Friday, June 17, 2022

ఈ రోజు మంచి మాట, కర్మ యోగులు

🌷కృష్ణం వందే జగద్గురుమ్🌷

హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే

ఈ రోజు మంచి మాట

కాగితం ఏం వ్రాసినా దాన్ని తనలో దాచుకుంటుంది. కానీ కొన్ని వ్రాతలు మాత్రమే కాగితాలు దాచుకునేలా చేస్తాయి.

కత్తి, బందిపోటు చేతిలో ఉంటే అది జనులను భయభీతులను చేయటానికి లేదా చంపటానికి ఆయుధమవుతుంది, అదే ఒక శస్త్ర చికిత్స వైద్యుడి దగ్గర ఉంటే, జనుల జీవితాలను కాపాడే పనిముట్టుగా ఉంటుంది. కత్తి దానికదే ప్రమాదకరమైనది కాదు అలాగే శుభకరమైనదీ కాదు - దాని వాడే విధానం బట్టి దాని ప్రభావం ఉంటుంది. షేక్స్పియర్ అన్నట్టుగా : “For there is nothing good or bad, but thinking makes it so.” అదే ప్రకారంగా, పని అనేది మంచిదా చెడ్డదా అని చెప్పలేము, మానసిక దృక్పథం బట్టి అది ఉన్నతికి కారకం కావచ్చు లేదా బంధన కారకం అవ్వచ్చు. తన ఇంద్రియ సుఖాల కోసం, అహంకార తృప్తి కోసం చేసే పని ఈ భౌతిక జగత్తు లో బంధన కారకమవుతుంది. కానీ ఒక యజ్ఞం లాగా (భగవత్ అర్పితంగా), ఆ పరమాత్మ ప్రీతి కోసం చేసిన పని, మాయా బంధాలనుండి విముక్తి కలిగించి దైవానుగ్రహాన్ని ఆకర్షిస్తుంది. కర్మలు/పనులు చేయటం అనేది మన యొక్క సహజ స్వభావం కాబట్టి ఈ రెంటిలో ఏదో ఒక దృక్పథం తో పని చేయాలి. మన మనస్సు నిశ్చలంగా ఉండలేదు కాబట్టి మనం ఏదో ఒక పని చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేము.

మనము కర్మలను భగవత్ అర్పితముగా చేయకపోతే, మన ఇంద్రియ మనస్సుల సంతృప్తి కోసం పని చేయవలసి వస్తుంది. అలా కాకుండా, పనులను యజ్ఞం లాగా చేస్తే, మనం సమస్త ప్రపంచాన్ని, దానిలో ఉండే ప్రతిదాన్ని భగవత్ సంబంధంగా చూసి, అవి పరమాత్మ సేవలోనే ఉపయోగపడాలని భావిస్తాము. శ్రీ రామ చంద్రుడి పూర్వీకుడైన రఘు మహారాజు ఈ విషయంలో ఒక చక్కటి ఆదర్శం చూపించాడు. రఘు మహారాజు విశ్వజిత్ యజ్ఞాన్ని చేసాడు, దానిలో తనకున్న సంపదనంతా దానం చేయవలసి ఉంటుంది.

స విశ్వజితం ఆజహ్ర్ఏ యజ్ఞం సర్వస్వ దక్షిణం
ఆదానం హి విసర్గాయ సతాం వారిముచాం ఇవ (రఘువంశము 4.86)

"మేఘములు పృథ్వి నుండి నీటిని గ్రహించటం, వాటి స్వప్రయోజనం కోసం కాకుండా, మళ్లీ ఈ పుడమి పైనే వర్షించటం కోసమే అన్నట్టుగా, ఒక మహారాజుగా తను పన్నుల రూపంలో ప్రజలనుండి సంపాదించినదంతా తన భోగాల కోసం కాకుండా, భగవంతుని ప్రీతి కోసమే అన్న భావనతో రఘు మహారాజు విశ్వజిత్ యజ్ఞాన్ని చేసాడు. కాబట్టి తన ఐశ్వర్యాన్నంతా దేవుని ప్రీతి కోసం తన ప్రజల సేవలో వినియోగించాలని నిర్ణయించాడు." యజ్ఞం పరిపూర్తి అయిన తరువాత రఘువు తనకున్నదంతా ప్రజలకు దానం చేసేసాడు. ఆ తర్వాత, ఒక యాచకుడిగా చిరుగు వస్త్రాలతో, మట్టి పాత్ర పట్టుకుని, తిండి కోసం యాచించటానికి బయలుదేరాడు.

ఓ చెట్టు క్రింద విశ్రాంతి తీస్కుంటుండగా, కొంత మంది ఇలా మాట్లాడుకోవటం విన్నాడు. "మన మహారాజు ఏంతో దయకలవాడు. తన కున్నదంతా దానం చేసాడు" అని. రఘువు కి తన పొడగ్త విని చాలా బాధ పడి ఇలా అన్నాడు.

“మీరు ఎమి మాట్లాడుకుంటున్నారు?” వారు ఇలా అన్నారు, “మేము మా రాజు గారి గొప్పతనం చెప్పుకుంటున్నాము. ఆయనంత దానశీలురు ఈ ప్రపంచంలోనే ఎవరూ లేరు.” రఘువు దీనికి ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాడు. “ఇంకెప్పుడూ ఇలా మాట్లాడకండి. రఘువు ఏమీ ఇవ్వలేదు.” వారు అన్నారు, “ఎలాంటి మనిషివి నువ్వు మా రాజు గారిని విమర్శిస్తున్నావు? అందరికీ తెలుసు రఘు మహారాజు తన సంపాదనంతా దానం చేసాడని.” రఘువు అన్నాడు “వెళ్లి మీ రాజుని అడగండి, ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమైనా ఉందా ఆయన దగ్గర అని? ఆయన ఉత్త చేతులతో పుట్టాడు. కాదా? మరి ఆయనది ఏమి ఉందని ఆయన ఇచ్చినట్టు? ”

కర్మ యోగ దృక్పథం అంటే ఇదే, ఈ దృక్పథం లో మొత్తం ప్రపంచాన్ని భగవంతుని సొత్తు గా మనం చూస్తాము మరియు దేవుని ప్రీతి కోసమే ఉందనుకుంటాము. అప్పుడు మనము మన విధులను మన ఇంద్రియ/మనస్సు ల తృప్తి కోసం కాకుండా భగవంతుని ప్రీతి కోసం చేస్తాము. విష్ణు మూర్తి ప్రచేతసుడికి ఈ విధంగా ఉపదేశించాడు:

గృహేష్వావిశతాం చాపి పుంసాం కుశలకర్మణామ్
మద్వార్తా యాతయామానం న బంధాయ గృహా మతాః (భాగవతం 4.30.19)

“పరిపూర్ణ కర్మ యోగులు, తమ ప్రాపంచిక/సాంసారిక విధులను నిర్వర్తిస్తూనే ఉన్నా, వారి అన్ని కర్మ ఫలాలకు నన్నే అనుభవించే వానిగా తెలుసుకుని, తమ పనులన్నిటినీ, నాకు యజ్ఞములా చేస్తుంటారు. వారికున్న ఎంత కొంచం తీరిక సమయం లో కూడా నా కీర్తి/లీలలను శ్రవణం, కీర్తనం చేస్తుంటారు. అలాంటి వారు ఈ ప్రపంచంలో జీవిస్తున్నా, వారు చేసే పనుల కర్మ బంధాలలో చిక్కుకోరు”

సేకరణ

No comments:

Post a Comment