Tuesday, October 21, 2025

 *నిద్రలేవగానే ఎవర్ని చూడాలంటే...!!!🙏*
తెల్లవారి లేవగానే ఎవరి ముఖం చూశానో అని దాదాపు 90శాతం మంది ఈ మాట అనుకోకుండా ఉండరు. 
మంచి జరిగినా, చెడు జరిగినా…కారణం ఏదైనా నిద్రలేవగానే ఎవరి ముఖం చూశా అనే ఆలోచన వస్తుంది. 
కొందరు ఉదయాన్నే కళ్లు తెరవగానే దేవుడి ఫొటో చూస్తారు. మరికొందరు భార్య లేదా భర్త ముఖం చూస్తారు… ఇంకొందరు తల్లిదండ్రులు, పిల్లల ముఖం చూస్తారు. 
_ఇంతకీ ఉదయం మేల్కొనగానే ముందుగా ఏం చూడాలి..? ఫలితం ఏంటి..?_
చాలామంది నిద్రలేవగానే అరచేతులను చూసుకుంటారు, వాళ్లు తెలిసి చేసినా తెలియక చేసినా అదే మంచిది. 

*ఎందకనేది ఈ శ్లోకం ద్వారా తెలుసుకుందాం...!!*

శ్లో|| "కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి
కరమూలే స్థితాగౌరి ప్రభాతే కరదర్శనం"
కరాగ్రే వసతే లక్ష్మీ…అంటే చేయి పైభాగాన లక్ష్మీదేవి..
 కర మధ్యే సరస్వతి.. మధ్యభాగంలో సరస్వతి.
 కర మూలే స్థితా గౌరీ.. చివరి భాగంలో గౌరీదేవి కొలువై ఉంటారు.

 ప్రాతః కాలంలో ఈ శ్లోకం చదివి రెండు చేతులూ కళ్లకు అద్దుకుని లేవాలి. 
_అయితే కోట్లాది దేవతలుండగా…నిద్రలేవగానే ఈ ముగ్గురినీ మాత్రమే ఉదయాన్నే ఎందుకు స్మరించాలంటే...?_
ఏ పని చేసినా చేతి చివరిభాగం ప్రధాన పాత్ర వహిస్తాయి. 
చేతి వేళ్లతో ఎంత పని చేస్తే అంత లక్ష్మీదేవి. 
అంటే ఎంత కష్టపడితే అంత ఫలితం…అంత డబ్బు నీ సొంతమవుతుంది. 
అందుకే చేతులు చివరి భాగం లక్ష్మీసమానం.

 సరస్వతీ కటాక్షం సిద్ధించాలన్నా…చదువుపై శ్రద్ధ పెరగాలన్నా చేతుల మధ్యలో పుస్తకాన్ని పెట్టుకుని చదవాలి. 
అంటే కరమధ్యే సరస్వతి, చదువుపై ఎంత శ్రద్ధ, పుస్తకాన్ని పట్టుకోవడంలో ఎంత నిబద్ధత ఉంటే అంత సరస్వతీ కటాక్షం అన్నమాట. 
కరమూలే స్థితా గౌరీ.....అంటే…చేతిమూలం మీదే శక్తంతా ఉంటుంది. 
నేలపై పడినప్పుడైనా, పైకి లేచేటప్పుడైనా చేతి తమ్మిభాగంలో ఆనుకుని లేస్తాం. 
అంటే పైకి లేపే శక్తి అంతా చేతి మణికట్టుదగ్గరే. 
అమ్మవారి స్వరూపాన్నే శక్తి అంటాం. 
ఆ స్వరూపం గౌరీదేవి, అందుకే కరమూలే స్థితా గౌరీ అని చెబుతారు.

జీవితంలో ఎప్పుడైనా కిందపడితే… నీ చేతుల ఆధారంతో ఎలా పైకి లేస్తావో…జీవితంలో కష్టాలను ఎదుర్కొని అలాగే పైకి లేచి నిలబడాలని అర్థం. 

ఇంకా ఒక్కమాటలో చెప్పాలంటే నిన్ను నువ్వే నమ్ముకో…మంచైనా, చెడైనా నీ చేతిలోనే ఉంది. 
అందుకే అంటారు కదా చేతులారా చేసుకున్నావ్ అని. 

అందువల్ల ఆ చేతుల్లో కొలువైన్న అమ్మవార్లకి నమస్కరిస్తూ నిద్రలేస్తే అంతా శుభమే. 
నిద్రలేచిన తర్వాత మన పాదం భూమిపై మోపే సమయంలో భూమికి నమస్కరించడం మరువకూడదు. 
ధర్మ శాస్త్రాల ప్రకారం ఇలా చేయడం వలన భూమాత నుంచి ప్రత్యక్షంగా ఆశీర్వాదాలు పొందుతామని విశ్వసిస్తుంటారు, ఫలితంగా దైనందిన జీవితంలో సంతోషంతో పాటు సంపద కూడా పెరుగుతాయని విశ్వాసం.

 అలాగే బంగారం, సూర్యుడు, ఎర్రచందనం, సముద్రం, గోపురం, పర్వతం, దూడతో ఉన్న ఆవు, కుడి చెయ్యి, బొట్టుపెట్టుకుని అందంగా అలంకరించుకున్న భార్యను ఉదయం లేవగానే చూస్తే చాలా మంచి జరుగుతుంది. 

ఓం నమో నారాయణాయ 🙏🌿🙏
ఓం నమ:శ్శివాయ 🙏☘️🙏

No comments:

Post a Comment