Thursday, January 30, 2025

 ☘️🍁  ఆప్తవాక్యాలు  🍁☘️


89. ధర్మాత్ అర్థశ్చ కామశ్చ....

ధర్మము వల్లనే అర్థకామములు(మహాభారతం)

అర్థశౌచమే ఆనందానికి మూలం. శుద్ధిగా ఉండడాన్ని శౌచం అన్నారు. వాక్ శుద్ధి, మనశ్శుద్ధి, క్రియాశుద్ధి, శరీరశుద్ధి... ఇలా బాహ్యాభ్యంతర శౌచం గురించి చెప్పారు.
సత్య, ప్రియ, హిత వచనాల వల్ల, దేవతాస్తుతుల వలన వాక్ శుద్ధి; ధ్యానం, సద్భావాల వలన మనశ్శుద్ధి; పవిత్ర ప్రవర్తన వలన క్రియాశుద్ధి; స్నాన, ఆహార నియమాదుల
వల్ల శరీరశుద్ధి ఏర్పడతాయి. 'అర్థశౌచమే నిజమైన శౌచం' అని మనుస్మృతి చెబుతోంది.
సంపాదనలో శుద్ధత ఉండాలి. ధనానికి అర్జన, వినియోగం, సంచయం... అని మూడు దశలు.

సంపాదించడం, ఉపయోగించడం, దాచుకోవడం... అని వాటి అర్థాలు. ఈ మూడూ శుద్ధిగా ఉండడమే అర్థశౌచం.

ఎంత సంపాదించామని కాక, ఎలా సంపాదించామనేది ప్రధానమంటుంది ధర్మం.దానిని బాధ్యతల నిర్వహణకు, ధర్మ రహితం కాని కోర్కెలకు ఖర్చుచేయడం వినియోగం.
భవిష్యదవసరాలకు తగినంత దాచుకోవడం సంచయం.

ఈ శుద్ధతను గ్రహించకుండా కొందరు అక్రమార్జనవైపు మొగ్గు చూపుతారు.
అక్రమార్జనను దొంగతనం అంటారు. ధనం ఎలా సంపాదించామనే దానిననుసరించి దాని శుద్ధత ఆధారపడి ఉంటుంది. అక్రమార్జనను గౌరవ చిహ్నంగా భావించే
అధికారులూ ఉన్నారు. అక్రమంగా, అశ్రమంగా సాధించిన సంపదకు నిలకడ ఉండదు. ఎక్కువగా వేదనాభరితమైన పరిస్థితులకు వినియోగించవలసి వస్తుంది.
ప్రపంచం కన్నుకప్పి ధనాన్ని సంపాదించినా, అంతరంగానికి అసలు విషయం తెలుసు.
మన పాపాలకు మొదటి సాక్షి మన అంతరంగమే.

కొంతమంది అన్యాయార్జనను పోగుచేసుకుంటూ, అందులో కొంత దేవతల పూజ, దేవాలయాల హుండీకో వినియోగించి 'పాపం పోయింద'ని భ్రమపడుతుంటారు. అలా చేయడం వల్ల పాపం పోదు సరికదా, అధర్మార్జనను దైవానికి సమర్పించిన దోషం వస్తుంది. పూజాద్రవ్యాలను కూడా శుచియైనవి ఎలా ఇస్తామో అలాగే న్యాయంగా, స్వార్జితంగా సంపాదించిన దానినే యజ్ఞాలకు (దేవతారాధనలకు మొక్కులకు) వినియోగించాలి. అక్రమార్జనతో చేసే దేవతా పూజలు
దుష్ఫలితాలనిస్తాయి.

దేవాలయాలకు సమర్పించడంలోనే శుద్ధత ఉండాలని శాస్త్రం చెబుతుంటే, మరి దేవాలయ ద్రవ్యాలను అక్రమంగా అనుభవించే వారి గురించి వేరే చెప్పాలా! అక్రమంగా పాండవులను వంచించి ఆర్జించిన రాజ్యం, భోగం కౌరవులను సమూలంగా నాశనం చేయలేదా! 'వినాశ కాలే విపరీత బుద్ధిః" - అన్నట్లు అది తగదని భీష్మాదులు,
ఋషులు ఎన్నిసార్లు బోధించినా ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు పెడచెవిన పెట్టారు.చివరకు భయంకరంగా మూల్యాన్ని చెల్లించుకున్నారు.

అయితే..ఎంతో నియమంగా, శక్తివంచన లేకుండా సంపాదించినా, ఏదోవిధంగా మనకు తెలియకుండా ఆ సంపాదనలో ఏ అన్యాయమో కలిసిపోవచ్చు. అది అజ్ఞాత
దోషం కనుక ఆ సంపాదనలో కొంత భాగం స్వార్థరహిత సత్కర్మలకు, భగవత్ కైంకర్యానికి వినియోగించినప్పుడు, అందులోని దోషం పోతుంది. అన్నాన్ని భగంతునికి నివేదించడం, మొక్కుబళ్లు, దానం... వంటి వాటివల్ల ఈ ప్రయోజనం ఉంది. కేవలం
ధార్మికులైన వారికి అజ్ఞాతంగా ఉన్న దోషాలను పోగొట్టడానికే ఇవి. అంతేకానీ అక్రమార్జనలను కప్పిపుచ్చడానికి పై సాధనలు సహకరించవు.

ఎవరూ చూడడం లేదు కదా అని అక్రమాలకు దిగేవారిని మనల్ని చూసే
సాక్షులున్నారని మరచిపోవద్దని భాగవత గ్రంథం హెచ్చరిస్తోంది.

మన అంతరంగంలో ఉన్న అంతర్యామితోపాటు, సూర్యుడు, అగ్ని, ఆకాశం, వాయువు, చంద్రుడు, సంధ్యలు, దిక్కులు, జలాలు, భూమి, ధర్మం... ఇవి మానవుని కర్మలకు సాక్షులు...వీటి కళ్లు ఎవరూ కప్పలేరు. ఎక్కడో పరలోకంలోనే కాదు - ఇక్కడే వీటి ఫలాలను అనుభవిస్తాం. వేసిన విత్తనం చెట్టవడానికి కాలం పడుతుంది. చేసిన కర్మకు ఫలం అనుభవించడానికీ దాని సమయమది తీసుకుంటుంది!    

No comments:

Post a Comment