Friday, July 11, 2025

 ఉపదేశ సారం-7

నిష్కామకర్మ... ముక్తిసాధకం 

“ఈశ్వరార్పితం నేచ్ఛయాకృతం
చిత్త శోధకం ముక్తి సాధకం”

భగవాన్ రమణులు బోధించిన 30 శ్లోకాల "ఉపదేశసారం" లో మూడో శ్లోకమిది .  కర్మఫలం అశాశ్వితమని , పైగా మోక్ష మార్గానికి ప్రతిబంధకం కూడానని రెండో శ్లోకం చెబుతుంది .  అలాగని కర్మఫలాన్ని వదిలే అవకాశం లేదు .  మరేం చేయాలి ?  ఈ ప్రశ్నకు పరిస్కారాన్ని ఈ మూడో శ్లోకంలో సూచించారు  మహర్షి .  

"కర్మఫలoపై కోరిక లేకుండా , భగవదార్పణ బుద్ధితో చేసిన కర్మ , చిత్తశుద్ధిని కలిగించి మోక్షాన్ని పొందడానికి సాధనమవుతుంది " అని దీని అర్ధం .  పాములవాళ్ళు పాముల కోరలు పీకేసి వాటిని ఆడించినట్టు , కోరికలనే కోరలను పీకేసి కర్మలు చేస్తే అవి మనకు బంధంగా మారవు .  దీన్నే నిష్కామ కర్మ యోగం అన్నారు .  దీన్నే రమణమహర్షి ఈ శ్లోకంలో "నేచ్ఛయా కృతం ( న ఇచ్చాయా కృతం )" అన్నారు .  కానీ, కోరికలు లేకుండా కర్మలు చేయడమంటే ఎలా ? అసలు ఎవరైనా అలా చేస్తారా ? ఏదైనా కర్మ చేస్తే ఏదో ఒక ప్రయోజనం ఉండాలి .  సుఖం కలగాలి . లాభం రావాలి .  పేరో , పుణ్యమో , కీర్తిప్రతిష్టలో , మనసుకు సంతృప్తో , ఇలా ఏదో ఒకటి ఆశించి చేస్తే అది కోరికతో చేసే కర్మ.    అలాగని , నిష్కామకర్మ అంటే ఏ కోరికా లేకుండా  చేయడం .  బండరాయిలాగా ఉండడం కాదు .  మనం చేసే కర్మల వల్ల "ఫలానా " ప్రయోజనం సిద్దించాలి " అని ముందే అనుకోకుండా , ఆశపడకుండా చేయడం .  ద్రుష్టి కర్మ ఫలం మీద కాకుండా , కర్మల మీదనే ఉంచి నైపుణ్యంతో కర్మలు చేయడమే నిష్కామకర్మ యోగం .  అలా  చేసే కర్మలు బంధం కాకపోగా మోక్షప్రాప్తికి కారణమవుతాయి .

నిజానికి కర్మల వల్ల ఎవరికీ సుఖదుఃఖాలు కలగట్లేదు .  ఆ కర్మల వల్ల వచ్చే ఫలితాలపై ఆసక్తి , ఆశ కలిగి ఉండడం వల్లనే సుఖదుఃఖాలు కలుగుతున్నాయి .  ఆవే బంధకారణాలవుతున్నాయి.  ఉదాహరణకు , ఇద్దరు విద్యార్థులు కష్టపడి చెరువు తున్నారు .  వారిలో ఒకరు ఫస్టుక్లాసులో ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు .  రెండోవాడు పరీక్షలు చక్కగా రాయాలి అనే పట్టుదలతో కస్టపడి చదువుతున్నాడు .  ఇద్దరూ సెకండ్ క్లాసులో పాసయ్యారు .  మొదటి విద్యార్థి , నిరాస , దుఃఖం , బాధతో విలవిలలాడిపోయాడు . రెండో విద్యార్థి ఆనందంగా ఉన్నాడు . మొదటివాడు దుఃఖానికి కారణం ,...ఫలితాన్ని ముందే ఆశించడం . రెండోవాడి ఆనందానికి కారణం ..ఫలాల్ని  ముందే ఆశించకపోవడం. ఒకే ఫలితంతో ఒకరికి సంతోషం , మరొకరికి దుఃఖం .  కారణం కర్మఫలాసక్తి . అదే ఉండకూడనిది .  ప్రయత్నలోపం లేకుండా నైపుణ్యంతో కర్మ చేయడమే ముఖ్యం .  అదే నిష్కామకర్మ .  ఇది సత్వ గుణలక్షణం.  కోరుకున్న ఫలితాల కోసం కర్మ చేయడం రజోగుణం లక్షణం .  కోరిన ఫలితం రాదేమోనని కర్మ మానడం తమో గుణ లక్షణం .  సత్వగుణ లక్షణమే మోక్షకారకం .

  అలాగే ..జనన, మరణ  రూప సంసార సముద్రంలో చిక్కుకోకుండా కర్మల వల్ల ప్రయోజనం పొందాలంటే కావాల్సిన మరొక నైపుణ్యం ..భగవదార్పణ బుద్ధితో కర్మలు చేయడం .  దాన్నే రమణులు " ఈశ్వరార్పితం " అన్నారు .  చేసే పని వల్ల వచ్చే ఫలితం పుణ్యమైనా ఏదైనా సరే ఆ భగవంతుడికే అర్పించడం వల్ల ...ఆ కర్మలకు కర్త మనం కాకుండా ఉంటాం . భగవంతుడి చేతిలో పనిముట్టులా , నిమిత్తమాత్రుల్లా ఉంటాం . దీనివల్ల చిత్తశుద్ధి కలుగుతుంది .  పుణ్యమైనా , పాపమైనా ...అనుభవించడానికి కర్మ ఫలమే లేకపోవడంతో ఆ కర్మలు ముక్తి సాధకాలు అవుతాయి .  అంటే ...మళ్ళి జన్మించే అవసరం ఉండదు .  
----BY శ్రీ దేవిశెట్టి చలపతిరావు,  
Sekarana from andhrajyoti .dt.26-11-19

No comments:

Post a Comment