*☘️వేదమూర్తుల స్తుతులు☘️*
*(11 వ భాగము)*
*ఈ సందర్భములో శ్రీధరస్వామి ఒక చక్కని శ్లోకాన్ని రచించారు. "కొందరిచే మిథ్యగా భావించబడెడి ఈ భౌతికజగత్తు నందును సత్యముగా ప్రకటమయ్యెడి భగవంతుని నేను భజిస్తాను." భౌతికజగత్తు మిథ్య యనెడి భావన జ్ఞానరాహిత్యము వలననే కలుగుతుంది. కాని కృష్ణభక్తిలో పురోగమించినవాడు. భగవంతుని సమస్తము నందు దర్శిస్తాడు. “సర్వం ఖల్విదం బ్రహ్మ - సమస్తము బ్రహ్మమే" అనెడి మహావాక్యము యొక్క అసలైన అనుభూతి ఇదే.*
*వేదమూర్తులు ఇంకను స్తుతించారు "దేవా! అల్పబుద్ధులు ఇతర ఆత్మానుభూతి పద్ధతులను చేపట్టినను విశుద్ధభక్తుడు కానిదే భౌతికకల్మషము నుండి శుద్ధిపడడానికి, నిరంతర జన్మమృత్యువలయాన్ని నిలపడానికి అవకాశమే లేదు. ప్రభూ! సమస్తము నీ వివిధ శక్తుల పైననే ఆధారపడియున్నది. 'ఏకో బహూనాం యో విదధాతి కామాన్' అని వేదాలలో చెప్పబడినట్లు ప్రతియొక్కరు నీ చేతనే పోషింపబడుతున్నారు.* *కనుక దేవతలు, మానవులు, పశువుల వంటి సకలజీవులకు నీవే రక్షకుడవు, పోషకుడవు. ఎల్లరు నీ చేతనే రక్షింపబడుతున్నారు. నీవు ఎల్లరి హృదయములలో కూడ విరాజమానుడవై ఉన్నావు. ఇంకొక రకంగా చెప్పాలంటే నీవే సమస్త సృష్టికి మూలానివి. కనుక నీ అనన్య భక్తియోగములో నెలకొని నిన్ను సర్వదా అర్చించేవారు నిజానికి విశ్వవృక్ష మొదలుకు నీరు పోసినవారే అవుతారు. కనుక భక్తియుత సేవచే మనిషి కేవలము భగవంతునే గాక సర్వులను కూడ సంతుష్టులను చేస్తాడు. ఎందుకంటే ఎల్లరు భగవంతుని చేతనే పోషింపబడి, రక్షింప బడుతున్నారు. భక్తుడు భగవంతుని సర్వవ్యాపకత లక్ష్యాన్ని అర్థము చేసికొన్న కారణంగా అనుభవసిద్ధమైన పరోపకారి, పరహితైషి అవుతాడు. కృష్ణభక్తిభావనలో దృఢంగా నెలకొని ఉండే అటువంటి విశుద్ధభక్తులు అవలీలగా జన్మమృత్యువులను అధిగమించి మృత్యువు శిరముపై నుండి దుమికి ముందుకు సాగుతారు." భక్తుడెన్నడును మృత్యువుకు లేదా నూతనదేహాన్ని పొందడానికి భయ పడడు. అతని చిత్తము కృష్ణ భక్తి భావనాయుతముగా మారిపోయి ఉంటుంది. భగవద్ధామానికి వెళ్ళకపోయినా, వేరొక భౌతికదేహాన్ని పొందవలసివచ్చినా అతనికి భయము అనవసరము. భరతుడే దీనికి చక్కని ఉపమానము. తదుపరి జన్మలో అతడు జింకదేహాన్ని పొందినప్పటికిని, ఆ తరువాతి జన్మలో అతడు భౌతికకల్మష విముక్తుడై భగవద్ధామానికి చేరుకున్నాడు. అందుకే భక్తుడెన్నడును నశింపడని భగవద్గీత ధ్రువపరచింది. ఆధ్యాత్మికజగత్తుకు భక్తుని పథము సునిశ్చితమై ఉంటుంది. భక్తుడు ఒకవేళ ఒక జన్మలో కొద్దిగా పతనం చెందినా అతని భక్తి యుత సేవ అతనిని ముందుకు పురోగమింపజేసి చివరకు భగవద్ధామానికి చేరుస్తుంది. విశుద్ధభక్తుడు తన అస్తిత్వాన్ని పునీతమొనర్చుకోవడమే కాకుండ అతనికి శిష్యుడైన వ్యక్తి కూడ పునీతుడై అనాయాసముగా భగవద్ధామానికి చేరుకోగలుగుతాడు. ఇంకొక రకంగా చెప్పాలంటే కేవలము విశుద్ధభక్తుడే మృత్యువును అధిగమించడము కాకుండ అతని కరుణచే అనుయాయులును. అవలీలగా ఆ పని చేయగలుగుతారు. భక్తియోగశక్తి ఎంతటి ఘనమైనదంటే విశుద్ధ భక్తుడు తన దివ్యోపదేశము ద్వారా అవిద్యాసాగర తరణానికై ఇంకొకని ఉత్తేజితుని చేయగలుగుతాడు.*
*శిష్యునికి విశుద్ధభక్తుడు చేసే ఉపదేశాలు కూడ సరళంగా ఉంటాయి. విశుద్ధ భక్తుని అనుసరించడములో ఎవ్వరికీ ఎటువంటి కష్టము కలుగదు. బ్రహ్మ, శివుడు, సనకాదులు, మనువు, కపిలుడు, ప్రహ్లాదుడు, జనకుడు, శుకదేవగోస్వామి, యమరాజు వంటి మహాజనులను వారి శిష్యపరంపరను అనుసరించేవానికి ముక్తి ద్వారము సులభంగా తెరచుకుంటుంది. ఇంకొక ప్రక్క భక్తులు గాక జ్ఞానయోగకర్మాది అనిశ్చయమైన ఆత్మానుభవ పద్ధతులలో నెలకొనేవారిని కల్మషులుగానే పరిగణించాలి. అటువంటి కలుషితవ్యక్తులు బాహ్యానికి ఆత్మానుభూతిలో పురోగమించినట్లు కనిపించినా తమనైనా ఉద్దరించుకోలేరంటే వారిని అనుసరించేవారి మాటను చెప్పేదేముంది? అటువంటి అభక్తులను గొలుసుతో కట్టివేయబడిన జంతువులతో పోల్చవచ్చును. ఎందుకంటే వారు ఒకానొక శ్రద్ధకు సంబంధించిన ఆచారాలను దాటిపోలేరు. భగవద్గీతలో వారు వేదవాదరతులని ఖండించబడ్డారు. వేదాలు సత్త్వరజస్తమోగుణయుత కర్మలతో ముడివడి యుంటాయని వారు. తెలిసికోలేరు. కాని శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశించినట్లు మనిషి వేదనిర్దేశిత కర్తవ్యాల పరిధిని దాటి భక్తియుత సేవను చేపట్టాలి. ఈ విషయాన్నే శ్రీకృష్ణుడు. భగవద్గీతలో "ని స్త్రైగుణ్యో భవార్జున అర్జునా! వైదిక అనుష్ఠానాలకు అతీతుడవు. కావడానికి యత్నించు" అని అన్నాడు. వైదిక అనుష్ఠాన కర్మలకు పరమైన ఈ దివ్యస్థితియే భక్తియోగము. తన అనన్య భక్తియోగములో నెలకొనినవారు బ్రహ్మములోనే నెలకొనినట్టివారని భగవంతుడు భగవద్గీతలో స్పష్టముగా చెప్పాడు. నిజమైన బ్రహ్మానుభూతి యంటే భక్తియుత సేవలో (కృష్ణభక్తిభావన) నెలకొనడమనియే అర్ధము. కనుక భక్తులే నిజమైన బ్రహ్మచారులు. ఎందుకంటే వారి వారి కార్యకలాపాలన్నీ భక్తియుత సేవలోనే ఉంటాయి.*
*అందుకే కృష్ణ చైతన్యోద్యమము నానారకాలైన ధార్మికులకు దివ్యమైన పిలుపు. నిచ్చి తన బాటలో చేరుమని అధికారముతో వారిని అడుగుతున్నది. దాని ద్వారా వారు భగవంతుని ప్రేమించే పద్ధతిని నేర్చుకొని ఆ విధంగా శాస్త్ర సిద్ధాంతాలను ఆచారాలను అధిగమించగలుగుతారు. మూసపోసిన ధర్మనియమాల పరిధిని దాటలేనట్టి వ్యక్తిని యజమానిచే గొలుసుతో కట్టివేయబడిన పశువుతో పోల్చవచ్చును. భగవంతుని తెలిసికోవడము, నిద్రాణముగా ఉన్నట్టి భగవత్ప్రమను జాగృత మొనర్చుకోవడమే ధర్మము యొక్క ప్రయోజనము. ధర్మనియమాలకు, సూత్రాలకు అంటి పెట్టుకునే ఉండియు భగవత్ప్రమస్థితికి రాలేనివాడు గొలుసుతో కట్టివేయ బడిన పశువే అవుతాడు. ఇంకొక రకంగా చెప్పాలంటే కృష్ణభక్తిభావనలో లేకపోతే మనిషి సంసార కల్మష విముక్తికి అర్హుడు కాబోడు.*
*ఈ సందర్భములో శ్రీల శ్రీధరస్వామి ఒక చక్కని శ్లోకాన్ని రచించారు: "కఠోరమగు తపస్సులు చేసినా, పర్వతపుటంచుల నుండి నేలపై దుమికి ప్రాణాలు విడిచినా, మోక్షము కొరకు పలు తీర్థస్థానాలు తిరిగినా, వేదాధ్యయనము తత్త్వాధ్యయనములో లోతుగా నెలకొనినా, ధ్యానములో మునిగినా, నానాతత్త్వ వాదములు చేసినా మనిషి కృష్ణభక్తిభావనాయుతుడు కానిదే, భక్తియోగములో నెలకొననిదే, భగవదనుగ్రహాన్ని పొందనిదే ఈ సంసార సాగరాన్ని దాటలేదు." అందుకే బుద్ధిమంతుడు మూసపోసినట్టి భావాలను విడిచి అసలైన మోక్షానికై కృష్ణచైతన్యోద్యమములో చేరుతాడు.*
💦🌸🌸 🌸🏵️🌸 🌸🌸💦
*"వేదమూర్తుల స్తుతులు" అను దశమస్కంధములోని భక్తివేదాంతభాష్యము ఇంకా వుంది*
💦🌸🌸 🌸🏵️🌸 🌸🌸💦
*☘️\!/సర్వం శ్రీకృష్ణార్పణమస్తు\!/☘️*
*┈┉┅━❀꧁ హరే కృష్ణ ꧂❀━┅┉┈*
*SPIRITUAL SEEKERS*
🍁🦚🍁 🙏🕉️🙏 🍁🦚🍁
No comments:
Post a Comment