Wednesday, January 27, 2021

చీమ చెప్పింది...చేప నేర్పింది..!

చీమచెప్పింది... చేపనేర్పింది..!

నేర్చుకోవాలని సంకల్పించాలే గానీ నిఖిల ప్రపంచం... సర్వ జీవగణం...అన్నీ గురువులై మన ముందుంటాయి..

దత్తాత్రేయుడికి ప్రకృతి గురువుగా మారిన సందర్భం ఒకటి అవధూతోపాఖ్యానంలో ఉంది. మనిషి తెలుసుకోవాల్సిన నిగూఢ సత్యాలెన్నో అందులో కనిపిస్తాయి..

భూమి

దున్నినా, తవ్వినా, అపరిశుభ్రం చేసినా సకల జీవుల శ్రేయస్సునే కోరుకుంటోంది.. మనిషి కూడా విశ్వ శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తే మహనీయుడవుతాడు..

# వాయువు

శీతోష్ణాలు, సుగంధ దుర్గంధాలతో తాత్కాలికంగా ప్రభావితమైనా గాలి నిర్మలత్వాన్ని కోల్పోదు.. ఎలాంటి పరిస్థితుల్లో నివసించినా, సంచరించినా మనిషి నిర్మలంగా ఉండగలగాలి.

ఆకాశం

మేఘాలు, ధూళి, సంధ్యారాగాలు... ఇవేవీ ఆకాశానికి అంటుకోవు. మనిషి కూడా మనోవికారాలను దూరంగా పెట్టి సజ్జనుడవుతాడు. తేజస్సుతో వెలుగుతాడు.

అగ్ని

యజ్ఞం చేసే వారి పాపాలను, కర్మదోషాలను తనలో దగ్థం చేసినా అగ్నికి అపవిత్రత అంటదు. సిద్ధులు ఇతరుల పాపాలను తొలగించినా వారి పవిత్రత ఏమాత్రం తగ్గదు.

సూర్యుడు

నీటిని తన కిరణాలతో స్వీకరించిన ఆదిత్యుడు తరువాత వర్షంగా కురిపిస్తాడు. గొప్ప వ్యక్తులు కూడా తమ అనుభవసారాన్ని బోధనల రూపంలో అందరికీ పంచుతారు.

కొండచిలువ

ఇది వేటాడదు.. తనకు దొరికిన ఆహారాన్ని మాత్రమే తింటుంది. మనిషి కూడా ఇహపర సుఖాల కోసం పాకులాడకూడదు..

పావురం

బోయవాడు వలవేసి తన పిల్లలను పట్టుకుంటే ఓ పావురాల జంట తాము కూడా వలలోకి దూకేశాయి. మనిషి కూడా ఇలా సంసార బంధంలో చిక్కుకుని అల్లాడుతున్నాడు.

సముద్రం

నదులన్నీ పొంగిపొరలి తనలో కలిసినా కడలి పొంగదు. మానవులు ఇలాగే పరిపూర్ణంగా ఉండాలి. ధర్మమనే చెలియలి కట్టను దాటకూడదు.

మిడత

అగ్నికి ఆకర్షితురాలై అందులో దూకి నశిస్తుంది. అజ్ఞాని కూడా అంతే.. సుఖాలపై మోహంతో, ఆకర్షణతో అందులోకి దూకి పతనమవుతాడు..

ఏనుగు

ఆడ ఏనుగు బొమ్మను అడవిలో పెడితే, మగ ఏనుగు దాని దగ్గరకు వచ్చి వేటగాళ్లకు చిక్కుతుంది. అజ్ఞానులు ఇలాగే అరిషడ్వర్గాలకు చిక్కుకుంటున్నారు..

చీమా

ఎన్నో కష్టాలు వచ్చినా, ఆటంకాలు ఎదురైనా ఆహారాన్ని సంపాదిస్తుంది. మనిషి కూడా ఎన్ని ఆటంకాలు వచ్చినా జ్ఞానధనాన్ని సంపాదిస్తూనే ఉండాలి.

శరకారుడు

బాణాలు చేయడంలో నిమగ్నుడైన ఓ నిపుణుడు పక్కనుంచి పోతున్న ఊరేగింపును పట్టించుకోలేదు.. అందరూ లక్ష్యంపై ఇలాగే ధ్యాసను నిలపాలి. భ్రమించజేసే విషయాలను వదిలిపెట్టాలి.

చేప

నీటిలోని చేప జిహ్వ చాపల్యం వల్ల ఎరకు చిక్కుతోంది.. మనుషులు కూడా జిహ్వచాపల్యం వల్ల ఆత్మహాని కొని తెచ్చుకుంటున్నారు.

పసి_పిల్లాడు

పసివాడికి చీకూచింతలు, ఉండవు.. హాయిగా జీవిస్తుంటాడు. ప్రతి వ్యక్తీ అంతే హాయిగా జీవితాన్ని గడపాలి. యోగమార్గంలో ఆ స్థితిని సాధించవచ్చు.

చంద్రుడు

చంద్రుడి వృద్ధిక్షయాలు తాత్కాలికం. నిజానికి ఆయనలో ఎలాంటి మార్పు ఉండదు. అలాగే జననం నుంచి మరణం వరకు వచ్చే మార్పులన్నీ శరీరానికే.., ఆత్మకు కాదు.

తేనెటీగ

తుమ్మెద వివిధ రంగుల పుష్పాల నుంచి తేనెను మాత్రమే గ్రహిస్తుంది. ఇక దేని జోలికీ వెళ్లదు. వివేకవంతుడు సకల శాస్త్రాల సారాలను ఇలాగే గ్రహిస్తాడు.

లేడి

వేటగాడి సంగీతానికి పరవశించి చివరకు అతని వలకు చిక్కుతుంది.. వాంఛలకు చిక్కుకోకుండా జాగ్రత్తపడిన వాళ్లు ఆధ్యాత్మిక శిఖరాలను చేరతారు.

నీళ్లు

సర్వజీవులనూ పోషిస్తున్నా నీరు పల్లానికే ప్రవహిస్తుంది. గొప్పవాళ్లు కూడా అంతే నమ్రతతో ఉంటారు.

గద్ద

చచ్చిన ఎలుక కోసం పోరాటం వృథా అనుకున్న ఓ గద్ద ప్రశాంతంగా ఓ చెట్టు కొమ్మపై కూర్చుంది. విజ్ఞుడైనవాడు ఇతరులు ఆశించే వాటి కోసం పోరాడి దుఃఖాన్ని కొని తెచ్చుకోడు.

సాలెపురుగు

తన లాలాజలంతో గూడు అల్లుతుంది. కొంతకాలానికి తిరిగి దాన్ని మింగేస్తుంది. సరిగ్గా పరబ్రహ్మం తనలో నుంచి సృష్టిని బహిర్గతం చేస్తుంది... చివరకు తనలోనే లీనం చేసుకుంటుంది.

కన్య:

ధాన్యం దంచడానికి సిద్ధమైంది ఓ కన్య.. చేతి నిండా ఉన్న గాజులు సవ్వడి చేస్తుంటే వాటన్నిటినీ తీసేసి ఒక్కో చేతికి ఒక్కో గాజును మాత్రమే ఉంచుకుంది. సాధన కు ఏకాంతం అవసరమని ఆమె చాటింది.

భ్రమరం:

తేనెటీగ తన పిల్ల చుట్టూ తిరుగుతూ ఝుంకారం చేస్తుంది. దీంతో ఆ పిల్ల కూడా కొంతకాలానికి భ్రమరంగా మారిపోతుంది. ఇలాగే మంచి శిష్యుడు కూడా గురువును అనుసరించి గొప్పవాడవుతాడు.

పాము

ఏకాంతంలో నిశ్చలంగా ఉంటుంది. ఇలాగే యోగి కూడా ఏకాంతంలో నిశ్చలమైన సమాధి స్థితిని పొందుతాడు..

సర్వేజనా సుఖినోభవంతు...🙏🙏🙏🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment