్రియాలు విషయాలను గ్రహించి, మనస్సులో నిల్వచేస్తాయి. తన వద్దనున్న నిల్వలను బట్టి, ఇంద్రియాలను పంపి, మనస్సు మరింతగ విషయాలకు బానిస అవుతూ ఉంటుంది. ఆ లోపలినిల్వలనే 'సంస్కారా'లంటారు. తాము సంపాయించిన సంస్కారాల కారణంగ ఇంద్రియాలు, మనస్సుగూడ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి, ప్రపంచంలో, కష్టనష్టాలను కొని తెస్తున్నాయి. మనం వాటికి బానిసలమై ఈ శరీరంలో బ్రతుకుతున్నాము. అంటే, మన సేవకోసం పెట్టుకొన్న సేవకులు, వారి దురలవాట్లు మనకి చెప్పి, తమ చెప్పుచేతల్లో మనని పెట్టుకొని ఆడిస్తున్నారన్నమాట! మనం బలహీనులం. మరిప్పుడేమి చేయాలి? మనస్సును, ఇంద్రియాలను వదిలేయగలమా? అంటే చనిపోవడమే కదా! అది చేయలేము. పోనీ అలానే ఏడుస్తూ బ్రతకాలా? మరింత దిగజారిపోతూనే ఉంటాము, ఇంద్రియాల ప్రభావంవల్ల.*
*ఇక, చేయవలసినది ఏమిటి? మనను అభిమానించిన, ఓ సమర్థుడైన స్నేహితుని సహాయం పొందాలి. ఈ ఇంద్రియాలకు, మనసుకుగూడ యజమాని, మన మీద నిష్కల్మషమైన ప్రేమాభిమానాలుకల శ్రీకృష్ణుని సహాయం పొందుదాం! శ్రీకృష్ణుడు మన సహాయకుడై, మనస్సును ఇంద్రియాలను ఇష్టమొచ్చినట్లు పోనీక, మంచి మార్గంలో నడిచే శిక్షణ యిస్తాడు. ఒక రథానికి భాగ తీసుకువెడతాయని 4 గుఱ్ఱాలు కట్టాము. ఆ గుఱ్ఱాలను నడిపేవాడు సారథి. ఆతడు గుఱ్ఱాలను సరిగా నడిపిస్తే రథం మార్గంలో నడిచి గమ్యం చేరుతుంది. ప్రయాణం చేసే వ్యక్తి సుఖపడతాడు. గుఱ్ఱాలు మాటవినకుండా నాలుగు దిక్కులకూ పరుగులు తీస్తే, సారథి మతిలేనివాడే అయితే, రథం నశించి, ప్రయాణీకుడు ప్రమాదంలో మునుగుతాడు. శరీరమొక రథమయితే, ఇంద్రియాలు గుఱ్ఱాలు. వాటిని, అదుపుచేసే మనస్సు కళ్ళెం. జీవుడనే మనము పయనిస్తున్నామిందులో. అయితే సారథిగ మన అల్పబుద్ధినే పెట్టుకుందామా? అతిశక్తివంతములైన ఈ గుఱ్ఱాలను నియంత్రించడం చేతకాదు. దానివల్లనే గద, మనం ఇన్నిరకాల ఇక్కట్లు కొనితెచ్చుకున్నాం. చివరకు రోజూ అసంతృప్తితో ఏడుస్తూ బ్రతుకడమే గతి. గుఱ్ఱాల శిక్షకుడు, సమర్థసారథిగ నేనే మీ వెంట ఉంటానంటున్నాడు. స్వామి శ్రీకృష్ణుడు. అన్ని గుఱ్ఱాలు ఆయన మాట వింటాయి. ఆయన్ని ప్రేమిస్తాయి. మన బుద్ధిని ప్రక్కన పెట్టు. ఈ ఇంద్రియాల పగ్గాలు శ్రీకృష్ణునిచేతికి అప్పగిస్తేచాలు. ఆయనపై 'బాధ్యతగల నా ప్రభువు శ్రీకృష్ణునకు భారమప్ప గిస్తున్నానని అనుకో. బాహ్యేంద్రియాలని, అంతర ఇంద్రియమైన మనస్సుని గూడ వెంటనే దారిలోకి తెస్తాడు. విధేయతగల సేవకులుగ తీర్చిదిద్దుతాడు. స్వాధీనంలో లేని తెరచాప, పడవను సుడిగుండాల్లోకి త్రోసివేస్తుంది. సమర్థుడైన నావికుడు, గాలివాటం గుర్తించి పడవను ప్రమాదాల బారిపడకుండా ఒడ్డుచేరుస్తాడు. శ్రీకృష్ణుడు సమర్థనావికుడు. మనస్సనే తెరచాపను, ఇంద్రియాలనే తెడ్లను సరిగావేస్తూ శరీరాన్ని చిక్కులపాలు కాకుండా రక్షిస్తాడు. బుద్ధికి బలాన్ని కలిగిస్తాడు.*
*అయితే వీటిని ఆయనవైపు పెట్టడం ఎలా?అందమనిపించిన వేవో ఇంద్రియాలను ఆకర్షిస్తాయి. లోకంలోని రంగులు, రుచులు, వాసనలు, స్పర్శలు, శబ్దాల వంటి వాటిలో అందాలన్నీ శ్రీకృష్ణునిలోంచే వచ్చాయి. ఆయన అందంలోని అల్పాంశాంశ మాత్రమే మనలను పిచ్చివాళ్ళను చేసేస్తున్నాయంటే ఇక ఆయన అందం ఎంతటిదో కద! అందుకే ఆయననొక చిన్నిరూపంలో మన మనస్సులో పెట్టుకుందాం!*
*దానినే శుభాశ్రయమంటారు. ఇంద్రియాలతో చేసేపనులన్ని ఆయన కోసమని, ఆయన సంబంధాన్ని గుర్తుచేస్తూఉందాం! అంటే, తినే పదార్థం, త్రాగే పదార్ధము ఏది కనిపించినా, అది శ్రీకృష్ణునికి అర్పించి గ్రహిద్దాం! వినే, చూసేవన్నీ శ్రీకృష్ణుని సంబంధంతో చూద్దాం! స్పృశించేవాటిలో శ్రీకృష్ణస్పర్శకై ప్రయత్నిద్దాం! ప్రతి భావనలో శ్రీకృష్ణుని గుర్తిద్దాం!*
*ప్రాపంచిక అనుభవాలను, శ్రీకృష్ణునిద్వారా పరిశుద్ధముగా వించుకుందాం!*
*ఎండు కట్టెలలో వేసిన నిప్పుకణము, వాటిని భస్మమయ్యేటట్లు దహించినట్లు క్షుద్రప్రాపంచిక విషయాలు శ్రీకృష్ణుని స్పర్శతో, మలినరహితాలై, పరిశుద్ధాలై, మన మనస్సులో చెడుసంస్కారాలను ఏర్పరచవు. గతంలో ఉన్నవి తొలగుతాయి. మనస్సు నిర్మలమౌతుంది. మంచి జ్ఞానం ఏర్పడుతుంది. ఇంద్రియాలు స్వాధీనాలౌతాయి. కష్టాలకు కారణాలనుకున్న సమస్యలనే, సుఖసాధనాలుగ మలచుకొని దుఃఖాలను దూరం చేసుకోగలుగుతాం!*
*ఇంట్లోచేరిన చెత్తాచెదారం మురిగిపోతే సమస్యే. కానీ వ్యవసాయదా రుడికి దాన్ని యిచ్చేస్తే - డబ్బులూ వస్తాయి. మురికీ తొలగుతుంది. ఆతనికి పంటా పండుతుంది. ఫలసాయం పెరుగుతుంది. శ్రీకృష్ణుడు గొప్ప వ్యవసాయదారుడు, ఆతనికి బాధ్యత నప్పగిద్దాం! మొండి ఇంద్రియాలను మనస్సునూ ఆతణ్ణి అదుపులో పెట్టమందాం! మనమా శ్రీకృష్ణుని శరణువేడుదాం! శ్రీకృష్ణుని సేవకులైన శక్తివంతమైన ఇంద్రియాలతో సుఖాలననుభవిద్దాం!*
*┈┉┅━❀꧁మార్గదర్శి꧂❀━┅┉┈*
*ఆధ్యాత్మి అన్వేషకులు*
🌺🦚🌺 🙏🕉️🙏 🌺🦚🌺
No comments:
Post a Comment