Wednesday, July 14, 2021

రావ్ బహుద్దూర్ వీణం వీరన్న..!

రావ్ బహుద్దూర్ వీణం వీరన్న..!

----------------------------------------

( దయచేసి ఈ వ్యాసాన్ని మన యువతకు షేర్ చెయ్యండి, తప్పకుండా ఇటువంటి మహనీయుల కోసం తెలియ చెయ్యాల్సిన బాధ్యత మనపై ఉంది )

ఉభయ గోదావరి జిల్లాలు సస్యశ్యామలం అవటానికి కారకుడు...సర్ ఆర్ధర్ కాటన్ దొర ..!

ఆయనకు సహకరించిన తొలి తెలుగు ఇంజనీర్ వీణం వీరన్న గారు...!

ఈ గోదావరి జిల్లాలను ‘అన్నపూర్ణ’ లా మార్చిన కాటన్‌దొర గారికి వెన్నెముకలా నిలిచిన ఇంజినీరు ఎవరు అంటే దాదాపు చాలా మందికి తెలియదు.

చరిత్ర ‘చీకట్ల’లో కలసిపోయిన ఆయన పేరే శ్రీ #వీణంవీరన్న గారు ..!

బ్రిటిష్ వారు అయిన కాటన్ దొర కు తనది కాని ప్రాంతంలో....తన భాష కాని వాళ్లతో అంత పెద్ద నిర్మాణ పనిని తలకెత్తుకున్న ఆయనకు తలలో నాలుకలా నిలిచారు వీరన్న గారు ...!

శ్రీ వీణం వీరన్న గారు వీరరాఘవమ్మ ..కొల్లయ్య దంపతులకు 1794. ..మార్చి 3న జన్మించారు.

తండ్రి కొల్లయ్య మచిలీపట్టణంలో బ్రిటిష్‌ ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగిగా చేసేవారు.
వీరన్న గారి ప్రాథమిక విద్యను రాజమండ్రిలో పూర్తి చేసుకున్నారు.

ధవళేశ్వరానికి చెందిన శ్రీమతి వెంకాయమ్మ గారితో వీరన్న గారికి వివాహమైంది. వారికి వెంకటరత్నం, జనార్దనస్వామి...కొల్లయ్య...సీతారామస్వామి...బాపమ్మలు సంతానం.

మచిలీపట్టణం ఆంగ్లోఇండియన్‌ కళాశాలలో ఉన్నత విద్యను పూర్తిచేసిన వీరన్న గారు... తన తండ్రి సూచన మేరకు ఇంజినీరింగ్‌ చదివేందుకు బెంగాల్‌ వెళ్లారు.

అప్పుడు ఆంగ్లేయుల ప్రధాన పాలన కేంద్రం కలకత్తా ... ఇంజినీరుగా ఆయన శిక్షణ మాత్రం మద్రాసులో సాగింది.

1840 నాటికి #రాజమండ్రి వచ్చి నీటిపారుదల శాఖలో ఉద్యోగ జీవితం మొదలుపెట్టారు.

ఆ సమయంలోనే... 1844లో గోదావరి పరీవాహక ప్రాంతాన్ని పరిశీలించడానికి వచ్చిన శ్రీ ఆర్థర్‌ కాటన్‌ గారితో #వీరన్న గారికి పరిచయం ఏర్పడింది.

అప్పటి నుంచి కాటన్‌ దొరకు సహాయకుడిగా వీరన్న కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
తనకంటే వయసులో పెద్దవాడైన వీరన్న గారిని కాటన్‌ దొర సోదర సమానుడిగా గౌరవించేవారు .

ప్రయాణ సౌకర్యాలు అంతగాలేని ఆ కాలంలో... కాటన్‌ దొర తో పాటు గోదావరి తీరం వెంబడి కాలినడకన, గుర్రాల మీద వెళ్తూ ఆనకట్ట నిర్మాణ పనులను #వీరన్న గారు పర్యవేక్షించారు.

రాజమండ్రి నుంచి అటు గోదావరి పుట్టే త్య్రంబకం., ఇటు సముద్రంలో కలిసే వరకు దాదాపు 1500 కిలోమీటర్ల ఎగువ దిగువ పరివాహక ప్రాంతాల్లో కాటన్‌ దొర విస్తృతంగా పర్యటించారు.
ఆ సమయంలో వీరన్న గారు ఆయన వెన్నంటి ఉన్నారు. భోజన సదుపాయాలు లేని మార్గాల్లో నెలల తరబడి ప్రయాణించిన వారిద్దరూ ... అరటి, మామిడి, జామపండ్లు తింటూ, గోదావరి నీళ్లు తాగుతూ ముందుకు సాగిపోయేవారు.

ఆనకట్ట నిర్మాణం సమయానికి తూర్పు- పశ్చిమ గోదావరి, #కృష్ణా
జిల్లాలు కలిసి రాజమండ్రి జిల్లాగా ఉండేవి.

బ్రిటిష్‌ కాలంలో దేశాన్ని ఎన్నో కరువులు పీడించాయి. ఓ వైపు గోదావరి, కృష్ణా నదుల నీళ్లు వృథాగా సముద్రంలో కలిసేవి. మరోవైపు ప్రజలు కరవుల బారినపడి తీవ్ర ఇక్కట్ల పాలయ్యేవాళ్లు.

దానితో ఈ నదుల నీళ్లను వ్యవసాయ అవసరాలకు వినియోగించుకునేలా చేయాలని సంకల్పించింది ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వం...కాటన్ దొర గారి ప్రోద్బలంతో...!

ఈ పనికి కాటన్‌ దొర గారిని నియమించింది...ప్రభుత్వం..!
దీనికోసం ప్రణాళిక సిద్ధం చేసుకుని కాటన్‌ గారితో కలిసి వీరన్న గారు మారుమూల ప్రాంతాల్లో సంచరిస్తూ ఆయా ప్రాంతాల రైతులను చైతన్యపరిచారు.

ఆనకట్ట పనులు ప్రారంభమైన తొలినాళ్లలో గోదావరి జిల్లాల నుంచి పనిచేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దానితో ఒడిశా...బెంగాల్‌ల నుంచి వందలమందిని ధవళేశ్వరానికి రప్పించారు.

వీరన్న గారు వాళ్లకు కావాల్సిన శిక్షణ ఇస్తూ రోజువారీగా చెల్లించే కూలీ డబ్బుల్ని నిక్కచ్చిగా ఇచ్చేవారు.

ఇది గ్రహించిన గోదావరి ప్రజలే కాకుండా కృష్ణా గుంటూరు శ్రామికులు కూడా తమంత తాముగా ఆనకట్ట నిర్మాణానికి ముందుకువచ్చారు.

వీరన్న గారు తన కుటుంబానికి ఉన్న పలుకుబడి పరిచయాలతో మన్యప్రాంతం కోయవారిని కూడా ఆనకట్ట పనులకు కూడగట్టారు.
పనికి కొత్తయిన వాళ్లకు తగిన శిక్షణ ఇప్పించారు. కూలీలను ఉత్సాహపరిచేందుకు... పనిచేయని ఆదివారం కూలి సొమ్మును కూడా శనివారం సాయంత్రమే ఇచ్చేవాళ్లు.

ఇది కూలీల్లో ఆనకట్ట నిర్మాణ అధికారులంటే విశ్వాసం పెరిగేలా చేసింది.
వీరన్న గారు శ్రామికుల కోసం గోదావరి తీరాన నివాసాలు ఏర్పాటు చేసి వాళ్ల ఆరోగ్య రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.
మొత్తానికి 1851 నాటికి పదివేల మందికి పైగా శ్రామికులను సమకూర్చి ఈ మహాయజ్ఞం పూర్తయ్యేలా చేశారాయన.

1848, 1851లలో ప్రభుత్వం నుంచి సొమ్ము రావటం ఆలస్యమైనా పనులు ఆగకుండా శ్రామికులను వీరన్న గారు ఉత్తేజపరిచారు.

ఆనకట్ట నిర్మాణానికి కంకణబద్ధులైన కాటన్ దొర.. వీరన్న గారి పట్ల ఆంగ్లేయ ( బ్రిటిష్ ) అధికారులకు అసూయ ఏర్పడింది.
దాంతో వాళ్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసేవాళ్లు.

వీటివల్ల ఒకానొక సందర్భంలో ఆనకట్ట నిర్మాణం ఆగిపోయిందనే వదంతులు కూడా వచ్చాయి.

అలాంటి సమయంలోనూ వీరన్న గారు...కాటన్‌ దొరల మీద ఉన్న గౌరవం... విశ్వాసం శ్రామికులతో ఏ ఆటంకాలు లేకుండా పనిచేయించింది.

ఇదంతా గమనించిన ప్రభుత్వం తన అభిప్రాయాన్ని మార్చుకుని ఆనకట్ట నిర్మాణానికి కావాల్సిన డబ్బు, ముడిసరకులను ఎప్పట్లా సరఫరా చేసింది.

చివరికి 1852 మార్చి 31 నాటికి పని పూర్తయింది.

ఆనకట్ట పూర్తయ్యాకే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పేర్లు వాడుకలోకి వచ్చాయి.

వీరన్న గారి సహకారం, కృషి, పట్టుదల, నిజాయతీ, అంకితభావం కారణంగానే తన కల నెరవేరిందని గ్రహించిన కాటన్‌ దొర ఆంగ్లంలో స్వదస్తూరితో
శ్రీ వీణెంవీరన్న అనే హైందవ పురుషోత్తముడు నాకు లభించకుండా ఉండి ఉంటే, నేను అనుకున్నట్లుగా ఇంతవేగంగా గోదావరి ఆనకట్టను పూర్తిచేయలేక పోయేవాణ్ని’ అని రాసుకున్నారు.

ఇంతేకాకుండా వీరన్న గారి శ్రమకు ప్రతిఫలంగా ... ఆయనకు ఇంకా ఏదైనా మేలు చేయాల్సిందిగా ఈస్టిండియా కంపెనీని... విక్టోరియా మహారాణిని అభ్యర్థించారు.

దాని ఫలితంగా కంపెనీ ఆనకట్టకు సమీపంలో ఉన్న మెర్నిపాడు గ్రామశిస్తును (ఆ రోజుల్లో రూ.500కు పైగా) వీరన్నకు శాశ్వతంగా దఖలుపరిచింది.

అంతేకాదు ఆయనకు ‘రావుబహుదూర్‌’ బిరుదునిచ్చి సత్కరించింది.

ఆనకట్ట నిర్మాణ సమయంలో అనేక పర్యాయాలు కాటన్‌ దొర అస్వస్థతకు గురయ్యారు. ఆస్ట్రేలియా, లండన్‌లకు నెలల తరబడి వెళ్లేవారు.

అయినా వీరన్న గారు కూలీలను సమన్వయపరుస్తూ నిర్మాణ పనులు సమర్థంగా నిర్వహించారు.
నిర్మాణ సమయంలోనూ, అనంతరం కురిసిన వర్షాల కారణంగా గోదావరికి వరదలు వచ్చి... చిన్నాపెద్ద ప్రమాదాలు వచ్చి పడినా సకాలంలో ప్రభుత్వం ఆనకట్టకు తగిన మరమ్మతులు చేపట్టేలా చేశారాయన.

1852లో ఆనకట్ట నిర్మాణం పూర్తయిన నాటినుంచి 1867లో మరణించేవరకు ధవళేశ్వరం హెడ్‌లాక్‌ క్వార్టర్సే వీరన్న గారి చిరునామాగా ఉంది.

ఆయన కోరిక మేరకు నేటి ధవళేశ్వరం హెడ్‌లాక్‌ ప్రాంతంలోనే ఆయన పార్థివ దేహానికి దహన సంస్కారాలు జరిపి అస్తికలను గోదావరిలో నిమజ్జనం చేశారు.

అంతేకాదు ఆయనను దహనం చేసిన ప్రాంతంలో ఉన్న రాతిగోడ మీద వీరన్న గారి పేరును ఆంగ్లంలో వి.వీరన్న ...రావ్ బహుదూర్....సబ్‌ఇంజినీర్..1867..! అని చెక్కించారు అప్పటి ఆనకట్ట ఉద్యోగులు.

1940లో బులుసు సాంబమూర్తి కాటన్‌ దొర విగ్రహం దగ్గరే వీరన్న గారి వివరాలు తెలిపే శిలాఫలకాన్ని చెక్కించారు.

1986లో వచ్చిన వరదలో కాటన్‌ దొర విగ్రహంతోపాటు ఈ శిలాఫలకం కూడా కొట్టుకుపోయింది.
1988లో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు గారి ప్రోద్బలంతో ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర నిర్మించిన కాటన్‌ మ్యూజియం లో వీరన్న గారి చిత్రపటాన్ని ఆవిష్కరించారు.

ఇప్పుడది మసకబారిపోయింది. తనకెంతో సాయమందించిన వీరన్న గారిని కాటన్‌ దొర మరచిపోలేదు.
కానీ మనం మర్చిపోయాం.

ఇలాంటి మహానుభావుల గురించి చెప్పుకోవడం ఎంతో అదృష్టం ..అయితే భావి తరాలకు ఇలాంటి గొప్ప వారి గురించి తెలిసేలా ప్రభుత్వాలు ఆయన విగ్రహాన్ని ఏర్పరిచి ..ఆయన జీవితచరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి.

రక్తదాహం..రాజకీయ లబ్ధి..ప్రాంతీయ విద్వేషాలతో..జలజగడాలతో కునారిల్లే వారికి అంకితం..!

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

శ్రీనివాస్ నాయుడు

Source - Whatsapp Message

No comments:

Post a Comment