*1000 సంవత్సరాలుగా భద్రపరచబడిన
శ్రీ రామానుజాచార్యుల పవిత్ర శరీరమును
శ్రీ రంగంలో ఎప్పుడైనా చూసారా?*
వేదానికి సరైన అర్ధము చెప్పి, విశిష్టద్వైత గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన మహనీయులు శ్రీ రామానుజాచార్యులు ఆయన పరమపథం చెంది వెయ్యేళ్లు అయినా ఇప్పటికీ ఆ శరీరము భద్రపరిచి ఉండడం విశేషం.....
శ్రీ రామానుజచార్యులు....
భారతదేశంలో హిందూ మతానికి ఉన్న ప్రాముఖ్యత ఎంతో విశిష్టమైనది ప్రతి రాష్ట్రంలోనూ అబ్బురపరిచే ప్రఖ్యాత దేవాలయాలు మనకు కనిపిస్తాయి, వాటిలో తమిళనాడులోని తిరుచ్చునాపల్లికి ఆనుకుని ఉభయ కావేరీ నదుల మధ్య ఉన్న శ్రీరంగం పట్టణం కూడా ఒకటి, ప్రసిద్ధ వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఒకటైన శ్రీరంగం ఆలయంలో విష్ణు మూర్తి స్వయంభువుగా అవతరించినట్లు చెబుతారు. ఏడు ప్రాకారాలతో నిర్మితమైన ఈ ఆలయంలో అడుగడుగునా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి, వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది శ్రీ రామానుజాచార్యుల వారి శరీరము
శ్రీరామానుజాచార్యులు పరమపదించి వెయ్యేళ్లకు పైగా గడిచినా ఆయన శరీరాన్ని నేటికీ ఇక్కడ భద్రపరిచి ఉంచడం విశేషం, అయితే చాలా మంది భక్తులకు దీని గురించి తెలియకపోవడం విచారకరం, కొందరు శ్రీరంగంలోని 4వ ప్రాకారంలో ఉన్న రామానుజాచార్యుల ఆలయాన్ని సందర్శించినా అక్కడ ఉన్నది ఆయన దివ్య శరీరం అని మాత్రం గుర్తించలేరు....
పద్మాసనంలో యోగ భంగిమలో కూర్చుని రామానుజుల వారు ఇక్కడ శరీరాన్ని విడిచిపెట్టారు, ఆ కూర్చున్న భంగిమలోనే ఇప్పటికీ ఆ శరీరము కనిపిస్తుంది, ప్రతి ఏటా రెండు సార్లు ఆయన కోసం ఓ ఉత్సవము నిర్వహిస్తారు, ఆ సమయంలో కర్పూరము కుంకుమ పువ్వును ఓ ముద్దగా నూరి రామానుజుల వారి శరీరానికి పూస్తారు, అందువల్ల ఆయన శరీరము ఓ ఎర్రని వర్ణంలో విగ్రహములా మెరుస్తూ కనిపిస్తుంది, అయితే హారతి ఇచ్చే సమయంలో ఆయన కళ్లు, గోళ్లను, మనం స్పష్టంగా గుర్తించవచ్చు, కుంకుమ పువ్వు లేపనాన్ని అక్కడ అద్దకపోవడం వల్ల హారతి వెలుగులలో అవి మరింత ప్రకాశవంతముగా కనిపిస్తాయి...
రామానుజాచార్యుల వారి గొప్పదనము:-
రామానుజులు వారు క్రీస్తు శకం 1017 సంవత్సరంలో చెన్నై పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీపెరంబుదూరు (భూతపురి)లో జన్మించారు, దాదాపు 123 ఏళ్లు జీవించిన రామానుజులు వారు విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రచారానికి విశేష కృషి చేశారు, ఆయన జీవిత కాలంలో సగభాగం తమిళనాడులోని శ్రీరంగం, కాంచీపురం క్షేత్రాల్లోనే గడిపారు....
కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వర స్వామి విగ్రహం విష్ణువు రూపానిదా? శివ రూపానిదా? అని వైష్ణవులు, శైవులకు మధ్య ఏర్పడిన వాదోపవాదాలకు రామానుజాచార్యులు పరిష్కారం చూపించారు, తిరుమల స్వామి వారి గర్భాలయంలో శంఖు చక్రాలను ఉంచగా తెల్లవారి చూసే సరికి స్వామి వాటిని ధరించి కనిపించడంతో ఈ సమస్య సులువుగా పరిష్కృతమైనది, తిరుమల వెంకటేశ్వరుని నిత్య కైంకర్యాలను, సేవలను కూడా రామానుజాచార్యులే నిర్ణయించారు....
కొందరికే పరిమితమైన "అష్టాక్షరీ "ముక్తి మంత్రాన్ని తిరుకొట్టియూర్ ఆలయం గోపురం పైకి ఎక్కి అందరికీ వినిపించారు, ఈ మంత్రం బహిరంగంగా ప్రకటిస్తే నరకానికి వెళ్తారనే వాదనలను తోసి పుచ్చి.. తాను నరకానికి వెళ్లినా పర్వాలేదు, ఈ మంత్రోపదేశం పొందిన వారికి ముక్తి లభిస్తే చాలని ఆయన భావించారు, ఇలా సమ భావన, సహ జీవన, సమతా భావాలను ఆనాడే ఆయన ప్రతిపాదించారు. హిందూ మతంలో ఎన్నో గొప్ప సంస్కరణలకు ఆద్యుడయ్యారు.....
ప్రాచుర్యంలోకి రాని రహస్యం:-
క్రీస్తు శకం 11 - 12 శతాబ్ధాల మధ్య రామానుజాచార్యులు శ్రీరంగంలో శరీరాన్ని విడిచి పెట్టారు, అప్పటి నుంచి ప్రత్యేక లేపనాలను అద్ది ఆయన శరీరాన్ని భద్రపరుస్తున్నారు, అయితే శ్రీరంగంలో ఉన్న రామానుజాచార్యుల దివ్య దేహాము అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన రహస్యంగా ఇది మిగిలిపోయింది, కాబట్టి శ్రీరంగం పర్యటనకు మీరు వెళ్లినట్లయితే రామానుజుల పవిత్ర దేహాన్ని తప్పక సందర్శించండి....
🌹శ్రీమతే రామానుజా నమః... 🌷.
No comments:
Post a Comment