Thursday, February 27, 2020

మాతృమూర్తి ఋణం

మాతృమూర్తి ఋణం

ఆదిశంకరాచార్యుల వారు
సన్యాసాశ్రమం స్వీకరించి
తన ఆప్తులందరినీ త్యజించి వెళ్ళే ముందు తల్లి ఆర్యాంబ
చాలా బాధ పడింది.

"శంకరా,
నువ్వు నాకు
ఏకైక పుత్రుడువి కదా!

నన్ను వదలి వెళ్ళి పోతున్నావు,

ఆఖరి క్షణాల్లో నాకని ఎవరున్నారు?

నాకు దిక్కెవరు "
అని దీనంగా ప్రశ్నించింది.

" అమ్మా!

ఏ సమయమైనా సరే,

నీవు తల్చుకుంటే చాలు నీ ముందు వుంటాను."
అన్నాడు శంకరుడు.

భగవత్పాదులు శంకరాచార్యులవారి తల్లికి మరణకాలం సమీపించింది. మూసిన కళ్ళు తెరవ లేదు.

"నేను తలచిన వెంటనే వస్తానన్నాడే శంకరుడు"
అని మనసులోనే తలుచు కుంటూ వున్నది ఆర్యాంబ.
తల్లి తలచు కుంటున్నదన్న విషయం
ఆదిశంకరులు గ్రహించారు.

వెంటనే శ్రీకృష్ణుని ధ్యానించారు.

శ్రీకృష్ణుడు ఏం కావాలని అడిగాడు.

కురుపితామహుడు భీష్మాచార్యునికి మోక్షమిచ్చినట్లుగా
నా మాతృమూర్తికి
మోక్షం ప్రసాదించమని వేడుకున్నారు శంకరాచార్యులవారు.

అర్యాంబ , తలుచుకుంటే శంకరుడు వస్తానన్నాడే అని తపిస్తున్నప్పుడు అక్కడికి ఎవరో వస్తున్న అలికిడయింది.
కళ్ళు కూడా తెరవలేని స్థితిలో వున్న ఆర్యాంబ చటుక్కున లేచి
శంకరా!
అంటూ ,
అక్కడికి వచ్చిన
ఒక పసిబాలుని,
గట్టిగా హృదయానికి
హత్తుకుంది.

బాలుని ఒంటి నిండా ఆభరణాలను గమనించిన ఆర్యాంబ‌,

శంకరుడు సన్యాసి కదా !

యీ ఆభరణాలు ఎలావచ్చాయని అనుకున్నది.

బరువెక్కిన కనురెప్పలను మెల్లిగా తెరచి చూసింది ఆర్యాంబ.

అక్కడ తను అను నిత్యం పూజించే గురు వాయూరు శ్రీకృష్ణుడు సాక్షాత్కరించి నిలచివుండడం
గమనించింది.

గురువాయూరప్పని చూసిన ఆర్యాంబ మహదానందంతో
"అప్పా!
నోరు తెరిచి,
నీ నామజపం చేసే
శక్తి కూడా లేని యీ దీనురాలి ఆఖరిక్షణాలలో నను చూసేందుకు వచ్చావా?
కృష్ణా " అని
మెల్లిగా గధ్గద కంఠంతో పలికింది.

శ్రీకృష్ణుడు వెంటనే
" నీ పుత్రుని ఆదేశం.

రాకుండా వుండగలనా ?

అమ్మను చూడకుండా
వుండగలనా " అని
చిరునవ్వులు చిందిస్తూ అన్నాడు.

అదే సమయానికి శంకరాచార్యులవారు కూడా అక్కడికి వచ్చారు.

ఉప్పొంగిన ఆనందంతో
ఆ మాతృమూర్తి శంకరునితో
" నాయనా !

నా భాగ్యమేమని చెప్పను ?

నిన్ను పుత్రుని గా పొంది నేను తరించాను.

సాక్షాత్తు
శ్రీకృష్ణ భగవానుడినే
నా ముందు నిల బెట్టావు కదా,
శంకరా!" అని
కన్నీళ్ళు కార్చింది .

గోపాలుని నేను నిలబెట్టడ మేమిటి?

నేను జన్మించినది మొదలు
నీవు నా కోసం
పడ్డ శ్రమకు ,
కష్టాలకు బదులుగా
నేనేమీ చేయలేక పోయాను.

సాక్షాత్తు భగవంతుడే మానవ రూపంలో పుట్టినా
మాతృ ప్రేమకు సాటిగా ,
ఎంతటి సేవ చేసినా కన్నతల్లి ఋణం అణు వంతైనా తీరదు.

నే నైనా అంతే.

నేను చేయగలిగిన దంతా
నీ దివ్య చరణాలకు హృదయ పూర్వకమైన
"సాష్టాంగ ప్రమాణం ఒక్కటే"
అని మాతృదేవత పాదాల ముందు మోక రిల్లారు ఆదిశంకరాచార్యులవారు.

మన తల్లి తండ్రుల కు
మనం చేసే సేవల వల్లనే
వారి మనసు సంతృప్తి చెంది
వారి దివ్యాశీస్సులు
సదా తమ బిడ్డలకు ప్రసాదిస్తారని
జగద్గురు
ఆదిశంకరాచార్యుల వారు
ఈ లోకానికి సందేశ మిచ్చారు.

సర్వేజనా స్సుఖినోభవంత్

No comments:

Post a Comment