207e4;
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀6️⃣```ప్రతిరోజూ...
మహాకవి బమ్మెర పోతనామాత్య..
```
*శ్రీమద్భాగవత కథలు*
➖➖➖✍️```
(రామకృష్ణ మఠం, హైదరాబాద్ ప్రచురణ ఆధారంగా)```
_________________________
*భాగవత జ్వాల*
*భక్తుల కథల ద్వారా..*
*భగవంతుని కథ*
```
భాగవతం భగవంతుడి కథ వలె కనిపించినా నిజానికి అది భక్తుల కథల సమాహారం.
మహాభారతంలో కూడా శ్రీ కృష్ణ భక్తుల కథలు ఉన్నాయి. నిజానికి భీష్ముడు, అర్జునుడు, విదురుడు, ద్రౌపది అత్యున్నతమైన శ్రీ కృష్ణ భక్తులు. వారిలో ఒక్కరిని మాత్రం రక్షించలేకపోగా శిక్షించవలసి వస్తుంది. అది భీష్ముడు. దగ్గరుండి మరీ భీష్ముడిని సంహరింప చేస్తాడు శ్రీ కృష్ణుడు. అందుకు బాధ పడతాడు కూడా. మిగిలిన శిష్యుల రక్షణకే మిగతా కథ అంతా.
భక్త శత్రువుల సంహార కథా విహారం. తన భక్తులను భగవంతుడు ఏ విధంగా కాపాడుకున్నాడు అని వివరించే ఉదాహరణాత్మక వివరణా సంపుటి భాగవతం. రెండింటికథాకథనాలు గమనిస్తే, భారతపు కొనసాగింపే భాగవతమా అనిపిస్తుంది.
అర్జునుడు పాండవ పుత్రులను చంపిన అశ్వత్థామను బంధించి తేవడం, తరువాత అతని శిరోమణిని గ్రహించి శిరోజాలను ఖండించి వదిలేయడం, శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో ఉత్తర గర్భస్థ శిశువు (పరీక్షిత్తు) ను రక్షించడం, కుంతీదేవి శ్రీకృష్ణుడిని స్తోత్రం చేయడం, ధర్మరాజు శ్రీకృష్ణుడితో కలిసి, మరణించడానికి సిద్ధంగా వున్న భీష్ముడి దగ్గరికి పోవడం, భీష్ముడు శ్రీకృష్ణుడిని స్తుతించడం, వాసుదేవుడిలో భీష్ముడు ఐక్యం కావడం, ఉత్తరకు పరీక్షిత్తు జన్మించడం. గాంధారీ-ధృతరాష్ట్రులు దేహత్యాగం చేసుకోవడం, ధర్మరాజు దుశ్శకునాలు చూసి విచారపడడం, అర్జునుడు ద్వారక నుండి వచ్చి శ్రీకృష్ణ నిర్మాణం గురించి ధర్మరాజుకు చెప్పడం, పరీక్షిత్తు పట్టాభిషేకం-పాండవుల స్వర్గారోహణం, పరీక్షిత్తు మహారాజుగా భూదేవి ధర్మదేవతల సంవాదం వినడం, కలిపురుషుడు ధర్మ దేవతను తన్నడం, పరీక్షిన్మహారాజు కలిని నిగ్రహించి ధర్మపాలన చేయడం, పరీక్షిత్తు శమీక మహర్షి మీద మృత సర్పాన్ని వేయడం, శమీక పుత్రుడు శృంగి పరీక్షిత్తును శపించడం, శుకుడు పరీక్షిత్తుకు ముక్తిమార్గాన్ని తెలియచేయడం, 'విరాట్పురుషుడైన శ్రీమన్నారాయణుడిలో పద్నాలుగు లోకాలలో జరిగిన-జరుగుతున్న-జరగబోతున్న సమస్త విషయాలు కనిపిస్తాయి. నేల, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, అహంకారం, మహత్తు అనే తత్త్వాలు ఈ విగ్రహం యొక్క అవరణాలు. ఇవి బ్రహ్మాండకోశమైన విరాట్ రూపుడి చుట్టూ పొరలు పొరలుగా చుట్టి ఉంటాయి. ఈ దేహంలో తేజరిల్లే ఆ విరాట్ స్వరూపుడే చిత్తం, ఏకాగ్రతకు చోటైన వాడు... అని చెప్పడం, శ్రీమన్నారాయణుడి లీలావతారాలు, పరీక్షిత్తు శుక మహర్షిని ప్రపంచోత్పత్తి, శ్రీవిష్ణువు వల్ల బ్రహ్మరుద్రాదిలోక ప్రపంచం ఉద్భవించడం వివరిస్తుందీ పురాణం. తరువాత భక్తుల కథలు ఉంటాయి.```
*సృష్టి రహస్యాలు:*```
మన ప్రపంచం ఈ భూమి ఏవిధంగా పుట్టాయి అనే ప్రశ్నకు సమాధానం భాగవతం.
“విరాట్ పురుషుడి హృదయాకాశం నుండి ఓజస్సు, సహస్సు, బలం అనే ధర్మాలు పుట్టాయి. సూక్ష్మమైన క్రియాశక్తి వల్ల ప్రాణం పుట్టింది. జీవుడి వెన్నంటి ఆ ప్రాణాలు బయటకు పోతుంటాయి. ఆకలిమంటలు, ఓర్చుకోలేని దాహం కలుగుతాయి. నోటి నుండి దవడలు, నాలుక మొదలైనవి పుట్టాయి. ముఖం నుండి శోభిల్లి 'పలుకు' తన రూపాన్ని కోరుకుంటుంది. మాట్లాడాలనే సంకల్పం కలుగుతుంది. విరాట్ పురుషుడి ముఖం నుండి వాక్కు పుట్టింది. దీనికి దేవత అగ్ని.
అగ్ని, వాక్కు (మాట) కలయిక వల్లే సంభాషణం వెలువడింది.
మహావాయువు వల్ల ముక్కు పుట్టింది. తేజస్సు నుండి రెండు కళ్ళు పుట్టాయి. సాక్షాత్తు భగవంతుడే చెవికి కారకుడయ్యాడు. దీని దేవత దిక్కులు. పుట్టుకలను కల్పించే పురుషుడి వల్ల చర్మం పుట్టింది. దాన్నుండి రోమాలు పుట్టాయి. వాయువు నుండి చేతులు పుట్టాయి. ఈశ్వరుడి శరీరం నుండి పాదాలు పుట్టాయి. వీటి దేవత విష్ణువు. భగవంతుడి వల్లే పురుషాంగం, స్త్రీ అంగం పుట్టాయి. స్త్రీ-పురుషుల కలయిక వల్ల సంతానం కలుగుతుంది. ఒక శరీరం నుండి మరో శరీరానికి చేరుకోవాలనుకున్నప్పుడు బొడ్డు అనే ద్వారం పుట్టింది. ప్రాణ- అపాన వాయువులను బంధించడానికి స్థానమయింది ఆ బొడ్డే. ఆ బంధం తొలగించడమే మరణం. అలాగే పేగులు, పొట్ట, నాడీ మండలం నిర్మితమయ్యాయి. కామానికీ, సంకల్పానికీ నెలవైన హృదయం పుట్టింది. ఆ తరువాత విరాట్ పురుషుడి తనువు నుండి సప్త ధాతువులు (త్వక్కు, చర్మం, మాంసం, రక్తం, మేధ, మజ్జ, ఎముకలు), ఏడు ప్రాణాలు (భూమి, నీరు, తేజస్సు వగైరా), ఇంద్రియాలు, అహం నుండి పుట్టిన స్వభావాలు, మనస్సు, మతి పుట్టాయి, ఇవన్నీ
ఆ పరమేశ్వరుడి స్థూల శరీర భాగాలే! ఇలా ఆ విరాట్ పురుషుడి ఈశ్వర రూపానికి తుదీ-మొదలు ఉండదు”. ఎంత సరళంగా ఉందీ సృష్టి క్రమం? ఇదీ జ్వాలానరసింహారావు రచనా విశేషం.
బాలుడైన ధ్రువుడు తండ్రి అంకపీఠంపై తనకు స్థానం ఇవ్వడంలేదని బాధపడి ఏకాగ్రతతో హరి కోసం తపస్సు చేయడం శ్రీహరిని సాక్షాత్కరింపజేసుకోవడం అనే భక్త విజయం ముఖ్యమైన కథ.
శ్రీ హరి వేదశాఖలను ఉద్దరించడంకోసం పరాశరుని కొడుకు వ్యాసుడుగా అవతరిస్తాడు. తరువాత కథల్లో శ్రీకృష్ణ నిర్మాణం, జగదుత్పత్తి లక్షణాల వివరణ, బ్రహ్మదేవుని జన్మ, బ్రహ్మకు నారాయణుడి ఉపదేశం, కాల నిర్ణయం, దితి కశ్యప సంవాదం. సనకసనందనాదుల శాపానికి గురై జయవిజయులు విష్ణువు శత్రువులుగా మూడు జన్మలు ఎత్తడం, హరి వారిని సంహరించడానికి నాలుగు వరాహ, నారసింహ, రామ, కృష్ణ - అవతారాలు ఎత్తడం, కపిలాచార్య అవతారం కథలు వివరిస్తారు. దక్షప్రజాపతి సంతాన కథలు, దక్షయజ్ఞధ్వంసం. ఒకటి తరువాత ఒక కథ వస్తూ ఉంటుంది. జడభరతుని కథ చాలా హృద్యంగా ఉంది.
'ఋగ్యజుస్సామాధర్వాది నాలుగు వేదాలు, ధనుర్వేదం, ఆయుర్వేదం, గాంధర్వవేదం, అధర్వవేదం అనే నాలుగు ఉపవేదాలు, పద్దెనిమిది స్మృతులు, ఇతిహాసాలు, పురాణాలు పుట్టిన తీరుతెన్నులు ఎలాంటివి? కల్పాల నడుమ సంభవించే ప్రళయం, దాని రూపు, కల్పాంతంలో సంభవించే పెద్ద ముప్పు ఎలా ఉంటుంది? యాగాది సంబంధిత కర్మలు, నూతులు, కొలనులు, చెరువులు, గుళ్లు లాంటి వాటి నిర్మాణం, అన్నదానం, ఉపవనాల ఏర్పాటు, ధర్మశాస్త్రాలు వచించిన పనులు ఎలా చేయాలి? హోమాదుల ఆచరణ పద్ధతులు, ప్రాణుల పుట్టుక, ధర్మార్థకామాలనే మూడు పురుషార్థాలను అమలుపరిచే తీరు, దైవాన్ని, వేదధర్మాలను విశ్వసించనివారి జన్మలు, జీవాత్ముడిని కట్టి వుంచే విధం, ముక్తిని సాధించే తీరు, తన ఇచ్చానుసారం సంచరించే ఈశ్వరుడి విషయం, సర్వాధిపతిగా భగవానుడు జీవులతో వినోదించే విధానం.' వివరిస్తూ ఇదంతా భాగవతమే అంటాడు శుకుడు.
ఇక భాగవత సారం ఏమంటే: 'జీవికి శరీరంతో సంబంధం కలిగే అవకాశం ఎలా ఏర్పడుతుందనేది చాలా ముఖ్యంగా అవగాహన చేసుకోవాల్సిన అంశం. పరమేశ్వరుడి మాయ లేకపోతే ఆ బంధం ఏర్పడదు. జీవి విష్ణుమాయా మహిమవల్ల పంచ భూతాలతో కూడిన దేహసంబంధం కలవాడు అవుతాడు. ఆ మాయ వల్లే జీవి బాల్యం, కౌమారం, యవ్వనం అనే వయో వ్యవస్థలను పొందుతాడు. విష్ణుమాయా ప్రభావం వల్లే జీవి మానవుడిగానో, దేవతగానో ఆకారం పొందుతాడు. “నేను”, “ఇది నాది” అనే భావనలతో సంసార మాయకు కట్టుపడి పోతాడు. పరమాత్ముడి మాయే అన్నిటికీ మూలకారణం. ఇలా బంధితుడైన ప్రాణికి భగవంతుడి మీద భక్తి కలగడం వల్ల మోక్షం ఏవిధంగా కలుగుతుందనేది ప్రశ్నార్థకం. అదెలా అంటే, ఎప్పుడూ జీవిలో ప్రకృతినీ, పురుషుడినీ అధిగమించే “బ్రహ్మతత్త్వం” ఉంటుంది. బ్రహ్మ ధ్యానంలో జీవి శ్రద్ధ చూపినప్పుడు మోహం వీడిపోతుంది. “నేను”, “నాది” అనే సంసార బంధం వదిలిపోతుంది. దాంతో మోక్షాన్ని పొందుతాడు!.
భగవన్మాయ, జగత్తు నిర్మాణం, బ్రహ్మజన్మ వృత్తాంతం, కాలలక్షణ నిరూపణ, బ్రహ్మసృష్టి మహిమ, కపిలాచార్యుని తత్వజ్ఞానం, భక్తియోగం, పిండోత్పత్తి క్రమం గురించి వివరాలు విచిత్రంగా ఉంటాయి.
అజామిళుడి భక్తి కథ వివరించిన తరువాత దక్షప్రజాపతి జననం ఆ తరువాత సకల జీవరాశుల సృష్టి, పిదప శ్రీమన్నారాయణ కవచం ఏమిటో వివరించడం, వృత్రాసురుడి కథ, దేవాసుర సంగ్రామం, ఇంద్రుడితో పోరాటం, ఇంద్రుడి చేతిలో వృత్రాసురుడి వధ గురించి వ్రాస్తారు. వృత్రాసుడు పూర్వజన్మలో పరమ విష్ణు భక్తుడనే కథ చెబుతారు.
ఏడో స్కంధంలో అనేక అంశాలతోపాటు అతి ముఖ్యమైన ప్రహ్లాదుడి చరిత్ర, నృసింహావతారం, హిరణ్యకశిపుడి సంహారం గురించి ఉంటుంది. హిరణ్య కశిపుని వధ తరువాత అతనికి విష్ణువుమీద పగ ఎందుకు వచ్చిందో వివరిస్తారు. త్రిపురాసుర సంహారం కథ కూడా సప్తమ స్కంధంలోనే ఉంటుంది.
ఎనిమిదో స్కంధంలో గజేంద్ర మోక్షం, క్షీరసాగర మథనం, మత్స్య, కూర్మ, బలి చక్రవర్తి, వామనుడు దానం అడగడం, తరువాత, త్రివిక్రముడై బలిని పాతాళానికి తొక్కిన ఉదంతాలుంటాయి. విష్ణువు పాలకడలిని మథించడం, కూర్మాకృతిలో మందర పర్వతాన్ని కవ్వంగా మోయడం, మోహినీ అవతారం ఎత్తడం, దేవతలకు అమృతాన్ని పంచడం లాంటి భగత్కథా విశేషాలన్నీ వివరించారు. నవమ స్కంధంలో ప్రత్యేకంగా చదవాల్సినవి అంబరీషోపాఖ్యానం, శ్రీరామచరిత్ర, పరశురాముడి చరిత్ర, శకుంతల దుష్యంతుల కథ మొదలైన 35 అంశాలు. ఇక్ష్వాకుడు, మాంధాత, హరిశ్చంద్రుడు, సగరుడు, భగీరథుడి కథలు, రంతిదేవుడి చరిత్ర, పాంచాల వంశాల వివరాలు ఉంటాయి.✍️
(సశేషం)
🙏కృష్ణం వందే జగత్ గురుమ్!🙏
రచన:శ్రీ వనం జ్వాలా నరసింహారావు ```
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
No comments:
Post a Comment