*మధురాంతకం శ్రీవైష్ణవ అభిమానం క్షేత్రం...............!!*
*శ్రీవైష్ణవ ఆచార్యుడు అయిన రామానుజుల వారికి పంచ సంస్కారములు జరిగిన ప్రదేశం.. తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలో ఉన్న చిన్న పట్టణం.ఈ మధురాంతకం.*
*రావణ సంహారం జరిగాక రాములవారు సీతా సమేతుడై అయోధ్యకు తిరిగివెళుతూ భరద్వాజ మహర్షి ఆశ్రమం వద్ద ఆగారు. అక్కడ పుష్పక విమానం దిగి భరద్వాజ మహర్షిని సేవించారు. పుష్పక విమానం దైవవిమానం కావటం చేత భూమిని తాకదు. కొంత ఎత్తులో నిలిచి వుంటుంది. రాములవారు సునాయాసంగా విమానం దిగారు.*
*సీతమ్మ సుకుమారి కనుక దిగటానికి అవస్థ పడింది. రాములవారు ఆమెకు చేయూతనిచ్చి దింపుకున్నారు. అది చూచిన భరద్వాజ మహర్షి సీతాకల్యాణవైభోగం సేవించలేనివారికొరకు అదే విధంగా తిరుక్కల్యాణ తిరుక్కోలంలో వేంచేసి వుండి భక్తుల ననుగ్రహించాలని కోరారు. అలాగేనని సీతారాములు అదే విధంగా వేంచేసి భక్తులననుగ్రహిస్తున్నారు.*
ఆనాటి భరద్వాజాశ్రమమే నేటి మధురాంతకమని ఐతిహ్యం. మూలస్థానంలో సీతారాములు కల్యాణతిరుక్కోలంలో చేతులు కలుపుకొని సీతామాతఎడమచేయి రాములవారికుడిచేతిలో పట్టి దర్శనమిస్తారు. స్వామికి ఎడమభుజంవైపు లక్ష్మణస్వామి వేంచేసి వుంటారు. ధ్వజస్తంభం వద్ద గరుడులవారిసన్నిధి వుంటుంది. ఆలయం బయట కోనేరు పక్కన ఆంజనేయుడి సన్నిధి వుంటుంది.
కాంచీపురంలోని శ్రీ వరదరాజ పెరుమాళ్ మందిరము లో ఉన్న తిరుకచ్చినంబి ద్వారా రామానుజుల వారికి శ్రీరంగంలోని పెరియ నంబి వారి దగ్గరికి వెళ్ళమని ఆదేశం లభించింది. ఆ ప్రకారం రామానుజులవారు శ్రీరంగం బయలుదేరారు.అక్కడ శ్రీరంగంలో పెరియ నంబి వారికి రామానుజులవారి ని శ్రీరంగం తీసుకురమ్మని శ్రీ రంగనాథ స్వామివారి ఆదేశం. స్వామి ఆదేశానుసారం పెరియ నంబి కాంచీపురానికి బయలుదేరారు.ఇద్దరూ మధురాంతకం లో కలిశారు.
పెరియనంబివారు కాంచీపురంలో రామానుజుల వారికి సమాశ్రయం అనుగ్రహించాలని అనుకున్నారు . కానీ రామానుజుల వారు గతంలో తాము శ్రీరంగంలో యామునులవారిని సేవింపబోగా అప్పటికే వారు పరమపదించిన విషయం జ్ఞాపకం చేసి క్షణభంగురమైన జీవితంలో గతకాలం మరలిరాదని, తమకు గల ఆర్తి గమనించి అక్కడే సమాశ్రయం అనుగ్రహించాలని వేడుకొన్నారు . సరేనని పెరియనంబివారు అక్కడి శ్రీ కోదండ రామ చంద్ర స్వామి వారి కోవెలలో విడిది చేస్తారు.
రామానుజులవారు శ్రీ వరదరాజ స్వామి వారి ఆదేశానుసారం పెరియ నంబి వారిని ఆచార్యులుగా స్వీకరించి వారిచే సింహమాసం శుక్ల పంచమి తిథి నాడు పంచసంస్కారములను పొందిన పవిత్ర ప్రదేశం ఈ మధురాంతకం లోని శ్రీ కోదండ రాముల వారి కోవెల అప్పటివరకు రామానుజులవారు గృహస్థాశ్రమంలో ఉన్నారు.
కావున ఇక్కడ వారు అంచులున్న తెల్లని పంచ కట్టుతో దర్శనమిస్తారు.
ఈ కోవెలలో రామానుజుల వారికి సమాశ్రయం అనుగ్రహించటానికి వినియోగించిన శంఖచక్ర ముద్రలను చూడవచ్చు.. ఈ కోవెలలో కుడివైపు జనకజవల్లి తాయార్ , ఎడమవైపు ఆణ్డాళ్ సన్నిధులు,చక్రత్తాళవార్ సన్నిధి ఆళవార్ సన్నిధి, రామానుజుల వారి సన్నిధిలోనే పెరియనంబివారు,విడిగా వేదాంత దేశికుల వారి సన్నిధి వున్నది.
వెలుపలి ప్రాకారంలో ఆణ్డాళ్ సన్నిధి వెనుక పక్కన ఉన్న చిన్న మండపంలో రామానుజుల వారికి పెరియ నంబి పంచ సంస్కారములు చేస్తూ ఉన్నట్లు చిత్రీకరించి ఉంటుంది.
శ్రీమతే రామానుజాయ నమః.
No comments:
Post a Comment