Saturday, May 31, 2025

 *కురుక్షేత్ర యుద్ధంలో విజయం తర్వాత ధర్మరాజులో చెప్పలేనంత విచారం కమ్ముకుంది.  అందుకు కారణం*….  *అభిమన్యుడు, ఉపపాండవులు, కర్ణుడు,  విరాట మహారాజు,  దుష్టద్యుమ్నుడు, భీష్ముడు, ద్రోణాచార్యుడు, ద్రుపదుడు మొదలగు పియ్రమైనవారిని, బంధువులను యుద్ధంలో కోల్పోవడమే*. *అంతమంది మరణానికి కారణమైన కురుక్షేత్ర సంగ్రామాన్ని నివారించలేకపోయానని, ప్రియమైనవారి మరణంతో పొందే రాజ్యం నెత్తురు కూడుతో సమానమని భావించాడు ధర్మరాజు. అలాంటి ఆలోచనలతో రాజ్యపాలన చేయడానికి సుముఖత వ్యక్తపరచలేదు*.  

 *ఆ పరిస్థితుల్లో వ్యాసమహర్షి వచ్చి ధర్మరాజుతో   “ రాజ్యపాలన కోసమే క్షత్రియులను పుట్టించాడు  బ్రహ్మదేవుడు. ఆ  ధర్మాన్ని నువ్వు ఆచరించాల్సిందే* . *నీకు నువ్వేదో ఊహించుకుంటూ విచారానికి లోనవుతుంటే బ్రహ్మదేవుడి రాతకు విలువ ఉండదు. సృష్టిలో పదార్థాలు వృద్ధి చెందుతున్నాయంటే అవి నశించడానికేనని*,  *ఎత్తుగా ఎదగడం విరిగిపడేందుకేనని, దగ్గరగా రావడం *దూరమయ్యేందుకేనని, పుట్టడం గిట్టడానికేనని,   సుఖపడటం కష్టాలు పడేందుకేనని గ్రహించాలని” చెప్పాడు*.  
*ధర్మరాజులో అంత తొందరగా మార్పు కనబడలేదు. వ్యాసమహర్షి ఇంకా ఇలా హితబోధ చేసాడు*. 

 *విదేహ రాజైన జనకుడు బ్రహ్మజ్ఞానం పొందని సమయంలో ఆయన బంధువులు చనిపోగా కలిగిన దుఃఖంతో ఇల్లు విడిచి పోవాలనుకున్నాడు*.  *ఆయనకు కూడా నీకు వచ్చినట్టే విచారం, వైరాగ్యంఆవహించాయి.  అశ్మకుడనే బ్రాహ్మణుడు  ఆయనకు  హితబోధ చేశాడు. దాన్నే నీ అవగాహన కోసం వినిపిస్తాను*.  
 
*జీవితములో కష్టసుఖాలనేవి  కావడి కుండల్లా కలిసే ఉంటాయి*. *మేఘాల్ని గాలి చెదరగొట్టి నట్లు వాటికి లోబడి పోయేవారి  ఆత్మను చెదరగొడతాయి.ఎప్పుడూ సుఖాలను మాత్రమే పొందేవారు*, *ఎప్పుడూ దుఃఖాల్ని పొందేవారు   లోకంలో  ప్రత్యేకంగా  ఉండరు.  ఈ భూమండలానికి చక్రవర్తి అయినంత మాత్రాన ముసలితనాన్ని,  మరణాన్ని తప్పించుకోలేరు.  ఏది జరిగినా దైవ నిర్ణయమనే భావాన్ని అలవర్చుకోవాలి. అదే జ్ఞానుల పద్ధతి*.   

 *వైద్యులు  రాత్రింబవళ్లు శ్రమించి వైద్యశాస్త్రమంతా అధ్యయనం చేసి వ్యాధులకు ఏ  మందులు వాడాలో చక్కగా నేర్చుకుంటారు. రోగులు,  స్త్రీల దోషాల్ని తెలివితేటలతో గుర్తించి  వైద్యం చేస్తారు*.  *అంత శ్రమించినా ఒక్కొక్కసారి రోగం తగ్గదు .  వైద్యుల్ని కూడా రోగాలు బాధ పెడుతుంటాయి. దీన్ని బట్టి మానవుడి నేర్పు,  తెలివితేటలు కూడా  విధి వైపరీత్యాలను మార్చలేవని,  మానవుడి తెలివితేటల కంటే విధి బలమైనదని తెలుస్తోంది*. 

*శారీరక అందచందాలు,  బలం,  ఆరోగ్యం ,  అదృష్టం ,  భోగాలు  మొదలైనవన్నీ పూర్వ జన్మ కర్మఫలాన్ని అనుసరించి ఏర్పడతాయి*.  *ఇవన్నీ  మానవులు కోరితే వచ్చేవి,  వద్దనుకుంటే పోయేవి కాదు. దైవ ప్రేరితాలు.   ప్రవాహంలో గడ్డి పరకలు కలసి ప్రయాణం చేస్తూ  కొంతసేపయిన తర్వాత విడిపోతున్నట్టే బంధుత్వాలు కూడా తాత్కాలికమైనవే*. 

   *జనన మరణం వలయంలో అనేక మంది తల్లిదండ్రులని,  భార్యా పిల్లల్ని,  బంధువుల్ని పొందుతూ ఉంటారు.  వీరిలో  ఏ జన్మలో బంధుత్వం కోసమని దుఃఖించాలి. బంధుత్వాలు అశాశ్వతమని తెలుసుకోవడమే జ్ఞానం*. 

 *కాలమనే సముద్రంలో జనన మరణాలనేవి మొసళ్ల వంటివని తెలుసుకొని శోకాన్ని వదిలి ధర్మ మార్గంలో నడవాలి*.  *మానవుడి శరీరమే కొన్నాళ్ళు భూమి మీద జీవించడానికి అప్పుగా తెచ్చుకున్నది.  శరీరమే సొంతం కానప్పుడు బంధుమిత్రుల మాట ప్రత్యేకంగా చెప్పక్కరలేదు.  బంధుత్వాలన్నీ కూడా అశాశ్వతమైనవే*. 

 *పుట్టుక చేత రాజ్యపాలన చేయడం నీ ధర్మం . మిగిలినవన్నీ మర్చిపోయి ముందుగా ఆ పని చెయ్యి*.  *ఇంకా నీలో ఉన్న సందేహాలు,  మాలిన్యాలను  సత్పురుషుల సాంగత్యంలో నివృత్తి చేసుకో. అలా అశ్మకుడు చేసిన ఉపదేశంతో వైరాగ్యపు పొరలు విడిపోయి రాజ్యపాలన చేపట్టాడు జనకమహారాజు*.  *నువ్వు కూడా అదే పద్ధతిలో నీ కుల ధర్మమైన రాజ్యపాలన చేపట్టు.  మిగిలిన ఆలోచనలన్నీ విడిచిపెట్టు*.” 
*అలా వ్యాసుడు చేసిన హితబోధతో ధర్మరాజులో గూడుకట్టుకున్న విచారం  మాయమైంది*. 
  *శుభోదయం*

No comments:

Post a Comment