*జన్మ సార్ధక సాధన.....*
ఒకసారి "పాలు" ఈశ్వరుని గురించి తపస్సు చేసిందట అప్పుడు ఈశ్వరుడు ప్రత్యేక్షమై ఏమి
నీ సమస్య అని అడిగారట.
అప్పుడు "పాలు" ఈశ్వరా దేవా... నేను ఆవు నుంచి, బర్రె నుంచి వచ్చినప్పుడు శుద్ధంగా, పరిశుద్ధముగా ఉంటాను.. అయితే ఈ పాపిష్టి మానవుడు వాడి స్వప్రయోజనము కోసం నాకు పులుపు వేసి నా మానసును విరిచేస్తున్నాడు... అని చెప్పి బాదపడిందట.
అప్పుడు ఈశ్వరుడు ఓ చిరు నవ్వు నవ్వి..
ఓ క్షీరమా... ఇది విను, నీవు పాలు లా జీవించాలి అని ఆశ పడే ముందు నా మాట విను.. నీవు పాలు లాగా అయితే ఒకరోజు మాత్రమే బ్రతుకుతావు, పాలకు పెరుగు తోడు వేస్తే రెండు రోజులు బ్రతుకుతావు, పెరుగుని చిలికి చల్ల ని చేస్తే పుల్లపుల్లగా ఇంకో రెండు రోజులు బ్రతుకుతావు, అదే చల్ల లోంచి వచ్చిన వెన్న అయితే వారం రోజులు బ్రతుకుతావు, అ వెన్నను బాగా కాచి దాంట్లో రెండు తమలపాకులు వేసి నెయ్యి చేస్తే మంచి ఘుమ ఘుమలతో నెలలు తరబడి బ్రతుకుతావు. ఆ నెయ్యితోనే దీపం పెడితే నాకు వెలుగువవుతావు..
ఇప్పుడు చెప్పు... ఒక రోజు పాలు లాగా ఉండి పాలలాగానే చస్తావా లేక క్షణక్షణం అనుక్షణం, రోజు రోజూ పెరిగి రూపాంతరం చెంది నాకు వెలుగువవుతావా.. అని ఈశ్వరుడు ప్రశ్నించారు..
దేవుని మాటకి "పాలు" మూగబోయింది, ఈశ్వరునికి దాసోహం అయ్యింది. తన మనసులో ఉన్న అంధకారానికి సిగ్గుపడి బయటకు వచ్చింది. ఈశ్వరుడు ముందు ప్రజ్వలించి దీపంలా నిలిచిపోయింది...
మానవుడు కూడా అట్లాగే.. ఎవరో తమ మనస్సుని విరిచేసారు అని మనస్సుని పాడుచేసుకుని బాధపడేకంటే.. క్షీరము వలె మనస్సు లో ఆధ్యాత్మికత అనే తోడు వేసి, ఆ ఆధ్యాత్మికతను ఈశ్వర నామ స్మరణతో చిలకరించి, దానిని దైవ చింతనం తో కాచి, దానిలోంచి వచ్చిన జ్ఞానం తో ఎప్పుడు ఎప్పుడా అని ఆ ఈశ్వరుని లో ఏకమవటానికి ఎదురు చూస్తూ జన్మను సార్ధకం చేసుకోవాలి..
No comments:
Post a Comment