Saturday, February 28, 2026

******ఈ శరీరం నాది.

 ఈ శరీరం నాది.
దీనికోసం పట్టు పరుపులు, పట్టు పీతాంబరాలు, నగలు, సుగంధ ద్రవ్యాలు, అబ్బో చెప్పుకుంటూ పోతే ఇష్టమైన అబ్బాయి అమ్మాయిల సాంగత్యం. ఎన్నెన్నో..

నిజానికి శరీరం నీదేనా?
శరీరానికి పది ఇంద్రియాలు అంతరేంద్రియాలు ఐదు.. బాహ్యేంద్రియాలు ఐదు ఉన్నాయని అందరికీ తెలుసు కదా.. 
కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చర్మం.
ఇష్టమైనదే చూస్తాను అని కన్ను,
ఇష్టమైనదే వింటాను అని చెవి,
ఇష్టమైనదే వాసన చూస్తాను అని ముక్కు,
నచ్చిన ఆహారమే తింటాను అని నోరు.,
చల్లటి, ఇష్టమైన వారి స్పర్శ కోరే చర్మం.. 

వీటికి తోడు మనసు..
ఏది అదుపులో ఉండదు.
మనస్సుకి ఇంద్రియాల గుమ్మం నుండి ప్రపంచ విషయాలు సేకరించడం, అనుభవించేలా ఇంద్రియాలను ప్రభావితం చేయడం ఇష్టం.

మనిషి  అనగా ఆత్మారాముడు.. లేక జీవుడు..
అజ్ఞానం కప్పి ఉన్న జీవుడు  మొడ్డునిద్రలో ఉంటాడు. అదేంటి నేను మెలుకవలోనే ఉన్నాను అన్ని పనులు చేస్తున్నాను అంటారా! ముందే అనుకున్నాం కదా! మనస్సు ప్రపంచం వైపు చూస్తుంటుంది. ఇంద్రియాలు దానికి అనుగుణంగా ప్రవర్తిస్తూ, వాటి వలన కలిగే సుఖదుఃఖాలు అనుభవిస్తూ ఉంటుంది. ఈ సుఖం దుఃఖం కష్టం నష్టం అనే భావనలు ఉండటమే మొద్దు నిద్ర.. 

మొద్దునిద్రలో ఉన్నంతకాలం భావనలు తప్పవు. అన్ని నావే, నేను లేకపోతే ఏమైపోతారో, ఆస్తులు ఏమైపోతాయో అనే నిరంతరం దిగులు పడుతూనే ఉంటారు.. 

ఇలాంటి మనస్సుని ఒక్కసారి నీవైపు (జీవుడి వైపు) తిప్పితే ఎంతలా నిద్రిస్తున్నావో అర్థమవుతుంది.. మనస్సుని తిప్పడం ఎలా? చాలా తేలిక ఇంద్రియాలు, మనస్సు ఎలా పని చేస్తున్నాయా తెలియాలంటే! ఏదైనా ఒక నియమం పెట్టుకో. ప్రతి ఏకాదశికి ఉపవాసం చేస్తాను, 11రోజులు బ్రహ్మచర్య నియమం పాటిస్తాను. సత్యమే పలుకుతాను, బయట మసాలా ఆహారం తినను, బిర్యానీ ముట్టను వంటివి ఏదైనా కొన్నిరోజులు నియమం పెట్టుకో. అప్పుడు తెలుస్తుంది.. మనస్సు నువ్వెదైతే వద్దని నియమం పాటిస్తున్నావో అటే తిప్పుతూ అదే చూపిస్తూ, అక్కడికే నడిపిస్తూ నరకం చూపిస్తుంది.

ఇలాంటి ఇంద్రియాల వశంలో ఉన్నాడు జీవుడు.. 
కన్ను చూడొద్దు అంటే చూడకుండా ఉండదు,
నోరు తినొద్దు అంటే తినకుండా ఉండదు..
ఏ ఇంద్రియ ప్రవృత్తిని అదుపు చేసే శక్తి నీలో లేదు. 
నీకు సాధ్యం కాదు. ఇంద్రియాల వరకు దేనికి శరీరంలో ఏ అవయవం బాగోకపోయినా ఇబ్బందే.. కానీ దేన్నీ అదుపు చేయలేవు. 

ఎందుకంటే దీనికి అధిపతి వేరే ఉన్నాడు.. ఆయన వీటిని నియంత్రిస్తుంటాడు. ఆయన్ని తెలుసుకోవాలంటే ముందు నిన్ను నువ్వు తెలుసుకోవాలి. నిన్ను తెలుసుకోవాలంటే బుద్ధికి పదును పెట్టాలి. మనస్సుని నియంత్రించాలి. ఇంద్రియాల వేగం తగ్గించాలి. ఆహార విహార నియంత్రణ ఉండాలి. దీనికోసం ఏళ్ల తరబడి సాధన చేయాలి.

అప్పటికి అన్ని అర్థమైనట్లే ఉంటాయి. ముందుకి సాగుతున్నకొద్దీ అర్థమైంది వ్యర్థమైందని, అర్థం చేసుకోవలసింది ఇంకా ఉందని తెలుస్తుంది.. దీనినే జ్ఞానం అంటారు. జ్ఞానం ఉదయించే వరకు ఇంద్రియ విహారం, వాటి పర్యవసానం తప్పడం.. ఈ శరీరం మీద ఎక్కువ దృష్టి పెట్టకుండా మనస్సుని అంతర్ముఖం చేయడమే ముందున్న లక్ష్యం. 

కాని బుద్ధి వద్దని చెబుతుంది. మనస్సు పదేపదే కోరుతుంది. అయ్యప్ప స్వామి మాల వేసినవాడు వేసిన రోజు నుండి ఎప్పుడు పూర్తవుతుందా అని ఎదురుచూసినట్లు ఉంటుంది..                                                                  

No comments:

Post a Comment