శ్రీరమణీయం
_"అదృశ్యశక్తి, మనోశక్తి ఈ రెండిటి వైవిధ్యం ఎలా అర్ధం చేసుకోవాలి ?"
మనసు-విశ్వమనసు
అదృశ్యంగా పనిచేసే శక్తే మనసు. ఈ అదృశ్యశక్తినే సైన్స్ సహజం అంటుంది. ఆ సహజాన్నే మనం 'భగవంతుడని' అంటాం. మనకు మనసు ఉన్నట్లే ఈ విశ్వానికి కూడా ఒక మనసు ఉంది ! ఈ విశ్వమంతా ఒకానొక శక్తి వ్యాపించి ఉంది. విషయాన్ని గ్రహించి దానికి తగ్గ క్రియచేసే ఆశక్తికే మనసని పేరు. ఇది సృష్టి అంతటా ఉంది. వేడి దగ్గరకు వెన్న చేరిస్తే అది కరిగి పోతుంది. ఈ ప్రక్రియలో మంటకు గురించి, వెన్నకు మంట గురించి తెలియదు. కానీ కరిగిపోవడం అనే క్రియమాత్రం జరిగిపోతుంది. మనిషికైతే ఇలా తెలియకుండా ఏక్రియ జరగదు. అంటే మనిషికి తెలిసినట్లుగా ప్రకృతిలో ప్రతిదానికి తెలియటం అనే గుణం ఉండనక్కర్లేదు. కానీ సృష్టిలో మాత్రం తెలియటం అనే క్రియ లేకుండానే తెలివితో నిరంతరం అనేక పనులు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిఏటా ఒకే కాలానికి పూత పూయాలని చెట్టుకు ఎలా తెలుసు ? ఏ కాలానికి ఎక్కడ, ఎంతమోతాదులో వర్షించాలో మేఘాలకు ఎలా తెలుసు ? ఇలా గ్రహించి అదృశ్యంగా పనిచేస్తున్న శక్తే మనసుగా పిలవబడుతుంది !*_
_*"మనసులో ప్రార్థిస్తే వినేశక్తి ఎక్కడిది ? అనుగ్రహం ఎలా లభిస్తుంది !?"*_
_*ప్రార్థిస్తే వినేశక్తి విశ్వమనసుకు ఉంది. తన్మయత్వంతో క్షణకాలంపాటు మనకిష్టమైన ఏ రూపంలో తలుచుకున్నా విశ్వమనసుగా ఉన్న శక్తే మనను అనుగ్రహిస్తుంది. నిత్యము, నిరతము విశ్వమంతా నిండి ఉండేది జ్ఞానం. అది మన మనసు ద్వారా వ్యక్తమైతే 'భక్తి' అవుతుంది. దైవానికి రూపం లేదనే విశ్వాసం కొందరిది. అయితే వారు కూడా రూపం అనే ఒక్క గుణం మినహా మిగిలిన అన్ని గుణాలను దైవానికి ఆపాదిస్తూనే ఉన్నారు. ఏ మతంవారైనా దైవాన్ని వరాలు కోరటం, పిలిస్తే పలకటం, రక్షించటం వంటి అనేక గుణాలతో కొలుస్తున్నవారే ! అందరికీ అందుబాటులో ఉండేలా మనం రూపం అనే గుణాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. దైవానికి రూపం లేదని తెలిసే వరకు మనం ఏదోక రూపంలో దైవాన్ని పూజించటం వలన లాభమే గానీ నష్టం లేదు. దైవాన్ని మనకిష్టమైన ఏ రూపంలో ఎంచుకున్నా కొలిచేది మాత్రం అందులోని అదృశ్యశక్తినే అయినప్పుడు రూపం వలన వచ్చిన నష్టం ఏముంది ! భగవంతుడు మన హృదయంలో ఉన్నాడన్న అనుభవం కలిగేవరకు రూపధ్యానం, నామజపం అవసరం. భగవంతుని విషయంలో రూపం, నామం, శక్తి వేర్వేరుగాలేవు. ఏ వస్తువునుండీ రూపాన్ని వేరు చేయలేము !!
No comments:
Post a Comment