Monday, March 30, 2020

దక్షిణామూర్తి అవతారం

దక్షిణామూర్తి అవతారం

శివుడు లయ కారకుడు. అంటే సృష్టిని విలీనం చేసుకొని కొత్త సృష్టికి మార్గాన్ని కల్పిస్తాడు. జ్ఞానంపై ఆసక్తి లేనివాళ్లను మళ్లీ జన్మ ఉండేటట్లుగా లయం చేయడం, జ్ఞానం కోరేవాడికి జ్ఞానాన్ని ప్రసాదించి మళ్లీ జన్మ లేకుండా భగవంతుని స్వరూపంలో కలపడం అనే రెండు రకాలుగా శివుడు లయం చేస్తాడు. శివుని యొక్క జ్ఞానావతారమే దక్షిణామూర్తి.

దక్షిణామూర్తి పరమశివుని జ్ఞానగురువు అవతారం. ఇతర గురువులు మాటలతో శిష్యులకు బోధిస్తారు. కానీ దక్షిణామూర్తి మౌనం గానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలు నివారిస్తాడు.

బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించినప్పుడు మొదట సనక, సనందన, సనత్సుజాత మరియు సనత్కుమారులను సృష్టించాడు. వారిని తన సృష్టిని కొనసాగించమన్నాడు. కాని వారికి ఇష్టం లేక మేము బ్రహ్మజ్ఞానం పొందాలి, అందువలన మేము మీకు సాయపడలేము అని విరక్తులై బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి గురువును వెదుకుతూ బయలుదేరారు. ఇక బ్రహ్మగారు మరో ప్రత్యామ్నాయంతో తన సృష్టిని కొనసాగించాడు.

ఇక ఈ నలుగురూ గురువు కోసం వెదుకుతూ నారద మహర్షి సహాయంతో మొదట బ్రహ్మ గారినే అడుగుదామనుకొన్నారు. కాని ప్రక్కన సరస్వతీదేవిని చూసి " ఈయనే పెళ్ళి చేసుకొని సంసారంలో ఉన్నాడు. ఇక ఈయన మనకు ఏమని ఉపదేశిస్తాడు" అని అనుకొని బ్రహ్మను అడుగలేదు. అలాగే మహావిష్ణువునూ మరియు పరమశివుడినీ కూడా అడుగుదామని వెళ్ళి వారి ప్రక్కన లక్ష్మీదేవినీ మరియు పార్వతీదేవినీ చూసి వారిని కూడా అడుగలేదు.

పరమశివుడు ఈ నలుగురి అజ్ఞానాన్ని చూసి బాధపడి వారికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాలనుకొని అనుకొన్నాడు. వారు వెళ్ళే దారిలో ఒక మర్రిచెట్టు క్రింద దక్షిణామూర్తిగా కూర్చున్నాడు. వీరు నలుగురూ ఆ మూర్తిని చూసి, అతని తేజస్సుకు ఆకర్షితులై, ఆయన చుట్టూ కూర్చున్నారు. శివుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా యోగ భంగిమ లొనే కూర్చున్నాడు. ఋషులందరికి అనుమానాలన్నీ వాటంతట అవే తొలగిపోయి జ్ఞానవంతులయ్యారు. దక్షిణామూర్తి స్వామి వారు తమ మౌనంతోనే వారందరినీ బ్రహ్మజ్ఞానం పొందునట్లు చేసారు. అలా మౌనముగా ఎందుకు బోధించారంటే బ్రహ్మము లేక పరమాత్మ మాటలకు, మనసుకూ అందనివారు కాబట్టి అలా బోధించారు.

ఇలాంటి యువకుడైన దక్షిణామూర్తి చుట్టూ వృద్ధులైన మునులు కూర్చుని ఉంటారట. గురువు చేసేది మౌనవ్యాఖ్యానం. మౌనంగా చిన్ముద్రలో కూర్చుని ఉండటమే అతడు చేసే వ్యాఖ్యానం.
దక్షిణామూర్తి పాదాలక్రింద ఉన్నది తమో గుణ రూపానికి ప్రతీక!వాటిని శివుడు తన కాలితో అదిమిపడుతాడు! దక్షిణామూర్తి కాలికింద ఉన్న రాక్షసుడు (తమో గుణం) ఆనందంగా ఉండటం! అజ్ఞానాన్ని అదుపు చేసేవాడే శ్రీ దక్షిణామూర్తి. ఈ తత్వమే ఆదిగురుతత్త్వం. దక్షిణామూర్తి ఆది గురువు, ఆది యోగి అన్న మాట. ఆయన సమస్త జ్ఞానానికి మూలం! ఈ తత్వాన్ని తెలుసుకోవటమంటే – జ్ఞానం, ఎరుక అనే అవగాహన కలిగివుండటమే! పరమశివుని ఈ రూపం సంగీత, సాహిత్యాల , యోగ, తాంత్రిక విద్యల కలయిక. సకల శాస్త్రాల సారాన్ని తెలిసి , అర్హులైన మహర్షులకు ఉపదేశం చేసినవాడే శ్రీ దక్షిణామూర్తి. సద్గురువు లభించని ఉత్తములు ఈయన్ని గురువుగా భావించి, జ్ఞానం, మోక్షాన్ని పొందవచ్చు.

దక్షిణామూర్తి శ్లోకం

గురవే సర్వలోకానాం భిషజే భవరోగినాం
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః

అర్ధం :

సర్వలోకాలకు గురువు, భవరోగులకు ( సంసార బంధాలలో చిక్కుకుపోయిన వాళ్ళకు ) వైద్యుడు, సకల విద్యలకు నెలవు ( నివాసం ) అయిన దక్షిణామూర్తి కి నమస్కారములు.

No comments:

Post a Comment