Wednesday, January 14, 2026

 🌺 జ్ఞాన ప్రసూనాలు 🌺
03/12/2025

1) ఆలోచనలను వదులుకోండి. మీరు మరేదీ వదులుకోవలసిన అవసరం లేదు.

2)నీ గురువాక్కే నీకు ప్రమాణం..!

3)శూన్యంగా ఉండడం అంటే
'అకర్త'గా ఉండడం...

4)గురుపరంపరగా వచ్చేదే గుప్తవిద్య. అది చాప క్రింద పారే నీరు వంటిది. పారేది తెలియకుండానే చేరే చోటికి చేరుతుంది.

5)“భగవదిచ్చ" అని మాటవరుసకు అనడం కాకుండా నిజంగా అందులో స్థిరంగా నిలబడగలిగితే అదే మోక్షం.
 *ఓం నమో భగవతే శ్రీ రమణాయ*

               ఒక యువకుడు :
  భగవాన్! నాకు మరోవిధంగా ఉపదేశం ఇస్తున్నారు. తమరు మాత్రం మధుర నుండి తిరువణ్ణామలై(అరుణాచలం) దాకా ఎందుకు రావాల్సి వచ్చింది?  

                   మహర్షి :
  "ఓహో! అదా నీ సందేహం! ఏమిరా! ఈ స్వామి తాను చేసేదొకటి, ఇతరులకి చెప్పేదొకటి అనేగా నీ సందేహం! అయితే చూడు! నీలాగ నేను ఎవరి దగ్గరకు వెళ్ళి ఇలా చెయ్యాలా! అలా చెయ్యాలా! ఏం చేయమంటారు? అని అడగలేదు. నాకు ఎలా తోచిందో అలాగే చేసాను. నువ్వు కూడా నీ ఇష్టం వచ్చినట్లు చేయవచ్చు; ఎవరు వద్దన్నారు. ఎందుకు ఇతరులను పోయి అడుగుతావు."
    
   ఆ యువకుడు బదులు చెప్పలేక నోరు మూతపడి కాస్సేపు తలవాల్చి కూర్చుని, లేచి వెళ్ళిపోయాడు.

    ఆ తర్వాత మహర్షి ఇలా సెలవిచ్చారు ....
    
    తనమీద తనకే నమ్మకం లేదు. ఇల్లు వదలి బయటకు వెలితే ఉండగలిగే స్థైర్యము(మనోబలము), ధైర్యం తనకు ఉన్నవో లేవో తెలీదు. కారణం మనోబలం లేకపోవడమే. 
    
   మనస్సు ధృఢంగా వుంటే సందేహాలే రావు. ఎవరినీ సలహా అడగవలసిన అవసరం లేదు. వైరాగ్యం ధృఢంగా వుంటే తన నిర్ణయంతో ఎటువంటి ఫలం ఎదురైనా చలించక ధైర్యంగా స్వీకరిస్తాడు. వైరాగ్య లక్షణానికి ఇది గీటురాయి. అయితే దృఢ వైరాగ్యం పరమేశ్వరుని అనుగ్రహ ప్రసాదంగా లభిస్తుంది.
 💐31శ్రీ లింగ మహాపురాణం💐 

       🌼శివస్తుతి🌼

#ముప్పై ఒకటవ భాగం#

దివ్య దృష్టి పొందిన మహర్షులు పరమేశ్వరుని నిజరూప దర్శనం పొంది తన్మయులై ఈవిధంగా శివస్తుతి చేశారు.

నమో దిగ్వాససే నిత్య కృతాంతాయ త్రిశూలినే |
వికటాయ కరాలాయ కరాళ వదనాయ చ ||

దిక్కులే వస్త్రములుగా గల దిగంబర శివునికి నమస్కారం! త్రిశూలధారికి నమస్కారం! విశ్వవినాశునకు నమస్కారం! కరాల కరాళ వదనునికి నమస్కారం! 

అరూపాయ సురూపాయ విశ్వరూపాయ తే నమః |
కటంకటాయ రుద్రాయ స్వాహాకారాయ వై నమః ||

రూపము లేనివానికి నమస్కారం! సుందరరూపునికి నమస్కారం! విశ్వరూపునికి నమస్కారం! రుద్రునికి నమస్కారం! స్వరాధిపతికి నమస్కారం! 

సర్వప్రణతదేహాయ స్వయం చ ప్రణతాత్మనే |
నిత్యం నీలశిఖండాయ శ్రీకంఠాయ నమో నమః ||

సర్వాత్మల చేత నమస్కరించబడు వానికి నమస్కారం! నిత్యం నీలవర్ణములో ఉండే శివునకు నమస్కారం! శ్రీకంఠునకు నమస్కారం! 

నీలకంఠాయ దేవాయ చితభస్మాంగధారిణే |
త్వం బ్రహ్మా సర్వదేవానాం రుద్రాణాం నీలలోహిత ||

నీలకంఠ దేవునికి నమస్కారం! చితాభస్మం దేహమంతా ధరించినవాడికి నమస్కారం! సర్వదేవతలలో పరబ్రహ్మకు నమస్కారం! రుద్రులలో నీలలోహితునకు నమస్కారం! 

ఆత్మా చ సర్వభూతానాం సాంఖ్యెః పురుష ఉచ్యతే |
పర్వతానాం మహామేరుర్నక్షత్రాణం చ చంద్రమాః ||

సమస్త ప్రాణులకు ఆత్మవు నీవే! నీవే సాంఖ్యుల చేత పరమపురుషుడని పిలవబడుతున్నావు! పర్వతాలలో మహామేరు పర్వతం నీవే! నక్షత్రాలలో చంద్రుడివి నీవే! 

ఋషీణాం చ వసిష్ఠస్త్వం దేవానాం వాసవ స్తథా |
ఓంకారః సర్వవేదానాం శ్రేష్టం సామ చ సామసు ||

ఋషులలో వసిష్ఠుడివి నీవే! దేవతలలో రుద్రుడివి నీవే! వేదాలలో ఓంకారం నీవే! సామములలో సామవేదం నీవే! 

ఆరణ్యానాం పశూనాం చ సింహస్త్వం పరమేశ్వరః |
గ్రామ్యాణామృషభశ్చాసి భగవాంల్లోక పూజిస్తూ ||

అరణ్యమృగాలలో సింహము నీవే! గ్రామజంతువులలో వృషభం నీవే! లోకాలలో భగవంతుడిగా పూజించబడే పరమేశ్వరుడు నీవే! 

సర్వథా వర్తమానోపి యోయో భావో భవిష్యతి |
త్వామేవ తత్ర పశ్యామో బ్రహ్మణా కథితమ్ తథా ||

వర్తమానంలో ఉన్న మేము బ్రహ్మ చెప్పిన విధి విధానం ద్వారా  భూత భవిష్యత్తు వర్తమానాలలో కనపడని ఉన్న  నిన్ను సందర్శించుకోగలుగుతున్నాము! 

కామః క్రోధశ్చ లోభశ్చ విషాదో మద ఏవ చ |
యేతదీచ్ఛామహే బోద్ధుం ప్రసీద పరమేశ్వర ||

మాలోని కామ క్రోధ లోభ విషాద  మద అహంకారాలన్ని తెలుసుకుని వదిలేద్దాం అనుకుంటున్నాము. పరమేశ్వరా! మమ్మల్ని అనుగ్రహించి ప్రసన్నుడవు అవ్వుము. 

మహాసంహరణే పాప్తే త్వయా దేవ కృతాత్మనా |
కరం లలాటే సంవిధ్య వహ్నిరుత్పాదిత స్త్వయా ||

ప్రళయ సమయంలో నీవే స్వయంగా మమ్మల్ని సంహరించి మూడో కన్ను నుంచి అగ్నిజ్వాలలు లోకాలను దహించటానికి పుట్టించావు 

తేనాగ్నినా తథాలోక అర్చర్బిః సర్వతో వృతాః |
తస్మాదగ్నిసమా హ్వోతే భవావో వకృతాగ్నయః ||

అలా పుట్టిన అగ్ని అన్నిలోకాలను చుట్టుముట్టి దహించివేసాయి.  ప్రళయాగ్ని సమాన రుద్రుడవు నీవే! 

కామం క్రోధశ్చ లోభశ్చ మోహో దంభ ఉపద్రవం |
యాని చ్చాన్యాని భూతాని స్థావరాణి చరాణి చ ||

కామ క్రోధ లోభ మోహ దంభాది ఉపద్రవాలు, సర్వ చరాచర ప్రాణులు నీ చేత సృష్టించబడిన అగ్నిలో దహించబడుతున్నాయి. 

దహ్యంతే ప్రాణినస్తే తు త్వత్సముతేన వహ్నినా |
ఆస్తమాకు దహ్యమానానాం త్రతా భవ సురేశ్వర ||
త్వంచ లోకహితార్థాయ భూతాని పరిషించసి |
మహేశ్వరా మహాభాగ ప్రభో శుభనిరీక్షక ||
ఆజ్ఞాపయ వయం నాథ కర్తారో వచనం తవ |
భూతకోటి సహస్రేషు రూపకోటి శతేషు చ |
అంతం గంతుం న శక్తాః‌ స్మ దేవదేవ నమోస్తుతే ||

దేవదేవా! మహేశ్వరా! నీ చేత సృష్టించిబడిన కామక్రోధాది అగ్నులలో దహించబడుతున్న మమ్మల్ని రక్షింపుము! లోకహితము కోసం నీవే సకల ప్రాణులను పరిరక్షిస్తున్నావు! మహాభాగా! మేమందరం నీ ఆజ్ఞలను పాటించేవారం! కోట్లాది ప్రాణులలో కోట్లాది రూపములలో ఉన్న మేము నీ ఆది అంతము చూడలేని అసమర్థులం! కావున నీవే మమ్మల్ని క్షమించి కాపాడాలి. నీ పై భక్తి సదా కలిగి ఉండేటట్టు చేయాలి!" అని మునులు చేసిన శివస్తుతికి మహేశ్వరుడు ప్రసన్నుడై

"మునులారా! ప్రసన్నుడనై మీకు హితోపదేశం చేస్తున్నాను.  నేను నన్ను ప్రకృతి పురుషునిగా విభజించుకుని సృష్టిని ఆరంభించాను. కనుక స్త్రీ లింగ రూపములో ఉత్పన్నమైన ప్రతి జీవి ప్రకృతి నుంచి వచ్చినదే. అలాగే పురుష రూపంలో ఉండే జీవులన్ని నా నుంచి ఏర్పడిన పురుషుడి నుంచి వచ్చినదే. కాబట్టి సృష్టి అంతా ప్రకృతి పురుషుల నుంచి ఏర్పడింది.

కనుక నా భక్తులైనవారు దిగంబర రూపంలోని యతులను, వారి చేష్టలు బాలుని వలె లేదా పిచ్చివాని వలె ఉన్నా నిందించరాదు, గేళి చేయరాదు. శివభక్తులు భస్మధారణ చేయడానికి ఇష్టపడతారు. భస్మధారణ ద్వారా పాపాలు తొలగిపోతాయి. వీరు రుద్రలోకము చేరుకుంటారు. ఇటువంటి వారిని నిందించడం నన్ను (శివుని) నిందించటమే అవుతుంది. వీరిని పూజించితే నన్ను పూజించినట్టు అవుతుంది.

లోక కల్యాణం కోసం  రుద్రుడు ప్రతియుగంలో భస్మము పూసుకుని మహాయోగి వలె లీలలు చూపిస్తుంటాడు. మీరు గుర్తించి వారిని గౌరవించి పూజించండి" అని అనుగ్రహ భాషణం చేశాడు.

మునులు పరమేశ్వరునికి నమస్కరించి శివలింగ ప్రతిష్టించి సుగంధ కుశములు, పుష్పాలు, ఫలాలతో కూడిన జలమును మహాకుంభాలతో తెచ్చి అభిషేకం చేసారు.

*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*.
🌹శ్రీకాంత్ గంజికుంట 
కరణంగారి సౌజన్యంతో🌹
💜   ఓం శ్రీఉమా 
మహేశ్వరాయ నమ:💜
🙏లోకా:సమస్తాః 
సుఖినోభవన్తు🙏 
రేపటి తరానికి బ్రతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
     (సర్వం శ్రీశివార్పణమస్తు) 
                🌷🙏🌷

శుభమస్తు 🌹 🌷 ♥️ 🙏 స్వస్తి.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺
 1️⃣1️⃣7️⃣

*🛕🔔భగవద్గీత🔔🛕*
  _(సరళమైన తెలుగులో)_

     *4. జ్ఞాన యోగము.*
   (నాలుగవ అధ్యాయము)

*32. ఏవం బహువిధా యజ్ఞా వితతా బ్రహ్మణో ముఖేl*
 *కర్మజాన్ విద్ధి తాన్ సర్వానేవం జ్ఞాత్వా విమోక్ష్యసేll*

ఓ అర్జునా! ఈ ప్రకారంగా వివిధములైన యజ్జములు అన్ని వేదములలో చెప్పబడ్డాయి. ఈ యజ్ఞములు అన్నీ కర్మల వలన ఏర్పడ్డాయి. కాబట్టి ఏ కర్మ చేసినా అది ఒక యజ్ఞంలాగా భగవంతుని పరంగా చేయాలి. అప్పుడే నీకు ముక్తి లభిస్తుంది అని తెలుసుకో... అని పరమాత్మ బోధించాడు.

కర్మలలో పుట్టి పెరిగి, కర్మలు చేసే ప్రతి వాడూ ఈ యజ్ఞముల గురించి తెలుసుకోవాలి. ఆచరించాలి. శాశ్వతానందమును పొందాలి. అందరూ వేదములను చదవలేరు, చదివినా అర్థం కావు కాబట్టి పరమాత్మ మనకు వివరంగా క్లుప్తంగా ఈ యజ్ఞముల గురించి చెప్పాడు. కర్మణాన్ అంటే ఈ యజ్ఞములు అన్నీ కర్మల వలన పుట్టినవి. ఏ యజ్ఞము కానీ శ్రద్ధతో నిష్టతో, భక్తితో చేయాలి గానీ ఏ ప్రయత్నమూ చేయకుండా సోమరిగా కూర్చోకూడదు. కాబట్టి ఇంద్రియములను, మనస్సును నిగ్రహించి ఏదో ఒక యజ్ఞము చేసి, జ్ఞానము సంపాదించి, మోక్షమార్గంలో ప్రయాణం చేయాలి కానీ ఏ ప్రయత్నమూ లేకుండా జ్ఞానం రమ్మంటే రాదు అని పరమాత్మ నిర్ద్వంద్వంగా చెప్పాడు.

ఒక్కసారి ఇప్పటి వరకు ఎన్ని యజ్ఞములు చెప్పబడ్డాయో తెలుసుకుందాము. శ్లోకము 25 లో దైవ యజ్ఞము, బ్రహ్మ యజ్ఞము. 26 లో ఇంద్రియ సంయమనము, శబ్దము మొదలగు విషయములను నిరోధించేయజ్ఞము. 27 లో మనో నిగ్రహ యజ్ఞము. 28 లో ద్రవ్య యజ్ఞము, తపో యజ్ఞము, యోగ యజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము. జ్ఞాన యజ్ఞము. 29 లో ప్రాణాయామము. 30 లో ఆహార నియమములు అనే యజ్ఞము. మొత్తము 12 రకములైన యజ్ఞములు చెప్పబడ్డాయి. ఇవే కాదు వేదములలో ఇంకా చాలా విధములైన యజ్ఞముల గురించి చాలా విస్తారంగా, విపులంగా చెప్పబడింది. ఈ యజ్ఞములనన్నింటినీ స్థూలంగా రెండుగా విభజించవచ్చు. అవే జ్ఞాన యజ్ఞము, కర్మయజ్ఞము. కర్మయజ్ఞములు కూడా జ్ఞాన సముపార్జనకు తోడుపడతాయి. అందుకని ముందు కర్మయజ్ఞములు ఆచరించి వాటి వలన చిత్త శుద్ధి, మానసిక నిర్మలత్వము పొంది తరువాత జ్ఞాన యజ్ఞములు చేసి మోక్షమునకు మార్గం సుగమం చేసుకోవాలి.

*33. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞా జ్ఞానయజ్ఞః పరన్తపl* 
*సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతేll*

ద్రవ్యములతో కూడిన యజ్ఞము కంటే జ్ఞానము గురించి చేసే యజ్ఞము గొప్పది అని పరమాత్మ చెప్పాడు.

ద్రవ్యములు అన్నీ శాశ్వతములు కావు. జ్ఞానము నాశనం అయ్యేది కాదు. పైగా ద్రవ్య యజ్ఞములు చేస్తే వచ్చేది జ్ఞానమే. జ్ఞానమునకు తొలి మెట్టు ద్రవ్యయజ్ఞము. కాబట్టి ద్రవ్యయజ్ఞము కంటే జ్ఞానయజ్ఞము గొప్పది. జ్ఞాన యజ్ఞము అంటే ఆత్మ తత్వమును గురించి విచారించడం, తెలుసుకోవడం. పరిశోధించడం, ఆత్మ అంటే ఏమిటి అనాత్మ అంటే ఏమిటి అని విచారించడం. మనం జ్ఞానేంద్రియములతో గ్రహించే విషయములను వివేకంతో పరిశీలించడం, భగవంతుని గురించి వినడం, మననం చేయడం, ఆచరించడం, ఇంద్రియములను, మనస్సును నిగ్రహించడం, పూర్వజన్మవాసనలను పూర్తిగా నిర్మూలించడం, మొదలగునవి జ్ఞానయజ్ఞము కిందికి వస్తాయి.

ఇంక ద్రవ్యయజ్ఞము అంటే ధనముతో సంపాదించిన వస్తువులతోనూ, బంగారముతో చేసిన వస్తువులను ఉపయోగించి చేసే యజ్ఞములు, ద్రవ్యము, వస్తువులు అశాశ్వతములు కాబట్టి జ్ఞానయజ్ఞమే శ్రేష్టము అని అన్నారు. ద్రవ్యయజ్ఞమునకు ధనం కావాలి, వస్తువులు కావాలి. కాని జ్ఞానయజ్ఞమునకు మన ప్రయత్నం తప్ప వేరే ఏదీ అక్కరలేదు. మనం విహిత కర్మలు చేసినా, కర్మలో అకర్మను చూచినా, అకర్మలో కర్మను చూచినా తుదకు అది జ్ఞానమునకే దారి తీస్తుంది. కాబట్టి ఏదీ వృధా కాదు. ఏ కర్మయజ్ఞము చేసినా అది తుదకు మానవునికి చిత్తశుద్ధిని కలిగించి జ్ఞానమును సంపాదించి పెడతాయి. నదులన్నీ సముద్రంలో కలిసినట్టు ఎన్ని కర్మలు చేసినా అవి తుదకు జ్ఞానము అనే సముద్రంలో కలుస్తాయి. అందుకే పరమాత్మ జ్ఞానే పరిసమాప్యతే అనే పదం వాడాడు. మనం ఏ యజ్ఞము చేసినా తుదకు జ్ఞానంతో పరిసమాప్తం అవుతుంది అని అర్థం. మనం చేసే సమస్తమైన కర్మలు, యజ్ఞములు వాటిఫలములు అన్నీ జ్ఞానంలో కలిసిపోతాయి. శాశ్వతత్వాన్ని పొందుతాయి.

కాబట్టి మనం ఏదైనా మంచి పని శ్రద్ధతో, భక్తితో, దైవపరంగా, నిష్కామంగా చేస్తే అది యజ్ఙంతో సమానము. దానికి మంచి ఫలం ఎప్పుడూ వెన్నంటి ఉంటుంది. అది జ్ఞానమునకు దారితీస్తుంది. కాబట్టి ప్రతి మానవుడు కూడా జ్ఞానమును పొందాలి అనే లక్ష్యంతోనే కర్మలు చేయాలి కానీ ఏవో తాత్కాలిక సుఖముల కోసం కాదు. కర్మ యజ్ఞము యొక్క లక్ష్యం జ్ఞానం పొందడం. దానికి సాయపడేదే కర్మ. అంతే కానీ ద్రవ్యయజ్ఞములే శాశ్వతం కాదు. మానవులు ఏ దేవుని పూజించినా, ఏ మార్గంలో ప్రయాణించినా, ఏ సాధన చేసినా, ఏ సంప్రదాయాన్ని పాటించినా, తుదకు జ్ఞానోదయమే అంతిమ లక్ష్యము. మోక్షం పొందడానికి ఈ జ్ఞానమే తుది మెట్టు. కాబట్టి జ్ఞానాన్ని సాధించడానికి కర్మ చేయాలి. ఆ జ్ఞానంతో మోక్ష మార్గం చేరుకోవాలి.

కర్మ ఏం చేస్తుంది? మానవుని జ్ఞానము అనే భవనం వద్దకు తీసుకొని వెళుతుంది. అక్కడి నుండి జ్ఞానము మానవుని మోక్షమార్గంలో తీసుకెళుతుంది. కాబట్టి జ్ఞానము అనేది ఒకే సారి రాదు. సత్కర్మలు చేసి చేసి, చిత్తశుద్ధిని అలవరచుకొని, తరువాత జ్ఞానమును సంపాదించాలి. కాబట్టి మొట్ట మొదటి మెట్టుగా మానవుడు కర్మయోగం అవలంబించాలి. సత్కర్మలు చేయాలి. సత్సంగములో ఉండాలి, నిష్కామ కర్మలు చేయాలి. నిరంతరము భగవంతుని ఆరాదించడం, దైవ చింతన చేయడం, శ్రవణం, మననం, కీర్తనం మొదలగునవి ఆచరించాలి. అప్పుడు మానవుడు జ్ఞానమునకు అర్హుడవుతాడు. కాబట్టి ప్రతి మానవుడు జ్ఞానసముపార్జనే లక్ష్యంగా కర్మలు చేయాలి. జ్ఞానము, కర్మ రెండింటిలో జ్ఞానమే శ్రేష్ఠమనీ, కాని జ్ఞానము సంపాదించడానికి కర్మముఖ్యమనీ పరమాత్మ స్పష్టంగా చెప్పాడు.

ఈ శ్లోకంలో జ్ఞానము యొక్క శ్రేష్టత, కర్మయొక్క ఆవశ్యకత నిరూపించబడ్డాయి. మరి ఆ జ్ఞానమును ఎలా పొందాలి అనే విషయాన్ని తరువాతి శ్లోకంలో చెప్పాడు పరమాత్మ.
(సశేషం)

*🌹యోగక్షేమం వాహామ్యహం 🌹*

(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
                           P272
 *_🦚 శ్రీరమణమహర్షి 🦚_*
꧁┉┅━❀🔯❀━┅┉꧂
*_🧘🏼‍♂️ ఒక యువకుడు చదువుకున్నవాడు. కొంత స్థితి, స్తోమత కలిగి ఉన్నవాడు. ఆరోగ్యవంతుడు. మంచీ చెడ్డా ఎఱిగినవాడు._* 
*_ఒకనాడు ఇంట్లో భగవాన్ పటం ఎదురుగా కూర్చుని భగవానును ధ్యానిస్తున్నాడు. ఉన్నట్లుండి చిత్రం సజీవమైనట్లు తోచింది. భయంతో మూర్ఛపోయేంత పని అయింది. అమ్మను కేక వేశాడు. ఆమె వచ్చి ఏమయింది ? అని అడిగింది._* 
*_చుట్టూ మూగినవారు అతని స్థితి చూచి కలవరపడ్డారు. వాళ్ళందరూ అక్కడే ఉన్నారని ఆ యువకునికి తెలుస్తూనే ఉందికాని ఏదో తెలియని శక్తి అతడిని ఇంకా అణచి వేస్తున్నది. కానీ అతడు దానిని ఎదుర్కొంటూనే ఉన్నాడు. కొంతసేపు స్మృతిని కోల్పోయాడు. తెలివి వచ్చాక అతడిని భయము ఆవేశించింది. కలవరపడినవారు అతనికి మందుమ్రాకులు ఇచ్చి, అతను తేరుకోవటానికి ప్రయత్నించారు._*
*_తరువాత కొంతకాలానికి అతడు తిరువణ్ణామలై వచ్చాడు. ఎదో మునుపటిలాగానే ఆ స్థితి ముంచుకొస్తుందనే భయం ఉండనే ఉంది అతనికి. భగవాన్ సన్నిధి, అట్టిదేమీ జరగనీయలేదు. కాని సన్నిధి నుంచి బయటకు వెళ్ళినప్పుడెల్లా, అతనికి ఆ పూర్వపు శక్తి పూనకం వచ్చి, భయావేశంలో చిక్కేవాడు._*
*_ఈ విషయాన్ని ఆశ్రమ భక్తులు, మహర్షికి విన్నవించారు. అందుకు మహర్షి దీర్ఘముగా ఇలా సెలవిచ్చారు..._*

*_🦚 ఓ అలాగా! నాకు ఎవరూ ఈ విషయాన్ని యింతవరకూ చెప్పలేదే ? అది శక్తిపాతం. శక్తిపాతంవల్ల కలిగే అనుభవం యధార్థము, సరియైనది కూడా._*
*_ఇక్కడ మనుజుడు తన సంస్కారగతిని సాగిస్తున్నాడు. సాధనలో ఆత్మ తానేనని అనుభవంలోకి వస్తున్నప్పుడు, ఉరకలువేస్తూ వస్తూన్న మనోశక్తి ఆ ఉద్వేగంలో కట్లు తెంచుకుంటుంది. తాను ఆత్మ (దైవము)ను ఏవిధముగా ఊహించాడో దాన్నిబట్టి సాధకుని అనుభవాలు ఉంటాయి._*
*_పరిపక్వబుద్ధి కలిగినవారి మనస్సు, హృదయంలో ప్రవేశించే తరుణంలో ఈ ఆత్మబోధ గురించి ఒక్కసారి విన్నారంటే, అది విద్యుత్తువలె పనిచేస్తుంది. వానికి ఆత్మ(దైవ)సాక్షాత్కారం నిశ్చయంగా అవుతుంది. అట్లుకాకపోతే ఘర్షణ తప్పదు !!_*
*_🦚 గుండెల్లో గురువు ఉంటే జీవితంలో కరువు ఉండదు. సద్గురు వేంకటరమణా.. శరణం శరణం శరణం. 🙏_* 
*_🪷 రేపటి తరానికి బతుకు, భద్రతలతోపాటు భారతీయత కూడా నేర్పండి ప్లీజ్..._*
🙏🇮🇳🎊🪴🦚🐍🔱⚜️
 🙏🕉️ హరిఃఓం 🕉️🙏

  పూజ్యశ్రీ చిన్మయానందగారి "ఒక మహాత్ముని జీవనయానం"అనే గ్రంథం నుండి :-(289వ రోజు):--
        విద్యుత్ యోగం! ఔను, మీరు స్వయంగా స్పృశించాలి ; కాని, మీ రక్కడ కూర్చొని ఎవరో ఒక సాహస వంతుడు చేస్తుంటే చూడాలను కొంటారు. తీగ వద్దకు వెళ్లి, నెమ్మది గా ... జాగ్రత్తగా ..వ్రేలును తగిలిస్తా డతను. "ఓ! ఓ! ఆఆహ్!" అని అరు స్తాడు విద్యుచ్ఛక్తి అతన్ని బలంగా త్రోయగానే. అక్కడ కూర్చొని చూస్తు న్న మీరనుకుంటారు, "ఇదన్నమాట రహస్యం. ఇదే ఆ అనుభవం : ఓ!ఓ! ఆఆహ్!". మూర్ఖుల్లా అక్కడ కూర్చొని "ఓ!ఓ! ఆఆహ్" అనే జపం మొదలుపెడ్తారు, ఆ లాభం మీకూ వస్తుందని. రాదు, నేను చెప్పేది వినండి - అలా ఎన్నటికీ జరుగదు. మీరు తీగ వద్దకు వెళ్లాల్సిందే, వ్రేలు సాచి దానిని ముట్టాల్సిందే. అప్పుడే మీకు విద్యుత్ యోగమంటే ఏమిటో బోధ పడుతుంది. అలా చేస్తేనే మీకు ప్రయోజన ముంటుంది. 
       ప్రశ్న :- ప్రయోజనం తప్పకుండా ఉంటుందని నాకెలా తెలుస్తుంది? ఆ జ్ఞానం పొందిన తర్వాత వేధించే భర్త, పెత్తనం చేసే అత్తగారు, ఏడుపు గొట్టు పిల్లలు ఉండరా ?
        స్వామీజీ :- వాళ్లంతా అలాగే ఉంటారు ; కాని, మీరు వాళ్ళను చూచే తీరు మాత్రం వేరే విధంగా ఉంటుంది. మీలోనే అంతర్గతంగా ఉన్న సత్యాన్ని మీరు గ్రహించి నపు డు, మీరు చూచే ద్వంద్వాలూ, సృష్టి లోని వైవిధ్యం - ఇవన్నీ ఆ ఒక్కగా నొక్క సత్యం నుంచే ఉద్భవించా యని గ్రహిస్తారు. అటువంటి గ్రహింపు తర్వాత, ఏదీ నిజంగా మిమ్మల్ని కలవర పరచలేదు. 
       ప్రశ్న :- ఆ శ్రేష్ఠమైన స్థితికి నేను చేరానో లేదో నాకెలా తెలుస్తుంది? ఏదైనా సరిగా చెయ్యలేదేమో ?
       స్వామీజీ :- దేముడున్నచోట 'నేను' అనే భావం ఉండజాలదు. 'నేను' ఉన్న చోటికి భగవంతుడు చాలా దూరంగా ఉంటాడు. 
        నిజానికి 'మీరు' ఆ అత్యున్నత స్థితికి చేరరు. ఆ స్థితిని అనుభవించ డానికి 'మీరు'ఉండక పోవడమే దీనికి కారణం. భగవంతుడే భగవంతుని కలుస్తాడు. 
       ప్రశ్న :- మాక్కూడా అటువంటి నిజమైన అనుభవం కలిగిందో లేదో తెలుసుకోడానికి ఉపకరించేలా, మీకు కలిగిన అనుభవాన్ని వర్ణిస్తారా? చాలామంది మహాత్ములు వారికి కలిగిన కొన్ని అనుభవాలను వివరించినట్లు నాకు గుర్తుంది. 
     స్వామీజీ :- నా స్వంత అనుభవం గురించి చెప్పాల్సిన దేమీ లేదు. అలా చెప్పడం హాస్యాస్పదం. యోగులు మాత్రమే మార్గంలో వారికి వివిధ అనుభవా లెదురయ్యా యంటారు - నిర్వికల్ప సమాధిలో అటువంటి దేమీ ఉండదు. ఆ నిర్మలమైన స్థితిలో అనుభవం అనేది లేదు. 
       🙏🕉️ హరిఃఓం 🕉️🙏
🙏👣శ్రీగురుపాదసేవలో👣🙏
               🌺 సరళ  🌺
 🌺 జ్ఞాన ప్రసూనాలు 🌺
 02/12/2025

1) భగవంతుణ్ణి పొందాలన్నది వదలి భగవంతుణ్ణి పొందాలని అనుకుంటున్నది ఎవరో చూడు.

2) తన మూలంతో తాను కనెక్ట్ అవడమే నిజమైన సత్సంగం. అంతేగాని, ఓ పదిమంది ఒకచోట చేరి తత్త్వ విచారణ చేయడంకాదు!

3) గ్రహమైనా పట్టివిడుస్తుందేగాని గురువు "అను గ్రహం", దైవము "అను గ్రహం' పడితే వదలవు!

4) జగత్తును కలగా భావించి జీవించడమే కళ.

5) ఏ మార్గంలో వెళితే తిరిగి ఈ సంసారబంధంలో చిగులుకోవో అది శ్రేయోమార్గము. ఏ మార్గంలో వెళితే తిరిగి మళ్ళీ సంసారబంధంలో ఇరుక్కుంటావో అది ప్రేయోమార్గము. ఇంద్రియాలు నెట్టేది ప్రేయోమార్గంలోకి సద్గురువు త్రోసేది శ్రేయోమార్గంలోకి

6) నేను దేహాన్ని" అనుకోవడం కంటే మూఢ విశ్వాసం మరొకటి ఉండదు.
 _*శ్రీమల్లికార్జున అష్టోత్తరశతనామావళీ -24 (93-96)*_
[శ్రీశైలఖండాంతర్గమ్ - నందీశ్వరేణ ప్రోక్తం]
✍️ శ్రీ శ్రిష్టి లక్ష్మీసీతారామాంజనేయ శర్మా
🙏🔱⚜️🔱⚜️🕉️🔱⚜️🔱⚜️🙏

93. _*ఓం గణాధీశాయ నమః*_

🔱 ఈ నామము ద్వారా మల్లికార్జునస్వామి గణాధీశుడిగా - గణదేవతల అధిపతిగా, గణపతికి తండ్రిగా, సర్వ శక్తుల సమన్వయకునిగా భావించబడతాడు. ‘గణ’ అనగా దేవతా సమూహం, ‘అధీశ’ అనగా అధిపతి.
మల్లికార్జునస్వామి గణాధీశుడిగా సర్వ గణాలకు అధిపతిగా, విధి–వినాయక తత్త్వాలకు మూలంగా, ఆధ్యాత్మిక కార్యసిద్ధికి మార్గదర్శిగా వెలుగుతాడు. మల్లికార్జున స్వామి రూపం వినాయక తత్త్వానికి, శక్తి సమాహారానికి, ధర్మ స్థాపనలో సహాయక శక్తికి ప్రతీక. ఈ నామము శివుని గణనాయకత్వాన్ని, శక్తి సమన్వయాన్ని, ఆధ్యాత్మిక కార్యసిద్ధిని ప్రతిబింబిస్తుంది.

[భ్రమరాంబికాదేవితో మల్లికార్జునస్వామినామ సమన్వయము]

🔱 భ్రమరాంబికాదేవి గణ తత్త్వానికి కార్యరూపం, శక్తులను సమన్వయపరచే ప్రకృతి, కార్యసిద్ధిని అనుభూతిగా మార్చే శక్తి. మల్లికార్జునస్వామి గణాధీశుడిగా తత్త్వాన్ని ప్రసాదిస్తే, భ్రమరాంబికాదేవి  శక్తిని భక్తుల జీవితాల్లో కార్యసిద్ధిగా మారుస్తుంది. ఇది శివ–శక్తుల గణాధిపత్య తత్త్వ సమన్వయాన్ని, శ్రీశైల కార్యసిద్ధి మహాత్మ్యాన్ని ప్రతిబింబిస్తుంది.
     🪷┈┉┅━❀🕉️❀┉┅━🪷

94. _*ఓం గిరిధన్వనే నమః*_ 

🔱 ఈ నామము ద్వారా మల్లికార్జునస్వామి గిరిధన్వనుడిగా -అరణ్యవాసి తపోమయ స్వరూపంగా, పర్వత–అరణ్యాలలో ధ్యానస్థితిగా భావించబడతాడు. ‘గిరి’ అనగా పర్వతం, ‘ధన్వన’ అనగా అరణ్యం - అనగా ప్రకృతిలో తపస్సుతో వెలిగే స్వరూపం. మల్లికార్జునస్వామి గిరిధన్వనుడిగా శివుని తపోమయ స్వరూపాన్ని, ప్రకృతిలో ధ్యానాన్ని, శాంతిని, వైరాగ్యాన్ని ప్రతిబింబిస్తాడు. మల్లికార్జునస్వామి రూపం అరణ్యవాస తపస్సుకు, ధ్యాన స్థితికి, ఆత్మవికాసానికి మార్గం. 

🔱 ఈ నామము శివుని తపోశక్తిని, ప్రకృతి–ధ్యాన సమన్వయాన్ని, ఆధ్యాత్మిక శుద్ధతను ప్రతిబింబిస్తుంది.

[భ్రమరాంబికాదేవితో మల్లికార్జునస్వామినామ సమన్వయము]

🔱 భ్రమరాంబికాదేవి గిరిధన్వన తత్త్వానికి కార్యరూపం, ప్రకృతిలో ధ్యానాన్ని ప్రవహింపజేసే శక్తి, తపస్సును అనుభూతిగా మార్చే ప్రకృతి. మల్లికార్జునస్వామి గిరిధన్వనుడిగా తత్త్వాన్ని ప్రసాదిస్తే, భ్రమరాంబికాదేవి  తత్త్వాన్ని భక్తుల జీవితాల్లో శాంతిగా మారుస్తుంది. ఇది శివ–శక్తుల తపో–ప్రకృతి తత్త్వ సమన్వయాన్ని, శ్రీశైల అరణ్య ధ్యాన మహాత్మ్యాన్ని ప్రతిబింబిస్తుంది.
     🪷┈┉┅━❀🕉️❀┉┅━🪷
   
95. _*ఓం వృషధ్వజాయ నమః*_

🔱 ఈ నామము ద్వారా మల్లికార్జునస్వామి వృషధ్వజుడిగా -వృషభాన్ని (బలరూప వాహనాన్ని) తన ధ్వజంగా ధరించినవాడిగా, ధర్మానికి ప్రతీకగా భావించబడతాడు. ‘వృష’ అనగా బలము, ధర్మము, ‘ధ్వజ’ అనగా పతాకం, ప్రతీక.
మల్లికార్జునస్వామి వృషధ్వజుడిగా ధర్మాన్ని తన వాహనంగా, బలాన్ని తన మార్గంగా, శాంతిని తన లక్ష్యంగా భక్తులకు మార్గదర్శకంగా నిలుస్తాడు. వృషభం ధైర్యానికి, స్థిరతకు, ధర్మ నిబద్ధతకు ప్రతీక. 

🔱 ఈ నామము శివుని ధర్మబలాన్ని, ఆధ్యాత్మిక స్థిరత్వాన్ని, వాహన తత్త్వాన్ని ప్రతిబింబిస్తుంది. భక్తుడు ఈ నామస్మరణతో ధర్మ మార్గంలో స్థిరంగా, ఆత్మవికాసాన్ని పొందగలడు.

[భ్రమరాంబికాదేవితో మల్లికార్జునస్వామి నామ సమన్వయము]

🔱 భ్రమరాంబికాదేవి వృషతత్త్వానికి కార్యరూపం, ధర్మాన్ని జీవనంలో ప్రవహింపజేసే శక్తి, బలాన్ని అనుభూతిగా మార్చే ప్రకృతి. మల్లికార్జునస్వామి వృషధ్వజుడిగా తత్త్వాన్ని ప్రసాదిస్తే, భ్రమరాంబికాదేవి  ధర్మాన్ని భక్తుల జీవితాల్లో శక్తిగా మారుస్తుంది. ఇది శివ–శక్తుల ధర్మ–బల తత్త్వ సమన్వయాన్ని, శ్రీశైల స్థిరత మహాత్మ్యాన్ని ప్రతిబింబిస్తుంది.
     🪷┈┉┅━❀🕉️❀┉┅━🪷

96. _*"ఓం భసితోద్ధూలితాకారాయ నమః*_
🔱 ఈ నామము ద్వారా మల్లికార్జునస్వామి భసితోద్ధూలితాకారుడిగా - భస్మంతో అలంకరించబడిన స్వరూపంగా, తపోమయ–వైరాగ్య తత్త్వానికి ప్రతీకగా భావించబడతాడు. ‘భస్మ’ అనగా విపరీతమైన తపస్సు ఫలితంగా ఏర్పడిన పవిత్ర బూడిద, ‘ఉద్ధూలిత’ అనగా అలంకరించబడిన.
మల్లికార్జునస్వామి భసితోద్ధూలితాకారుడిగా వైరాగ్యాన్ని, తపస్సును, శుద్ధతను తన శరీరంపై భస్మరూపంలో ధరించి ఆత్మజ్ఞానానికి మార్గం చూపుతాడు. భస్మం అహంకార నాశనానికి, శరీర తత్త్వానికి తాత్కాలికతకు, ఆత్మ శాశ్వతతకు సంకేతం.

🔱 ఈ నామము శివుని తపోమయ స్వరూపాన్ని, వైరాగ్యాన్ని, ఆధ్యాత్మిక శుద్ధతను ప్రతిబింబిస్తుంది. భక్తుడు ఈ నామస్మరణతో అహంకారాన్ని అధిగమించి, ధ్యాన మార్గంలో స్థిరమవుతాడు.

[భ్రమరాంబికాదేవితో మల్లికార్జునస్వామినామ సమన్వయము]

🔱 భ్రమరాంబికాదేవి భస్మతత్త్వానికి కార్యరూపం, వైరాగ్యాన్ని జీవనంలో ప్రవహింప జేసే శక్తి, తపస్సును అనుభూతిగా మార్చే ప్రకృతి. మల్లికార్జునస్వామి భసితోద్ధూలితా కారుడిగా తత్త్వాన్ని ప్రసాదిస్తే, భ్రమరాంబికాదేవి  తత్త్వాన్ని భక్తుల జీవితాల్లో శాంతిగా మారుస్తుంది. ఇది శివ–శక్తుల తపో–వైరాగ్య తత్త్వ సమన్వయాన్ని, శ్రీశైల శుద్ధత మహాత్మ్యాన్ని ప్రతిబింబిస్తుంది.
        ❀┉┅━❀🕉️❀┉┅━❀
🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 
🙏 *లోకాస్సమస్తా సుఖినోభవంతు*


*సేకరణ:రమణ ఈ సమూహంలో చేరడానికి *జైశ్రీరామ్* అని8519860693 కి WhatsApp చేయండి.
🙏⚜️🔱⚜️🔱🕉️⚜️🔱⚜️🔱🙏
 💐30శ్రీ లింగ మహాపురాణం💐 

🌼దారుకావన మునులకు బ్రహ్మోపదేశం🌼

    #ముప్పైయ్యవ భాగం#

సనత్కుమారుడు తన తండ్రి బ్రహ్మ వద్దకు వెళ్లి "పితామహా! దారుకావన మునులు తిరిగి పరమశివుని అనుగ్రహం 
ఏ విధంగాపొందగలిగారుఇందు కోసం వారికి మీరు చేసిన ఉప దేశం ఏమిటి?" అని అడిగాడు.

బ్రహ్మ సరేనని "సనత్కుమారా! నేను వారికిశివునిగొప్ఫదనాన్ని చెప్పి, అనుగ్రహం పొందడానికి పూజించేశివలింగంఎలాఉండాలో, శివ పూజ భక్తితో ఎలా చేయాలో చెప్పాను. అదే నీకు వివరిస్తాను.

మహేశ్వరుడు, మహాదేవుడు, దేవాధిదేవుడు అనిశివునితప్ప వేరేఎవ్వరినిపిలువలేము.దేవతలు,పితృదేవతలు,మునులు, మానవులు,రాక్షసులు,గంధర్వాది సకల జనానికిశివుడుఒక్కడే మహా ప్రభువు.  వేయి మహా యుగాల తరువాతవచ్చేసమస్త సృష్టిని లయం చేసుకుని తాను ఒక్కడే అవ్యక్తుడుగాఉంటాడు.

తిరిగి సృష్టిసంకల్పించినప్పుడు తానే బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఇంద్రుడుగామారిసకలలోకాలను,చరాచరజీవులనుసృష్టిస్తాడు, పరిపాలిస్తాడు, రక్షిస్తాడు. ఆయన కృతయుగంలో యోగి అని, త్రేతాయుగంలో క్రతువు అని, ద్వాపరంలో కాలాగ్నిఅని, కలియుగంలో ధర్మకేతువు అని పేర్లు కలిగి ఉంటాడు.

జ్ఞానులుశివునియొక్కఈనాలుగురుద్రరూపాలనేధ్యానిస్తుంటారు. మునులు, బ్రాహ్మణులు, నరులు సర్వలక్షణోపేతమైన లింగరూపంలోశివునిపూజిస్తారు. శివలింగము ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలో మీకు వివరిస్తాను.

లోపలయందున్న లింగము బహిర్భాగమున చతురస్ర రూపములో ఉండాలి. పిండికా ఆశ్రమ స్థానములో ఎనిమిది పార్శ్వములు ఉండాలి. ఇతర స్థానాల్లో వృత్తాకారంలో ఉండాలి.

బ్రహ్మ విష్ణువులు రుద్రునితో పాటు శివలింగము లోనే ఉంటారు. కావున లింగము సువృత్తముగా శుభకరమైన ఆకారంలో ఎనిమిది అంగుళాలు పరిమాణము కలిగి ఉండాలి.  సమకేంద్రముగా ఎనిమిది లేక పదహారు కోణాలు కలిగి ఉండాలి. ఈ విధంగా తయారు చేయబడిన లింగము అభీష్టాలన్నింటిని తీరుస్తుంది.

వేదిక  రెట్టింపుగా లేక సరిసమానంగా ఉండాలి. గోముఖ వేదిక అయితే సర్వలక్షణములతో ఆకారంలో మూడవ వంతు ఉండాలి. వేదిక యొక్క అంచు చివరలు అనగా పట్టిక నాలుగు వైపులలో ఒక యవ మాత్రమే వెడల్పు కలిగి ఉండాలి. లింగము బంగారం, వెండి లేక రాగితో చేయవచ్చును. వేదిక విస్తీర్ణం నాలుగు వైపులా మూడు రెట్లు పరిమాణం కలిగి ఉండాలి.

ఆకారంలో వేదిక వృత్తముగా లేదా త్రిభుజముగా లేదా చతుర్భుజంగా లేదా షడ్భుజంగా కోణములు కలిగి ఉండవచ్చును.  కానీ ఎక్కడా పగుళ్లు వుండరాదు. వేదిక మధ్యభాగంలో కలశం స్థాపించి, పంచాక్షరి మంత్ర సహితంగా బంగారు ముక్కలను కలశంలో ఉంచాలి. సద్యోజాత మంత్రంతో లింగమును అభిమంత్రించాలి. పంచాక్షరి మంత్రంతో శివలింగాన్ని జలంతో అభిషేకించాలి.

ఈ విధంగా పూజ సామాగ్రితో లింగపూజ  ఏకాగ్ర చిత్తంతో తన పుత్రులు, బంధుమిత్రులతో  కలసి చేయాలి.  అంజలి ఘటిస్తూ త్రినేత్రుడు, త్రిశూలధారి యైన మహేశ్వరుని మనస్సులో స్థిరపరచుకుని స్మరించాలి.  భక్తి శ్రద్థలతో తనను ఆరాధించేవారిని, పూజించేవారిని పరమశివుడు తప్పక అనుగ్రహిస్తాడు"  అన్న నా ఉపదేశం విన్న దారుకావన మునులు అలాగే చేసి శివానుగ్రహం పొందుతామని నమస్కరించి దారుకావనానికి తిరిగి వెళ్లారు" అని బ్రహ్మదేవుడు చెప్పాడు.

దారుకావనానికి తిరిగి వెళ్లిన మునులు తమ భార్యాపుత్రులతో కలసి బ్రహ్మదేవుడు చెప్పిన విధానంలో శివుని ఆరాధించ సాగారు. కొందరు ఎండలలో పర్వత శిఖరాలపై, కొందరు శీతల కొండగుహలలో, కొందరు నది తీరాలలో శివపూజ చేయసాగారు. కొందరు నిలబడి, కొందరు ఒంటి కాలిపై, కొందరు నీరు మాత్రమే ఆహారంగా, కొందరు గాలి మాత్రమే ఆహారంగా తీసుకుని శివపూజ చేశారు.

భక్తి శ్రద్థలతో మునులు చేసిన పూజలకు ప్రసన్నుడై శివుడు సంవత్సరం తరువాత అదే దింగబర అనాకారి రూపంలో దారుకావనంలో ప్రత్యక్షమైనాడు.  శరీరమంతా భస్మం పూసుకుని ఉన్నాడు. కన్నులు ఎర్రగాను, పసుపు వర్ణంలోను ఉన్నాయి. కాగడా చేతిలో పట్టుకుని అటు ఇటూ తిప్పుతూ, భయంకరంగా నవ్వుతూ, పాటలు పాడుతూ, నాట్యం చేస్తూ వారి ఆశ్రమాల చూట్టూ తిరగసాగాడు.

భిక్ష అర్థిస్తూ ప్రతి ఆశ్రమం ముందు నుంచి వివిధ రూపాలలో  వివిధ భావాలను ప్రదర్శిస్తూ వెళుతూ శివుడు వారికి కనిపించాడు. ఇప్పుడు దారుకావన మునులలో శివుని పై భక్తి శ్రద్థలు ఉండటంతో శివుని గుర్తించి భార్యాపుత్రులు, శిష్యులు, అనుచరులతో సాష్టాంగ నమస్కారం చేసి స్తుతించారు. రుద్ర భగవానునికి పళ్ళు, పూలు, పవిత్ర జలం, ధూప గంధములతో స్వాగతం పలికారు.

చేతులు జోడించి "పరమేశ్వరా! అజ్ఞానంతో, అవివేకంతో, అహంకారంతో మేము మొదట నిన్ను గుర్తించలేక తప్పు చేసాము. మా తప్పులు మన్నించి మమ్మలి క్షమించుము. చరాచర ప్రపంచం నీ నుంచే వెలువడింది. విశ్వమంతా నీవే వ్యాపించి ఉన్నావు.  అందరిని సృష్టించేవాడవు, రక్షించేవాడవు, లయము చేసుకునేవాడవు నీవే! మా తప్పులను మన్నించి ప్రసన్నుడవు కమ్ము! " అని ప్రార్ధించారు.

పరమేశ్వరుడు ప్రసన్నుడై తన దిగంబర రుద్ర రూపం వదలి వేలాది సూర్యుల తేజస్సుతో   త్రినేత్ర, త్రిశూలధారిగా దారుకావన మునులకు దర్శనమిచ్చాడు. ఆ రూపము చూడటానికి మునులకు దివ్య దృష్టి ప్రసాదించాడు. దివ్య దృష్టి పొందిన మునులు పరమశివుని నిజరూపం చూసి పులకితులై శివస్తుతి చేశారు.

*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*.
🌹శ్రీకాంత్ గంజికుంట 
కరణంగారి సౌజన్యంతో🌹
💜   ఓం శ్రీఉమా 
మహేశ్వరాయ నమ:💜
🙏లోకా:సమస్తాః 
సుఖినోభవన్తు🙏 
రేపటి తరానికి బ్రతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
     (సర్వం శ్రీశివార్పణమస్తు) 
                🌷🙏🌷

శుభమస్తు 🌹 🌷 ♥️ 🙏 స్వస్తి.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺
 🔥అంతర్యామి 🔥

# గెలుపు దారి..

☘️లోకంలో కొందరు తమ బుద్ధి విశేషంతో, అపార అనుభవంతో ఎలాంటి సమస్యలనైనా తేలిగ్గా ఎదుర్కొంటారు. సొంతంగా నిర్ణయాలు తీసుకోగ ఆ సామర్థ్యాన్ని స్వయం ప్రతిపత్తిగా చెప్పుకోవచ్చు. ఆ క్రమంలో విజయం సాధించినప్పుడల్లా తమపై తమకు నమ్మకం పెరుగుతూ వస్తుంది. ఆధ్యాత్మిక పరిభాషలో 'పౌరుషం' అంటే అదే!

☘️మరికొందరు ప్రతి విషయానికీ దేవుడి సాయం ఆశిస్తారు. తమ చిత్తాన్ని దైవానికి అంకితం చేసి, కోరికలను ప్రార్ధన రూపంలో భగవంతుడికి నివేదిస్తూ ఉంటారు. ఆ క్రమంలో గెలుపొందినప్పుడల్లా వారికి దేవుడిపై నమ్మకం మరింత బలపడుతూ వస్తుంది. అలా తమను తాము దైవానికి సమర్పణ చేసుకోవడమే- 'శరణాగతి'. ఆ మార్గంలో దక్కిన విజయాన్ని 'దైవికత' అంటారు. దైవ, పౌరుషాల మధ్య సమన్వయం చేకూరితే సంపూర్ణ విజయం సిద్ధిస్తుందని పెద్దల సూచన. అర్జునుడికి లభించింది. ఆది. పూర్తి సామర్థ్యంతో, పరాక్రమంతో తానే యుద్ధం చేసినా కీలక సమయాల్లో మాత్రం కృష్ణుడి సహకారాన్ని స్వీకరించాడు. దైవ, పౌరుషాల ఆ మేలికలయిక కిరీటికి గొప్ప విజయాన్ని అందించింది. 'శిశుపాల వధ'లో మాఘకవి- ఆ కలుపుగోలు ధోరణిని వివరిస్తూ 'విద్వాంసుడు పూర్తిగా దైవంపై ఆధారపడడు. అలా అని, అంతా తన ప్రతిభేననీ పొరబడడు, సత్కవులకు శబ్దం, అర్ధం రెండూ అవసరమైనట్లే... విజేతల విషయంలో దైవ పౌరుషాలు ఒకటవ్వాలి' అన్నాడు. ఆధునిక యుగంలో ఈ సూత్రాన్ని విజయవంతంగా అమలుచేసిన వారిలో భారత పూర్వ రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ అగ్రగణ్యులు.

☘️'ఆదినుంచీ దైవాన్ని నా కార్యకలాపాల్లో భాగస్వామిగా నమ్మడం అలవాటు. విధుల్లో అత్యుత్తమ ఫలితాలను సాధించడం అన్నివేళలా సాధ్యం కాదని, అది నా శక్తికి మించినదని నాకు తెలుసు. నా సామర్థ్యాన్ని తొలుత అంచనా వేసుకుని దాన్ని యాభైశాతం పెంచి, నన్ను నేను  దేవుడి చేతులకు సమర్పించుకుంటాను. ఆ తరహా సమష్టి భాగస్వామ్యంలో నేను అదనపు శక్తిని పొందడమే కాక, అది నిజంగానే నా ద్వారా ప్రసరిస్తున్న అనుభూతిని సైతం స్వయంగా ఆస్వాదించాను. దేవుడి రాజ్యం నీలోనే ఆ శక్తి రూపంలో ఉంటుందని నిశ్చయంగా చెప్పగలను' అంటూ తన ఆత్మకథలో కలామ్ చెప్పారు.

☘️దిలీప్ కుమార్ పుట్టి పదహారో ఏట సూఫిజాన్ని స్వీకరించి, భారతీయ సినీ సంగీత జగత్తును శాసించే స్థాయికి ఎదిగిన ఎ. ఆర్. రెహమాన్ అనుభవమూ అదే. 'ఎప్పటికప్పుడు కొత్తదేదో చేయడానికి నన్నొక శక్తి ముందుకు తోస్తోందని నిత్యం అనిపిస్తూనే ఉంది' అన్నారాయన. పడమటి సంగీతానికి పట్టుచీర కట్టినట్లు తన పౌరుషానికి దైవికతను చుట్టబెట్టాన దాని అంతరార్థం.

☘️కలామ్, రెహమాన్ల విషయంలో ఆధ్యాత్మికత అనేది విశ్వాసాలకు చెందినది కాదు- అధ్యయనం చేయాల్సిన అంశంగా నిరూపణ అయిన విషయం. దాన్ని అర్థం చేసుకుంటే ఆధ్యాత్మికతను మనిషి తనకు చోదకశక్తిగా మలచుకోగలుగుతాడు. అది గెలుపు దిశగా మనిషిని నడిపించగలుగుతుంది.🙏

✍️- ఎర్రాప్రగడ రామకృష్ణ

🌺 శ్రీ రామ జయ రామ జయ జయ రామ 🌺
 1️⃣1️⃣6️⃣

*🛕🔔భగవద్గీత🔔🛕*
  _(సరళమైన తెలుగులో)_

     *4. జ్ఞాన యోగము.*
   (నాలుగవ అధ్యాయము)

*31. యజ్ఞశిష్టామృతభుజో యాన్తి బ్రహ్మ సనాతనమ్l*
 *నాయం లోకోఽస్త్యయజ్ఞస్య కుతోఽన్యః కురుసత్తమll*

పైన చెప్ప బడిన యజ్ఞములు చేసిన తరువాత యజ్ఞ ప్రసాదమును స్వీకరిస్తే వారికి శాశ్వతమైన బ్రహ్మపదము లభిస్తుంది. యజ్ఞము చేసిన తరువాత చేసే భోజనము కూడా యజ్ఞఫలము, యజ్ఞశేషము అవుతుంది. అటువంటి యజ్ఞము కనీసం ఒకటైనా చెయ్యాలి. అప్పుడు ఈ మానవ జన్మ ఎత్తి నందుకు సార్థకత కలుగుతుంది. ఏమీ చేయకపోతే ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా అంటే మరుజన్మలో కూడా సుఖం కలుగదు.

పైన చెప్పబడిన యజ్ఞములలో కొన్ని పూజలు వ్రతాలు, ఉన్నాయి. ఇవి చేసిన తరువాత భగవంతునికి నివేదించిన పదార్థాలను, భగవంతుని ప్రసాదంగా ఆరగించడం వలన శరీరము మనసు పరిశుద్ధం అవుతుంది. భగవంతునికి నివేదించిన పదార్థములు అమృతంగా మారిపోతాయి. అవి తింటే మనం కూడా అమృతత్వమును సంతరించుకుంటాము. అందుకే భగవంతునికి నివేదించిన పదార్థములను ప్రసాదము అనీ, అమృతముతో సమానమనీ, మనం భక్తితో కళ్లకద్దుకొని మరీ తింటాము. (సత్యనారాయణవ్రత ప్రసాదము ఇటువంటిదే. శ్రద్ధతో, దీక్షగా వ్రతం చేసి, లేదా వ్రతం జరిగే చోట కూర్చుని, వ్రతం అయిన తరువాత ప్రసాదం స్వీకరించాలే కాని కేవలం ప్రసాదం పెట్టే సమయానికి వాలిపోయే ప్రసాద భక్తులం కాకూడదు).

పైన చెప్పిన శ్లోకంలో యజ్ఞము, దానికి ఉపయోగించే వస్తువులు, ఆ యజ్ఞము చేసే వ్యక్తులు, ఆ యజ్ఞఫలము అంతా బ్రహ్మ పదార్ధమే అని చెప్పారు. ఈ శ్లోకంలో యజ్ఞము చేసిన తరువాత మిగిలిన పదార్ధములు కూడా బ్రహ్మమే. అవి ఆరగిస్తే వాళ్లు కూడా బ్రహ్మ స్వరూపులు అవుతారు. మనం ఏదన్నా పని చేస్తే ఆ కార్యము యొక్క గొప్ప దానము దాని ఫలితము మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మనం యజ్ఞము అనే కర్మ చేస్తున్నాము. యజ్ఞము బ్రహ్మము అయినపుడు ఆ యజ్ఞఫలము కూడా బ్రహ్మమే అవుతుంది కదా.

మనం బాహ్య ప్రపంచములో అనేక కర్మలు చేస్తుంటాము. వాటికి తగిన ఫలితములను పొందుతుంటాము. ఆ ఫలితములన్నీ కేవలం క్షణికములే. ఇలా వచ్చి అలా పోతాయి. కాని మనం చేసే కర్మ బ్రహ్మస్వరూపము అయినపుడు దాని ఫలితము కూడా బ్రహ్మమే అయినపుడు ఆ ఫలితము శాశ్వతముగా ఉండి పోతుంది. మనకు శాశ్వతానందము కలుగజేస్తుంది. మనం ఈ జన్మ ఎత్తింది మోక్షం కోసం. మోక్షం అంటే ప్రాపంచిక విషయముల నుండి విముక్తి పొందటం. అటువంటప్పుడు మనం కేవలం క్షణికములు అయిన సుఖములు ఇచ్చే వాటి కోసం పాకులాడే కంటే శాశ్వతానందము ఇచ్చే బ్రహ్మయజ్ఞము కోసం ఎందుకు ప్రయత్నించకూడదు. కాబట్టి మనం అందరం పైన చెప్పబడిన దేవ యజ్ఞము, బ్రహ్మ యజ్ఞము, ద్రవ్యయజ్ఞము, తపోయజ్ఞము, యోగ యజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము, ఆహార సంయమనము వీటిలో ఏదో ఒక యజ్ఞమును శ్రద్ధాభక్తులతో, ఏకాగ్రతతో, నిష్కామంగా చేసి శాశ్వతానందమును ఎందుకు పొందకూడదు.

కాబట్టి మనం మన పరిధిలో ప్రతిరోజూ దేవునికి పూజాకార్యక్రమమును నిర్వర్తించి వండుకున్న పదార్థములను దేవుడికి నివేదించి తరువాత భుజించాలి అనే నియమం పెట్టుకోవాలి. అదే దేవయజ్ఞము. అలా కాకుండా వండుకున్నది దేవుడికి అర్పించకుండా తింటే పాపము తింటున్నట్టు అని ఇదివరకే తెలుసుకున్నాము. అటువంటి వానికి ఈ లోకంలో సుఖంఉండదు. పరలోకంలో అంటే తరువాతి జన్మలో కూడా సుఖం ఉండదు. కాబట్టి ఉత్తమమైన మానవ జన్మను పొంది కూడా, కేవలం ప్రాపంచిక విషయముల కోసరం పాడులాడటం అవివేకము అని తెలుసుకోవాలి.

ఈ శ్లోకంలో భగవానుడు యజ్ఞశిష్టామృతభుజో అని చెప్పాడు. ఏదో ఒక యజ్ఞము చేసి తరువాత ఆ యజ్ఞశేషము అనే అమృతమును భుజించువాడు అని అర్థము. మనకు చేతనైన ఏదో ఒక యజ్ఞము చేసి, భగవంతునికి నివేదించి, ఆ యజ్ఞ శేషమును తింటే అది అమృతముతో సమానము. ఇక్కడ అమృతము అంటే మృతము లేని జ్ఞానము, వివేకము, శాంతి కలుగుతుంది. అంతే కానీ మనకు చావు రాదని కాదు. పుట్టినవాడు చావక తప్పదు అని గీతావాక్యము. కాబట్టి అమృతం అంటే అవ్యయము అయిన ఆత్మతత్వము, ఆత్మజ్ఞానము అని అర్ధము.

ఇటువంటి యజ్ఞములు అంటే దేవతా కర్మలు, కనీసం ఒకటి అయినా చేయని వాడు అంటే ప్రతిరోజూ దేవుడికి దీపం పెట్టి తాను తయారుచేసుకున్న భోజనము పరమాత్మకు నివేదించని వాడు, ఈ లోకంలో కాదు కదా, పరలోకంలో కూడా అంటే మరుజన్మలో కూడా సుఖపడడు. వాడికి సుఖము శాంతి అనేవి ఉండవు అని పరమాత్మ బోధించాడు.

ఇక్కడ మనకు ఒకసందేహము వస్తుంది. జ్ఞానయజ్ఞము, ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము, తపస్సు, ప్రాణాయాయము మొదలగునవి చేస్తే, యజ్ఞశేషము అనేది ఉండదు. కదా అని. మనం ఏ పని చేసినా అది తుదకు భోజనముతో సమాప్తి అవుతుంది. ఆ భోజనమునే భగవంతునికి నివేదించి, ఆ అమృతమును భుజించాలి అని అర్థం. పైన చెప్ప బడిన జ్ఞానయజ్ఞము, ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము, తపస్సు, ప్రాణాయామము మొదలగు యజ్ఞముల ఫలము దాని వలన మనశ్శాంతిని, సుఖశాంతులను పొందటం. ఇవి కళ్లకు కనిపించే ఫలములు కాదు. మనస్సుతో అనుభవించేవి. అవి కూడా అమృతములే అంటే మృతము కానివి. శాశ్వతమైనవి.
(సశేషం)

*🌹యోగక్షేమం వాహామ్యహం 🌹*

(రచన: శ్రీ మొదలి వెంకట సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ. పి. హైకోర్టు.)
                           P270
 యోగి శ్రీ రామ సూరత్ కుమార్, తిరువన్నామలై
తిరువణ్ణామలై తలిచినంతనే సమస్త పాపాలను తొలగించే క్షేత్రం. తిరువణ్ణామలై కారణ జన్ములలో చిన్న మొలకలుగా ఉన్న ఆధ్యాత్మిక భావాలను ఎదిగి పదిమందికి నీడ నిచ్చే వటవృక్షాలుగా మార్చేదివ్య క్షేత్రం. మొన్న నిన్న నేడు ఇంకా ముందు ముందు ఎందరికో అద్భుత ఆధ్యాత్మిక పరిపక్వత అందించే మహోన్నత క్షేత్రం. అందుకే తిరువణ్ణామలై దేశం నలుమూలల నుండి ఆధ్యాత్మిక వాదులను ఆకర్షిస్తోంది.
అలా సరి అయిన క్షేత్రం కోసం అన్వేషణ చేస్తూ చివరికి తిరువణ్ణామలై చేరిన వారే యోగి రామ సూరత్ కుమార్ స్వామి.పవిత్ర గంగా నదీ తీరం.భూలోక కైలాసం కాశి.
ఈ రెండింటికీ సమీపంలోని చిన్న గ్రామం "నరదారా" యోగి జన్మస్థలం. ( 01. 12. 1918 ).
చిన్నతనం నుండే గంగా తీరంలో నివసించే సాదు సంతుల సన్నిధిలో ఎక్కువ గడుపుతుండేవారు."కపాడియా బాబా" ఆయనను ఎక్కువగా ప్రభావితం చేసిన వారు.
ఆ రోజులలోనే అలహాబాద్ విశ్వ విద్యాలయం నుండి పట్టభద్రులయ్యారు.ఉపాధ్యాయ వృత్తి చేస్తూ, గృహస్థు అయిన ఆయనలో ఆధ్యాత్మిక విషయాల పట్ల ఉన్న ఆసక్తి పెరిగిందే కానీ తరగ లేదు.జీవితంలో జరిగిన ఒక సంఘటన యోగిని అన్నీ వదిలి గురు అన్వేషణకు బయలుదేరేలా చేసింది.కపాడియా బాబా సలహా మేరకు పాండిచ్చేరి లోని అరవింద ఆశ్రమం చేరారు. కొంత కాలం తరువాత తిరువణ్ణామలై లోని శ్రీ రమణ మహర్షి ఆశ్రమానికి చేరారు.
చాలా కాలం ఈ రెండు ప్రాంతాల మధ్య తిరుగుతుండే వారు.
శ్రీ అరబిందో మరియు శ్రీ రమణ మహర్షి మహా నిర్వాణం తరువాత కేరళ రాష్ట్ర కాసరగోడ్ జిల్లా "కన్హన్ గడ్" లోని
"పాపా రామదాస్" ని ఆశ్రయించారు.ఆయన శ్రీ రామ మంత్రం ఉపదేశించారు.నిరంతర తారక మంత్ర ధ్యానం చేస్తుండే వారు.ఆత్మ పరిపక్వత, భగవత్ సాక్షాత్కారం లభించిన పిదప సుమారు ఏడు సంవత్సరాలు కాలి నడకన దేశమంతటా తిరిగి తిరువణ్ణామలై చేరుకొన్నారు.
తొలినాళ్ళలో ఆయనకు ఒక స్థిరవాసం ఉండేది కాదు.
శ్రీ అరుణాచల ఆలయ పరిసరాలలో ఉండేవారు.
ఆయనలో ప్రస్పుటంగా కనిపిస్తున్న యోగ లక్షణాలకు ఆకర్షితులైన కొందరు సన్నిధి వీధిలో చిన్న ఇల్లు కొని అక్కడ ఆయనను బలవంతంగా ఉంచారు.భక్తుల కోర్కెను ఆమోదించారు.తరువాత సుధామ గృహం లో కొంత కాలం ఉన్నారు.అక్కడనుంచి సిద్ది పొందే ( February 20, 2001)వరకు ప్రస్తుత ఆశ్రమం లోనే ఉన్నారు.
ఆయన సూక్తులు, బోధనలు ప్రత్యేకంగా ఉంటాయి.
ఆశ్రమ నలుదిశల కనపడతాయి.తన భౌతిక దేహం ఉన్న ఆశ్రమం చుట్టూ తిరిగినా అరుణాచల గిరివలయం చేసిన ఫలితం దక్కుతుందని అంటారు.దీని కోసం ప్రత్యేక మార్గం ఆశ్రమం లో ఉన్నది.
సువిశాల ప్రాంగణంలో ఉన్న ఆశ్రమం శ్రీ రమణ మహర్షి ఆశ్రమానికి ఎదురుగా ఉన్న వీధిలో ఉంటుంది.ప్రతి నిత్యం ఎందరో శిష్యులు ఇక్కడికి వస్తుంటారు. నామ కోటి రాయడం, సంకీర్తనా గానం, సత్సంగాలు జరుగుతుంటాయి.భక్తులకు ఉదయం అల్పాహారం, మధ్యాహాన్నం భోజనం ఉచితంగా అందిస్తారు.
యోగి రామ సూరత్ కుమార్ తన ఆధ్యాత్మిక మార్గానికి సహాయ పడిన ముగ్గురి గురించి ఇలా చెప్పారు.శ్రీ అరొబిందో జ్ఞానం ప్రసాదిస్తే, శ్రీ రమణులు తపః శక్తిని పెంచుకొనే మార్గం భోదించగా, శ్రీ పాపా రామదాసు భక్తి మార్గం లోని మాధుర్యాన్ని చవిచూపారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న యోగి రామ సూరత్ కుమార్ శిష్యులు ఆయన చూపిన మార్గాన్ని అందరికీ పరిచయం చేయడం, వివిధ సహాయ కార్యక్రమాలలో మరియు ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొంటుంటారు.
*తిరువణ్ణామలై లో దర్శించవలసిన వాటిల్లో యోగి రామ సూరత్ కుమార్ ఆశ్రమం ఒకటి. *
అరుణాచలేశ్వరాయ నమః !!!
 🕉️అష్టావక్ర గీత 🕉️
అధ్యాయము 18 
శ్లోకము 87

శ్లో॥ అకించనః కామచారో నిర్వంద్వ శ్చిన్నసంశయః|

అసక్త స్పర్యభావేషు కేవలో రమతే బుధః ||

మోహింపజేసే రెండవదేదీ లేదనే దృఢజ్ఞానంతో, దేనినీ సంపాదించా లనే కోరిక లేకుండా యథేచ్చగా చరిస్తూ ఉంటాడు జ్ఞాని. సర్వసంశయ రహితుడై సర్వద్వంద్వాల ప్రభావానికీ లోనుకాకుండా నిత్యానందస్వరూపుడై ఉంటాడు.

ఈ ప్రాపంచిక విషయాలు తమంతతాముగా ఏ వ్యక్తినీ బంధించి బాధించవు. వాటిని సంపాదించాలనే కోరికే అహంకారంగా రూపుదిద్దుకుంటుంది. అహంకారమే తన కోరికలతో ఉద్రేకాలతో విషయ వాంఛలతో కష్టసుఖాల ననుభవిస్తూ ఉంటుంది. సాధించి స్వంతం చేసుకోవాలనే ఈ కోరిక వస్తువులపై కావచ్చు, వ్యక్తులపై కావచ్చు, ప్రదేశాలపై కావచ్చు, కొందరు తమ గురువుల నారాధిస్తూ బందీలైపోతారు. మరికొందరు గంగాతీరానికో పుణ్యక్షేత్రాలకో బానిసలైపోతారు. ఈ విధంగా ఆకర్షింపబడి దృఢంగా కట్టుబడిపోవడం సాధకు లకు ప్రాథమిక దశలో అవసరమే. ఈ విధంగా ఒక భావాన్ని ఆరాధిస్తూ కట్టుబడిన మనస్సు క్రమంగా ఏకాగ్రమయి, సునిశితమూ తీక్షణమూ అయిన శాస్త్రాధ్యయనంలో సారాన్ని గ్రహించగలుగుతుంది. ఇక్కడ మహర్షి జీవన్ముక్తుని జీవన దృక్పథాన్ని వర్ణిసూ అతడేవిధంగా దేనినీ సంపాదించాలనే కోరికలేకుండా, ఏ స్థలంమీద ప్రత్యేక వ్యామోహం లేకుండా యథేచ్చగా చరిస్తూ ఆనందంగా జీవించ గలడో స్పష్టం చేస్తున్నారు. మానసికంగా అతనిలో అహంకార తాదాత్మ్యం ఉండదు. కాబట్టి తత్ఫలితమయిన కోరికలూ ఆశాంతీ ఉండవు, సుఖదుఃఖాలు మానావమానాలు మొదలయిన ద్వంద్వాలతనిని బాధించవు.

ఈ విధంగా శరీరానికి సంబంధించి ఆతనివంటూ ప్రత్యేక పసువులు కానీ అతనికిష్టమయిన ప్రత్యేక ప్రదేశాలు కానీ ఉండవు. ద్వంద్వాలచే బాధింప బడవి శాంత మనఃస్థితి కలిగి ఉంటాడు. ప్రపంచంలో యథేచ్చగా చరిస్తూ ఉంటాడు. బుద్దిపరంగా అతనిలో ఎటువంటి సందేహాలు లేకపోవడంతో నిశ్చలశాంత బుద్దితో సదా సంతోషంగా ఉండగలుగుతాడు. అనుక్షణమూ తాను ఆత్మనని, తనకంటే భిన్నంగా రెండవదేదీ లేదని దృఢజ్ఞానం కలిగిన అతనిలో ఎటువంటి సందేహాలూ ఉండవు. వ్యక్తులపై, వస్తువులపై, ప్రదేశాలపైనా కూడా మోహపు విలువలు అతనిలో పూర్తిగా నశిస్తాయి. సాధారణ మానవులలో ఈ మూడింటిపైనా ఉండే మోహపు విలువలే వారి బాధలన్నిటికీ కారణంగా ఉంటాయి.

ఈ విధంగా జ్ఞాని---"కేవలో రమతే" -- తనలో తానే సదా ఆనందంగా ఉంటాడు. ఈ కేవలత్వం సర్వవ్యాప్తమయిన ఆత్మ చైతన్యపు స్వస్థితిని యథా తథంగా సూచిస్తుంది. స్తంభంలో భూతపుజాడ ఏ మాత్రమూ ఉండదు! భ్రమా జన్యమయిన పాము పోలికలు తాడులో మచ్చుకయినా కనిపించవు!! ఆత్మ తత్త్వంలోనికి జాగృతుడయిన వానిలో జగద్రూపభ్రమ లేశమాత్రమయినా ఉండదు, ఉన్న ఏకైక సత్యమే ఎప్పుడూ ఉంటుంది. వేదాంతంలో సూచింపబడే లక్ష్యం ఈ కైవల్యమే.

ఇక్కడ మహర్షి వాడిన "ఛిన్నసంశయః" అన్న పదం ముండకోపనిషత్తు లోని ఈ క్రింది శ్లోకాన్ని జ్ఞప్తికి తెస్తుంది.

భిద్యతే హృదయగ్రంధిః ఛిద్యస్తే సర్వసంశయాః క్షీయస్తే చాస్య కర్మాణి తస్మన్ దృష్టి పరావరే.

(ముండకోపనిషత్తు 2-28)

పరాపరాల రెండింటినీ దర్శించగల మహనీయునిలో హృదయపు గ్రంధులు ఏకమయి సర్వసంశయాలూ నశిస్తాయి. అతని కర్మలన్నీ కూడా దీనితోపాటే నశిస్తాయి.🙏🙏🙏
 🌺 జ్ఞాన ప్రసూనాలు 🌺
 01/12/2025

1) శివాజ్ఞ లేనిదే చీమయినా కుట్టదు అన్నాక' నీకెందుకు బెంగ? అంతా ఈశ్వరేచ్చకు వదిలేయ్.

2) మన శరీరంలో ఘనాహారాన్ని శక్తిగా మార్చుకునే సిస్టంనే మనం వాడుకుంటున్నాము. నీటిని.. గాలిని శక్తిగా మార్చుకునే సిస్టంలు కూడా మన శరీరంలో ఉన్నాయి.

 3)మహా మౌనంలో నుండి 'నేను' పుట్టింది. 'నేను'లో నుండి 'నాది' పుట్టింది. స్వస్థితిని తిరిగి పొందాలంటే నాది లేని నేనుగా తరువాత నేను లేని నేనుగా మారుకోవాలి.

4) సంవత్సరాన్ని యూనిట్ గా తీసుకుంటే జనవరి ఒకటిన మాత్రమే ఉత్సవం.
క్షణాన్ని యూనిట్ గా తీసుకుంటే ప్రతి క్షణమూ ఉత్సవమే.

5) అనుభవంలో నుంచి శాస్త్రాలు వచ్చాయేగాని శాస్త్రాల వలన అనుభవం కలుగదు.

6)నిద్రలో ఒకడిగానే ఉన్నాడు మెలకువలో అనేకం అయినాడు. ఈ విషయం మెలకువలో జ్ఞప్తి ఉంటే అదే ఆత్మానుభవం.
 *_🦚 శ్రీరమణమహర్షి 🦚_*
꧁┉┅━❀🔯❀━┅┉꧂
*_🧘🏻భక్తుడు : భగవాన్ ! గురువుల అనుగ్రహం కాదుగదా ప్రోత్సాహం సైతం లేదు. ఇక నా దుఃఖం మాట ఏమి ? ధైర్యం పలికేవారు లేక ఆ ఉత్సాహం క్షీణించి పోయింది. ఏం చెయ్యను ?_*
*_🦚 మహర్షి : అది అజ్ఞానంవల్ల ; చేయతగ్గ అన్వేషణ ఆ దుఃఖం ఎవరికని ఆ దుఃఖ పీడితుడు ఎవరో వెదకిపట్టుకో. ధైర్యం పలికేవారు లేరని అన్నావు ! కానీ సాధనలో నీకు కొంతలో కొంత శాంతి కలగటం లేదా ? అభివృద్ధికి అది సూచన. సాధన సాగిస్తే శాంతి గాఢము, దీర్ఘమూ అవుతుంది.. గమ్యానికి చేరుస్తుంది !!_*
*_♻️ ఒక్క గురు పాదాలను_*
*_పట్టుకుంటే చాలు మన మనసుని గురువు గారి పాదాల చెంత వదిలితే మన జీవితం అంతా తానై చూసుకుంటారు !_* 
*_🧘🏻 ఓం నమో భగవతే_* 
*_శ్రీరమణాయ 🧘🏻‍♀️_*
             *_అరుణాచల శివ.._*
             *_అరుణాచల శివ.._*
             *_అరుణాచల శివ.._*
             *_అరుణాచలా...!_* 
🙏🇮🇳🎊🪴🦚🐍