Friday, July 11, 2025

 ఉపదేశ సారం-8
ఉత్తమం ..మానసిక జపం

ఉత్తమస్తవా  దుచ్ఛ మందతః 
చిత్తజం జప  ధ్యానముత్తమం

భగవంతుని గుణ , మహిమల గురించి స్తోత్రం చేయడం మంచిదే .  దాని కన్నా బిగ్గరగా చేసే జపం ఉత్తమైనది.  దాని కన్నా మంద జపం (తక్కువ శబ్దంతో చేసే జపం ) ఉత్తమం.  దాని కన్నా శ్రేష్టమైనది మానసిక జపం అని దీని అర్ధం .   రమణ మహర్షి విరచిత 30 శ్లోకాల "ఉపదేశ సారం " లోని ఆరో శ్లోకమిది .   భక్తిని పెంపొందిచుకోవడానికి చేసే సాధనాల్లో పూజ గురించి ఐదో శ్లోకంలో చెప్పిన రమణులు .   వాక్కు ద్వారా చేసే జపం గురించి ఇందులో చెప్పారు.  
 జపం మూడు రకాలుగా చేయవచ్చు . 

 మొదటిది ఉచ్చ జపం .  దీన్నే వాచక జపం అంటారు . "ఓం నమో నారాయణాయ " ," ఓం నమో భగవతే వాసుదేవాయ ", "ఓం నమశ్శివాయ " .  ఇలా ఏదైనా ఒక మంత్రాన్ని పెద్దగా , పక్కన ఉన్నవారికి కూడా వినిపించేటట్లుగా పదేపదే ఉచ్చరించడమే వాచక  జపం .  

రెండోది మందజపం.  దీన్నే "ఉపాంశు " అని కూడా అంటారు. ఇందులో పెదవులు కదిలీకదలనట్లుగా కదులుతాయి .  నాలుక కూడా కదులుతుంది . శబ్దం సన్నగా వస్తుంది .  కానీ , పక్కనున్నవారికి కూడా వినిపించదు. మనకు మాత్రమే వినిపిస్తుంది .

మూడోది ...చిత్తజం జపం .  దీన్నే మానసిక జపం అని కూడా అంటారు .  ఇందులో శబ్దం అసలు రాదు .  పెదవులు కదలవు .  నాలుక కదలదు.   కేవలం మనసులో మాత్రం మంత్రం దొర్లి  పోతుంటుంది .  వాక్కుతో చేసే ఉత్తమం స్ధవం (స్తోత్రం ) కన్నా జపం.   జపంలోనూ ఈ మూడు రకాలూ క్రమంగా ఒకదాని కన్నా ఒకటి ఉత్తమమైనవని మహర్షి చెప్పారు .  మానసిక జపం అన్నిటికన్నా కష్టసాధ్యమైనది.  కానీ, ఏకాగ్ర చిత్తంతో  ఆ జపసాధన కొనసాగిస్తే మనసు పవిత్రమవుతుంది .  మాంస  మయమైన  శరీరం  మంత్రమయమవుతుంది .  ఇలా పవిత్రత , ఏకాగ్రత కలిగిస్తుంది కనుకనే మానసిక జపం  ఎంతో శ్రేష్ఠమైనది.  ఏడు సంవత్సరాలుగా జపం చేస్తున్న ఒక సాధకుడు ఒక మహాత్ముని సందర్శించి , " స్వామీ , ఏడేళ్లుగా జపం చేస్తున్న నాకు జపసిద్ధి కలగట్లేదు " అని చెప్పాడు .
 
దానికా స్వామి , "నాయనా , జపం చేసేటప్పుడు నీ ద్రుష్టి అంతా భగవంతుని మీదే ఉంటోందా?" అని అడిగాడు .  దానికి సాధకుడు ," స్వామీ మాల తిప్పుతూ జపం చేసేటప్పుడు  మేరుపూస (108 పూసలు ఉండే జపమాలలో ప్రధాన పూస.  దాన్నే "గురు పూస " అని కూడా అంటారు ) ను దాటుతానేమోనన్న భయంతో ఎల్లప్పుడూ ద్రుష్టి మేరుపూస మీదే ఉంటోంది " అని వివరించాడు .  ఆయనకు జపం సిద్దించకపోవడానికి కారణం అదే.  కనుక జపం చేసేటప్పుడు మన ద్రుష్టి మేరుపూస మీద కాక భగవంతుని మీద నిలవాలి .  అప్పుడే జపం గొప్ప భక్తి సాధనమవుతుంది .  జపం ధ్యానంగా మారుతుంది .  ధ్యానించగా ధ్యానించగా మంత్రం అదృశ్యమై మనస్సు లక్ష్యంలో నిలిచిపోతుంది .

-  by sri దేవిశెట్టి చలపతిరావు, 
Sekarana from andhrajyoti .dt.7-1-2020

No comments:

Post a Comment