*కురుక్షేత్ర యుద్ధంలో విజయం తర్వాత ధర్మరాజులో చెప్పలేనంత విచారం కమ్ముకుంది. అందుకు కారణం*…. *అభిమన్యుడు, ఉపపాండవులు, కర్ణుడు, విరాట మహారాజు, దుష్టద్యుమ్నుడు, భీష్ముడు, ద్రోణాచార్యుడు, ద్రుపదుడు మొదలగు పియ్రమైనవారిని, బంధువులను యుద్ధంలో కోల్పోవడమే*. *అంతమంది మరణానికి కారణమైన కురుక్షేత్ర సంగ్రామాన్ని నివారించలేకపోయానని, ప్రియమైనవారి మరణంతో పొందే రాజ్యం నెత్తురు కూడుతో సమానమని భావించాడు ధర్మరాజు. అలాంటి ఆలోచనలతో రాజ్యపాలన చేయడానికి సుముఖత వ్యక్తపరచలేదు*.
*ఆ పరిస్థితుల్లో వ్యాసమహర్షి వచ్చి ధర్మరాజుతో “ రాజ్యపాలన కోసమే క్షత్రియులను పుట్టించాడు బ్రహ్మదేవుడు. ఆ ధర్మాన్ని నువ్వు ఆచరించాల్సిందే* . *నీకు నువ్వేదో ఊహించుకుంటూ విచారానికి లోనవుతుంటే బ్రహ్మదేవుడి రాతకు విలువ ఉండదు. సృష్టిలో పదార్థాలు వృద్ధి చెందుతున్నాయంటే అవి నశించడానికేనని*, *ఎత్తుగా ఎదగడం విరిగిపడేందుకేనని, దగ్గరగా రావడం *దూరమయ్యేందుకేనని, పుట్టడం గిట్టడానికేనని, సుఖపడటం కష్టాలు పడేందుకేనని గ్రహించాలని” చెప్పాడు*.
*ధర్మరాజులో అంత తొందరగా మార్పు కనబడలేదు. వ్యాసమహర్షి ఇంకా ఇలా హితబోధ చేసాడు*.
*విదేహ రాజైన జనకుడు బ్రహ్మజ్ఞానం పొందని సమయంలో ఆయన బంధువులు చనిపోగా కలిగిన దుఃఖంతో ఇల్లు విడిచి పోవాలనుకున్నాడు*. *ఆయనకు కూడా నీకు వచ్చినట్టే విచారం, వైరాగ్యంఆవహించాయి. అశ్మకుడనే బ్రాహ్మణుడు ఆయనకు హితబోధ చేశాడు. దాన్నే నీ అవగాహన కోసం వినిపిస్తాను*.
*జీవితములో కష్టసుఖాలనేవి కావడి కుండల్లా కలిసే ఉంటాయి*. *మేఘాల్ని గాలి చెదరగొట్టి నట్లు వాటికి లోబడి పోయేవారి ఆత్మను చెదరగొడతాయి.ఎప్పుడూ సుఖాలను మాత్రమే పొందేవారు*, *ఎప్పుడూ దుఃఖాల్ని పొందేవారు లోకంలో ప్రత్యేకంగా ఉండరు. ఈ భూమండలానికి చక్రవర్తి అయినంత మాత్రాన ముసలితనాన్ని, మరణాన్ని తప్పించుకోలేరు. ఏది జరిగినా దైవ నిర్ణయమనే భావాన్ని అలవర్చుకోవాలి. అదే జ్ఞానుల పద్ధతి*.
*వైద్యులు రాత్రింబవళ్లు శ్రమించి వైద్యశాస్త్రమంతా అధ్యయనం చేసి వ్యాధులకు ఏ మందులు వాడాలో చక్కగా నేర్చుకుంటారు. రోగులు, స్త్రీల దోషాల్ని తెలివితేటలతో గుర్తించి వైద్యం చేస్తారు*. *అంత శ్రమించినా ఒక్కొక్కసారి రోగం తగ్గదు . వైద్యుల్ని కూడా రోగాలు బాధ పెడుతుంటాయి. దీన్ని బట్టి మానవుడి నేర్పు, తెలివితేటలు కూడా విధి వైపరీత్యాలను మార్చలేవని, మానవుడి తెలివితేటల కంటే విధి బలమైనదని తెలుస్తోంది*.
*శారీరక అందచందాలు, బలం, ఆరోగ్యం , అదృష్టం , భోగాలు మొదలైనవన్నీ పూర్వ జన్మ కర్మఫలాన్ని అనుసరించి ఏర్పడతాయి*. *ఇవన్నీ మానవులు కోరితే వచ్చేవి, వద్దనుకుంటే పోయేవి కాదు. దైవ ప్రేరితాలు. ప్రవాహంలో గడ్డి పరకలు కలసి ప్రయాణం చేస్తూ కొంతసేపయిన తర్వాత విడిపోతున్నట్టే బంధుత్వాలు కూడా తాత్కాలికమైనవే*.
*జనన మరణం వలయంలో అనేక మంది తల్లిదండ్రులని, భార్యా పిల్లల్ని, బంధువుల్ని పొందుతూ ఉంటారు. వీరిలో ఏ జన్మలో బంధుత్వం కోసమని దుఃఖించాలి. బంధుత్వాలు అశాశ్వతమని తెలుసుకోవడమే జ్ఞానం*.
*కాలమనే సముద్రంలో జనన మరణాలనేవి మొసళ్ల వంటివని తెలుసుకొని శోకాన్ని వదిలి ధర్మ మార్గంలో నడవాలి*. *మానవుడి శరీరమే కొన్నాళ్ళు భూమి మీద జీవించడానికి అప్పుగా తెచ్చుకున్నది. శరీరమే సొంతం కానప్పుడు బంధుమిత్రుల మాట ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. బంధుత్వాలన్నీ కూడా అశాశ్వతమైనవే*.
*పుట్టుక చేత రాజ్యపాలన చేయడం నీ ధర్మం . మిగిలినవన్నీ మర్చిపోయి ముందుగా ఆ పని చెయ్యి*. *ఇంకా నీలో ఉన్న సందేహాలు, మాలిన్యాలను సత్పురుషుల సాంగత్యంలో నివృత్తి చేసుకో. అలా అశ్మకుడు చేసిన ఉపదేశంతో వైరాగ్యపు పొరలు విడిపోయి రాజ్యపాలన చేపట్టాడు జనకమహారాజు*. *నువ్వు కూడా అదే పద్ధతిలో నీ కుల ధర్మమైన రాజ్యపాలన చేపట్టు. మిగిలిన ఆలోచనలన్నీ విడిచిపెట్టు*.”
*అలా వ్యాసుడు చేసిన హితబోధతో ధర్మరాజులో గూడుకట్టుకున్న విచారం మాయమైంది*.
*శుభోదయం*
No comments:
Post a Comment