Monday, June 27, 2022

చక్కని నీతికథ.

 చక్కని నీతికథ. 


సైన్సు మాష్టారు తొమ్మిదో తరగతి పాఠం చెప్పిన  తరువాత   సమయం మిగలడంతో పిల్లల్తో మాట్లాడారు. “సృష్టిలో ప్రతి జీవికీ ఏదోఒక  ప్రత్యేకత ఉంటుంది. జాగ్రత్తగా గమనిస్తే, చిన్న ప్రాణుల నుండి కూడా నేర్చుకోడానికి మంచి లక్షణాలు కనిపిస్తాయి” అన్నారు. 


    నరేంద్ర అనే పిల్లవాడు “మాష్టారూ! నిజంగానా?”అన్నాడు  సందేహంగా.  


     “సందేహమెందుకురా? రేపెలాగూ ఆదివారమే. ప్రయత్నించి చూస్తే మీకే తెలుస్తుంది”  అన్నారు నవ్వుతూ మాష్టారు. 


 సోమవారంనాడు  పాఠశాలలో తొమ్మిదో తరగతికి  వచ్చినప్పుడు సైన్సు మాష్టారు నరేంద్రని నిలబెట్టి “నువ్వడిగిన ప్రశ్నకు జవాబు దొరికిందా?” అనడిగారు. 


“ఇంటికి వెళ్ళగానే ఆ విషయం మరచిపోయాను” అన్నాడు తల ఒంచుకుని నరేంద్ర.   


  వాడి ప్రక్కనే కూర్చున్న కార్తీక్ చెయ్యెత్తాడు. వాడిని చెప్పమన్నారు మాష్టారు.          


“ మా ఇంట్లో  పంచదార క్రింద పడింది. కాసేపటికి ఒక చీమ వచ్చి  పంచదార పలుకుని తీసుకుపోయింది. మరికొంతసేపయ్యేసరికి చీమల దండు వచ్చింది అక్కడకి.  ఒక్కో పలుకు చొప్పున దాదాపు మొత్తం పంచదారని తీసుకుపోయాయవి. వచ్చేటప్పుడు,  వెళ్ళేటప్పుడు వరుస పాటించాయి చీమలు. అవెళ్లే దారిలో  గిన్నె అడ్డుపెట్టాను.  ప్రక్కనుండి వెళ్లిపోయాయి తప్ప ఆగలేదు చీమలు” అన్నాడు కార్తీక్ . 


“నీకేం  అర్థమైంది?” అనడిగారు మాష్టారు. 

పిల్లలంతా కార్తీక్ వైపు ఆసక్తిగా చూసారు. 

“ఆహారం ఎక్కడుందో చీమలు త్వరగా గుర్తుపడతాయని, వరుస పధ్ధతిని  పాటిస్తాయని, దారిలో ఏదైనా అడ్డం వస్తే ఆగిపోవని, ఐకమత్యంగా ఉంటాయని తెలిసింద”న్నాడు వాడు.  


 “బాగా చెప్పావు” అని మెచ్చుకున్నారు మాష్టారు.    


“ఇంకెవరైనా?” అని మాష్టారు అడగ్గానే రాము నిలబడి  “మా  దొడ్లో  జామచెట్టు ఉంది. కాయలు కోద్దామని వెళ్లేసరికి ఒక  సాలీడు గూడు అల్లుతూ కనిపించింది. గూడు కట్టే ప్రయత్నంలో  అది జారి క్రింద పడిపోతుండేది. ఒకసారి  పెద్దగా  గాలి వీచింది. దాంతో దారం తెగిపోయింది. మరోసారి  చిన్న  కొమ్మ విరిగడంతో  దారం తెగి క్రిందపడింది. అలా ఆటంకాలు వచ్చినా పట్టు వదల్లేదది. చాలా సార్లు క్రిందపడినా ప్రయత్నం వదలకుండా ప్రయత్నించి చక్కని గూడు కట్టుకుని దర్జాగా అందులో  ఇమిడిపోయింది సాలీడు ” అన్నాడు. 


“  నీకేం అర్ధమైందో చెప్పు?” అనడిగారు మాష్టారు. 

“ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆటంకాలు వచ్చినా ఆగిపోకూడదని,  ఎన్ని  ప్రయత్నాలు చేసైనా సరే పని పూర్తి చెయ్యాలని” అన్నాడు రాము.


 బాగా చెప్పావని రాముని మెచ్చుకున్నారు మాష్టారు. 


ఈసారి మాష్టారు అడగక ముందే రవి నిలబడ్డాడు.  ‘నేనూ ఒకటి చెబుతానంటూ’ మొదలుపెట్టాడు.


  “ మా పెరట్లో  పూలమొక్కలే కాకుండా  జామ, దానిమ్మ , వేపచెట్లున్నాయి. వేపచెట్టు కొమ్మల్లో తేనెటీగలు  తేనెపట్టుని  పెట్టాయి. అక్కడ నుండి  తేనెటీగలు వచ్చి పువ్వుల  మీద వాలాయి. ఒక్కో పువ్వునుండి మకరందాన్ని నోటిలోకి తీసుకొని ఝమ్మని ఎగురుతూ  తేనెపట్టులో దాచేసి  మళ్ళీ వచ్చేవి. ఇంకో పువ్వు మీద వాలేవి. అలా రోజంతా ఎగురుతూనే ఉన్నాయి. మకరందం తీసుకెళ్తూనే ఉన్నాయి” అన్నాడు.   


“నీకేం అర్ధమైందని“ వాడిని అడిగారు మాష్టారు. 


“తేనెటీగలకి  బద్ధకం లేదని తెలిసింది. మనం కూడా రోజంతా కష్టపడి ఉత్సాహంగా పనిచేసినప్పుడే కలిగే ఫలితం తేనెలాగా తియ్యగా ఉంటుందని బోధపడింది” అన్నాడు రవి.  

 

మాష్టారు  “పిల్లలూ! నరేంద్ర అడగబట్టే  కదా వీళ్ళ  ముగ్గురూ  తెలుసుకున్న విషయాలను  మనతో చెప్పారు.  దీన్ని బట్టి  ప్రశ్నించడం అలవాటు  చేసుకోవాలని తెలిసింది కదా. వాళ్ళ ముగ్గురూ చెప్పినట్టు మనుషులు కూడా  ‘చీమల్లా ఐకమత్యంగా ఉండాలి.  కష్టపడి పని చెయ్యాలి.  తలో దారిలో వెళ్లకుండా ఒకే మాట, ఒకే బాటన్నట్టు ఉండాలి.  పనిలో  అడ్డంకులు వచ్చినా వదిలేయకుండా మరో ప్రయత్నం చెయ్యాలని, పూర్తయ్యేవరకు సాలీడులా  పట్టు విడువకూడదని తెలిసింది. తేనెటీగల విషయానికి వస్తే  అవి కష్టపడి తేనె పట్టు పెట్టినా తేనెను త్రాగలేవు. మనుషులే  వాడుకుంటారు. మనం కూడా ప్రక్కవారికి ఉపయోగపడే పనులు చేస్తుండాలని గ్రహించాలి. మీరు శ్రద్ధగా గమనిస్తే  మిగతా జీవుల్లో కూడా   మంచి లక్షణాలెన్నో కనిపిస్తాయి”  అన్నారు. 


పిల్లలంతా సంతోషంగా చప్పట్లు కొట్టి “అర్ధమైంది మాస్టారు. మేము కూడా మాలో మంచి లక్షణాలు పెంచుకుంటాము” అన్నారు ఏకకంఠంతో.


సేకరణ. మానస సరోవరం 👏

No comments:

Post a Comment