Tuesday, March 26, 2024

త్రయ మేకత్ర సంయమః

 4. త్రయ మేకత్ర సంయమః

ఈ మూడూ ఒకటిగా యేకం కావడమే సంయమము అంటున్నాడు పతంజలి, మొదట ఒక విగ్రహం మీద మనస్సునూ, దృష్టినీ కేంద్రీకరించాము దానిని ధారణ అని తెలుసుకున్నాము.

ధారణ ద్వారా మనస్సులో ఆ విగ్రహాన్ని మాత్రమే ప్రతిష్టించుకుని దానినే ప్రవాహంలాగా ధ్యానించసాగాము. కనుక ధారణ చేతనే ధ్యానించే స్థాయికి చేరుకున్నాము..

ధారణ లేకుండా ధ్యానము రాదు. కనుక ద్యానము ధారణ కలియడం చేత ధ్యాన స్థితియేర్పడిందన్న మాట.

ధ్యానాన్ని మరింత తీవ్రం చేసి మనకు కనిపించేదంతా పరమాత్మ ప్రతిరూపమన్న సమాధి స్థితికి చేరుకున్నాము.

ధారణ, ధ్యానములు కలిసి తీవ్రంగానిదే సమాధి స్థితి కలగదు. అట్టి సమాధి స్థితికి చేరాక చిత్తములో వుండే భావనలన్ని నశించిపోయి తన శూన్య చిత్తములో ప్రకాశించే వెలుగే తాను ధ్యానిస్తున్న పరమాత్మ స్వరూపమన్న ఏకైక భావన మాత్రం నిలిచివుంటుంది.

అనగా ధారణ, ధ్యానములలో సమాధి స్థితి కూడా కల్పిపోవడం చేత ధ్యానికి ఆ ఏకైక భావన కలిగిందన్నమాట!

ఇలా యీ ధారణ, ధ్యాన, సమాధులు మూడూ కల్సిన స్థితినే 'సంయమము' అంటారు. ఇవి ఒకదాని తర్వాత మరొకటి కలిగి చివరికి యీ మూడూ ఏకం కావడం చేతనే దీనిని 'సంయమము' అన్నారు.

ఇలా ధారణ, ధ్యానము, సమాధి ఏకమై సంయమము చేకూరినప్పుడే సాధకుడు. జ్ఞానసిద్ధిని పొంది తన జీవిత ధ్యేయమైన పరమాత్మ యదార్థ స్వరూపాన్ని దర్శించగలుగుతాడు.

కనుక యీ సంయమయ స్థితిలో అనేక ధ్యాన ధారణ సమాధి స్థితులు కలిగినప్పటికీ వాటిని యిలా ఏకాత్మ భావనతో సంయమము చేస్తూ ముందుకు సాగిన వారికి యీ సంయమము వల్ల కలిగే ఫలితం అనుభవమవుతుంది.
అయితే ఆ ఫలితం ఎలాంటిది?
.

No comments:

Post a Comment