Monday, July 14, 2025

 ఉపదేశ సారం-9
సరళ చింతనం .మోక్షదాయకం

ఆజ్యధారయా ప్రోతసా సమం।
సరళ చింతనం విరళత: పరం॥

రమణ మహర్షి రచించిన 30 శ్లోకాల "ఉపదేశ సారం " లోని ఏడో శ్లోకమిది.  భగవంతునియందు భక్తిని కలిగించి,  పెంపొందించే సాధనలలో శరీరంతో చేసే పూజ , వాక్కుతో చేసే జపం గురుంచి గత శ్లోకాలలో తెలిపిన రమణులు ..మనసుతో చేసే చింతనం ఎలా ఉండాలో ఈ శ్లోకం ద్వారా చెప్పారు .  మధ్య మధ్య ఆటంకాలతో కొనసాగే విరళ చింతనం కన్నా నేతి ధారలా (ఆజ్య ధారయా ), నదిలో జలం ప్రవహించినట్టుగా (శ్రీతాసాం సమం )  ఏ ఆటంకాలూ లేకుండా  అఖండంగా జరిగే సరళ చింతనం శ్రేష్టమైనదని  దీని అర్ధం . 
 
చింతనం అంటే ..మనలో ఆలోచనలన్నింటినీ ఒకే ఒక  సద్వస్తువు పైకి ప్రవహింపజేయడమే .  ఈ చింతననే ధ్యానం అని కూడా అంటారు. నిధిధ్యాసన అన్నా ఇదే .  ఆధ్యాత్మిక సాధనల్లో అత్యంత విలువైనది చింతనం లేదా ధ్యానం విలువైనదేగానీ ...అంత   సులువైనది కాదిది .  జ్ఞానసాధనలో ఇది మూడో మెట్టు .  మొదటిది శ్రవణం . రెండోది మననం .  మూడోది చింతనం .

పరమాత్మతత్వంపై  చింతనం చేయాలంటే ముందుగా సద్గురువు వద్ద కూర్చొని భక్తితో , శ్రద్ధతో ఏకాగ్రతతో శ్రవణం చేయాలి .  ఏం శ్రవణం చేయాలి ? అంటే వేదాంత శ్రవణం చేయాలి.  ఉపనిషత్తుల్లో నిక్షిప్తం చేసిన జ్ఞానాన్ని శ్రవణం చేయాలి .  ఎందుకంటె ధ్యానానికి ముందు జ్ఞానం తప్పనిసరి .  జ్ఞానం స్థిరమై సంపూర్ణంగా ఉన్నప్పుడే అది ధ్యానానికి సహాయకారి అవుతుంది .  ఇలా స్థిరం , సంపూర్ణం కావాలంటే శిష్యుడు సాధన చతుష్టయ సంపన్నుడై శ్రవణం చేయాలి.  గురువు శ్రోత్రియుడై , బ్రహ్మనిష్ఠుడై ఉండాలి .  ఇలా శ్రవణం చేసి పొందిన ఆత్మజ్ఞానం స్థిరం కావాలంటే , శిష్యుడు దాన్ని మరలా మరలా మననం చేసుకుంటూ ఉండాలి .  ఇలా శ్రవణ , మననాలైన తర్వాత ధ్యానం చేయాలి.  శ్రవణ మననాలలో జీవుడు తానూ నిజంగా పరమాత్మనేనని , ఈ దేహ మనోబుద్ధులతో తాదాత్యం చెంది , వాటి వృత్తులను తనపై ఆరోపించుకుని , కర్తగా భోక్తగా వ్యవరిస్తున్నానని తెలుసుకుంటాడు .  ఆ తాదాత్యాన్ని వీడి తాను తానుగా ఉండాలని తెలుసుకుంటాడు .  అలా తెలుసుకున్న విషయాన్ని చింతనలో , ధ్యానంలో ,  "సోహం ( ఆ పరమాత్మను నేనే )" అని అనుభవపూర్వకంగా స్థిరీకరించుకుంటాడు .  ఇదే ధ్యాన లక్ష్యం  .  అలాంటి అనుభవం వల్లనే జీవన్ముక్తి (మోక్షప్రాప్తి ) లభిస్తుంది .  కనుక సరళ చింతనం ఉత్తమైనది అని మహర్షి భావం .  

సాధనలలో పూజ కన్నా జపం , జపం కన్నా చింతనం , చింతనలో కూడా విరళ  చింతనం కన్నా సరళ చింతనం అత్యుత్తమైనదని రమణులు చెప్పారు .  కాబట్టి అన్ని సాధనలో వదలి ఆ సరళ చింతనమే సాగిద్దామనుకుంటే అది పొరబాటే .  ఎందుకంటె ఈ సాధనాలన్నీ నిచ్చెన మెట్ల వంటివి .  అన్నిటికన్నా పై నున్న మెట్టే పై అంతస్తులోకి చేరుస్తుందని తెలిసినా ...నిచ్చెనలోని అన్ని మెట్లనూ ఎక్కితే గానీ పై మెట్టును చేరుకోలేం కదా!  భక్తి సాధన కూడా అంతే.  ఒక్కొక్క మెట్టూ ఎక్కుతూ చివరిమెట్టు అనదగ్గ సరళ చింతనంలోకి ప్రవేశించాలి .

-  by sri దేవిశెట్టి చలపతిరావు, 
Sekarana from andhrajyoti .dt.21-1-2020

No comments:

Post a Comment